గతంతో పోలిస్తే, కుటుంబ వ్యాపారాల్లోకి మహిళలు ఎక్కువగానే వస్తున్నారు. కానీ దేవిత షరాఫ్ మాత్రం మరో అడుగు ముందుకేశారు. ఇరవై ఒక్క ఏండ్లు నిండగానే తండ్రి స్థాపించిన జెనిత్ కంప్యూటర్స్లో మార్కెటింగ్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. అంతకుమించి, ఏదైనా వినూత్నంగా చేయాలనుకున్నారు. ఇంటెల్, ఎమ్ఐటీ లాంటి దిగ్గజ సంస్థల పెద్దలతో సంభాషించిన తర్వాత… ఆ లక్ష్యం మరింత బలపడింది. Vu అనే టెక్నాలజీ కంపెనీని స్థాపించారు.
నాణ్యమైన టీవీలను అందుబాటు ధరలో అందించడం ఈ సంస్థ ఉద్దేశం. ఈ మాట చెప్పగానే అందరూ పకాపకా నవ్వారు. కారణం, అప్పటికే చైనా నుంచి సవాలక్ష బ్రాండ్స్ మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. ఇక కొరియన్, జపనీస్ కంపెనీలైతే బాసింపట్టు వేసుకుని మరీ స్థిరపడిపోయాయి. ఈ నేపథ్యంలో ఓ భారతీయ బ్రాండ్ నిలదొక్కుకోవడం అసాధ్యమన్నారు. దేవిత మాత్రం తన దూకుడుతోనే జవాబు చెప్పారు. ఈ రోజు ఆ సంస్థ 400 కోట్ల రూపాయల టర్నోవర్కు చేరుకుంది. అన్ని విభాగాల్లో ఉనికిని చాటుకుంటున్నది. అరబ్ దేశాలకు సైతం టీవీలు ఎగుమతి అవుతున్నాయి. ‘పరిమితులను ప్రశ్నించడమే నా విజయ రహస్యం’ అని చెబుతారు దేవిత. కాదనగలమా!