అలంకరణకు ఓ పరిశ్రమ హోదా తెచ్చారు. సౌందర్య సంరక్షణకు అంతర్జాతీయ ప్రమాణాలు జోడించారు. సామాన్యులను సెలెబ్రిటీలుగా మార్చారు. సెలెబ్రిటీలను స్టార్స్గా మెరిపించారు. వేలమంది మహిళలకు ఉపాధి శిక్షణనిచ్చి.. సమాజంలో నిలువగలమనే, గెలువగలమనే ఆత్మవిశ్వాసం నింపారు. కష్టాలకు, కన్నీళ్లకు తావులేని అందమైన సమాజమే తన లక్ష్యమని చెబుతారు ‘మిర్రర్స్ లగ్జరీ సెలూన్స్’ అధినేత్రి గూడపాటి విజయలక్ష్మి.
Gudapati Vijayalakshmi | అందానికి అద్దంతో అనుబంధం ఎక్కువ. కష్టపడేవారికే విజయం సొంతమవుతుంది. ఈ రెండు అంశాలే.. విజయలక్ష్మిని మునుముందుకు నడిపిస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ నెల్లూరు జిల్లా వాకాడులో పుట్టిందామె. చదువుకునే రోజుల్లోనే ఏదైనా సాధించాలనే కసి ఉండేది. అదే స్కూల్ చాంపియన్ను చేసింది. అప్పటికి తనకు తెలిసినవి రెండే.. చదువు, క్రీడలు. చదువు ఓ సమస్యే కాదు. తను ఏకసంథాగ్రాహి. క్రీడలంటారా? మైదానంలో దిగితే శివంగే. లాంగ్జంప్లో ప్రతి ప్రయత్నం ఓ రికార్డే. ఖోఖోలో ప్రత్యర్థి జట్టుకు చెమటలు పట్టించేది. తనే కాదు, తనవాళ్లూ అందరికంటే ముందుండాలని తాపత్రయపడేది. సాయంత్రం బడి నుంచి వచ్చాక తమ్ముడికి, చెల్లికి ప్రత్యేకంగా ట్యూషన్లు చెప్పేది.
విజయలక్ష్మి చదువు పూర్తయ్యే సమయానికి.. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో అనేక మలుపులు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ అధిష్ఠానం నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. ఆ నిర్ణయం విజయలక్ష్మి జీవితాన్నీ మలుపు తిప్పింది. కొత్త సీఎం తమ కుటుంబానికి ఆత్మీయుడు కావడంతో శుభాకాంక్షలు చెప్పడానికి హైదరాబాద్ వచ్చిందామె. నేరుగా చీఫ్ మినిస్టర్ బంగ్లాకు వెళ్లింది. ఆ సమయంలో పక్కనే ఉన్న స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడుకు ‘మా ఊరమ్మాయే. మీ దగ్గర ఏదైనా పని ఉంటే తీసుకోండి. చాలా టాలెంటెడ్’ అని పరిచయం చేశారు నేదురుమల్లి. తిరిగి వెళ్లేటప్పుడు తన విజిటింగ్ కార్డు ఇచ్చి.. ‘ఆఫీస్కు వచ్చి కలవమ్మా’ అని చెప్పారు రామానాయుడు. మరుసటిరోజే వెళ్లి కలిసింది. అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఉద్యోగం ఇచ్చారాయన. సినిమా పరిశ్రమ అంటేనే ఓ రంగుల లోకం. ఆ తళుకుల జగత్తును దగ్గర నుంచీ చూసిందామె. వెండితెర మేడిపండు చందమని తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు. దీంతో, ఆ పరిశ్రమతో సంబంధం లేని వ్యక్తిని పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అలా ప్రవీణ్ గూడపాటి ఆమె జీవితంలో ప్రవేశించారు.
అప్పటి వరకూ తారల మధ్య తారలా వెలిగిన విజయలక్ష్మి పెండ్లి తర్వాత నాలుగు గోడలకే పరిమితమైంది. ఇల్లు, సంసారం.. ఇదే జీవితంగా మారిపోయింది. అంతలోనే అంతర్మథనమూ మొదలైంది. ‘పెళ్లయితే ఇంతేనా? కలల ప్రయాణం ఆగిపోవాల్సిందేనా? నేను సాధించాల్సింది ఏమీ లేదా? ప్రతిదానికీ ఇంకొకరి మీద ఆధారపడి బతకాల్సిందేనా?’ అని తనను తాను ప్రశ్నించుకుంది. ఆ ప్రశ్నలే ఆమెకు దిశానిర్దేశం చేశాయి. అప్పటికే బాబు కడుపులో ఉన్నాడు. తనకు బ్యూటీ సెలూన్ నిర్వహణలో కొంత అవగాహన ఉండేది. దీంతో సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకుంది. అందం అనగానే అద్దమే మనసులో మెదులుతుంది. కాబట్టే, తన సౌందర్యశాలకు ‘మిర్రర్స్ సెలూన్’ అని పేరు పెట్టింది. అప్పటికే ఆమెకు సినిమా పరిశ్రమతో స్నేహ సంబంధాలు ఉండటంతో.. పెద్దపెద్ద తారలంతా తరలిరావడం మొదలైంది. జాగా సరిపోలేదు. సిబ్బందీ సరిపోలేదు. దీంతో, మిర్రర్స్ను అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని అర్థమైపోయింది. లండన్, సింగపూర్, మలేషియా చుట్టొచ్చింది. అక్కడి సౌందర్య పరిశ్రమను అధ్యయనం చేసింది. ఆ స్ఫూర్తితోనే ‘మిర్రర్స్’ను భారత్లోనే టాప్ లగ్జరీ సెలూన్ బ్రాండ్గా తీర్చిదిద్దింది. ఇప్పటివరకు ఇరవై రెండు.. జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి. ‘ఫోర్బ్స్’ పత్రిక ప్రభావశీలురైన మహిళల జాబితాలో విజయలక్ష్మి ప్రస్థానాన్ని ప్రస్తావించింది.
ఇప్పటికే హైదరాబాద్లోని మాదాపూర్, గచ్చిబౌలి, బంజారాహిల్స్ ప్రాంతాల్లో మిర్రర్స్ లగ్జరీ సెలూన్స్ ఉన్నాయి. త్వరలోనే కోకాపేటలో కూడా ప్రారంభించనున్నారు. ‘మిర్రర్స్ అకాడమీ ఆఫ్ హెయిర్ అండ్ బ్యూటీ’ పేరుతో విజయలక్ష్మి ప్రారంభించిన శిక్షణ సంస్థ వేలమందికి అలంకరణ పాఠాలు బోధించింది. విదేశాల నుంచి సైతం శిక్షణ కోసం వస్తున్నారు. ‘పట్టుదలతో కష్టపడితే ఎవరైనా విజయం సాధించవచ్చు. కాకపోతే ఏ దశలోనూ అలసిపోవద్దు, ఎక్కడా ఆగిపోవద్దు. గెలిచే వరకు పట్టుపట్టాలి. ఒకసారి గెలిస్తే సరిపోదు. మళ్లీమళ్లీ గెలవాల్సిందే. ఇంకా ఇంకా కష్టపడాల్సిందే. నేను అనుసరించే సూత్రం ఇదే. మనకు సమాజం చాలా ఇచ్చింది. మనం కూడా సమాజానికి తిరిగివ్వాలి. అందుకే నా వంతుగా క్యాన్సర్ బాధితులకు సాయం చేస్తున్నా. త్వరలోనే ఒక వృద్ధాశ్రమాన్ని దత్తత తీసుకుందామని అనుకుంటున్నా. ఇదంతా నా మనసు చెప్పిందనే చేస్తున్నా. గుర్తింపు కోసమో, ప్రచారం కోసమో కాదు. నాకు ఎలాంటి ఎన్జీవోలూ లేవు. తోటివారికి సాయం అందితే చాలనుకునే వ్యక్తిత్వం నాది’ అంటుంది విజయలక్ష్మి.
…? సుంకరి ప్రవీణ్కుమార్