నిధి భాసిన్.. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్) అనుబంధ ఎన్జీవోకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీయీవో). రానున్న పదేండ్లలో రెండుకోట్ల జీవితాలను మార్చాలన్నది ఈ సంస్థ ఆశయం. ఆ వైపుగా నిధి అడుగులు వేస్తున్నారు. వ్యూహ రచనా చేస్తున్నారు. ‘మహిళలలో సాంకేతిక అక్షరాస్యతను పెంచి.. ఉపాధి అవకాశాలను విస్తృతం చేయాలన్నది మా ఆకాంక్ష’ అంటారామె. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెడుతున్నాయి. వాటిని అందిపుచ్చుకోవాలంటే.. ఇంటర్నెట్లో శోధించే సామర్థ్యం ఉండాలి.
మేం ఇరవై రాష్ర్టాలలో సాంకేతిక చైతన్యాన్ని పెంచే కార్యక్రమాలు చేపట్టాం. సామాజిక మాధ్యమాల సాయంతో వ్యాపారం చేయడం ఎలాగో గృహిణులకు నేర్పించాం. ఫలితంగా లక్షమంది యూట్యూబ్, వాట్సాప్ తదితర వేదికలను సమర్థంగా ఉపయోగించుకుంటున్నారు’ అని వివరిస్తారామె. నిధి ఆరంభించిన మరో కార్యక్రమం.. ఉమెన్ విజార్డ్స్ రూల్ టెక్. ఇది సాంకేతికంగా ఇంకొక మెట్టు. బిగ్ డేటా, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చెయిన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్.. గురించి మహిళలకు అవగాహన కలిగించడం ప్రధాన లక్ష్యం. నిధి చొరవతోనే నాస్కామ్ ఫౌండేషన్ మెంటర్షిప్ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. మహిళా ఆంత్రప్రెన్యూర్స్కు ఇదో దిక్సూచి.