చక్కని ఇల్లు. ఆదరించే భర్త. సరిపడా డబ్బు. ఆనందంగా బతికేందుకు అన్నీ ఉన్నా మనసులోఏదో వెలితి. బోసినవ్వులను ఒడిలో చూసుకునే భాగ్యంలేదనే బాధ. ఆమె చేతి వంటలు అద్భుతమనీ, ఆమె పెట్టే పచ్చళ్లు అమృతమనీనలుగురూ చెబుతుంటే.. మనసు మళ్లించుకునేందుకు వాటి అమ్మకమే వ్యాపకం చేసుకుంది.పచ్చళ్ల వ్యాపారం ద్వారా వచ్చినడబ్బును పేద పిల్లల చదువుల కోసంఖర్చు పెడుతున్నది. అలా మునమర్తిబాలా రాయుడు చేతి వంట వందమంది పిల్లల చదువులకు భరోసాగా నిలిచింది. ఆ పచ్చళ్ల అమ్మతన సేవా ప్రయాణాన్ని ‘జిందగీ’తో పంచుకున్నదిలా..
మీకు ఓ సంఘటన చెబుతాను. మిత్రుల సూచనతో మేం ఓ ఆటోడ్రైవర్ కూతురుకి చదువు చెప్పిస్తున్నాం. ఆ పాప అప్పటికి మూడో తరగతో, నాలుగో తరగతో చదువుతున్నది. తన బాధ్యతలు మేం తీసుకున్నాం. అప్పటిదాకా యావరేజ్ స్టూడెంట్ అయిన అమ్మాయి, మరుసటి ఏడాది నుంచి తొంభై శాతానికి పైగా మార్కులు తెచ్చుకున్నది. తన మనసులో ఏ మూలనో ఉన్న.. చదువు కొనసాగుతుందో, లేదో అనే అనుమానం తొలగించి, మేమున్నామనే భరోసా కల్పించడమే ఇందుకు కారణం. ఇలాంటి విషయాలు విన్నప్పుడు చాలా సంతోషం కలుగుతుంది. మరింత కష్టపడి పనిచేసి ఇంకా ఎక్కువమందికి సాయం అందించాలన్న ఉత్సాహం వస్తుంది.
నాకు వంట చేయడం సరదా. రకరకాల రుచులు ప్రయత్నించేదాన్ని. మా అమ్మ, అత్తగారు పచ్చళ్లు బాగా పెట్టేవారు. వాళ్ల దగ్గర మెలకువలు తెలుసుకున్నా. నేను పెట్టిన ఊరగాయల్ని ఇచ్చినప్పుడు చాలా బాగుందనీ, తమకూ చేసిపెట్టమని స్నేహితులు అడిగేవారు. కావలసిన దినుసులన్నీ తెచ్చిచ్చేవారు. నేనూ ఓపిగ్గా చేసిచ్చా. అయితే, తరచూ ముడిపదార్థాలు మిగిలిపోయేవి. అదంతా ఎందుకని ‘నేనే పచ్చడి పెట్టిస్తా. ఇంత అని డబ్బివ్వండి చాలు’ అని అడిగాను. అలా కాస్తోకూస్తో డబ్బు మిగిలేది. వాటిని పేద పిల్లల సాయానికి ఉపయోగించేదాన్ని. బిడ్డలు లేరన్న వెలితిని పూడ్చుకోవడానికి ఇదొక మార్గంగా తోచింది.
మాది కృష్ణా జిల్లా ఉయ్యూరు. నాన్న ఇన్కమ్టాక్స్ ఆఫీసర్గా పనిచేసేవారు. నా పదో ఏట గుండెపోటుతో చనిపోయారు. సెకండరీ స్కూల్ నుంచి నా చదువంతా హైదరాబాద్లోనే జరిగింది. డిగ్రీ పూర్తయ్యాక పెళ్లయ్యింది. మా వారు ప్రశాంత్ రాయుడు. ఆయనకు సెంట్రల్ ఏసీల ప్లానింగ్ బిజినెస్ ఉంది. మేం అప్పట్లో బెంగళూరులో ఉండేవాళ్లం. పది పన్నెండేళ్ల పాటు పిల్లల కోసం ప్రయత్నించాం. ఐవీఎఫ్ సహా రకరకాల ట్రీట్మెంట్లు తీసుకున్నాం. ఏదీ ఫలించలేదు. అప్పటికే నాకు నలభై అయిదేళ్లు వచ్చేశాయి. దత్తత తీసుకునే వయసూ కాదనిపించింది. మార్పు కోసం నాకిష్టమైన సంగీతం మీద దృష్టిపెట్టాను. హైదరాబాద్లోని ఆంధ్ర మహిళా సభ కాలేజీ నుంచి బీఏ వోకల్ పూర్తి చేశాను. కంచిపీఠంతో పాటు స్కందగిరి, శంకరమఠంలాంటి చోట్ల కచేరీలు ఇచ్చాను. న్యూయార్క్ కూడా వెళ్లొచ్చాను. ఇప్పటికీ ఆసక్తి ఉన్నవారికి ఆన్లైన్ క్లాసులు తీసుకుంటాను. ఒక పక్క పచ్చళ్లు, పొడుల తయారీ.. మరో పక్క సంగీత తరగతులు.. ఖాళీ లేకుండా సమయం గడుపుతున్నా.
తెలంగాణ ఆవకాయ, నువ్వుల ఆవకాయ, పెసర ఆవకాయ, వెల్లుల్లి ఆవకాయ, తియ్య ఆవకాయ, పసుపు పచ్చ ఆవకాయ… ఇలా రకరకాల మామిడికాయ కారాలు పెడతాను. నిమ్మ, గోంగూర, ఉసిరి, టమాటతోపాటు రేగిపండు, వెలగపండు, తియ్యనిమ్మలాంటి వెరైటీ పచ్చళ్లూ చేస్తాను. నల్లకారం, మునగాకు పొడి, అవిసె గింజల పొడిలాంటి ఇరవై రకాలకుపైగా పొడులూ.. టమాట, దోసకాయలాంటి కూరగాయలను జోడించిన వడియాలూ తయారు చేస్తున్నా.
పొడులూ పచ్చళ్లూ కలిపి ఏడాదికి పదిహేను వందల కేజీల దాకా అమ్ముతున్నాను. మా దగ్గర కొనుక్కునే వాళ్లంతా తెలిసిన వాళ్లే. నాతో పాటు మరో అయిదుగురు సిబ్బంది తయారీలో సహకరిస్తారు. మా పచ్చళ్ల తయారీలో గానుగ నూనెలనే వాడతాం. కారం కూడా ప్రత్యేకంగా పట్టించిందే వినియోగిస్తాం. రంగులు, ప్రిజర్వేటివ్స్, టేస్ట్ ఎన్హ్యాన్సర్స్ ఊసే లేకుండా జాగ్రత్త పడతాం. ఢిల్లీ, ముంబై, పుణెతో పాటు యూకే, అమెరికా, జర్మనీ, సింగపూర్, హాంకాంగ్లకు నా పచ్చళ్లు, పొడులు వెళ్తున్నాయి. ప్రస్తుతం కొత్తిమీర, అల్లం, చింతకాయ, దోస ఆవకాయలాంటి రోజువారీ పచ్చళ్లను కొందరు ప్రముఖుల కోసం ఫ్రెష్గా చేసి ఇస్తున్నా.
పదేళ్ల క్రితం ఈ పని మొదలు పెట్టినప్పుడు హైదరాబాద్లోని దేవ్నార్ ఫౌండేషన్ వాళ్ల అంధుల పాఠశాలలో ఉంటున్న పిల్లల కోసం వాయిస్ రికార్డర్లు, స్పీకర్లు, యూనిఫామ్లు, బ్రెయిలీ పుస్తకాలు అందించేదాన్ని. హాస్టల్ అవసరాలకు ఫ్యాన్లు, దుప్పట్లు, ఆడపిల్లల కోసం శానిటరీ న్యాప్కిన్ల లాంటివి కొనిచ్చేదాన్ని. కొవిడ్ ముందు వరకూ ఇక్కడ చాలా మంది పిల్లలకు సేవలందించాం. మాడపాటి హనుమంత రావు స్కూల్లో ప్రస్తుతం ఆరుగురు పిల్లలకు మొత్తం ఫీజులు మేమే కడుతున్నాం. వంటవాళ్లు, పనివాళ్లు, ఆటోడ్రైవర్లు.. కాదనకుండా సాయం అడిగినవారినంతా చదివిస్తున్నాం. ఒక సేవా సంస్థకు కూడా పిల్లల చదువుల నిమిత్తం శక్తి మేరకు సేవ చేస్తున్నా. మొత్తంగా చెప్పాలంటే కనీసం ఓ వంద మంది పిల్లలు నా చేతి వంట కారణంగా చక్కగా చదువుకోగలిగారు. ఇన్ని పచ్చళ్లు పెట్టడానికి కొన్ని గంటల నుంచి రోజుల సమయం పడుతుంది. అయినా సరే పదేళ్ల నుంచి ఇదే పని చేయగలుగుతున్నానంటే, పిల్లలకు సాయం అందించడంలో దొరికే తృప్తే కారణం. ఓపిక ఉన్నంత కాలం ఈ సేవ కొనసాగుతూనే ఉంటుంది.
…? లక్ష్మీహరిత ఇంద్రగంటి