పూనమ్ కుర్వే.. జువాలజీ ప్రొఫెసర్. రిటైర్మెంట్ దగ్గర పడుతున్నకొద్దీ ‘వాట్ నెక్ట్స్?’ అనే ఆలోచన వెంటాడేది. తనకు బాల్యం నుంచీ సీతాకోక చిలుకలంటే ప్రాణం. ఆ రంగురంగుల రెక్కలను చూసిన ప్రతిసారీ మనసు పరవశించేది. తానే ఎందుకు ఓ సీతాకోక చిలుకల ఉద్యానవనం నిర్మించకూడదు? అనిపించింది. వెంటనే కార్యాచరణ ప్రారంభించింది. ఎలాగూ థానేలోని ఆమె నివాసం పెద్దగానే ఉంటుంది. పాతకాలం ఇల్లు. చుట్టూ చాలా ఖాళీ జాగా. ఆ ఆవరణనే బటర్ఫ్లై పార్క్గా తీర్చిదిద్దే పని మొదలు పెట్టింది.
మందార, నిమ్మ తదితర మొక్కలు నాటింది. రంగురంగుల రాళ్లు ఏర్పాటు చేసింది. ఇదంతా సీతాకోక చిలుకలను ఆకర్షించే ప్రయత్నమే. ఆ శ్రమ వృథాగా పోలేదు. చాలామంది పిల్లలకు సీతాకోక చిలుకల గురించి పెద్దగా తెలియదు. పసివాళ్లలో వాటి పట్ల ప్రేమ కలిగేలా చేయాలన్నది పూనమ్ ఆలోచన. అందుకే, తన ఉద్యానవనానికి పాఠశాలల విద్యార్థులనూ ఆహ్వానిస్తారు. ‘మన ఊళ్లోకో, మన వీధిలోకో సీతాకోక చిలుకలు వస్తున్నాయంటే.. పరిసరాల్లో ఎంతోకొంత నాణ్యమైన గాలి ఉన్నట్టు. ఆ నేస్తాలు మనకు దూరం కాకుండా ఉండాలంటే.. పర్యావరణాన్ని పరిశుభ్రంగా, పచ్చగా ఉంచుకోవాలి’ అని సలహా ఇస్తారు పూనమ్.