జరిగిన కథ :ద్వీపరాజ్య రాకుమారుడు జాయప అనుమకొండ జీవితం.. ఒక సామాన్యుడిలా మొదలైంది. మావటి సుబుద్ధితో కలిసి యుద్ధ శిక్షణశాలకు వెళ్తూ, ఒక్కో యుద్ధకాండలో ఆరితేరుతున్నాడు. శివభట్టు ఘటికా స్థానానికి వెళ్లినప్పుడు గ్రామ సమయాల గురించి తెలుసుకున్నాడు. మరో రోజున యుద్ధ శిక్షణ సంస్థ వద్ద గొప్ప యోధుడు, వీరబలింజ వర్తకుడు, గ్రామ సమయాల శెట్టి అయిన వల్లయశెట్టిని చూశాడు. ‘అంత పెద్ద వర్తకుడికి ఈ యుద్ధవిద్యల్లో శిక్షణ ఎందుకో!?’ అనుకుంటూ నవ్వుకున్నాడు జాయప.
జాయప మనసును కనిపెట్టిన వాడిలా.. “ఇంత వ్యాపారం చేసేవాడు యుద్ధ విద్యలు ఎందుకు అభ్యాసం చేస్తున్నాడనే కదా నీ సందేహం?” అడిగాడు సుబుద్ధి. ‘అవును!’ అన్నట్లు నవ్వాడు జాయప.
“చతుర్వర్ణ వ్యవస్థలో వైశ్యులు, కోమట్లు వర్తకం చేసే వణిజుల్లో ముఖ్యులు. కానీ, వీళ్ల సరుకు తరలించే ఎడ్ల బళ్లను దారి దొంగలు దోచుకునేవారు. వణిజులను తీవ్రంగా గాయపరిచేవారు. దాంతో వీళ్లు ఆయుధధారులైన రక్షకభటులను నియమించుకోసాగారు. ఈ వర్తక బిడారులను ప్రాణాలకు తెగించి రక్షించే సైనికవర్గం శూద్ర కులజులు. తర్వాత కొంతకాలానికి ఈ రక్షకభట సేనానులు కూడా కోమట్లతోపాటు వర్తకం మొదలుపెట్టారు. దాంతో వీళ్లు కూడా వణిజులయ్యారు. అంటే వణిజవర్గంలో కూడా చతుర్ధ కులస్థులు వచ్చారు. వాళ్లే వీరబలింజలు. మేము కూడా వీరబలింజ కులస్తులమే యువరాజా!” అన్నాడు సుబుద్ధి.. మీసం మెలివేస్తూ. “ఇప్పుడు ఈ వీరబలింజలు మంచి వర్తకశ్రేష్ఠ వర్గాలుగా ఎదిగి, మనరాజ్యంలోనే కాదు దేశ విదేశాలలో కూడా గొప్ప వర్తక స్థావరాలను స్థాపించారు” అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు జాయపకు కొంత అర్థం అయ్యింది. సుబుద్ధి మరికొంత వివరించాడు.
“ఇవ్వాళ సమయశెట్టిలు, వీరబలింజలు కేవలం వ్యాపారం, వర్తక బిడారులకు కాపలా మాత్రమే కాకుండా గొప్ప సైనికదళాలుగా కూడా తయారయ్యారు. యుద్ధకాలంలో ఈ బలింజ సైనికులు యుద్ధపటాలాలలో చేరి రాజ్యంకోసం యుద్ధం కూడా చేస్తున్నారు. ఈ వల్లయశెట్టి వద్ద పాతిక వేలమంది బలింజ సైనికులు ఉన్నారు. ఇలాంటి బలింజ వర్తకులు అనుమకొండలోనే యాభై మంది ఉన్నారు. ఇది ఉభయ తారకం. అంటే రాజులకు రోజూ వేతనాలు ఇచ్చి సైన్యాన్ని పోషించే పనిలేదు. ఈ సైన్యాన్ని భృత్య సైన్యం అంటున్నారు. బలింజ వర్తకులు రాజు కోరిన వెంటనే భృత్య సైన్యాన్ని చతురంగ బలగాల్లోకి పంపుతారు”..
సమాజంలో మమేకమై తిరిగితే కానీ తెలియని ఈ వాస్తవ వృత్తులు, కులాలు, సమయాల వంటి వాటి కార్యకలాపాలు.. రాజాంతఃపురాలలో పుట్టి పెరిగే రాకుమారులకు తెలిసే అవకాశం లేదు. నియుక్తులైన మంత్రులు, వైదికగురువులు చూపే దర్పణాల ద్వారా, వినిపించే సుభాషితాల ద్వారా అధికారమే పరమార్థమనే మార్గం నుంచి తాను పూర్తిగా దూరంగా.. వాస్తవ సమాజానికి దగ్గరగా ఉన్నానని జాయప గుర్తించాడు.
అతనికి సమాజాన్ని మరింతగా విప్పి చూపించే మరో మిత్రుడు పరిచయం అయ్యాడు. అతను త్రిపుర శెట్టి. నాగంభట్టు పరిచయం చేశాడు. త్రిపుర శెట్టి చిన్న ఉత్పత్తిదారుడు. శివభట్టు ఘటికా స్థానానికి కావాల్సిన తాళపత్ర ప్రతులను సరఫరా చేస్తాడు. సన్నగా గోగుమొక్కలా నిటారుగా ఎదిగి, కాస్త వంగిపోయిన యువ శరీరుడు. రంగు తక్కువ. ముందరి పళ్లు కాస్త ముందుకు ఉండి, నోరు తెరచినా మూసినా కనిపిస్తుంటాయి. అందుచేత నవ్వకపోయినా నవ్వినట్లుండే ముఖం.. మంచి సరదాగా ఉండే మిత్రతత్వం.. విమర్శ, హాస్యం ప్రతిపదంలోనూ తొంగిచూస్తుంటాయి. జాయప పరిచయం తర్వాత.. “ఇంత మంచి కుర్రాడు. పండిత పుత్రునివి.. నీకు శిష్యుడేమిటి?!” అన్నాడు పరిహాసంగా. భట్టు నవ్వి.. “శిష్యుడన్నానా? మిత్రుడన్నాను..” అన్నాడు.
ఆ పరిచయం ఆహ్లాదంగా తోచింది జాయపకు. జాయప కన్నా ఇద్దరూ పెద్దవాళ్లే. ముగ్గురూ మంచి మిత్రత్రయంగా కనువిందుగా ఉన్నారు. “నీ పేరే జైనం.. అంటే జయం. జైనులు అంటే జయాన్ని సాధించేవారు. అంటే నువ్వే. నువ్వు యుద్ధం చేసినా.. జయమే! నాట్యం చేసినా జయమే! ఎవరైతే తన మనసును, తన వాక్కును, తన శరీరాన్ని గెలుస్తాడో.. వాడే జినుడు. జైనంపై ఆసక్తి పోయాక హైందవంలో అది జైయం అయ్యింది. అదే జాయ. ఇప్పుడు రెండు అక్షరాల పేర్లు పోయి మూడక్షరాల పేర్లు పెట్టుకుంటున్నారు. అందుకే నీపేరు జాయప.. లేదా జాయన అని కూడా పిలవొచ్చు..” వివరంగా చెప్పాడు త్రిపుర.
‘నా పేరుకు ఇంత కథ ఉందా?’ అనుకుంటూ మురిసిపోయాడు జాయప. అప్పుడొచ్చారు ఇద్దరు వ్యక్తులు. “మిత్రమా.. నా గురించి చెప్పు!” అన్నాడొక వ్యక్తి. “ఇద్దరిని పరిచయం చేస్తాను మిత్రమా.. వీరు చలమయ శెట్టి. నాలాగే ఉత్పత్తిదారుడు. ఈయన నరసయ. ఇద్దరూ మా ఇంటికి అటూ ఇటూ నివసించే గృహస్థులు..” అంటూ పరిచయం చేశాడు త్రిపుర శెట్టి. “అది సరే! అసలు సంగతి.. అది చెప్పు” అన్నాడు, ఆ నూతన మిత్రుడు చలమయ.
మనిషి చూపులకు విచిత్రంగా ఉన్నాడు. భావప్రకటన కొంచెం ఉధృతంగా ఉంది. వస్త్రధారణ కూడా విచిత్రంగా ఉంది. పంచె హస్తితుండకం పద్ధతిలో కట్టాడు. పైన కంచుకం.. దానిపై ఉత్తరీయం. ముఖాన తిలకధారణం.. వేళ్లకు అంగుళీయాలు, కర్ణాలకు మకరిక, త్రికండికలు.. అవన్నీ అందరూ అతనివైపు చూసేలా ఉన్నాయి. “వస్తున్నా వస్తున్నా! అక్కడికే వస్తున్నా! చలమయ గొప్ప చరిత్ర పరిశోధకుడు. ఇటీవల నా ఆధ్వర్యంలో పరిశోధన ముమ్మరం చేశాడు” అన్నాడు త్రిపుర.
చలమయ ముఖంలో ఆనంద తాండవం. “ఏ అంశంపై వారు పరిశోధన చేస్తున్నారో తెలుసుకోవచ్చునా మిత్రమా?” ప్రశ్నించాడు నాగంభట్టు. “మహా రుషులు ఎందుకు గెడ్డాలు, మీసాలు పెంచుతారు? ఇదీ ఆయన పరిశోధనాంశం.. కదూ”.
“లెస్స పలికితివి మిత్రమా! ఆ మహత్తర అంశమే నేను పరిశోధించేది..” అన్నాడు గర్వంగా చలమయ. జాయప, నాగంభట్టు ముఖముఖాలు చూసుకున్నాడు. అతణ్ని త్రిపురశెట్టి ఆట పట్టిస్తున్నట్లుగా వారికి అవగతమైంది. తను చేస్తున్నది మహాద్భుతమైన పరిశోధన అని పూర్తిగా నమ్ముతున్నట్లుంది చలమయ ముఖారవిందం. త్రిపుర అంశం మార్చాడు.
“ఆ.. చలమయ మిత్రమా! నీకోసం వాతూల అహోబలపతి నిన్నటి దినం వచ్చిపోయాడు. నీకేదో ఆర్థిక సహాయం చెయ్యాలని ఉన్నదని.. నీ ఉత్పత్తి సంస్థకు కొంత పెట్టుబడి పెడతాడట”.. ఆ మాటలతో చలమయ ఆనందంతో కదిలిపోయాడు. “నిజమా మిత్రమా!? నా ఉత్పత్తి సంస్థకు పెట్టుబడి పెడతాడా?! ఎవరా మిత్రుడు.. కాదు కాదు దేవుడు?!”. “వాతూల అహోబలపతి. నీ మిత్రుడట! ఇటీవల విదేశీవర్తకంలో రాణించి నాలుగు రాళ్లు వెనకేశాడట. కష్టాల్లో ఉన్న నీకు పెట్టుబడి పెట్టాలని ఆయన నిర్ణయం తీసుకున్నాడట. వెళ్లి అభ్యర్థించు..” అన్నాడు త్రిపుర. ఆ అహోబలపతి ఎవ్వరో గుర్తు చేసుకుంటూ అతని కోసం ఆనందంగా వెళ్లిపోయాడు చలమయ. “తెలివి తక్కువ.. తాపత్రయం ఎక్కువ. మహిళల అలంకార వస్తువుల ఉత్పత్తిదారు. అది సలక్షణంగా నిర్వహించకుండా చరిత్ర పరిశోధన అని మావెంట పడ్డాడు. సంస్థ ఆర్థిక సమస్యల్లో ఉంది!”.. త్రిపురలో ఉత్సాహానికి, ముచ్చట్లకు కొదువ ఉండదు. ఒక వస్తూత్పత్తి వ్యవహారాన్నీ ప్రత్యక్షంగా చూశాడు జాయప. త్రిపుర తయారీ సంస్థ ప్రాంగణంలో! అదొక చిన్న కుటీర పరిశ్రమ. ఇలాంటివి చూడటం జాయపకు మొదటిసారి. తాళపత్ర అలేఖన పొత్తాల మొత్తం తయారీని అక్కడ చూశాడు. చుట్టూ ప్రహరీతో బయటి వారికి కనిపించని ప్రాంగణం. లోపల అంతా నిట్టాళ్లపై నిర్మించిన రెల్లుగడ్డి మండపం. ఆ పక్కనే రెండు గదుల కోష్టాగారం. మరోవైపు తాటియాకులతో కప్పిన రెండు పెద్దపెద్ద పందిళ్లు. ఈవలగా రెండు పెద్ద గాడి పొయ్యిలపై పెద్ద బానల్లో ఏవో ఉడుకుతున్నాయి. రెండు పెద్ద నీటితొట్టెలు. దాదాపు యాభైమంది పనివాళ్లు ఆ ప్రాంగణం లోపల వివిధ దశల తయారీలో నిమగ్నమై ఉన్నారు. కొందరు ఆ తాటియాకులను కత్తులతో ఈనెలు తీసి, వాటిలో పొడవు ఎక్కువ ఉన్నది కత్తితో కోసేస్తున్నారు. ఇద్దరు వాటిని పందిరి కింద ఎండ బెడుతున్నారు.
“ఈ తాటియాకుల్ని ఎండలో ఎండబెడితే పెళుసుగా మారి విరిగిపోతాయి. అందుకే పందిరి కింద నీడలో ఎండ బెడుతున్నాం. దీన్ని ఛాయాశుష్కం అంటారు. తర్వాత వాటిని తొట్టెలో ఆవు పంచాయతనంలో వేసి నానబెట్టాలి. ఆ క్రియ.. అదిగో ఆ తొట్టెల్లో జరుగుతున్నది. అక్కడ బాగా నానిన వాటిని పక్కనే ఉన్న ఆ గాడి పొయ్యిలపై చాకలి బానల్లో ఉడకబెడతాం. గరుకుగా ఉండే తాటియాకు అప్పటికి బాగా మెత్తగా, గట్టిగా కూడా మారుతుంది”.. వివరించాడు త్రిపుర.
ప్రధానమందిరంలో కూర్చున్న వారి ముందుకు ఈ ఉడికించిన తాటియాకులు తెచ్చిపడేస్తున్నారు కొందరు. కూర్చున్న వాళ్ల చేతుల్లో.. చేతికి అమిరే మంచి శంఖాలు, గవ్వలు ఉన్నాయి. వాటితో ఒక్కొక్క ఆకు ఉపరితలంపై మెల్లగా, నున్నగా రుద్దుతున్నారు. తద్వారా ఆ ఆకు పూర్తిగా రాయడానికి తగినట్లు మారుతున్నది. తర్వాత ఆ ఆకులకు రెండువైపులా రంధ్రం చేసి, దాంట్లోంచి దారం గుచ్చి.. ఒక పొత్తిలాగా చేస్తున్నారు. అదే ప్రోతం. సూత్రం.. అంటే దారంతో కూర్చబడినది ప్రోతం. అదే పొత్తం అయ్యింది. అదే గ్రంథం!
“ఈ తాటియాకు పొత్తం పైన, కింద సన్నని చెక్కతో చేసిన పలక ముక్కలు పెట్టి తాడుతో కడితే పొత్తం సిద్ధం. వీటిపైన మళ్లీ చిత్రవిచిత్రమైన బొమ్మలు.. అక్కడ చిత్రకారులు గీస్తున్నారు చూడండి. పూర్తిగా సిద్ధమైన పొత్తాలను అలేఖనాలు అంటారు”.. అంటూ తయారీ విధానం మొత్తం వివరించాడు త్రిపుర. అనంతరం అక్కడ కోష్టాగారంలో సిద్ధమైన అలేఖనాలను
చూపించాడు.
ఆ తయారీ కార్యక్రమాన్ని చూసి జాయప అబ్బుర పడ్డాడు. అక్కడ తాటియాకులతో చేసిన చిన్న కత్తి ఒరలా ఉన్న ఓ వస్తువు జాయపను ఆకర్షించింది. దాన్ని మురిపెంగా చేతిలోకి తీసుకున్నాడు. “బాగుందా!? నచ్చితే తీసుకో జాయపా!.. అయితే, ముందు అదేమిటో చెప్పు?” కొంటెగా అడిగాడు త్రిపుర. అటూ ఇటూ తిప్పి తిప్పి చూశాడు. ఆలోచించాడు కానీ, చెప్పలేకపోయాడు. “అది.. ఘంటం ఒర! మన స్నేహానికి గుర్తుగా నేనిస్తున్నా, తీసుకో!”.. అంటూ దాన్ని తనే తీసుకుని జాయప కంచుకం కిందివైపు ఉన్న సంచిలో పెట్టాడు త్రిపుర. జాయప ముగ్ధుడయ్యాడు. తానొక లేఖకుడుగా, కవిగా భావించాడా క్షణాన. ఆ క్షణం ఎంత గొప్పదో కదా!? ఆగామి దినాలలో అతనొక ప్రసిద్ధ నాట్యాచార్యుడై, కవియై.. మూడు లాక్షణిక గ్రంథాలు రాయబోతున్నాడని తెలియని జాయప.. ఆ తాటియాకుల ఘంటం ఒరను ఆప్యాయంగా భద్రపరచుకున్నాడు. “త్రిపుర మంచి నాణ్యత ఉన్న తాళపత్రాలు తయారుచేస్తున్నాడని గుర్తించి.. కవులు, ఉపాధ్యాయులు, పండితులే కాదు.. లేఖకులు, కాయస్థులు, కరణాలు, రాజలేఖకులు, రాజ లిపికారులు.. అందరూ ఇవే కావాలని ఇక్కడికే వస్తున్నారు!” అభినందనగా అన్నాడు నాగంభట్టు. “గాడిద గుడ్డు కదూ! ఎందుకు పంతులూ ఈ తాటియాల తయారీ!? లాభమా.. ఏమన్నానా? చెబితే ఇనడు.. ఈ నా కొడుకు!”.. ఉరుము ఉరిమినట్లు, పెద్దపెద్ద బండరాళ్లు కిందికి దొర్లినట్లు వినపడిందో గొంతు. ఆ మాటలు అన్నది ఎవరోనని.. అందరూ గిరుక్కున వెనక్కి తిరిగారు. (సశేషం)
-మత్తి భానుమూర్తి
99893 71284