ఏదైనా సున్నితమైన విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలంటే.. అందరికంటే ఎత్తులో నిలబడాలి. నాలుగు దిక్కులకూ వినిపించేలా గొంతు సవరించుకోవాలి. సిమి కూడా అదపని చేసింది. తాను నమ్మిన.. త్రికరణశుద్ధిగా అనుసరిస్తున్న వీగనిజం గురించి గొంతెత్తి చాటడానికి.. కిలిమంజారో పర్వతాన్ని వేదికగా ఎంచుకున్నది. సర్వశక్తులూ ధారపోస శిఖరానికి చేరుకున్నది. తన భావాలను ప్రకటించింది. మనం బతకడం కోసం.. ఇంకో జీవిని చంపడం ఎంత వరకూ న్యాయమని ప్రశ్నించింది. కూడా.
‘ఏదైనా మార్పును బలంగా కోరుకున్నప్పుడు మన వంతు ప్రయత్నం కూడా అంతే బలంగా చేయాలి. రావాల్సిన సమయంలో ఫలితం తప్పక వస్తుంది’ అంటున్నది సిమి అలియాస్ శారద. ఓ కార్పొరేట్ హాస్పిటల్ పీఆర్వోగా కెరీర్ మొదలుపెట్టిన ఈ యువతి ఆ తర్వాత పలు మీడియా సంస్థల్లో పనిచేసింది. 2014లో అమెరికా వెళ్లింది. అక్కడ ఓ ఎఫ్ఎం రేడియోలో ప్రోగ్రామింగ్ హెడ్గా పనిచేసింది. చిన్నప్పటి నుంచీ తనకు పెంపుడు జంతువులుఅంటే ఎంతో ఇష్టం. వాటి కోసం తన వంతుగా ఏదైనా చేయాలని భావించింది. ఆ ప్రేమ కొద్దీ చిన్న వయసు నుంచే మాంసాహారానికి, జంతువుల ద్వారా వచ్చే ఆహార పదార్థాలకు దూరమైంది.
అమెరికాలో ఉన్నప్పుడు కొంతమంది వీగన్లతో పరిచయం ఏర్పడింది. వారి జీవన విధానాన్ని, ఆహారపు అలవాట్లను దగ్గరి నుంచి గమనించింది. జంతువుల పొదుగు నుంచి పితికిన పాలకు బదులుగా సోయా, చిక్కుడు, పల్లీల నుంచి తీసిన పాలు తాగేవారు వాళ్లంతా. మాంసం అస్సలు ముట్టుకునేవారు కాదు. సిమి కూడా ఆ బృందాన్ని అనుసరించింది. క్రమంగా.. పూర్తిస్థాయి వీగన్గా మారిపోయింది. కరోనా సమయంలో అమెరికా నుంచి వచ్చేసింది. వీగన్గా మారిన తర్వాత కూడా తనకు ప్రొటీన్లు, శక్తి విషయంలో ఎలాంటి తేడా కనిపించలేదు. దీంతో, నలుగురికీ వీగనిజం గురించి చెప్పడం మొదలుపెట్టింది. ఇంకా ఎక్కువ మందికి ఆ సందేశాన్ని చేరవేయాలని అనుకుంది. అందరి దృష్టినీ ఆకర్షించేలా ఏదైనా చేయాలనుకుంది. వీగనిజం ప్రచారంలో భాగంగా.. ఆఫ్రికా ఖండంలోనే అతిపెద్దదైన కిలిమంజారో పర్వతం ఎక్కాలని నిర్ణయించుకుంది. పర్వతారోహణ అంటే మాటలు కాదు. అందుకు ఫిట్నెస్ కావాలి. స్టామినా ఉండాలి. వెంటనే, శారీరక దృఢత్వం కోసం ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకుంది. సరిగ్గా అదే సమయంలో సెకెండ్ వేవ్ మొదలైంది.
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించడం మొదలుపెట్టింది. దీంతో తన పర్వతారోహణను ఆరు నెలల పాటు వాయిదా వేసింది. సాధన మాత్రం ఆపలేదు. ఫైనల్గా.. 2021 సెప్టెంబర్లో సముద్రమట్టానికి 19,340 అడుగుల ఎత్తులో ఉన్న కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది. కిలిమంజారో పర్వతాన్ని ఎక్కిన తొలి వీగన్ మహిళగా రికార్డు సృష్టించింది. ‘నేను వీగన్ని. వీగనిజం ఫాలో అవుతూ చాలా ఆరోగ్యంగా ఉన్నా. నాకు కావాల్సిన పోషకాలు వీగన్ ఫుడ్లో దొరుకుతున్నాయి. మీరు కూడా వీగనిజం అనుసరించండి. జంతుహింస వీడండి’ అంటూ అక్కడి నుంచే తన సందేశాన్ని వినిపించింది.
హైదరాబాద్లోని మాదాపూర్, గచ్చిబౌలిలో సిమీస్ వరల్డ్ పేరుతో కేఫ్ ప్రారంభించి.. వీగన్ ఫుడ్ రుచి చూపిస్తున్నది శారద. ‘క్లౌడ్ కిచెన్’ పేరుతో ఏర్పాటు చేసిన చానల్ ద్వారా వీగన్ వంటల తయారీని జనంలోకి తీసుకెళ్తున్నది. ‘ఫిట్నెస్కు, ఆరోగ్యానికి వీగన్ ఫుడ్ చాలా మంచిది. అందుకు ఉదాహరణ నేనే’ అని సగర్వంగా చెబుతున్నది. దీంతో పాటే వివిధ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నది శారద. ప్రత్యేక సందర్భాలలో స్టాల్స్ ఏర్పాటు చేసి వీగన్ వంటలను పరిచయం చేస్తున్నది. ‘నాన్వెజ్లాగే రుచితోపాటు పోషకాలు లభించే వంటకాలు వీగన్ మెనూలో చాలానే ఉన్నాయి. ముందు రుచి చూడండి. ఆ తర్వాతే వీగన్గా మారండి’ అంటూ ప్రచారం చేస్తున్నది. వీగనిజం గురించి మరోసారి అందరూ మాట్లాడుకునేలా.. జూలో రష్యాలోని మౌంట్ ఎల్బ్రుస్ పర్వతం ఎక్కేందుకు సిద్ధమవుతున్నది శారద అలియాస్ సిమి. జై వీగనిజం!
మన జీవన విధానాన్ని మారుస్తుంది. తోటి జీవిని హింసించి, చంపి తినడం అమానుషం. వీగన్గా మారితే రోజుకో జీవిని కాపాడినట్టే. నా వంతుగా ఇదో చిన్నపాటి ప్రయత్నం. మార్పు ఎప్పటికైనా వస్తుందని నమ్ముతున్నా. అప్పటివరకు వీగనిజం గురించి ప్రచారం చేస్తూనే ఉంటాను. ఉన్న
పళంగా వీగన్గా మారడం కష్టమే. అలా అని, అసాధ్యమూ కాదు.
…? సుంకరి ప్రవీణ్కుమార్
– చిన్న యాదగిరి గౌడ్