డబ్బావాలాలు అంటే ముంబై గుర్తుకువస్తుంది. ఇప్పుడు లండన్లోనూ డబ్బాల్లో ఆహార పదార్థాల సరఫరా మొదలైంది. ఈ సేవలను అంశు అహూజా, రెనీ విలియమ్స్ ప్రారంభించారు. వీరిద్దరూ కలిసి ‘డబ్బా డ్రాప్’ పేరుతో రోజూ వందలాది మందికి ఇంటివంటలను రుచి చూపిస్తున్నారు. అంశు ముంబైలో పుట్టి పెరిగింది. భోజన ప్రియురాలు. రెస్టారెంట్ భోజనం ఆమె ఇష్టాల్లో ఒకటి. ‘డబ్బా డ్రాప్’ మొదలుపెట్టక ముందు లండన్లోని ఓ టీవీ ప్రొడక్షన్ హౌస్లో పనిచేసేది.
తల్లి అయ్యాక ఇంటి నుంచే ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తే బాగుంటుంది అనుకుంది. బాగా ఆలోచించాక, ఆహార వ్యాపారంలో అడుగు పెట్టాలని నిర్ణయించుకుంది. ఆ అధ్యయనంలో ఉన్నప్పుడే, ఆన్లైన్ ఆర్డర్ల మూలంగా పెద్ద ఎత్తున ఆహార పదార్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు పోగు కావడం గమనించింది. ఆహారాన్ని ప్యాకింగ్ చేయడం వృథా అని, ప్లాస్టిక్ కవర్లు, డబ్బాలను పునర్వినియోగం చేయడం కష్టమని ఆమెకు అర్థమైపోయింది. ఇదే 2018లో ఆమె ‘డబ్బా డ్రాప్’ స్థాపనకు ప్రేరణగా నిలిచింది.
అంశు స్టార్టప్ స్థాపనలో రెనీ విలియమ్స్ అనే ఆత్మీయురాలు కూడా తోడుగా నిలిచింది. ఈవెంట్స్ ప్రాడ్యూసర్ అయిన రెనీ అప్పటికే తన పనికి స్వస్తి పలకాలనే ఆలోచనలో ఉంది. అన్నట్టు రెనీ కూడా పిల్లల తల్లే. అలా ఇద్దరు తల్లులూ వ్యాపారంలో కలిసి సాగాలనుకున్నారు. అంశు ముంబై నుంచి వెళ్లింది కాబట్టి అక్కడి డబ్బావాలాలనే స్ఫూర్తిగా తీసుకుంది. ప్లాస్టిక్ కంటెయినర్ల స్థానంలో స్టీల్ డబ్బాలను
వాడాలని సంకల్పించింది. అలా లండన్ ప్రజలకు భారతీయ, దక్షిణాసియా వంటకాలను డబ్బాల్లో చేరవేస్తున్నది. మొదట్లో అంశు ఇంటినుంచే వంటల కార్యక్రమం ప్రారంభమైంది. ఆ తర్వాత వేరుగా కిచెన్ ఏర్పాటు చేసుకున్నారు.
నోటి ప్రచారం ద్వారానే ‘డబ్బా డ్రాప్’ గురించి ఒకరి నుంచి ఒకరికి తెలిసింది. 2018లో 150 మంది వరకూ ఉన్న సబ్స్ర్కైబర్ల సంఖ్య ప్రస్తుతం 1,500కు చేరుకుంది. చందాదారులు నిర్దిష్టంగా ఉంటారు కాబట్టి, రోజుకు ఎంత వండాలనేది ముందుగానే నిర్ణయమైపోతుంది. దీంతో ఆహారం ఏ మాత్రం వృథా కాకుండా వంటలు చేస్తున్నారు. అన్నం డబ్బాలను సైకిళ్లు, ఎలక్ట్రిక్ స్కూటర్ల మీద డెలివరీ చేస్తారు. అంటే సరఫరా కూడా పర్యావరణ హితంగా ఉండేలా ఏర్పాట్లు చేసుకున్నారన్నమాట. ఇప్పటివరకు డబ్బా డ్రాప్ ద్వారా అంశు, రెనీ భూమాతకు రెండు లక్షలకు పైగా ప్లాస్టిక్ డబ్బాల బెడద తగ్గించారు. మూడువేల కిలోల వరకు ఆహార వృథాను నివారించారు.