ప్రకృతి నిండా రంగులే. పరికించి చూస్తే అడుగు అడుగుకో వర్ణం. అణువు అణువులో అద్భుతం. మనం అడిగినవీ, అడగనివీ చాలానే ఇచ్చింది. కానీ, మనమే ప్రకృతికి దూరంగా వచ్చేశాం. వికృతికి అలవాటు పడిపోయాం. కృత్రిమత్వానికి దగ్గరయ్యాం. మళ్లీ ప్రకృతి వైపు, సహజత్వం వైపు అడుగులేస్తే ఎంత బాగుంటుందో వివరిస్తున్నారు మాన్య చేరబుద్ధి. నేచురల్ డైయింగ్ కాన్సెప్ట్తో సహజ సిద్ధమైన రంగులను పరిచయం చేస్తున్నారామె.
ఇష్టమైన షర్ట్ మీద కాఫీ మరక పడితే మనసు విలవిల్లాడుతుంది. ఖరీదైన పట్టుచీరకు మొండి మరక అంటుకుంటే గుండె జారి గల్లంతైపోతుంది. అదేదో సబ్బుల కంపెనీ ప్రకటనలో చెప్పినట్టు మరక మంచిదే అంటున్నది మాన్య. కాకపోతే అది సహజంగా తయారు చేసుకున్నది అయితే చాలంటుంది. సహజ పద్ధతుల్లో దుస్తుల మీద రంగుల అద్దకం గురించి అధ్యయనం చేసిందామె. ఎంతో మందికి ఆన్లైన్లో నేచురల్ డైయింగ్ గురించి అవగాహన కల్పిస్తున్నది మాన్య చేరబుద్ధి.
నేచురల్ డైయింగ్ కొత్తగా వచ్చిందేం కాదు. పురాతన కాలం నుంచీ ఉన్నదే. బట్టలు రంగురంగుల్లో ఆకర్షణీయంగా కనిపించేందుకు పూలు, ఆకులు, సుగంధ ద్రవ్యాల నుంచి తీసిన వర్ణాలను వాడేవారు. సింథటిక్ డైయింగ్ పెరిగిన తర్వాత ఈ ప్రక్రియ క్రమంగా కనుమరుగు అవుతున్నది. చాలామంది పిల్లలకు రంగులు ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలియదు. ఎక్కడో పరిశ్రమల్లో తయారు చేస్తారనే అనుకుంటారు. కానీ, ‘ప్రకృతి మనకు తీరొక్క రంగులను బహుమతిగా ఇచ్చింది. రంగులు కూడా ఒక రకమైన ఔషధమే’ అంటారు మాన్య. ఈ సహజ వర్ణాలను పసుపు, ఉల్లిపొట్టు, దానిమ్మ తొక్కలు, రకరకాల పూలు, మోదుగు ఆకులు, పోకలు, టీ పొడి, కాఫీ పొడి, మంజిష్ట, పత్తిముగం వంటి వాటితో తయారు చేసుకుని.. వస్ర్తాలపై నైపుణ్యంతో అద్దుతుంది మాన్య.
సహజ సిద్ధమైన రంగుల తయారీకి ప్రత్యేక పద్ధతులు ఉంటాయి. ముందు మనకు కావాల్సిన రంగు దేని నుంచి వస్తుందో గుర్తించాలి. తర్వాత ఆ పదార్థాన్ని వేడినీళ్లలో 40 నిమిషాల పాటు మరగబెట్టాలి. అప్పుడే, అందులోని రంగు నీటిలోకి దిగుతుంది. డై వేసే ముందు బట్టలను పటిక నీళ్లలో నానబెట్టాలి. తర్వాత నీడలో ఆరేయాలి. అయితే, మనం డై వేయాలనుకున్న ఫ్యాబ్రిక్ కాటన్ది అయితేనే రంగు బాగా అంటుకుంటుంది. పసుపు, సుగంధ ద్రవ్యాలు, పూల రంగులు అద్దకం చేసిన వస్ర్తాలను నిత్యం ధరించడం వల్ల అందులోని ఔషధ గుణాలు శరీరానికి మేలు చేస్తాయి. చెమట వాసనను అడ్డుకుంటాయి.
ఇప్పటి వరకు మాన్య ఐదువేల మందికి సహజ వర్ణాల తయారీ పద్ధతిని నేర్పింది. అందులో ఓ యాభైమంది నేచురల్ డైయింగ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు. నేచురల్ డైయింగ్ పుట్టిందే భారతదేశంలో. మనకు ఆయుర్వేదం మాత్రమే తెలుసు. ‘ఆయుర్ వస్త్ర’ అనే అంతే ప్రాచీన శాస్త్రం కూడా ఒకటి ఉందన్న సంగతే మరిచిపోయాం. ఈ విషయాలు అందరికీ తెలిసేలా సెమినార్లు, వర్క్షాప్లు, క్లాసులు నిర్వహిస్తున్నది మాన్య. హైదరాబాద్లో పుట్టి పెరిగిన మాన్యకు చిన్నప్పటి నుంచీ కళలు, ప్రకృతి అంటే ఇష్టం. ఆ మక్కువతోనే చిన్నప్పటి నుంచీ ఆకులు, పూలను గమనించేది. ఆ ఆసక్తి క్రమంగా జిజ్ఞాసగా, అధ్యయనంగా మారింది.
వర్జీనియా యూనివర్సిటీలో బిజినెస్, ఆర్ట్ విభాగాల్లో రెండు డిగ్రీలు చేసిందామె. 2013లో హైదరాబాద్కు తిరిగి వచ్చేసి తన బంధువైన మానసి గాంధీతో కలిసి డయాగ్నొస్టిక్ సేవలు అందించే ‘డాక్టర్-సి’ సంస్థను ప్రారంభించింది. ఆ తర్వాత బెంగళూరు వెళ్లి ఓ డిజైనింగ్ కంపెనీలో పని చేసింది. సరిగ్గా ఆ సమయంలోనే నేచురల్ డైయింగ్ ఆలోచన వచ్చింది. అంతే, చేస్తున్న ఉద్యోగాన్ని మానేసి తనకు ఇష్టమైన రంగంలో పరిశోధన మొదలుపెట్టింది. మాన్య తాను రాసిన ఓ పుస్తకాన్ని పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ పద్ధతిలో ప్రింట్ చేయించింది. మట్టిలో కలిసిపోయే పేపర్, పర్యావరణానికి హాని చేయని ఇంక్ ఉపయోగించింది. అదీ ఆమెకు ప్రకృతి మీద ఉన్న ప్రేమ. ‘ప్రకృతిని అర్థం చేసు కోవడం మొదలుపెడితే.. ప్రపంచం మరింత అందంగా కనిపిస్తుంది’ అంటుందామె.
…? సుంకరి ప్రవీణ్ కుమార్
– చిన్న యాదగిరి గౌడ్