హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : సికింద్రాబాద్లోని పరేడ్గ్రౌండ్లో మంగళవారం జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎండకు తాళలేక సీఎం రేవంత్రెడ్డి తన ప్రసంగాన్ని మధ్యలోనే ముగించడంపై తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రసంగాన్ని పూర్తిగా చదువకుండానే ఎండ పేరుతో ఆయన మధ్యలోనే ముగించేశారు. దీంతో స్వరాష్ట్ర ఆకాంక్ష లేని వ్యక్తి పట్టుమని పది నిమిషాలు కూడా నిలబడలేపోయారని తెలంగాణ బిడ్డలు, ఉద్యమకారులు దుమ్మెత్తిపోస్తున్నారు. కనీసం అరగంట నిలుచొని ప్రసంగం చేయలేరా? అని మండిపడుతున్నారు.
గత ప్రభుత్వంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను అదే పరేడ్గ్రౌండ్లో నిర్వహించిన కేసీఆర్.. ఏనాడూ తన ప్రసంగాన్ని మధ్యలో వదిలిపెట్టలేదు. ఎంత ఎండ ఉన్నా.. తన ప్రసంగం ఆసాంతం ఆసక్తికరంగా ముగించేవారు. ఎండ తీవ్రత పేరుతో ఆవిర్భావ కార్యక్రమాన్ని ఉదయం 8.30 గంటలకు ప్రారంభించుకున్న రేవంత్రెడ్డి.. తన ప్రసంగం పూర్తికాకుండానే ముగించారు. నాడు కేసీఆర్ కూడా ఉదయం 8.30 గంటలకే కార్యక్రమం ప్రారంభించినా.. 9 గంటల తర్వాతే ఆయన స్పీచ్ ప్రారంభమయ్యేది. ఎండను లెక్కచేయకుండా ఏకధాటిగా గంట వరకూ ఆయన ప్రసంగం చేసేవారు. కేసీఆర్ గంటల తరబడి నిలుచొని ఇచ్చే స్పీచ్ సందర్భాలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు.
ప్రసంగించే వేదిక ఏదైనా సరే.. కేసీఆర్ స్టైలే వేరు. ఆయన ప్రసంగ శైలి, సుదీర్ఘ సమయంపాటు నిలబడి మాట్లాడే విధానం తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా చర్చించుకునే అంశం. గణాంకాలు, చరిత్ర, రాజకీయ విశ్లేషణ, వ్యంగ్యం, సామెతలు, తెలంగాణ మాండలికం కలగలిపి గంటల తరబడి మాట్లాడగల నాయకుడిగా ఆయన పేరు సంపాదించారు. తన తొమ్మిదిన్నరేండ్ల పాలనలో శాసనసభలోనూ, బహిరంగ సభల్లోనూ గంటల తరబడి నిలబడి ప్రసంగించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అసెంబ్లీలో ఏదైనా ముఖ్యమైన అంశంపై మాట్లాడటం ప్రారంభిస్తే, కనీసం గంట నుంచి 2 గంటలపాటు నిలబడేవారు. బడ్జెట్ ప్రసంగాలు, ప్రతిపక్షాల విమర్శలకు సమాధానాలు ఇచ్చే క్రమంలో కనీసం 2.5 గంటల నుంచి గరిష్ఠంగా 3.5 గంటలపాటు విరామం లేకుండా నిలబడే ప్రసంగించేవారు.
ఎన్నికల ప్రచారం, బహిరంగ సభల్లో కేసీఆర్ ఏం మాట్లాడుతారా? అని జనాలు ఎదురుచూసేవారు. అంతలా వారిని ఆకట్టుకునేలా మాట్లాడం కేసీఆర్ స్టైల్. పార్టీ ప్లీనరీలు, ప్రగతి నివేదన వంటి సభల్లో ఆయన గంట నుంచి గంటన్నరపాటు నిరంతరాయంగా నిలబడి ప్రసంగించేవారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే కేసీఆర్ అసెంబ్లీలో నోట్స్ లేకుండా.. కేవలం పాయింట్లు మాత్రమే చూసుకుంటూ, పూర్తి గణాంకాలతో గంటల తరబడి అనర్గళంగా మాట్లాడటం ఆయన ప్రత్యేకత. మోకాలి నొప్పులు వంటి సమస్యలు ఉన్నప్పటికీ, ఆయన అసెంబ్లీ వేదికపై గంటల కొద్దీ నిలబడి మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచేవారు.