ముంబైకి చెందిన సంస్కృతి, శ్రుతి… కవలపిల్లలు. ఇద్దరి పోలికలే కాదు, ఇష్టాలూ ఒకేలా ఉంటాయి. అక్కడితో ఆగలేదు. ఓ అరుదైన విజయాన్ని కూడా ఇద్దరూ కలిసి పంచుకున్నారు. ఈమధ్యనే విడుదలైన చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) పరీక్ష ఫలితాలలో ఇద్దరూ మొదటి పది ర్యాంకుల్లో నిలిచారు. ఆరుగురు సభ్యులున్న ఈ కవలల కుటుంబంలో అయిదుగురు చార్టర్డ్ అకౌంటెంట్లు ఉన్నారు.
సంస్కృతి-శ్రుతిల నాన్న, అన్నయ్య, వదిన కూడా చార్టర్డ్ అకౌంటెంట్లే. తండ్రిని చూస్తూ పెరిగారు ఇద్దరూ. దాంతో, అకౌంట్స్ అంటే ఏమిటో తెలియని వయసులోనే ఆ రంగం పట్ల ఆకర్షణ ఏర్పడిపోయింది. చిన్నప్పటి నుంచీ ఇద్దరి చదువు, ఆటపాటలూ అన్నీ కలిసే సాగేవి. సీఏ లాంటి కఠినమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు కూడా ఆ స్నేహం సాయపడింది. కలిసి ప్రిపేర్ అవుతూ, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఫైనల్ పరీక్షలు రాశారు. ఈ ఏడాది ఫలితాల్లో సంస్కృతి రెండో ర్యాంకు, శ్రుతి ఎనిమిదో ర్యాంకు సాధించారు. త్వరలోనే, ఇద్దరూ కలిసి ఎంబీఏ చేయాలనుకుంటున్నారు.