ఒకరి అవసరాలకు ఒకరి ఆసరా. ఒకరి కష్టాల్లో ఒకరి ఆసరా. ఒకరి కలల్ని నిజం చేయడంలో ఒకరి ఆసరా. ఆ సమష్టి కృషే.. లక్ష్మీ పద్మావతి మహిళా సంఘాన్ని విజయాలవైపు నడిపిస్తున్నది. ‘ఆసరా’ బ్రాండ్కు గుర్తింపు తెస్తున్నది.
‘బృంద స్ఫూర్తికి సరైన ఉదాహరణ ఈ మహిళలు. వీరిలో చాలామంది బడి మొహం కూడా చూడనివారే. ఊరి పొలిమేర దాటింది కూడా తక్కువే. నమ్మకం, పట్టుదల, ఎదగాలన్న తపన.. ఇవే ఆ కూలీలను ఆంత్ర ప్రెన్యూర్స్గా మార్చాయి. స్థానిక ఉత్పత్తులనే సరుకుగా మలుచుకొని ‘ఆసరా’ బ్రాండ్ పేరుతో పల్లె నుంచి నగరాలకు వ్యాపారాన్ని విస్తరించారు. ఆర్థికంగా ఎదిగి.. ఎంబీఏ పట్ట భద్రుల కన్నా తామేం తక్కువ కాదని నిరూపిస్తున్నారు సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలానికి చెందిన లక్ష్మీ పద్మావతి మహిళా సంఘం సభ్యులు. మేళ్లచెరువు చుట్టుపక్కల పల్లెలకు చెందిన అనేక కుటుంబాలది వ్యవసాయ నేపథ్యమే. నిత్యం కూలీ పనులకు వెళ్లడం.. స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే అప్పులతో కుటుంబ అవసరాలను తీర్చుకోవడం.. ఎలాగోలా ఆ అప్పు తీర్చి ఇంకో అప్పు కోసం ఎదురుచూడటం.. సర్వసాధారణం అయిపోయింది.
‘ఈ ఎదుగూబొదుగూ లేని జీవితాలు ఇంకెంతకాలం?’ అనిపించింది వారికి. ఆ రుణాల ఊబిలోంచి బయటపడే మార్గం గురించి ఆలోచించారు. ఏదైనా వ్యాపారం చేసి తమ కాళ్లపై తాము నిలబడాలని నిర్ణయించుకున్నారు. అలా ఏర్పాటైందే.. లక్ష్మీ పద్మావతి మహిళా సంఘం. మేళ్లచెరువు, ఎర్రగట్టుతండా, గుడిమల్కాపురం, దొండపాడు, చింతలపాలెం గ్రామాలకు చెందిన పదిమంది మహిళలు ఒక బృందంగా ఏర్పడి 14 ఏండ్ల కిందట సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. డిగ్రీ చదివిన లక్ష్మమ్మ ఈ సంఘానికి చైర్పర్సన్. స్థానికంగా లభించే నాణ్యమైన ఉత్పత్తులను ‘ఆసరా’ బ్రాండ్ పేరుతో విక్రయించి మార్కెట్లో ఘన విజయం సాధించారు. తొలిదశలో ఒక్కో సభ్యురాలు రూ.30వేల పెట్టుబడి పెట్టారు. ఆ వ్యాపారం నేడు రూ.45 లక్షల టర్నోవర్కు చేరుకున్నది. అరకోటికి చేరువ అవుతున్నది.
స్థానిక ఉత్పత్తులనే..
యంత్రాలు.. వర్కర్లు.. మార్కెటింగ్.. ఇదంతా తమవల్ల అయ్యేపనేనా అని తొలుత సందేహించారు. అయినా, అధికారుల ప్రోత్సాహంతో ముందడుగు వేశారు. మేళ్లచెరువు చుట్టుపక్కల పల్లెలన్నీ మిర్చి సాగు చేస్తుండటంతో స్థానికంగా పండే పంటనే వ్యాపార వస్తువుగా మలుచుకున్నారు. ఆహార పదార్థాల తయారీ, ప్యాకింగ్ తదితర అంశాల్లో శిక్షణ తీసుకున్నారు. అప్పటి కలెక్టర్ రిజ్వీ సహకారంతో మేళ్లచెరువులోని సివిల్ సప్లయిస్ పాత గోదాంను లీజుకు తీసుకున్నారు. మెషినరీ సమకూర్చుకున్నారు. తొలుత కారం, పసుపు ప్యాకింగ్ చేసి చుట్టుపక్కల దుకాణాలకు విక్రయించడం మొదలుపెట్టారు. తర్వాత జొన్న, రాగిపిండి, రవ్వ, ఫినాయిల్ వంటి ఎనిమిది రకాల ఉత్పత్తులను తయారుచేసే స్థాయికి ఎదిగింది మహిళా సంఘం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీడీఏ ద్వారా అనేక ప్రాంతాలకు ఉత్పత్తులను విక్రయించే అవకాశం వచ్చింది. దీంతో కొండంత భరోసా కలిగింది. ప్రస్తుతం నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలతోపాటు హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ వంటి నగరాలకు సైతం ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. సూర్యాపేట జిల్లావ్యాప్తంగా అన్ని గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లకు సైతం వీరి ఉత్పత్తులు
సరఫరా అవుతున్నాయి.
స్వావలంబన దిశగా
పొద్దస్తమానం పనిచేస్తేనే ఇల్లు గడిచే పరిస్థితి. పిల్లలను చదివించాలని ఉన్నా చదివించలేని దుస్థితి. ఇదంతా గతం. ఇప్పుడు ఆ వాతావరణం మారిపోయింది. పల్లె మహిళలు వ్యాపారమేం చేయగలరు? అన్నవారే నేడు ప్రశంసలు కురిపిస్తున్నారు. లక్ష్మీ పద్మావతి సంఘం ఆధ్వర్యంలో నెలకు 10 టన్నుల ఆహార ఉత్పత్తులను ప్రాసెస్ చేసి.. చక్కని ప్యాకింగ్తో మార్కెట్కు తరలిస్తున్నారు. నాణ్యతలో రాజీపడకపోవడంతో మార్కెట్లో ‘ఆసరా’ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. అన్ని ఖర్చులు పోనూ నెలకు రూ.2.50 లక్షల వరకు మిగులుబాటు అవుతున్నది. దీంతో ఒక్కొక్కరు నెలకు రూ.20వేలకు పైగా సంపాదించుకుంటున్నారు. మరో ఇరవై మందికి ఉపాధి చూపుతున్నారు. ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు మహిళలనే నియమించి, ఇరవై శాతం కమీషన్ ఇస్తున్నారు. పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. ఎవరికి తెలుసు.. వారిలో డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లు, టీచర్లు ఉండవచ్చు.
వీ హబ్ సాయంతో..
పదిమంది మహిళలు ఓ బృందంగా ఏర్పడి వ్యాపారాన్ని ప్రారంభించాం. వీ హబ్ వ్యాపార మెలకువలపై అవగాహన కల్పించింది. ఒకప్పుడు తెల్లటి ప్లాస్టిక్ కవర్లలో మా ఉత్పత్తులను అమ్మేవాళ్లం. నేడు బహుళజాతి సంస్థల ఉత్పత్తులకు దీటుగా మా ప్యాకింగ్లో మార్పు వచ్చింది. ప్రభుత్వ సంస్థలకు సరఫరా చేసే ఉత్పత్తుల విషయంలో ‘ఆసరా’కు ప్రాధాన్యం ఇస్తే వ్యాపారాన్ని మరింత విస్తరిస్తాం. ఇంకొంత మందికి ఆధారం కల్పిస్తాం.
బి.లక్ష్మమ్మ, అధ్యక్షురాలు లక్ష్మీ పద్మావతి మహిళా సంఘం
…? గంజి ప్రదీప్కుమార్ సముద్రాల వెంకటరమణ కుమార్