Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదలకు సిద్ధమైంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ‘గేమ్ ఛేంజర్’ తర్వాత చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలోని స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో చరణ్ మాస్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా విజయవాడలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల సందడితో ఘనంగా జరిగింది. చాలా కాలం తర్వాత విజయవాడలో జరిగిన భారీ సినీ వేడుక కావడంతో వేలాది మంది అభిమానులు హాజరై సందడి చేశారు.
అయితే ఈ వేడుకలో జరిగిన ఒక ఆసక్తికర ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఓ అభిమాని ఒక్కసారిగా స్టేజ్ వైపు పరుగెత్తుకుంటూ వచ్చి రామ్ చరణ్ను కలిసేందుకు ప్రయత్నించాడు. అతడు చరణ్కు దగ్గరయ్యేలోపే అక్కడే ఉన్న బాడీగార్డ్ అప్రమత్తమై వెంటనే స్పందించాడు. రామ్ చరణ్ కొత్త బాడీగార్డ్ కెవిన్ కుంట ఆ అభిమానిని చాకచక్యంగా అడ్డుకుని, క్షణాల్లో పక్కకు తీసుకెళ్లాడు. ఈ ఘటన అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేయగా, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానికి ఎలాంటి హాని కలగకుండా నియంత్రించిన విధానం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇటీవలే రామ్ చరణ్ భద్రత కోసం నియమించబడిన కెవిన్ కుంట ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాడు. ఆఫ్రికా ఖండంలోని గాంబియా దేశానికి చెందిన కెవిన్, ప్రస్తుతం ఇటలీలో ప్రొఫెషనల్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) ఫైటర్గా గుర్తింపు పొందాడు. అతని ఫిట్నెస్, వేగం, అప్రమత్తత కారణంగా ఇప్పటికే పలువురు అభిమానుల ప్రశంసలు అందుకున్నాడు. ముంబైలో జరిగిన ‘పెద్ది’ ప్రమోషనల్ ఈవెంట్లో కూడా అభిమానుల రద్దీని సమర్థంగా నియంత్రించిన కెవిన్, ఇప్పుడు విజయవాడ ఈవెంట్లో మరోసారి తన ప్రొఫెషనలిజాన్ని చాటుకున్నాడు. దీంతో సోషల్ మీడియాలో “చరణ్ కొత్త బాడీగార్డ్ ఎవరు?” అనే చర్చ మొదలైంది. ఇక ‘పెద్ది’ విషయానికి వస్తే, రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, జగపతి బాబు, శివరాజ్కుమార్, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు.