‘ఈ భూమిపై పుట్టి, ఇక్కడి ప్రకృతిపై ఆధారపడి బతుకుతున్నందుకు మనమంతా నేలమ్మకు రుణపడి ఉందాం. మనవంతు బాధ్యతగా పర్యావరణ పరిరక్షణకు పాటు పడదాం’ అని పిలుపునిస్తారు ప్రజక్తా కోలి. ఆ మాటతీరే ఆమెను యూట్యూబ్ స్టార్ను చేసింది. అనేక అందలాలు ఎక్కించింది. వివిధ వేదికలపై కోలి అభిప్రాయాలను దేశాధినేతలూ శ్రద్ధగా ఆలకించారు.
ప్రజక్త్తా కోలి.. మహారాష్ట్రలోని థానేలో పుట్టి పెరిగింది. చిన్నప్పుడు తను రేడియో శ్రోత. ఆరో తరగతిలో ఉన్నప్పుడే.. పెద్దయ్యాక రేడియో అనౌన్సర్ కావాలని లక్ష్యం పెట్టుకున్నది. పాఠశాలలో జరిగే ఉపన్యాస పోటీల్లో బహుమతులు తెచ్చుకునేది. మాస్ మీడియాలో డిగ్రీ చదువుతున్నరోజుల్లో ఇంటర్న్షిప్ కోసం ‘ఫీవర్ 104 ఎఫ్ఎం’లో చేరింది. సోలోగా ‘కాల్ సెంటర్’ అనే షో చేసింది. ఎందుకో,ఆ కార్యక్రమం కమర్షియల్గా అంత విజయం సాధించలేదు. దీంతో తనే ఆ బాధ్యత నుంచి తప్పుకొంది. డిగ్రీ చేతికి రాగానే సోషల్ మీడియాలో అడుగుపెట్టింది. తక్కువ కాలంలోనే సెలెబ్రిటీ స్థాయికి చేరుకుంది.
యూట్యూబర్గా సామాజిక అంశాలను చర్చించే ప్రజక్త్త.. నటిగా పసందైన వినోదాన్నీ పంచుతున్నది. మూడేండ్ల క్రితం ‘ఖయాలి పులావ్’ అనే షార్ట్ ఫిల్మ్ నిర్మించింది. హర్యానాలోని గ్రామీణ మహిళల సాధికారత ప్రధాన కథాంశం. ఆ తర్వాత నెట్ఫ్లిక్స్ ‘మిస్మ్యాచ్డ్’ సిరీస్లో కీలక పాత్రలో నటించింది. ఈ రొమాంటిక్ డ్రామా ద్వారా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నది. అంతేనా, సినిమా రంగంలోనూ అడుగుపెట్టింది.
‘మోస్ట్లీ సానె’ పేరుతో 2015లో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించింది ప్రజక్త. రోజువారీ జీవితంలోని చిన్నచిన్న విషయాలను సరదాగా చెప్పి నవ్వించడం తన ప్రత్యేకత. పనిలో పనిగా సామాజిక అంశాలనూ చర్చకు పెడుతుంది. ‘రియల్ టాక్ ట్యూస్డే’ పేరుతో పలువురు సెలెబ్రిటీలను ఇంటర్వ్యూ చేసేది. ఈ చొరవే ఆమెను సోషల్ మీడియా స్టార్ స్థాయికి తీసుకెళ్లింది. యూట్యూబ్ సీఈఓ సుసాన్ను ఇంటర్వ్యూ చేయడం కోలి కెరీర్లో గొప్ప మలుపు. ఓ ఇండియన్ యూట్యూబర్కు యూట్యూబ్ సీఈఓ ఇంటర్వ్యూ ఇవ్వడం అదే తొలిసారి. ఆ వేదిక మీదే.. భవిష్యత్తులో సంగీత ప్రియుల కోసం ‘యూట్యూబ్ మ్యూజిక్’ లాంచ్ చేస్తామని ఆయన ప్రకటించాడు. ఆ తర్వాత ‘ప్రెట్టీ ఫిట్’ పేరుతో యూట్యూబ్ ఒరిజి
నల్స్లో మరో ఛానెల్ ప్రారంభించింది కోలి. కరీనా కపూర్ లాంటి సెలెబ్రిటీలు ఈ వేదిక మీద ఫిట్నెస్ పాఠాలు చెప్పారు. దీనికి మంచి ఆదరణ లభించడంతో యూట్యూబ్ నిర్వహించే వివిధ కార్యక్రమాలకూ ఆహ్వానాలు అందాయి.
భారత్ తరపున ‘యూత్ ైక్లెమేట్ ఛాంపియన్’గా ప్రజక్త్తను నియమించింది ఐక్యరాజ్య సమితి. యువతను కలుస్తూ వాతావరణ మార్పులు, జీవ వైవిధ్యంపై ఆలోచనలు పంచుకుంటూ ప్రజక్త కొత్తకొత్త వీడియోలు చేస్తున్నది. ఓప్రా విన్ఫ్రే, జూలియా రాబర్ట్స్ లాంటి ప్రముఖులు పాల్గొన్న ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో భారత్ నుంచి ప్రజక్త్త్త ప్రాతినిధ్యం వహించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా సతీమణి మిషెల్లీతో మహిళల అభ్యున్నతి గురించి లోతైన సంభాషణలూ జరిపింది తను. సమాజంలో మార్పు రావాలని చెప్పేవారి కంటే, ఆ మార్పును కోరుకునేవారి కష్టాల్ని వినిపించడమే ప్రజక్త్తకు ఇష్టం. గత ఏడాది దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు ప్రపంచ వ్యాప్తంగా ఆరుగురు కంటెంట్ క్రియేటర్స్ను ఆహ్వానించారు. వారిలో ప్రజక్త ఒకరు. వాతావరణ పరిరక్షణ, సామాజిక న్యాయం, ప్రజారోగ్యం గురించి ప్రజక్త వెల్లడించిన అభిప్రాయాలను అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులూ జాగ్రత్తగా ఆలకించేవారు.
ఇలా దేశవిదేశాల్లో ఆమెకు ఎన్నో అవకాశాలు దక్కాయి. అనేక అవార్డులూ వరించాయి. అంత ఒత్తిడిలోనూ తను విశ్రమించలేదు. తాజాగా, పాడ్కాస్టర్గానూ శ్రోతలను అలరిస్తున్నది. దుబాయ్లో వాతావరణ మార్పులపై నిర్వహించిన ‘కాప్-28’ అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న ఒకే ఒక్క యూట్యూబర్ ప్రజక్తా కోలి. ఈ సదస్సుకు గూగుల్ ఆమె పేరును ప్రతిపాదించింది. సదస్సులో పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఎన్నో అర్థవంతమైన చర్చలు లేవనెత్తిందామె. ‘చుట్టూ ఉన్న వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతే, మన భవిష్యత్ ఎంత ప్రమాదంలో పడుతుందో అందరికీ అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం ఉంది. పర్యావరణం పట్ల ప్రేమ ఉన్నవాళ్లంతా.. బంధుమిత్రులకు, ఇరుగుపొరుగు వారికి పర్యావరణం గురించి చెప్పండి’ అని పిలుపునిస్తున్నది కోలి.