Inspiration | మూలాలు గ్రామీణమే అయినా.. తల్లిదండ్రుల ఉద్యోగాలతో ఆమె విదేశాల బాటపట్టారు. నైజీరియాలో స్థిరపడ్డారు. కన్నతల్లి అస్వస్థత భారతదేశానికి రప్పించింది. ఈ పదేండ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ ఓ ఇరవై మందికి ఉపాధినిచ్చే స్థాయికి చేరుకొన్నారు. మార్కెట్లోని ఉత్పత్తులకు దీటుగా.. సొంత బ్రాండింగ్తో దూసుకెళ్తున్న చెక్ ఆర్గానిక్స్ ఫౌండర్ చికోటి కీర్తి స్టార్టప్ స్టోరీ..
నా మూలాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నాయి. నైజీరియాలో నాన్న మెకానికల్ ఇంజినీర్గా చేసేవారు. దీంతో మేమంతా హైదరాబాద్లో ఉండాల్సి వచ్చింది. మా పెంపకం కోసం అమ్మ ఉస్మానియా దవాఖానలో నర్సు ఉద్యోగానికి రాజీనామా చేశారు. నేను బీఎస్సీ చదివాను. కొంతకాలం కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నిర్వహించాను. మేం తరచూ నైజీరియా వెళ్లేవాళ్లం. అనుకోకుండా, అక్కడ స్థిరపడిన తెలుగు వ్యక్తితోనే నా వివాహం జరిగింది. నా బిడ్డ భారతదేశంలోనే పుట్టాలనే సంకల్పంతో మొదటి డెలివరీ కోసం భారత్ వచ్చి వెళ్లాను. రెండో బిడ్డకు జన్మనిచ్చే సమయానికి అనుకోని అవాంతరాలు ఎదురయ్యాయి.
నైజీరియాలో మలేరియా అతిపెద్ద సమస్య. అమ్మ మలేరియా బారినపడింది. ఆ వ్యాధి మెదడు వరకూ సోకింది. తను కోమాలోకి వెళ్లడంతో నైజీరియాలో ఉండలేకపోయాను. అమ్మను తీసుకుని హైదరాబాద్ వచ్చేశాను. ఇక్కడికి వచ్చాక, సహజసిద్ధంగా దొరికే తొగరు పండులోని అద్భుతమైన ఔషధగుణాల కారణంగా అమ్మ కోలుకున్నది. తనే నా డెలివరీ చేసింది. ఆ ఆనందం ఎంతోకాలం నిలబడలేదు. పసికందుకు డౌన్ సిండ్రోమ్ అని తేలింది. చాలా బలహీనంగా ఉండేవాడు. నెలలు గడిచినా అదే పరిస్థితి. దీంతో అమ్మ దేవుడి మీద భారం వేసి.. నోరి పండు రసాన్ని పట్టించేది. దీంతో బాబు బరువు పెరిగాడు. రోగ తీవ్రత తగ్గింది.
ప్రతి మనిషి జీవితంలోనూ సవాళ్లు ఉంటాయి. మహిళ జీవితంలో మరీ ఎక్కువ. ఆ అవరోధాల్ని ధైర్యంగా తట్టుకోవాలి. ప్రతి సమస్యనూ ఓ అవకాశంగా మార్చుకోవాలి. వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నప్పుడు లోతైన పరిశోధన చేయాలి. నిపుణులతో మాట్లాడాలి. ఇంకొకరి మీద ఆధారపడటం మంచిది కాదు. ఇది నా స్వానుభవంతో చెబుతున్న విషయం.
మొదట్లో ఎవరు చెప్పినా నమ్మకం కలిగేది కాదు. అనుభవంలోకి వచ్చాకే.. తొగరు పండు ఔషధ లక్షణాలు తెలిసొచ్చాయి. స్వయంగా అనేక పరిశోధనలు చేశాను. న్యూట్రిషనిస్టులు, ఫుడ్ సైంటిస్టులతో మాట్లాడాను. అంతలోనే నాన్న కూడా ఇండియా వచ్చేశారు. జనగామ సమీపంలో వ్యవసాయ భూమి కొని… తొగరు పండ్ల సాగు మొదలుపెట్టారు. రసాయన ఎరువులు వాడేవాళ్లం కాదు. అన్ని పనులూ మేమే చేసుకునేవాళ్లం.
కానీ, ఓ సంస్థ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక పోయింది. గిట్టుబాటు ధర అందించలేదు. ఆ నష్టాన్ని భరించ లేక.. మేమే మార్కెటింగ్ చేయడం ఆరంభించాం. తొగరు పండ్ల జ్యూస్, నూనె, షాంపూ, సబ్బు, మాయిశ్చరైజర్, పెయిన్ బామ్.. ఇలా అనేక ఉత్పత్తులు అందిస్తున్నాను. ప్రవాసులు భారతదేశానికి వచ్చినప్పుడు ఎంతైనా ఖర్చుచేస్తారు. కానీ ఇక్కడ రూపాయి కూడా సంపాదించలేరు. మళ్లీ విదేశాలకు వెళ్లాకే ఆర్జన మొదలవుతుంది. పట్టుదల ఉంటే, స్థానిక మార్కెట్ను అర్థం చేసుకోగలిగితే భారత్లోనూ వ్యాపారం చేయవచ్చు. లాభాలు సంపాదించవచ్చు. అందుకు నా జీవితమే ఒక ఉదాహరణ.
నైజీరియా నుంచి తిరిగివచ్చిన తర్వాత కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఆంత్రప్రెన్యూర్ (కోవే)తో పరిచయమైంది. ఆ అనుబంధమే నా వ్యాపారాన్ని వినూత్నంగా తీర్చిదిద్దింది. భారతీయ మార్కెట్ తీరుతెన్నులు, వ్యాపార స్థితిగతులు, ఆర్గానిక్ ఉత్పత్తులు.. తదితర అంశాలపై అవగాహన కల్పించింది. రెండు వారాల ప్రత్యేక శిక్షణ ఫలితంగా బ్రాండింగ్లో, మార్కెటింగ్లో మెలకువలు తెలిశాయి. ఆ అనుభవంతో అమ్మకాలను పెంచుకున్నాను. ఆన్లైన్ వేదికగా అంతర్జాతీయ స్థాయిలో విక్రయాలు జరుపుతున్నాను. అమెరికా, నైజీరియాతోపాటు అనేక దేశాలకు మా ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నాం. chekorganics.com ద్వారా ఆన్లైన్లో అమ్మకాలు జరుగుతున్నాయి. ఇంటి వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నవారూ ఉన్నారు.
– కడార్ల కిరణ్