ప్రతిమ శశిధర్.. ఆధ్యాత్మిక గాయని, సంగీత గురువు. రెండు దశాబ్దాలుగా సాధనలో, బోధనలో నిమగ్నమై ఉన్నారు. అనేక కచేరీలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. వేంకటేశ్వర భక్తి ఛానెల్లో సంకీర్తనలు వినేవారికి ఆ స్వరం సుపరిచితం. ప్రతిమ శశిధర్ నేతృత్వంలోని సరస్వతి సంగీత నృత్య శిక్షణాలయం ఇటీవలే 21 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా తన సరిగమల ప్రయాణాన్ని వివరిస్తున్నారు ప్రతిమ..
ఈ ప్రస్థానం అనేక మలుపుల సమాహారం. 2002లో కేవలం ఏడుగురు విద్యార్థులతో మొదలై.. నేడు 500 మందితో హైదరా బాద్లోనే అత్యుత్తమ మ్యూజిక్ స్కూల్స్లో ఒకటిగా అలరారుతున్నది మా సరస్వతి సంగీత నృత్య శిక్షణాలయం. నిజానికి, నాకు మ్యూజిక్ స్కూల్ పెట్టాలనే ఆలోచనే లేదు. నేను పద్మావతి మహిళా యూనివర్సిటీ నుంచి సంగీతంలో సర్టిఫికెట్ కోర్సు చేశాను. బంగారు పతకం కూడా సాధించాను. ఆ తర్వాత ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం చేసేదాన్ని. పెండ్లి తర్వాత హైదరాబాద్లో స్థిరపడ్డాం. పిల్లలు పుట్టాక.. ఉద్యోగం చేస్తూ బిడ్డల ఆలనాపాలనా చూసుకోవడం కష్టం అనిపించింది. అప్పటికే ఈటీవీ ‘పాడుతా తీయగా’లో పాడిన అనుభవమూ ఉంది కాబట్టి, ఇంటిపట్టునే ఉంటూ సంగీతం నేర్పాలని భావించాను. ఇన్ని సంవత్సరాలు శిక్షణాలయాన్ని నడపగలనని కాని, ఇంతమందికి నేర్పగలనని కానీ ఊహించలేదు.
మాది సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం. స్వస్థలం అనంతపురం. మా అమ్మ భాగ్యలక్ష్మి వీణ వాయించేవారు. మా నలుగురు అక్కలు సంగీతం నేర్చుకునేవారు. వాళ్లంతా ఇంట్లో ప్రాక్టీస్ చేస్తుంటే.. విని నేర్చుకున్నాను.
తిరుపతిలో చదువుకుంటున్నప్పుడు.. టీటీడీ ఆల్బమ్స్లో పాడే అవకాశం వచ్చింది. దీంతో, డాక్టర్ ద్వారం లక్ష్మిగారి దగ్గర రికార్డింగ్స్లో పాడటంలో మెళకువలు నేర్చుకున్నాను. వీలున్నప్పుడు హైదరాబాద్ వచ్చి పద్మ రామలింగ శాస్త్రి గారి సమక్షంలో సాధన చేసేదాన్ని. నేను ఎంఏ (మ్యూజిక్) కూడా చేశాను. గురువుల నుంచి నేర్చుకున్న విద్యను నలుగురికీ పంచాలనే ఉద్దేశంతో నృత్య శిక్షణాలయాన్ని ప్రారంభించాను. మా దగ్గర సంగీతంతోపాటు భరతనాట్యం, గిటార్, కీబోర్డ్, వీణ, వయోలిన్ కూడా నేర్పుతున్నాం.
సంగీతం ఒక యజ్ఞం లాంటిది. నిర్మాణాత్మకంగా నేర్చుకోవాలి. అందుకే మా విద్యార్థులకు తెలుగు విశ్వవిద్యాలయం సిలబస్కు అనుగుణంగా శిక్షణ ఇస్తాం. ఇప్పటి వరకూ 200 మందికి పైగా విద్యార్థులు డిప్లొమా, బీఏ (మ్యూజిక్), ఎంఏ (మ్యూజిక్)లో ఉత్తీర్ణులై పలు పాఠశాలల్లో మ్యూజిక్ టీచర్స్గా ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రస్తుతం 300 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. నృత్యం, గిటార్, వయోలిన్, వీణ, కీబోర్డ్తో కలిపితే దాదాపు 500 మంది అవుతారు. మా ఆన్లైన్ అకాడమీ ద్వారా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, న్యూజిలాండ్, సింగపూర్, మలేషియా నుంచి దాదాపు 120 మంది శిక్షణ పొందుతున్నారు. మావారు శశిధర్గారు అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్. నా సంగీత ప్రయాణంలో ఆయన సహకారం మరువలేనిది.
వేంకటేశ్వర భక్తి ఛానెల్ ‘కృష్ణ లీలా తరంగిణి’ కార్యక్రమంలో నారాయణ తీర్థుల వారి తరంగం ట్యుటోరియల్ ఎపిసోడ్స్, భక్తి టీవీలో ‘కృష్ణం వందే జగద్గురుమ్’, ‘దేవ దేవం భజే’ దూరదర్శన్లో ‘దేవీ వైభవం’, ‘సంక్రాంతి సంబరాలు’, ‘దీపలక్ష్మీ నమోస్తుతే’ లాంటి ఎన్నో కార్యక్రమాలు చేశాను. నేను ఆధ్యాత్మిక గాయనిగా పేరు తెచ్చుకోవడానికి ముఖ్య కారణం ‘HopeadTV’ ఛానెల్ వారే. నన్ను ఎంతో ప్రోత్సహించి ఎన్నో కొత్త థీమ్స్తో రికార్డింగ్స్ చేసి యూట్యూబ్లో విడుదల చేశారు. ఇక ఔత్సాహికులకు నా సూచన ఒకటే. సంగీతాన్ని గురుముఖంగానే నేర్చుకోండి. అప్పుడే లోపాలను సరిదిద్దుకోగలం. కొత్తవేకాదు, అరుదైన కృతులూ నేర్చుకోగలం. సంగీత సాధన పూర్వజన్మ సుకృతం.
…?కేసాని నరసింహ రావు