ఆమె మనుషుల డాక్టరు కావాలనుకుంది. కానీ పంటల వైద్యురాలైంది. ఉద్యాన శాఖలో ఉన్నతోద్యోగం సాధించింది. రైతులకు కొత్త పంటలు పరిచయం చేసింది. అగ్రిప్రెన్యూర్స్ను ఎంతో ప్రోత్సహించింది. వేలు పట్టుకుని స్టార్టప్ దిశగా నడిపించింది. రంగారెడ్డి జిల్లా హార్టికల్చర్ అధికారి డాక్టర్ ఎన్.సునంద రెడ్డి విజయ ప్రస్థానమంతా ఆమె మాటల్లోనే..
నేను పుట్టింది కామారెడ్డి జిల్లా పోసాని పేటలో. జిల్లాల పునర్విభజనకు ముందు నిజామాబాద్ జిల్లాలో ఉండేది. నా చిన్నతనంలోనే మా కుటుంబం అక్కడికి పది కిలోమీటర్ల దూరంలోని రామారెడ్డికి వలస వచ్చింది. పదో తరగతి వరకు నా విద్యాభ్యాసమంతా గవర్నమెంట్ స్కూల్లోనే. చిన్నతనం నుంచీ నేను తెలివైన విద్యార్థిని. నాన్న నారాయణ రెడ్డి ఆరోగ్యశాఖలో పని చేసేవారు. అమ్మ సేద్యం చూసుకునేది. అప్పట్లో అమ్మాయిల చదువు విషయంలో వివక్ష కనిపించేది. అమ్మ లక్ష్మికి కూడా ఆడపిల్లలకు చదువు ఎందుకనే భావన ఉండేది. నాన్న మాత్రం మమ్మల్ని బాగా చదివించాలని అనుకునేవారు. అన్నను ఎమ్మెస్సీ, ఇద్దరు అక్కలను డిగ్రీ చదివించారు. పదో తరగతిలో నాకు మండలంలోనే అత్యధిక మార్కులు వచ్చాయి. గోల్డ్ మెడల్ ప్రదానోత్సవంలో వక్తలు అమ్మానాన్నలను ప్రశంసలతో ముంచెత్తారు. దాంతో అమ్మ మనసు మారింది. ఎప్పుడూ నా చదువులకు అడ్డు చెప్పలేదు.
హార్టికల్చర్ వైద్యురాలిని నన్ను డాక్టర్గా చూడాలని నాన్న కోరిక. పదో తరగతి వరకు మ్యాథ్స్ బాగా చేసేదాన్ని. ఇంటర్లో ఎంపీసీ తీసుకోవాల్సింది. కానీ నాన్న కోరిక మేరకు బైపీసీ బాట పట్టాను. ఎంసెట్లో మంచి ర్యాంక్ రాకపోవడంతో డాక్టర్ కల చేజారింది. ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంక్ సాధించి టీచర్ ట్రైనింగ్ కోర్సులో జాయిన్ అయ్యాను. కెరీర్ అక్కడితో ముగిసిపోకూడదనే ఉద్దేశంతో మధ్యలోనే వదిలేసి బీఎస్సీలో చేరాను. ఆ తర్వాత హైదరాబాద్లోని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్సీ, పీహెచ్డీ చేశాను. డాక్టరేట్ అందుకోగానే అదే విశ్వ విద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం వచ్చింది.
అంతలోనే గ్రూప్-1 ద్వారా ఉద్యానశాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ కొలువుకు ఎంపికఅయ్యాను. ప్రొఫెసర్గా యూజీసీ స్కేల్ జీతం బాగానే ఉంటుంది. కానీ, పరిశోధనలకే పరిమితం కావద్దని భావించి అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగంలో చేరాలని నిర్ణయించుకున్నా. నాన్న తరచూ రైతుల కష్టాల గురించి చెప్పేవారు. దేశానికి వెన్నెముక లాంటి రైతన్న కోసం మనవంతుగా ఏదైనా చేయాలనేవారు. నేను హార్టి కల్చర్ ఉద్యోగాన్ని ఎంచు కోవడానికి ఇది కూడా ఓ కారణమే. ఎంతో సంతృప్తి గతంలోని బాధ్యతలన్నీ ఒక ఎత్తు, రంగారెడ్డి జిల్లా ఉద్యానశాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం ఒక ఎత్తు. నాకెంతో సంతృప్తినిచ్చిన అనుభవం ఇది. ఫోన్ ద్వారా దాదాపు నాలుగువేల మంది రైతులు నాతో టచ్లో ఉంటారు.
ఉద్యాన పంటలకు సంబంధించి సలహాలు, సూచనల కోసం సంప్రదిస్తుంటారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం గురించి అడుగుతూ ఉంటారు. నేనూ ఎంతో ఓపికతో జవాబు చెబుతాను. అవకాశం దొరికిన ప్రతిసారీ క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్తుంటాను. కూరగాయల సాగులో రంగారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉంది. జిల్లాలో సెరీకల్చర్ సాగు కూడా బాగా పెరిగింది. కరోనా సమయంలో చాలామంది యువకులు విదేశాల్లో ఉద్యోగాలు వదిలేసి వచ్చి మరీ సొంతూళ్లలో ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. విదేశీ పంటలైన డ్రాగన్ ఫ్రూట్, అవకాడో ఇక్కడ కూడా పండిస్తున్నారు. యూట్యూబ్ ద్వారా వ్యవసాయ విజయాలను పరిచయం చేస్తున్న యువ రైతులూ ఉన్నారు.
కొత్తకొత్త ఆలోచనలతో అగ్రిప్రెన్యూర్స్ నా దగ్గరికి వస్తుంటారు. వాళ్లను నేను స్టార్టప్స్ దిశగా ప్రోత్సహిస్తుంటాను. ఆ ప్రయత్నంలో చాలామంది విజయం సాధించారు కూడా. ఆ గెలుపులో నా పాత్ర ఉండటం ఎంతో సంతోషాన్ని ఇస్తున్నది. ఉద్యోగంలో అత్యుత్తమ సేవలకుగాను అనేక అవార్డులు వరించాయి. తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీలో జరిగిన జాతీయ స్థాయి సెమినార్లో బెస్ట్ పోస్టర్ అవార్డు అందుకున్నా. డ్రిప్ ఇరిగేషన్ సాగుపై అధ్యయనం కోసం ఇజ్రాయెల్కు వెళ్లిన తెలంగాణ నిపుణుల బృందంలో నేనూ ఉన్నాను. నా ఎదుగుదల వెనుక నా కుటుంబ మద్దతు ఉందని గర్వంగా చెప్పగలను. మా ఆయన రవీందర్ రెడ్డి ఎండీ(హోమియో) చేశారు. హైదరాబాద్లో క్లినిక్ ఉంది. ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గానూ చేస్తున్నారు. పాప ఆరాధ్య, బాబు రిత్విక్ జీవితంలోకి వచ్చాక మా సంతోషం సంపూర్ణమైంది.
…? గంజి ప్రదీప్ కుమార్
– ఉప్పరి శివ