అది ముంబై సాగరతీరానికి సగర్వ ముఖద్వారంగా నిలిచే.. గేట్ వే ఆఫ్ ఇండియా. దాని ముందు మరో తోరణం నిలబెడితే.. అది కూడా మన సంస్కృతిని ప్రతిబింబించేలా ఉంటే. అదే జరిగింది కూడా. చేతి అల్లికలతో రూపొందించిన 1,008 వస్ర్తాలను కలిపి ఓ 46 అడుగుల అందమైన తోరణాన్ని రూపొందించింది ‘చాణక్య స్కూల్ ఆఫ్ క్రాఫ్ట్’ అనే స్వచ్ఛంద సంస్థ. ఇందుకోసం 35 వేల గంటలు పట్టింది. ఆ తోరణం ముందు పరిచిన పూలమధ్య జరిగిన ర్యాంప్ వాక్ కూడా భిన్నంగానే సాగింది.
భారతీయ వస్త్రధారణ ప్రతిబింబించేలా, విభిన్న చేనేత కళారూపాలతో రూపొందించిన ఆధునిక వస్ర్తాలను ధరించారు మాడల్స్. ఫ్యాషన్ ప్రపంచంలో పెను సంచలనం సృష్టించిన ఈ విజయం వెనుక ఉన్న ఓ మహిళను తల్చుకుని తీరాలి. హస్తకళలకు ప్రాచుర్యం కల్పించాలనుకున్న తన తండ్రి అడుగుజాడల్లో… చాణక్య స్కూల్ ఆఫ్ క్రాఫ్ట్ను స్థాపించిన కరిష్మ స్వాలి ఘనత ఇది. ఆమెకు బాసటగా ఎంతోమంది కార్యకర్తలు, చేనేత కార్మికులు, హస్త కళాకారులు.. ప్రాచీన భారతీయ కళారూపాలు అంతరించిపోకుండా కృషి చేస్తున్నారు. నేతకళ, నేతన్న.. బతికి బట్టకడితేనే భారతీయ వస్త్ర పరిశ్రమకు ఓ ఉనికి అంటూ ఉంటుంది. ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా.. మన వైభవం రాజుగారి దేవతా వస్త్రమే.