జరిగిన కథ : క్రీ.శ.1199లో కాకతీయ చక్రవర్తిగా అభిషిక్తుడైన గణపతిదేవుడు.. తొలియుద్ధాన్ని వెలనాడుపై ప్రకటించి, దానితోపాటు ద్వీప మండలాన్ని కూడా జయించాడు. సర్వసైన్యాధ్యక్షుడు మల్యాల చౌండ అశేష ధనరాశులతోపాటు ద్వీపరాజు పినచోడుని కుమార్తెలు నారమ, పేరమను అనుమకొండకు తరలించాడు. పినచోడుని కొడుకు పదేళ్ల చిన్నారి జాయప.. ఎవ్వరికీ చెప్పకుండా అక్కల పల్లకిలో దూరి, అనుమకొండ చేరాడు. జాయపను చౌండ తన ఇంట్లో ఉంచుకున్నాడు గానీ, అతనెవరో ఎవ్వరికీ చెప్పలేదు. ఓసారి వీధిలోకి వచ్చిన జాయపకు.. సైనిక తిరుగుప్రయాణంలో పరిచయమైన మావటి సుబుద్ధి కనిపించగా, అతని ఇంటికి వెళ్లాడు. అలా విధివిలాసమేమో.. రాకుమారుడైన జాయప అనుమకొండ జీవితం, ఓ అనామకుడిగా మొదలయ్యింది. సుబుద్ధి పిల్లలతో ఆ వాడకట్టులో ఆటలు, చదువు ప్రారంభించాడు జాయప. క్షీరనీరన్యాయమెరిగిన జాయప.. మంచి పండితుడైన నాగంభట్టును గురువుగా ఎంచుకున్నాడు. ఆ వాడకట్టులో పిల్లలందరూ చదువుకునేలా ప్రోత్సహించాడు.
గురువు నాగంభట్టు పెట్టిన ముహూర్తదినం రోజు సుబుద్ధితో వెళ్లాడు జాయప. అదొక పెద్ద యుద్ధ శిక్షణశాల. ఇలాంటివి అనుమకొండలో మరో ఐదు ఉన్నాయని సుబుద్ధి చెప్పాడు. అది సువిశాల ప్రాంగణం. చుట్టూ పకడ్బందీగా ప్రహరీ. లోపల భిన్న అంశాలకు వేరువేరు ప్రాంగణాలు. ఒకచోట కాల్బల వీరులకు శిక్షణ, పక్కన ధనుర్విద్యలో శిక్షణ.. మరో పక్క గజశిక్షణ, అశ్వశిక్షణ మరో పక్క. ప్రతిచోటా యాభైమంది వీరులు ప్రతి అంశాన్నీ ఏకాగ్రతతో నేర్చుకుంటున్నారు. మరో నూరుమంది తమ ప్రావీణ్యాన్ని మెరుగుపరచుకుంటూ సాధన చేస్తున్నారు. ప్రతి ఉదయం శిక్షణ.. వ్యాయామంతో ప్రారంభమవుతుంది. అనంతరం ఎవరికివారు వారి వారి అంశాల శిక్షణ తరగతుల వైపు వెళుతున్నారు. కాల్బలవీరులు విభిన్న పట్లు ఎలా పట్టాలి? శత్రుసేనల పట్టునుంచి ఎలా విడిపించుకోవాలి? ఇత్యాది అంశాల్లో అనుభవజ్ఞులైన వృద్ధవీరులు సైన్యానికి వివరిస్తూ.. పట్లుపట్టి చూపిస్తున్నారు. అవతలగా విశాలమండపంలో వ్యూహరచనపై తరగతి నడుస్తున్నది. యుద్ధభూమిలో ఎలా నిలబడాలి? తనకు తగిన శత్రుసైనికుణ్ని ఎలా గుర్తించాలి? ఎలా తనవైపు రాబట్టుకోవాలి? ఎలా ఎదుర్కోవాలి? ఎప్పుడు ఏ ఆయుధం సంధించాలి? శత్రువును ఎలా ఓడించాలి? అనే అంశాన్ని యుద్ధతంత్ర నిపుణులు వివరిస్తున్నారు. అక్కడ వందమంది దాకా సైనికులు ఉన్నారు.
సుబుద్ధితో కలిసివచ్చిన జాయప.. శిక్షణావరణ చూసి పులకించిపోయాడు. సంవత్సర కాలంగా ఇవన్నీ పోగొట్టుకున్నట్లు భావించాడు. ఎటు చూసినా శిక్షణ పొందుతున్న సైనికులు. శిక్షణకు కావాల్సిన సామగ్రి, శిక్షకులు, రథాలు, ఆయుధాలు, అశ్వాలు, ఏనుగులు.. ఓహ్.. ఆ దృశ్యం మనోహరంగా ఉంది. ముందు పరుగున ఏనుగుల దగ్గరికి వెళ్లాడు. ఆప్యాయంగా తొండం పట్టుకుని వాటిని పలకరించాడు. గుర్రాలను ముట్టుకున్నాడు. వాటి కంఠంపట్టి ఊగాడు. పిల్లలు సాధారణంగా యుద్ధ శిక్షణ సంస్థ ప్రాంగణాలకు రారు. ఇళ్ల దగ్గరే ఎద్దులతో, గేదెలతో లేదా ఉంటే గుర్రంతో ఆడుకుంటారు కానీ, యుద్ధ జంతువులంటే పిల్లలను దూరంపెడతారు పెద్దలు. వాటికి పెట్టే తిండి, ఇచ్చే తీవ్రశిక్షణ వల్ల అవి చాలా ఉగ్రంగా ఉంటాయి. అలాంటి యుద్ధజంతువులతో జాయప ఆటలాడటం, కబుర్లు చెప్పడం.. మావటివాడైన సుబుద్ధిలాంటి దళపతికే ఆశ్చర్యంగా ఉంది.
జాయప జంతువులతో మాట్లాడుతున్నట్లు చిన్నగా పిట్ట కూతల్లా కూజితాలు చేస్తాడు. వాటికి జంతువులు.. ముఖ్యంగా ఏనుగులు బాగా స్పందిస్తాయి. అదేదో వాటికి మాత్రమే తెలిసిన భాషలా అవి ఆలకిస్తాయి. చెప్పినట్లు ప్రవర్తిస్తాయి. “యువరాజా! ఈ ఏనుగులతో గుర్రాలతో మాట్లాడుతున్నట్లు ఆ కూతలు ఏమిటి? వాటికి జంతువులు కూడా స్పందించడం.. ఎలా?” అడిగాడు సుబుద్ధి. “మా బాబయగారు గజ, అశ్వ శిక్షణపై ఎంతో చదువుకున్నారు. ఆర్యావర్తం వెళ్లి యుద్ధ విద్యలు నేర్చుకుని వచ్చారు. వారు పెదాల కదలికలతో, కూతలతో యుద్ధ జంతువులతో మాట్లాడటం అనే కళను సాధించారు. నాకూ నేర్పారు. మనం చెప్పింది ఆ జంతువు వింటే చాలు. పాటిస్తుంది. అర్థమయ్యేలా చెప్పడం మనం అలవరచుకోవాలి. మన గిరిజనులు ఎన్నో పక్షుల కూజితాలు చేస్తారు కదా.. ఇదీ అంతే!”.
ఉషోదయానికి ముందే నిద్రలేచి బావివద్ద స్నానం చేస్తాడు జాయప. వెంటనే ఇంటి చావిడిలో ఆవులు, గేదెల పక్కన పద్మాసనుడై అద్భుతంగా యోగాసనాలు వేస్తాడు. శరీరాన్ని పూచికపుల్లలా వంచుతాడు. అలాగే ధ్యానం. గంటల కొద్దీ ప్రపంచాన్ని మరిచి.. తపోముద్రలో ఉండగలడు. జాయప యవ్వనుడై, ప్రౌఢ వయస్కుడు అయితే మహామునులు, మహా శాస్త్ర విజ్ఞాన పారంగతుల జీవితస్థాయిలో జీవించగలడని.. వారి స్థాయిలో అద్భుతాలు ఆవిష్కరించగలడని సుబుద్ధి భావన. తర్వాత యుద్ధ శిక్షణశాలకు వెళ్తాడు. అక్కడ వీసెడు నువ్వులనూనె తాగి కఠోరమైన వ్యాయామం చేస్తాడు. నూనె అంతా చెమటరూపంలో కారిపోయేవరకూ.. దండీలు, బస్కీలు, పరుగు, మల్ల వీరులతో మల్లయుద్ధాలు.. అందరూ ఉదయాన్నే చేసి ఎండ పెరిగాక విశ్రమిస్తారు. కానీ, జాయప మిట్టమధ్యాహ్నం వేళ కూడా సాధన చేస్తాడు.
‘యుద్ధం చేసేది నీడలోకాదు.. బాగా తిన్నాక యుద్ధం ప్రారంభిస్తామా?’ అన్నది అతని దృక్పథం. ఒక్కోరోజు ఒక్కో యుద్ధకాండ. ఓ రోజు కాల్బల విన్యాసాలు, మరుసటి రోజు గజయుద్ధ పద్ధతులు. తర్వాతి రోజు అశ్వయుద్ధం. ఆ తర్వాత రథంపైనుంచి యుద్ధం. మర్నాడు యుద్ధభూమిలో కాల్బలంతో సమన్వయం. ఇలా సూక్ష్మాంశాలు కూడా గురువులతో, యుద్ధప్రవీణులతో చర్చిస్తూ.. వాటిని స్వయంగా చేస్తూ యుద్ధ వీరత్వంలో దినదిన ప్రవర్ధమానం అవుతున్నాడు జాయప. భోజనం తర్వాత విద్యావ్యాసంగం. నాగంభట్టు తండ్రి శివభట్టు నిర్వహిస్తున్న ఘటికాస్థానానికి నాగంభట్టుతో వెళ్లాడు జాయప. అదొక ప్రభుత్వ గుర్తింపులేని ఘటికాస్థానం. తమ శక్తియుక్తులను ఆర్థిక స్తోమతనంతా ధారపోసి నాగంభట్టు వంశస్థులు నిర్మించుకున్న సరస్వతి నిలయం. ప్రహరీ దాటి లోపలికి అడుగుపెట్టగానే.. లోపలినుంచి వినవస్తున్న విద్యార్ధుల పఠన ఘోష, చెవులకు సరస్వతిదేవి వీణారావంలా తాకుతున్నది. ఎదురుగా నిలువెత్తు జైనమహర్షి సిద్ధుని విగ్రహం.
“ఆయన విద్యలకు ఆది గురువు..” చెప్పాడు నాగంభట్టు.
ఆ విగ్రహం ఎదుట సరస్వతి వీణాపాణియై కూర్చున్న భంగిమలో మరో శిల్పం. జైనంలోనూ, వైదికంలోనూ సరస్వతి విద్యలకు అధిదేవతయే! ఆ విగ్రహాలచుట్టూ నిర్మించిన చిన్న ఉద్యానం. దాంట్లో నీరు ఎగజిమ్ముతున్న నీటిగొట్టాలు.. ప్రవేశ ప్రదేశంలోనే మధురమైన ఆహ్వానం పలుకుతున్నాయి. లోపలికి వెళ్లారిద్దరూ. విశాలమైన తరగతి గది. దాదాపు అరవై మంది విద్యార్థులు పద్మాసనంలో కూర్చుని, గురుముఖతః పాఠాన్ని గొంతెత్తి గట్టిగా వల్లె వేస్తున్నారు. ఉత్తరంగా ఉన్నత వేదికపై ఆసీనులైన గురువు.. దాని అర్థాన్ని, అంతరార్థాన్నీ వివరిస్తున్నాడు. మొత్తంగా అదొక శ్రావ్య సముద్ర కెరటాల ఘోషలా.. ఆ మండపమంతా ముందూ వెనుకకూ ప్రవహిస్తున్నది. ఆ గురువు నాగంభట్టు తండ్రి శివభట్టుగా గుర్తించాడు జాయప. వినయంగా దూరంనుంచే నమస్కరించాడు. ఆయన కూడా నాగంభట్టు పక్కనున్నవాడు జాయపగా గుర్తించినట్లు, తన పాఠాన్ని కొనసాగిస్తూనే చెయ్యి కొంచెం ఎత్తాడు.. ఆశీర్వదిస్తున్నట్లుగా! చుట్టూ ఉన్న గోడలపై కూడా విద్యా సంబంధిత అంశాలే చిత్రించి ఉన్నాయి. గురుకులం.. ఆర్య నాగార్జునుడు.. జైనముని సిద్ధుడు.. బుద్ధ భగవానుడు, బ్రహ్మ, సరస్వతి, ప్రాచీన లిపులు, రాతలు, వివిధ కాలాలలో ఉపయోగించిన పర్ణికలు, ఘంటాలు, తూలికలు, మట్టి ముద్రలు. ఈ విద్యావిషయిక వర్ణచిత్రాలమధ్య అమరావతి శిల్పసంప్రదాయంతో మరికొన్ని సామాజిక చిత్రాలు.. మొక్కలు, లతలతో అన్ని గోడలు, స్తంభాలు మనోహరంగా ఉన్నాయి.
విద్యార్థులకు ఆవలగా చేతులు కట్టుకుని అటూఇటూ కదులుతూ అన్నీ పరికిస్తున్నాడో వ్యక్తి. “మా అన్న రామేశభట్టు.. ఈ ఘటిక నిర్వాహకుడు..” చెప్పాడు నాగంభట్టు. ఇద్దరూ పక్కగా నడుస్తూ లోపలి గదులలోకి వెళ్లారు. అదొక గ్రంథాలయం. గోడలన్నీ చెక్క అరలతో వేరువేరు గూళ్లు. ఆ గూళ్లనిండా తాళపత్ర గ్రంథాలు. వాటిని తీసుకుని చూస్తూ పరిశీలిస్తూ మరింత మంది పెద్దలైన పరిశోధకులు, కింద కూర్చుని గ్రంథాలను తదేక దీక్షతో తిరిగి రాస్తున్న లేఖకులు, ఆవలగా వరండాలలో.. చావిడిలో.. బయట వృక్షాల కింద.. ఎవ్వరినీ నొప్పించకుండా చర్చలు చేస్తున్న విద్యార్థి బృందాలు. ఆ విద్యా వాతావరణం జాయపను ఎంతో తన్మయుణ్ని చేసింది. ఏదైనా తాళపత్ర గ్రంథాన్ని చేతితో స్పృశించాలని.. తెరచి చదవాలని తపించిపోయాడు.
“జాయపా.. రా! నాన్నగారిని పరిచయం చేస్తాను” అన్నాడు నాగంభట్టు.శివభట్టుకు సాష్టాంగ నమస్కారం చేశాడు జాయప. లేపి హృదయానికి హత్తుకున్నాడు శివభట్టు. జాయపను తదేకంగా చూస్తూ.. “జన్మవశాత్తూ మహా ప్రతిభావంతుడివి కుమారా..” అన్నాడాయన.“నాగంభట్టు చెప్పాడు నీ ప్రతిభ. బలింజవాడ అంతా విద్యావ్యాప్తి చేస్తున్నావని విని ఎంతో సంతోషించాను”.. అంటూ ఓ పద్యం చెప్పారు అప్రయత్నంగా. అన్నదానం పరం దానం, విద్యాదానమతః పరం అన్నేన క్షణికా తృప్తి ర్యావజ్జీవం చ విద్యా ॥
(అన్ని దానాలలోనూ అన్నదానం గొప్పది. అన్నదానం కంటే విద్యాదానం మరింత గొప్పది. అన్నం వల్ల లభించే తృప్తి క్షణికమైనది. ఒక్కపూట సుష్టుగా తిన్నా మర్నాడు మళ్లీ ఆకలివేస్తుంది. విద్యాదానం వల్ల కలిగే తృప్తి జీవితాంతం ఉంటుంది) పద్యం, తాత్పర్యం, అభినందనలతో ఆనంద పరవశుడయ్యాడు జాయప.
“ఈ భరతవర్షంలో శాలివాహన కాలానికి వెయ్యేళ్లముందే విద్య ఉన్నది. మన ప్రాచీన విద్య అంతా శ్రుతులే. అంటే.. ఓ మనిషి నుంచి మరో మనిషి విని దానిని మళ్లీ ఇంకో మనిషికి వినిపిస్తూ.. అలా అనేక శతాబ్దాలుగా కొనసాగుతున్నది. మనిషి మస్తకమే ఓ పుస్తకం అనుకోవాలి. మనిషే నడిచే గ్రంథాలయం. బుద్ధునికి ముందు వేదాలు కులీనులు మాత్రమే చదవాలనే నిబంధన ఉండేది. అందరికీ విద్య అనే అంశంతో విప్లవం సృష్టించినవాడు బుద్ధ భగవానుడు. ప్రతి ఆరామాన్ని ఓ విద్యాకేంద్రంగా.. గ్రంథాలయంగా కూడా నిర్మించాడు. జైనులు విద్యకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి మరోస్థాయికి తీసుకుపోయారు. నలంద, తక్షశిల, శ్రీపర్వతం.. ఇలా ఆరోజుల్లోనే ఇరవై విశ్వవిద్యాలయాలతో అలరారిన జ్ఞానదేశం ఇది. ప్రపంచంలోనే విద్యకోసం విదేశాలకు వెళ్లడం మొదలయ్యింది భారతదేశంతోనే. యుద్ధోన్మాదులు తప్ప భారతదేశానికి వచ్చిన తొలి విదేశీయులు విద్యార్థులే. ప్రపంచంలోనే తొలి విశ్వవిద్యాలయం.. మన విజయపురి విశ్వవిద్యాలయమే”.. చెబుతున్నాడు శివభట్టు. (సశేషం)
-మత్తి భానుమూర్తి