‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2021’లో రూ.వెయ్యి బహుమతి పొందిన కథ.
ఆగస్టు 15, 1947. “నిన్న అర్ధరాత్రి అఖండ భారతదేశాన్ని రెండు సర్వసత్తాక దేశాలుగా విభజించి.. స్వాతంత్య్రాన్ని ప్రకటించింది బ్రిటిష్ ప్రభుత్వం. భారతదేశంలోని నాయకులు, ప్రజలు జెండా ఎగరేసి సంబురాలు చేసుకుంటున్నారు”.. అంటూ సాగుతున్న వార్తలకు మధ్యలో అంతరాయం కలిగిస్తూ..
“ఏంటీ!? భారతదేశానికి అప్పుడే స్వాతంత్య్రం వచ్చిందా..! వచ్చే సంవత్సరం ఇస్తానన్నారుగా! ముందే ఇచ్చేశారేంటి?” అంటూ అనుమానంగా అడిగాడు మైపాల్ రెడ్డి.
తండ్రి మాటలు విని రేడియో సౌండ్ తగ్గించింది మైపాల్ రెడ్డి కూతురు.
“రెండో ప్రపంచయుద్ధం తర్వాత విన్స్టన్ చర్చిల్ ఓడిపోయాడు నాన్న. ఇప్పుడు బ్రిటన్లో కొత్త ప్రభుత్వం.. లేబర్ పార్టీ అని ఏర్పడింది. అందుకే పోయిన ఏడాదే మనకు ఎన్నికలు పెట్టింది. ఈ రెండో ప్రపంచయుద్ధం తర్వాత భారతీయుల ఒత్తిడి బాగా ఎక్కువైంది. అందుకే ఇచ్చే స్వాతంత్య్రమేదో ముందే ఇచ్చేసి వెళ్లిపోతున్నారు” అంటూ జరిగిన, జరుగుతున్న రాజకీయాల్ని వివరించింది.
మైపాల్ రెడ్డికి భారతదేశంలోని రాజకీయాలే అంతంత మాత్రం తెలుసు, బయటి దేశాలంటే.. అసలే తెలియదు.
“వెళ్తే వెళ్లారుగానీ దేశాన్ని రెండు ముక్కలు చేసి వెళ్లాలా..!?”.
“తప్పదు నాన్నా.. స్వాతంత్య్రం కావాలంటే దేశాన్ని రెండుగా విడదీయాలి. అయినా రెండు మతాలుగా కలిసుండటం కంటే, రెండు దేశాలుగా విడిపోవడం మంచిది”.
“అని ఎవరు చెప్పారు?”.
“అంబేద్కర్లాంటి కొంతమంది మేధావులు మద్దతిచ్చారు”.
“ఈయనొకడు.. అందరూ ఒకటంటే ఈయన ఇంకోటంటాడు. అందుకే ఈళ్లను చదువుకోవద్దని దూరం పెట్టింది. చదువుకుంటే ఇదిగో ఇలా అన్నిట్లో వేలుపెడతారు”.. అంటూ అక్కడే ఇల్లు తుడుస్తున్న దేవమ్మ వైపు చూశాడు.
ఇంతలో కూతురు ఏదో చెప్పబోయింది. అంతలోనే..
“ఏందే అట్లా చూస్తున్నావ్. ఇల్లు సక్కగ తుడువు” అన్నడు.
ఇల్లు తుడుస్తూ భయంభయంగా బయటికి వచ్చింది దేవమ్మ.
బకీట్ల నీళ్లు పారబోసి ఇంటికి బయల్దేరింది.
నిజానికి దేవమ్మ ఇల్లు తుడుస్తూనే, ఆ తండ్రి కూతుర్ల మాటలన్నీ విన్నది.
‘పటేల్ సెప్తే ఊరంతా ఇంటది. అట్టాంటి పటేలు.. కూతురు మాట ఇంటండు. ఎంతైనా సదువుకున్న పిల్ల’.. అని ఆలోచిస్తూ ఇంటికి చేరుకుంది.
ఇంట్లో నుంచి ఉమ్మేస్తే వాకిట్లో పడ్డట్టు! ఉంది ఆ గుడిసె.
ఆ గుడిసెలో ఆరేండ్ల పిల్లగాడు. వాడు భూమ్మీద పడంగనే తండ్రి పోయిండు. అప్పటిసంది నానా కష్టంచేసి పెంచుతున్నది కొడుకును. పొద్దుగాల లేసి ఇంత అంబలి కాసి, పటేల్ ఇంటికి పోతది. ఆ ఇంట్లో పనంతా చేసి, మల్ల ఇంటికొచ్చి తిని కూలి పనికి పోతది. పొద్దుగూకినాక వచ్చి.. బుక్కెడు వండుకొని తిని, పిల్లగానికి కథలు చెప్పుకొంట పండుకుంటది.
ఇంటికొచ్చిన దేవమ్మను చూసిండు కొడుకు.
“అమ్మా! ఇయ్యాల అంబలి కొంచెమే కాసినవ్!” అని అడిగాడు.
“ఏంలేదు బిడ్డా! శాననే కాసిన. కానీ పొద్దుగాల ఒకాయనొస్తే కొంచెం పోసిన”.
“ఎవరమ్మా ఆయిన!?”.
“ఏమో.. ఎవలో!? పొద్దుపొద్దుగాల శాతగాక మన ఇంటి ముందు కూసుంటే ఇంత పోసిన”.
“అమ్మా.. మనకు తక్కువ అయితది కదనే!”.
“ఏం కాదు! నువ్వు మధ్యానం అంబలి తాగు.. నేను వొట్టిరొట్టె తీసుకుపోతా”.
“అమ్మా! రాతిరికేం తొక్కే!?”.
“చింత చిగురు చేస్తలే!”.
“అమ్మా! నాకు కోడిగుడ్డు.. కోడిగుడ్డు..” అంటూ ఎగిరాడు పిల్లగాడు.
“సరే! ఇయ్యాల కోడివెట్టె గుడ్డు నీకే! నువ్వు మాత్రం యాడికీ పోకుండా ఈన్నే ఆడుకో! నేను మాపటికొస్తా”.
“అమ్మా అమ్మా! శెల్కలకు నేనుగూడ వస్తనే!”.
“వొద్దుబిడ్డా! అది శానాదూరం. నువ్వు నా ఎంబడి
వొస్తే.. కోన్ని వట్టుకొని గంపకింద ఎవలు వెడ్తరు!? మాపటికి గుడ్డు కావాల్నా.. వద్దా!?”.
“కావాలె… కావాలె!”.
“ఐతే ఈన్నే ఉండు. సరేనా!”.. అంటూ దేవమ్మ సద్ది కట్టుకొని పోయింది.
ఆ రోజు పటేలు శెల్కల పత్తి ఏరనీకి పోయింది. దేవమ్మతోపాటు శానామంది వొస్తరు. వాళ్లకు పది సాల్ల అవ్తల పత్తి ఏరుతది దేవమ్మ. తెచ్చుకున్న సద్దికూడా.. దూరంగ కూసొని ఒక్కతే తింటది. ఏం అవసరం వచ్చినా.. ఆపద వచ్చినా.. ఆ దిక్కుకు పోవొద్దు. అందరూ.. పాటలు పాడుకుంట పనిచేస్తరు. దేవమ్మకు వాళ్లు పాడే పాటలన్నీ వచ్చు.. అయినా పాడకూడదు.
ఎండ నెత్తిమీదికొచ్చింది. అందరూ సద్ది తిననీకి కూసున్నరు. దేవమ్మ కూడ తను తెచ్చుకున్న సద్ది ఇప్పి.. వొట్టిరొట్టెను ఇరిసి నీల్లల్ల నానవెట్టింది. దానికి తోడు కాస్త మిరప్పొడి తీసుకొచ్చింది. రొట్టింకా నానలేదు. అందుకే.. నీల్లల్లకు వొత్తుకుంట గాలికి అక్కడిక్కడ చూసింది. దూరంగా ఎవరో వస్తున్నట్టు అనిపించింది. చేతిలో కట్టెను చూసి కావలాయన అని గుర్తుపట్టింది. రొట్టె కాస్త నానింది. ఓ రొట్టె తున్కను మిరప్పొడిల అద్దుకొని నోట్లె ఏసుకున్నది. ఇంతలో కావలాయన..
“దేవమ్మా.. ఓ దేవమ్మా!” అని పిలిచిండు.
‘ఇదేంది? కావలాయిన నాకోసం వొచ్చిండు’ అనుకొని పలికింది.
“నిన్ను పటేల్ రమ్మంటుండు”.
‘అదేంది ఎండపొద్దున రమ్మంటుండు’ అనుకొని..
“సరే! వొస్తున్నా” అంటూ తెచ్చుకున్న సద్ది మూటకట్టుకుంది.
పటేల్ ఇంటికాడ పోలీస్ జీప్ ఆగి ఉన్నది. దేవమ్మ ఇంటి ముందుకు వొచ్చిందో లేదో.. దూరం నుంచి సూసిన పటేల్ కోపంగా దేవమ్మ మీదికి వొస్తూ..
“నీయమ్మ! నా ఇంట్ల పనిజేసుకుంట నన్నే సంపనీకి సూస్తవా!?” అంటూ చెంప మీద కొట్టిండు.
దేవమ్మ పరేశానైంది. వెనక నుంచి పోలీసు వొచ్చి..
“పటేల్ సాబ్! ఇవన్నీ మేం సూసుకుంటం” అంటూ దేవమ్మ దగ్గరికి పోయి.. ఆ చెంప ఈ చెంపా సర్శిండు.
“నిజం జెప్పు! పటేల్ను సంపనీకి ఎప్పట్నించి చూస్తున్నర్రు..!? ఎంతమంది వచ్చిండ్రు? ఎవరెవరు వచ్చిండ్రు?”.
దేవమ్మకు ఏం అర్థంకాలే. భయమైతుంది. ఏం జెయ్యాల్నో తోస్తలేదు.
“నాకేం తెల్వదు సారూ! నేనెందుకు పటేల్ని సంపాలనుకుంటా..” అంటూ ఏడుస్తున్నది.
పోలీసు దేవమ్మ జడ వట్టుకొని..
“అసలు నీకు అన్నలకు సమ్మందమేంది? ఎప్పటి సంది పని జేస్తున్నావ్ వాళ్లకు..” అన్నడు.
దేవమ్మకు భయం ఎక్కువైంది.
“నాకేం తెలుసు సారూ! అన్నలు ఎవరో నాకు తెల్వదు. నన్ను నమ్మండి సారూ..” అంటూ ఏడుస్తూనే ఉన్నది.
“ఏం తెల్వదానే! దొంగ ముండా..” అంటూ పటేల్ పండ్లు కొరుకుతూ మీదికి వొచ్చిండు.
“పటేల్ సాబ్! నేను చూసుకుంట అని శెప్పిన కదా! మీ శేతికి ఎందుకు మైలంటుకుంటది” అనుకుంటనే దేవమ్మ తానికి పోయిండు పోలీసు.
“ఇయ్యాల పొద్దుగాల మీ ఇంటికి అన్నలు వచ్చిండ్రా.. లేదా?” అన్నడు దేవమ్మతోని.
‘లేదు..’ అన్నట్టుగా తలూపింది దేవమ్మ.
పోలీసు కండ్లల్ల క్రూరత్వం మొదలైంది.
“ఇయ్యాల పొద్దుగాల మీ ఇంటికి ఒకడు వచ్చిండు. ఆనికి నువ్వు అంబలి పోసి పంపినవ్! అవునా… కాదా?”.
‘అవును’ అన్నట్టు ఏడుసుకుంటనే తల ఊపింది.
“ఆయినె అన్నని నాకు తెల్వదు. నీరసంగా కనిపిస్తే అంబలి పోసి ఇచ్చిన. అంతకుమించి నాకేం తెల్వదు సారూ”.
“నీరసంగా ఉంటే అంబలి పోసి ఇస్తావా!? నా పెండ్లం లేక మూడు రోజులైతుంది. నాకూ.. ఒంట్లో నీరసంగా ఉంది!” అంటూ దేవమ్మకు మరింత దగ్గరికెళ్లి చెప్పిండు పోలీసు. దేవమ్మ గుండె శెరువైంది.
“పటేలా! దీని గుడిసె సోదా జెయ్యాలే” అన్నడు పటేల్ను చూస్తూ.
“వాళ్లు నిన్నెందుకు లోపలికి
గుంజుకపోయిండ్రు. లోపల నిన్ను కొట్టిండ్రా!?” అని తల్లిని చూస్తూ అడిగిండు కొడుకు.
ఆకాశం ఇరిగి ఈపు మీద
పడ్డట్టనిపించింది దేవమ్మకు.
ఆరేండ్ల పిల్లగానికి, అదీ తన సొంత కొడుక్కు.. ఆమె చేయని తప్పునకు,
చేసిన సాయానికి ప్రతిఫలంగా
అనుభవించిన మానభంగం గురించి ఏమని చెప్తుంది?
ఆమె రెండు దవడలు
బిగుసుకుపోయి ఆ పంటికింద బాధను ఎంత నమిలినా
నలగట్లేదు.
‘సరే!’ అన్నట్టు తలూపాడు పటేల్.
దేవమ్మను కొట్టుకుంట గుడిసెకాడికి తీసుకొచ్చిండు. గుడిసె మూసుకొని ఉంది. పిల్లగాడు లేడు.
దేవమ్మ అక్కడేం జరిగిందో మొత్తం పూసగుచ్చినట్టు చెప్పి.. చేసి చూపించింది.
అయినా పోలీసు విన్లేదు. ఆమె జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లి గుడిసె తలుపును తన్ని దేవమ్మను లోపలికి తోసిండు.
గుడిసెలోంచి కోడిపెట్ట ఎగిరి బయటికొచ్చింది. ఆ కోడిపెట్ట కాలిగోరు పోలీసుచేతికి గీసుకపోయింది. అక్కణ్నే ఉన్న సిపాయిలకు దాన్ని పట్టుకరమ్మని చెప్పిండు. అప్పటికే దేవమ్మ కొడుకొచ్చి వాకిట్ల నిలవడ్డడు. ఆ పోలీసు.. పిల్లగాన్ని సూసుకుంట తలుపేసిండు.
కొంచెం సేపైనాక తలుపు తీసుకొని.. అంగి భుజానికి ఏసుకుని బయటికొచ్చిండు.
ఎదురుగా ఇద్దరు సిపాయిలు కోడిపెట్టను వట్టుకొని నిలవడ్డరు. ఆ పక్కనే పిల్లగాడు నిలవడి ఉన్నడు.
‘వెళ్దాం పద!’ అన్నట్టుగా సైగ జేసిండు పోలీసు.
పోతూపోతూ పిల్లగాని తల నిమిరిపోయిండు.
కొంచెంసేపటికి పిల్లగాడు గుడిసెలోకి పోయిండు.
దేవమ్మ ముద్దగా కూసొని ఉన్నది. ఎడంచేతికాడ కొంచెం రైక చినిగింది. చీర శాన తోవల్ల చినిగిపోయింది.
ఆమె పెయ్యంత నొప్పులతోని పులిసిపోయింది.
పిల్లగాడు..
“అమ్మా..!” అంటూ దేవమ్మ దగ్గరికి పోయిండు.
ఆమె ఏం మాట్లాడకుండా లేసి తానానికి వెళ్లింది. పిల్లగానికి ఏమీ అర్థం కాక బయటికొచ్చి కూసున్నడు.
దేవమ్మ తానం చేసి, లోపలికెళ్లి ఇంకో చీర కట్టుకొని వొచ్చింది. ఎండవెట్టిన చింతచిగురు తీసి పొయ్యిమీద యేసింది. లోపలికెల్లి గుడ్డు తీసుకొచ్చి ఉడుకవెట్టింది. వంట చేసి తిననీకి కూసున్నరు. పిల్లగాడు దేవమ్మను చూస్తూనే ఉన్నడు. కానీ ఏమీ మాట్లాడలేదు. మాటలు లేకుండనే తిన్నరు.
గుడిసె బయట సాపేసి తల్లీకొడుకులిద్దరూ పడుకున్నరు. దేవమ్మ ఆకాశంలోకి చూస్తున్నది.
“అమ్మా!” అంటూ పిలిచిండు కొడుకు.
దేవమ్మ ఆకాశంలోకి చూస్తూనే.. ‘ఊ!’ అని పలికింది.
“వాళ్లు నిన్నెందుకు లోపలికి గుంజుకపోయిండ్రు. లోపల నిన్ను కొట్టిండ్రా!?” అని తల్లిని చూస్తూ అడిగిండు.
ఆకాశం ఇరిగి ఈపు మీద పడ్డట్టనిపించింది దేవమ్మకు. ఆరేండ్ల పిల్లగానికి, అదీ తన సొంత కొడుక్కు.. ఆమె చేయని తప్పునకు, చేసిన సాయానికి ప్రతిఫలంగా అనుభవించిన మానభంగం గురించి ఏమని చెప్తుంది? ఆమె రెండు దవడలు బిగుసుకుపోయి ఆ పంటికింద బాధను ఎంత నమిలినా నలగట్లేదు. కండ్లలోని సుడిగుండాల్ని, ముక్కుపుటాలదిరే శ్వాసల్ని, శ్వాసలోని ఆయాసాన్ని పిడికిళ్లు బిగపట్టి..
“అవును.. కొట్టారు..” అంటూ ఇంట్లకు పోయి, కండ్లు తుడుసుకొని.. చినిగిన చీర – జాకెట్టు తీసుకొచ్చి కుడుతున్నది.
“రేపటిసంది మనల్ని ఎవరూ కొట్టరమ్మా!” అంటూ తల్లి ఒళ్లో పడుకున్నాడు పిల్లగాడు.
“యే యెందుకు?” అంటూ.. పిల్లాడి దిక్కు తిరిగింది దేవమ్మ.
“మనకు సొతంత్రం వొచ్చిందంట!” అన్నాడు చిన్న నవ్వు ముఖంతో.
“నీకెవరు చెప్పిండ్రు!?” అడిగింది దేవమ్మ.
“ఎక్కువోళ్ల పిల్లలు అంటుంటే విన్నా.. సొతంత్రం వస్తే ఎవరినీ కొట్టరంటమ్మా!”.
“నిజమే! కానీ, సొతంత్రం మనకు రాలేదు”.
“మరీ..!?”.
“భారతీయులకు వొచ్చింది”.
“మరి మనమెవరం..?”.
“మనం హైద్రాబాదోల్లం! మనది నిజాం రాజ్యం!”.
“మల్ల మనకెప్పుడొస్తది!?”.
“మనమీద పోలీసోడుండు.. వానీమీద పటేలుండు.. పటేల్ మీద దొరుండు.. దొర మీద నిజామోడుండు! ఇంతమందిని దాటుకొని మనకేడొస్తది బిడ్డా.. సొతంత్రం!”.
“అయితే.. మనం భారతదేశం పోదాం”.
“పోవాలె! సదువు యేడ దొరికితే ఆడికే పోవాలె! నిన్ను సదివిస్త.. ఈలోకం సదివినోని మాటనే ఇంటది. మన ఊర్ని యేలే పటేల్.. సదువుకున్న ఆయిన బిడ్డ మాట ఇంటుండు. రేపు నువ్వు కూడా సదువుతే.. నీమాట అందరూ ఇంటరు” అన్నది.
‘మౌనంగా గెలవాలె. గెలిచినంక ప్రపంచమంతా ఇనిపించేటట్లు అరవాలె! అదే నిజమైన గెలుపు’ అని మనసులో అనుకున్నది దేవమ్మ. చీర, రైక పక్కనపెట్టి.. పడుకొని ఆకాశంలోకి చూస్తున్నది.
“అమ్మా! భారతదేశం పోదామే! అక్కడయితే
నిన్నెవరూ కొట్టరు”.
‘సరే’ అన్నట్టుగా నవ్వుతూ తలూపింది.
‘భారతదేశమైనా.. లోకంలో ఏ దేశమైనా.. ఆడదాని బతుకులో ఏం తేడా ఉండది. ఏం శాతకాని మగాడైనా.. వాడి అధికారం అంతా ఆడదానిపైనే! అయినా మిమ్మల్ని అని ఏం లాభం!? కులాన్నిబట్టి మానానికి, పాణానికి విలువివ్వాలని చెప్పినోన్ని పూజించే ఈ దేశంలో ఉంటే ఎంత? పోతే ఎంత?’ అనుకుంట కండ్లు మూసుకున్నది.
చింతకింది శివశంకర్
చింతకింది శివశంకర్ స్వస్థలం నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం అంబట్పల్లి. తల్లిదండ్రులు చింతకింది అపరంజమ్మ – వెంకటయ్య. బీటెక్ (ఈసీసీ) చేశారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్ సంస్థలో టెలికాం ఇంజినీర్గా పనిచేస్తున్నారు. కథకుడిగా ‘స్వాతంత్య్రం’ ఈయన మొదటి కథ. మరణం అంచున నేను, స్వజాతి, బొందల గడ్డ కథలు రాశారు. ‘విషనరుడు‘ కవితా సంపుటి ప్రచురించారు. ‘చరిత కామాక్షి’ సినిమాతోపాటు ‘గప్ చుప్’ వెబ్ సిరీస్కు రచయితగా పనిచేశారు. యూట్యూబ్ వేదికగా ‘స్టోరీ టెల్లర్’ చానెల్ ఏర్పాటు చేసి.. పుస్తకాల గురించి చెబుతున్నారు. ‘అసుర’ తెలుగు పోడ్కాస్ట్ నిర్వహిస్తున్నారు. మొదటి కథ స్వాతంత్య్రం.. నమస్తే తెలంగాణ – ముల్కనూరు ప్రజా గ్రంథాలయం నిర్వహించిన 2022 కథల పోటీలో బహుమతి గెలుచుకున్నది. రచయిత అభిప్రాయం ప్రకారం.. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా, తెలంగాణకు రాలేదు. తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చినా, కొన్ని కులాలకు రాలేదు. కులాలకు స్వాతంత్య్రం వచ్చినా, ఆడవాళ్లకు రాలేదు. వీటన్నిటికీ సమాధానం.. చదువు. వీటి ఆధారంగా రాసిన కథే.. స్వాతంత్య్రం!.
– చింతకింది శివశంకర్ 99123 24492