చారిత్రక కాల్పనిక నవల
జరిగిన కథ :
ద్వీపరాజ్యంపై విజయంతో కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడు పులకించిపోయాడు. సర్వ సైన్యాధిపతి చౌండ సేనానితోపాటు యుద్ధ విజయంలో భాగమైన అందరినీ ఘనంగా సత్కరించాడు. ఆ సాయంత్రం మంత్రాంగ నిపుణుల ఆత్మీయ మధువు కార్యక్రమం ఏర్పాటుచేశాడు. ఆ సమయంలోనే దివిరాజు పినచోడుని కవలపిల్లలను అనుమకొండకు తీసుకువచ్చిన విషయాన్ని బహిరంగ పరిచాడు చౌండ. దానికి సంతోషించిన చక్రవర్తి.. వారు సామంత లాంఛనాలతో అంతఃపురంలో ఉండే ఏర్పాట్లు చేయించాడు. జాయప సంగతి చెప్పడంలో తర్జనభర్జన పడి.. చెప్పలేకపోయాడు చౌండ నాయకుడు.
మరో రెండు ఝాములు దాటే వేళకు తన ప్రాసాదానికి వచ్చాడు చౌండ. ఈలోగా మైలమ, కాటయ, పద్మాక్షి సమక్షంలో కొంత తేరుకున్నాడు జాయప. చౌండను చూడగానే పరుగెత్తుకెళ్లాడు జాయప. ఏమీ అనకుండా దీనంగా చూస్తూ నిలబడ్డాడు. అర్థం చేసుకున్నట్లు చిరునవ్వు నవ్వాడు చౌండ.
“మీ అక్కలిద్దరినీ అంతఃపురంలో ప్రత్యేక భవనంలో మీ సొంత పరిచారికలతో పూర్తి రాజ్య
రక్షణలో ఉంచి వచ్చాను. చక్రవర్తులవారికి కూడా తెలియజేశాను. సరేనా?!” అన్నాడాయన.
ఆయన ముఖంలో అలజడి కొంత తగ్గి, ఆనందవీచికలు వీయడం మైలమ గుర్తించింది.
“అక్కడ మీ అక్కలు క్షేమంగా ఉన్నారు. నువ్వేమీ దిగులు పెట్టుకోకు. ఇక్కడ అన్న, అక్కతో చక్కగా ఆడుకో!” అన్నది.. జాయప బుగ్గలుపట్టి, ఆత్మీయంగా సాగదీస్తూ!
జాయప ముఖంలో ఇంకా ఏవో సందేహాలు దోబూచులాడుతున్నాయి. అలాగే చౌండ దంపతుల ముఖాల్లో కూడా కొన్ని సందేహాలు కదలాడుతున్నాయి.
‘జాయపను ఏం చెయ్యాలి? ఇక్కడ ఉంచడం మంచిదేనా? అడిగిన వారికి ఏమని చెప్పాలి?’..
అది నిర్ణయించే ముందు.. జాయపను ఎవరైనా ‘నువ్వు ఎవరు?’ అని అడిగితే ఏమి చెప్తాడు??
మైలమ చెప్పింది జాయపతో..
“ఆ.. జాయపా! ‘నువ్వు ఎవరు?’ అని ఎవరైనా అడిగితే.. నేను మీ పిన్నిగారిననీ, మహాసేనానులు మీ బాబయ గారనీ చెప్పాలి!”.
“అదే చెబుతున్నానుగా పిన్నిగారూ!”.
“అదే అదే! మీది ద్వీపరాజ్యం అని చెప్పకుండా.. విసురునాడు అని చెప్పాలి.. సరేనా?”.
“ఎందుకు పిన్నిగారూ?”.
“మీ అక్కల రక్షణ కోసం!”.
“అలాగా.. అలా అయితే అలాగే!”.
.. వింటున్న చౌండ కాస్త తేలికగా నిట్టూర్చాడు. అంతకుమించి ఏమీ చేయలేని పరిస్థితి కాబట్టి, మౌనంగా అక్కడినుంచి లోపలికి కదిలారా దంపతులు.
రాచనగరులో పుట్టి పదేళ్లు పెరిగిన జాయప మొదటిసారి బయటి ప్రపంచాన్ని చూడటం ఈ అనుమకొండ ప్రయాణంతోనే ప్రారంభమైంది. పెద్ద సైనిక పటాలాన్ని చూడటంకూడా మొదటిసారి. ఆ మత్తేభాలు, ఆ యుద్ధాశ్వాలు, పల్లకీలు, ఎడ్లబండ్లు.. అంతమంది సైన్యం, ఆ నడకలు, ఆ భోజనాలు, ఆ ఆటలు, పాటలు ఇవన్నీ కొంచెం కొంచెం తమ రాచనగరులో చూసినవే కానీ, ఇప్పుడు వాటిని ఇలా తనొక సామాన్యుడిగా చూడటం.. వాటిలో అసంకల్పితంగా పాల్గొనడం వల్ల బయటి ప్రపంచంలోకి వచ్చిపడ్డాడు.
ఇప్పుడు ఇక్కడ ఈ చౌండ సేనాని భవంతిలో మళ్లీ విద్య. వారి సాహిణంలో యుద్ధవిద్యల అభ్యాసం. తోటి అన్నదమ్ములతో కలిసి చేయడం వేరు.. ఇక్కడ వేరొకరి పిల్లలతో వారు చేసేవి చూస్తూ తను నేర్చుకోవడం వేరు. ఈ తేడా ఏకసంథాగ్రాహి అయిన జాయపకు తెలుస్తున్నదిప్పుడు.
ఆవలగా ఓ గోడపై మైలమ చిత్రం వేస్తుండగా చూసి ఆశ్చర్యపోయాడు జాయప. తమ కోటగోడలపై చిత్రాలు చూశాడు కానీ, వాటిని వేస్తుండగా చూడలేదు.
మైలమ మంచి చిత్రకారిణి. ఎప్పుడూ గోడలపైనా, చిత్ర ఫలకాలపైనా బొమ్మలు వేస్తూనే, పరిచారికలకు ఇంటి పనులను పురమాయిస్తూ ఉంటుంది. ఆమెకు ఇద్దరు గురువులు. వాళ్లు వచ్చి సలహాలు ఇచ్చి పోతుంటారు.
ఆమె అలా చిత్రలేఖనం చేస్తుండగా చూడటం అబ్బురంగా ఉంది జాయపకు. అ రంగులు, కుంచెలు.. అలాగే ఓ రూపాన్ని వర్ణరంజితంగా చిత్రీకరించడం అతణ్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఆమె త్రిపురాసుర సంహారం చిత్రీకరిస్తున్నది. పక్కన మరోవ్యక్తి కూర్చొని చూస్తున్నాడు. కాస్త ఆవలగా పరిచారకుడు ఓ పాత్రలో ఉన్న కలబంద, గోరింట, కరక, గంగరావి ఆకులు.. తదితరాలు ఓ గుడ్డలో వేసి, మరో పాత్రలోకి పిండుతున్నాడు. తద్వారా ఓ కొత్త రంగు వస్తున్నది.
మైలాంబ ఓ ఘంటంతో శివుడి చిత్తరువులో ముఖభాగంలో మూడోకన్ను గీస్తున్నది.
“మూడోకన్ను కన్నులా చిత్రించాల్సిన అవసరం లేదు. దానిని నీ ఆలోచనలకు తగ్గట్లు రూపకల్పన చెయ్యవచ్చు. ఎందుకంటే మనిషికి మూడో నేత్రం ఉండదుకదా! నువ్వు.. ‘శివుణ్ని మానవరూపంలో చిత్రించినప్పుడు నేత్రం ఉండాలి కదా!’ అంటావు. దానిని ఆలోచనాత్మకంగా చిత్రీకరించేదే మన భారతీయ చిత్రకళ. ఈ మూడో నేత్రం అన్నది ఓ భావన. అందులో ఎంతో అంతరార్థం ఉంది గ్రహించావా?! నువ్వు నేత్రాన్ని ఎలా చిత్రించాలనుకుంటున్నావు మైలాంబా?” అన్నారాయన.
“నిన్న మనం చర్చించినట్లు.. అగ్నిలా చిత్రించాలని అనుకుంటున్నాను గురువు గారు. ఎందుకంటే శివుడు తన చూపు వెళ్లినంతమేరా పాపాలను దహిస్తాడని నా ఆలోచన. దానిని ఈ చిత్రం ద్వారా ప్రకటిస్తాను” అన్నదామె.
“శుభం.. బాగా ఆలోచించావు. ఇక గీయవమ్మా!” అన్నారాయన.
రంగులు వేయకుండా నల్లరంగులో ఆమె గీతలా గీయడం చూసి..
“పిన్నిగారూ! కన్ను అలా ఘంటంతో గీస్తున్నారేమిటి? ఈ రంగులను తూలికతో పులమవచ్చుకదా!?” అన్నాడు జాయప.
ఇద్దరూ నవ్వారు.
“మైలాంబికా.. ఎవరీ బుడుతడు?” అడిగారు గురువుగారు.
“మా బంధువుల అబ్బాయి.. పేరు జాయప!” అన్నదామె క్లుప్తంగా.
గురువుగారు జాయప వైపు చూస్తూ..
“దీనినేమంటారు?! చిత్రలేఖనం. ముందు చిత్రాన్ని రేఖా చిత్రంగా లిఖించాలి. అది మన భారతీయ విధానం. యవనదేశం లాంటి పరాయిదేశ చిత్రకళ రంగులు పులమడంతో ప్రారంభం అవుతుంది. దాని ప్రభావంతో మనం కూడా పులమడం చేస్తున్నాం. ఇటీవల తురుష్కుల చిత్రకళ భారత ఖండంలోకి వచ్చింది. దాని ప్రభావంతో మన కళలో మరికొన్ని మార్పులు వస్తున్నాయి. ఇది సహజం. అయితే ముందు మన ప్రాచీన పద్ధతితో ప్రారంభించి, తర్వాత ఇతర విధానాలను విశ్లేషించుకొని, మనకళను మనం అభివృద్ధి చేసుకోవాలి” అంటూ వివరించాడు.
ఆ మాటలు విన్న జాయప.. ఆయన వంక ప్రశ్నార్థకంగా చూశాడు.
ఆయన అర్థం చేసుకున్న వాడిలా..
“నా పేరు కామిత రాయుడు.. చిత్రకారుణ్ని!” అన్నాడు, పరిచయం చేసుకుంటున్నట్లు.
జాయప వంగి నమస్కరించాడు.
ఒక కళారూపం, దాని భారతీయతత్వం జాయపకు అర్థంకావడం ఇక్కడే ప్రారంభం అయ్యింది.
ఓ రాకుమారుడు కేవలం పదేళ్ల వయసులోనే ఇలా పరాయిరాజ్యంలో కొంచెం గౌరవప్రదమైన చోట వీటన్నిటినీ అభ్యసించే అవకాశం రావడం కూడా జాయపకు అనుకోకుండా లభించిన వరంలా ఉంది. సొంత ఇంట్లో అమ్మపెట్టిన గోరుముద్దల భోజనానికీ, పరాయి ఇంట్లో మరొకామె పెట్టిన అతిథి భోజనానికి ఉన్నతేడా అతనికి తెలుస్తున్నది. పూర్తిగా మమేకమై తినేది అమ్మఒడిలో.. అన్నిటినీ పరిశీలిస్తూ తినేది పరాయి ఒడిలో!
ఈ పరిశీలన అతనికి నాలుగేళ్ల చదువును నాలుగు నెలల్లో నేర్పింది. చుట్టూ జరిగేది చాలావేగంగా ఆకళింపు చేసుకుని బుర్రలో భద్రపరచుకోవడం అలవాటైంది.
జాయప కోసం మైలమ మంచి దుస్తులు సిద్ధం చేసింది. తమ పిల్లలతో జాయపకు కూడా సమాన గౌరవం ఇవ్వాలని తన పరివారానికి సూచించాడు చౌండ. ఇటు కాటయ అన్న, పద్మాక్షి అక్క తనను ఆత్మీయంగా చూస్తారు. చదువు, ఆటలు, యుద్ధ ప్రక్రియలు కలిసి అభ్యసిస్తారు. కలిసి సాధన చేస్తారు. మైలమ, చౌండ చాలా అభిమానంగా చూస్తారు.
ఇక్కడికి వచ్చి అప్పుడే ఆరునెలలు దాటింది.
‘నేను ఇక్కడున్నట్లు అక్కలు అక్కడ ఉన్నారు. వాళ్లను సంకెళ్లతో బంధించలేదు. కొరడాలతో కొట్టడం లేదు. వాళ్లు చిరిగిన బట్టలు కట్టడంలేదు. హమ్మయ్య!’..
ఈ భావన ఆ పసిప్రాణాన్ని కాస్త ప్రశాంతంగా ఉండేలా చేస్తున్నది.
చౌండ భవంతిలో జాయప ఎందరెందరో కాకతీయ ప్రముఖులను చూశాడు. ఆయన కొండిపర్తి మండలాధీశుడు కూడా. ప్రతి మండలేశ్వరునికి అనుమకొండలో కార్యాలయం ఉంటుంది. కొండిపర్తిలో పెద్ద తటాకం తవ్విస్తూ, పక్కనే పెద్ద దేవాలయం నిర్మిస్తున్నాడు చౌండ. అవి పూర్తయ్యాక శాసనం వేయించి, అందులో ద్వీపరాజ్య విజయం కూడా నమోదు చెయ్యాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నాడు.
కొండిపర్తి మండల కార్యకలాపాల్లో మైలాంబ పూర్తిగా సహకరిస్తుండగా, ఆయన నిరంతరం సామ్రాజ్యపు యుద్ధ సంబంధిత అంశాలపైనే నిమగ్నమై ఉంటాడు. భవంతిలో పనిచేసే వారిలో సేవకులు తక్కువ. ఎక్కువ మంది వేగులే. వచ్చినవాళ్లను వీళ్లు జాగ్రత్తగా పరిశీలిస్తారు. వారివారి కదలికలు అనుసరిస్తారు. తేడా ఉంటే మైలమ చెవిన వేస్తారు.
ఓరోజు బయటికి వెళ్లే అవకాశం అయాచితంగా లభించింది. చౌండ కుటుంబం మరో సేనానులవారి ఇంట జరిగే వివాహానికి వెళ్లింది. జాయపను తీసుకెళ్లలేదు. కారణం చాలా సున్నితమైనది. ఇంటికివచ్చిన వారందరికీ జాయప ఎవరో చెప్పాల్సి వచ్చేది.
‘ఇవన్నీ మా రాచనగరులో కూడా జరుగుతూ ఉండేవన్నమాట!’ అని యువరాజైన జాయప చాలాసార్లు అనుకున్నాడు. అయితే రానురానూ రాచభవంతిలో ఉండటంపై అతనిలో కొంత అసహనం ఏర్పడింది. బయటికి పోవాలన్న కోరిక ఇంతింతై పెరుగుతున్నది.
ఓరోజు బయటికి వెళ్లే అవకాశం అయాచితంగా లభించింది. చౌండ కుటుంబం మరో సేనానులవారి ఇంట జరిగే వివాహానికి వెళ్లింది. జాయపను తీసుకెళ్లలేదు. కారణం చాలా సున్నితమైనది. ఇంటికివచ్చిన వారందరికీ జాయప ఎవరో చెప్పాల్సి వచ్చేది. అతిథులు ఇంటికి వస్తే.. వీలైనంత వరకూ వారికి జాయప కనిపించకుండా ఉంచడానికి మైలమ ప్రయత్నించేది. తమ పిల్లలతో బయటికి వెళ్తే.. జాయపను వెంట తీసుకెళ్లేవారు కాదు.
ఆరోజు మెల్లగా భవంతి బయటికి వచ్చాడు జాయప. పరిచారికలు అడ్డుపెట్టలేదు. భవంతి ముంగడ కొండిపర్తి మండల కార్యాలయం ఉంటుంది. ఆ మండలవాసులు అనేకులు వస్తూపోతూ ఉంటారు. ఆరోజు కూడా మండల కార్యాలయం హడావుడిగానే ఉంది. రక్షణ భటులున్నారు. పలకరింపుగా నవ్వాడు జాయప. రాజనగరి శ్రీవాకిలి కుప్పయ నవ్వి ఊరుకున్నాడు గానీ, అడ్డుకోలేదు. మెల్లగా కదిలి వీధిలోకి వెళ్లాడు. ఎవ్వరూ ఆపకపోవడం తనకు ఆశ్చర్యం కలిగించింది.
‘సరే! కాస్త వీధుల్లో తిరిగి వద్దాం!’ అనుకుంటూ ముందుకు కదిలాడు.
జాయప ఇలా బయటికి పోతే అడ్డు చెప్పవద్దంటూ.. రాజనగరి శ్రీవాకిలి కుప్పయకు, అతని వర్గాలకు మైలమ ముందే చెప్పిపెట్టినట్లు ఆ చిన్నారికి తెలియదు.
(సశేషం)
మత్తి భానుమూర్తి