Necessity is the mother of invention అంటారు. ఆ ప్రకారంగా.. అవసరం ఎవరినైనా ఆవిష్కర్తను చేస్తుంది. శీతల్ను కూడా ఆ అవసరమే ఆంత్రప్రెన్యూర్గా మార్చింది. చర్మ సమస్యతో బాధపడుతున్న నెలల పసిబిడ్డ కోసం ఆమె తయారుచేసిన సబ్బు.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవుతున్నది. జీవితంలో ఎదురైన సవాలును గెలుపు మార్గంగా మార్చుకున్న ఆ మామ్ప్రెన్యూర్ విజయ ప్రస్థానం..
నెల వయసు పాప. ఆ లేలేత చర్మం ముట్టుకుంటే కందిపోయేలా మారిపోయింది. పొలుసులు పొలుసులుగా ఊడిపోతున్నది. బిడ్డ పరిస్థితిని చూసి శీతల్ మనసు విలవిల్లాడింది. మార్కెట్లో దొరికే టాల్కమ్ పౌడర్లు, లోషన్లు, బేబీ ప్రొడక్ట్స్ వాడినప్పుడు పసిబిడ్డ చర్మం మరింత ఎర్రబారేది. ఆ తల్లి వెంటనే వాటన్నిటినీ చెత్తబుట్టలో పడేశారు. ఇంటినే ప్రయోగశాలగా మార్చారు. ఎలాంటి రసాయనాలూ ఉపయోగించకుండా తానే సబ్బుల తయారీకి పూనుకున్నారు. దాంతోపసిబిడ్డకు స్నానం చేయించడం మొదలుపెట్టారు. క్రమంగా చర్మం మామూలు స్థితికి రావడం మొదలైంది. అదే సమయంలో ఎగ్జిమా అనే చర్మవ్యాధి శీతల్ను ఇబ్బంది పెట్టింది. తాను కూడా ఆ సబ్బే వాడారు.
ఆశ్చర్యకరంగా చర్మ సమస్య తగ్గిపోవడమే కాదు, కొత్త నిగారింపు వచ్చింది. అడ్డమైన రసాయనాలు వాడి అందాన్ని, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నామని ఆమెకు అర్థమైపోయింది. అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చారు. ఇకపై ఎలాంటి రసాయన ఉత్పత్తులూ వాడకూడదని తీర్మానించారు. కుటుంబానికి అవసరమైన సబ్బులు, షాంపూలు, ఇతర సౌందర్య సాధనాలు సంప్రదాయ పద్ధతిలో ఇంట్లోనే తయారుచేయడం మొదలుపెట్టారు. అందుకు అవసరమైన దినుసులను కూడా స్థానికంగానే సేకరించారు.
బంధుమిత్రులు తరచూ శీతల్ను చిన్నారి బాగోగులు అడిగేవారు. అలా, ఆమె తయారు చేసిన సబ్బుల గురించి చుట్టాలకు, స్నేహితులకు తెలిసిపోయింది. తమకూ కావాలని అడగసాగారు. తీసుకెళ్లి ఉపయోగించారు. మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని సంతోషంగా చెప్పారు. దీంతో లైసెన్స్ తీసుకుని.. సబ్బుల ఉత్పత్తి ప్రారంభించారు శీతల్. ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. తమిళనాడు, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, కేరళ తదితర రాష్ర్టాలతో పాటు.. అమెరికా, కెనడా, యూకే, అరబ్ దేశాలకు సైతం ‘ఎర్తీ సపో’ సబ్బులు, షాంపూలు, సౌందర్య సాధనాలు ఎగుమతి అవుతున్నాయిప్పుడు.
శీతల్ గతంలో ఓ కార్పొరేట్ బ్యాంకు ఉద్యోగి. మంచి జీతం వచ్చేది. సకల సౌకర్యాలు లభించేవి. ఆ తర్వాత, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేశారు. ఆ సమయంలోనే పెళ్లి కావడం, పాప పుట్టడంతో ఉద్యోగానికి రాజీనామా చేశారు. పాప పెద్దయ్యాక ఏదైనా ఉద్యోగంలో చేరాలని అనుకునేవారు శీతల్. కానీ పాపకు వచ్చిన చర్మ సమస్య ఆమెను సబ్బుల తయారీ వైపు ప్రోత్సహించింది. ఆ వ్యాపారం ఇప్పుడు ఓ కంపెనీ స్థాయికి చేరింది. కొందరు మహిళలకు ఉపాధి కల్పిస్తున్నది.
తన ఉత్పత్తులను ప్రచారం చేయడానికి శీతల్ ఇప్పటివరకూ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఎలాంటి వాణిజ్య ప్రకటనలూ ఇవ్వలేదు. సోషల్ మీడియా ప్రమోషన్స్ జోలికి కూడా వెళ్లలేదు. కారణం తనమీద తనకున్న నమ్మకం. సంప్రదాయ ఉత్పత్తుల పట్ల గౌరవం. ‘కస్టమర్లే మా కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్లు. మంచి ఉత్పత్తిని పదిమందికీ చేరవేసేందుకు శ్రమించాల్సిన అవసరం లేదు. పనితనం బాగుంటే చాలు’ అంటారు శీతల్. ప్రస్తుతం ‘ఎర్త్ సపో’కు నెలకు నాలుగువేల వరకూ ఆర్డర్లు వస్తున్నాయి. ఎక్కడా రుణం తీసుకోకుండా.. ఉద్యోగంలో దాచుకున్న డబ్బులతో వ్యాపారం ప్రారంభించారామె.
తొలిదశలో పెద్దగా లాభాలనూ ఆశించలేదు. దాదాపు పద్దెనిమిది రకాల సబ్బులు, మూడు రకాల షాంపూలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. చర్మతత్వాన్ని బట్టి ఏ సబ్బు వాడాలో కూడా కస్టమర్లుకు సలహా ఇస్తారు. జీవితంలో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఎవరు పరిష్కరిస్తారా అని ఎదురు చూడటం కాదు. మనమే పరిష్కారం వెతుక్కోవాలని నిరూపించారు శీతల్. ‘చాలామంది అందంగా కనిపించడానికి రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. అది తప్పు. అందంగా ఉండటం కాదు.. అందంగా జీవించాలి. ఆరోగ్యంగా జీవించాలి. దాన్ని మించిన సౌందర్యం లేదు’ అంటారామె.
…? సుంకరి ప్రవీణ్ కుమార్
వీరగోని రజినీకాంత్ గౌడ్