ఘజల్ అలఘ్.. మామాఎర్త్ అనే సౌందర్య పోషకాల సంస్థ సహ-వ్యవస్థాపకురాలు. గురుగ్రామ్ నివాసి. ఆమె భర్త వరుణ్ అలఘ్ వ్యాపారవేత్త. దాదాపు తొమ్మిదేండ్ల క్రితం ప్రాణంపోసుకున్న మామాఎర్త్కు అన్నీ తానే! రసాయనాల ఆనవాళ్లు లేని ఉత్పత్తులను అందిస్తుందీ సంస్థ. ఇప్పుడు మామాఎర్త్ వెయ్యి కోట్ల రూపాయల కంపెనీ. ‘కస్టమర్స్ ఎంత సంతోషంగా ఉంటే కంపెనీ అంత ఎదుగుతుంది. నేను రోజుకు ఒక వినియోగదారుతో అయినా మాట్లాడతాను. ఆ ఫీడ్బ్యాక్ ఆధారంగానే మా బోర్డ్రూమ్ చర్చలు ఉంటాయి’ అంటారు ఘజల్.
ఆమె నాయకత్వ లక్షణాలను చూసే.. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి మామాఎర్త్లో పెట్టుబడులు పెట్టారు. బ్రాండ్ అంబాసిడర్గా మారారు. ‘నేను ఉత్పత్తుల నాణ్యతమీద ఫోకస్ చేస్తాను. మా ఆయన మార్కెటింగ్ వ్యవహారాలు చూసుకుంటారు’ అని వివరిస్తారు ఘజల్. ‘ఓ కంపెనీని నిర్మించడం అంటే పసిబిడ్డను కని, పెంచి, పెద్ద చేయడంతో సమానం. పిల్లలకు నైతిక విలువలు నేర్పినట్టే.. సంస్థలో వ్యాపార విలువలను భాగం చెయ్యాలి. బిడ్డల వందేళ్ల భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం. కంపెనీ విషయానికొస్తే.. వెయ్యేళ్ల ప్రణాళిక అవసరం’ అంటున్నప్పుడు ఆమెలో ఓ మాతృమూర్తిని చూస్తాం.