Ramaayanam | ఎప్పుడూ ఇంటి పనిలో మునిగి ఉండటం వల్లో, అలంకరణ పట్ల పెద్దగా ఆసక్తి లేకపోవడం వల్లో మొత్తానికి.. అమ్మ మా ‘ముస్తాబు’ విషయం పట్టించుకునేది కాదు. చక్కగా తలలు దువ్వి, రిబ్బన్లు కట్టి జడలు వేయడం, ఉతికిన బట్టలు వేసి బడికి పంపడం తప్ప.. ప్రత్యేకంగా అలంకరించడం అనేది లేదు. శుభ్రత విషయంలో మాత్రం ఎన్నో జాగ్రత్తలు చెప్పేది.
చురుగ్గా ఉండటం, తొందరగా తయారవడం.. ఇదే అమ్మ డిక్షనరీ. అక్కకూ, నాకూ పెద్ద జుట్టు ఉన్నా.. రకరకాలుగా జడలు వేసేది కాదు. పూలూ అంతే! పెరటి నిండా ఎన్నో పూలు పూసినా.. బడికి పోయేటప్పుడు పెట్టేది కాదు. ఎప్పుడో అరుదుగా తప్ప, పూలజడలు వేయడమూ లేదు. అసలు మేం మొహానికి క్రీములూ, రంగు రంగుల బొట్లూ వాడేవాళ్లం కాదు. మెడలో గొలుసులు లాంటివి అస్సలు లేవు. మొహానికి పౌడర్ కొంచెం ఎక్కువైనా చాలు.. “ఏందా తయారవుడు?! చదువు చక్కగుండాలె. మాట బాగుండాలె. నడవడి మంచిగుండాలె గానీ, తయారవుడు కాదు” అనేది అమ్మ. కాస్త వంకరగా నిలబడి అమ్మ కంటబడితే చాలు.. “ఏంది గా నిలబడుడు?! వగలు పోవుకుంట! చక్కగ నిలవడరాదా?!” అనేది. ఏదైనా సరే అతిగా, ఎబ్బెట్టుగా ఉండకూడదనేది అమ్మ అభిప్రాయం.
మా ఇంటికి మూడిళ్లవతల ఆంజనేయస్వామి గుడి పక్కన దొరతాత వాళ్ల ఇల్లు ఉండేది. ఆయనకు ముగ్గురు కూతుళ్లూ, ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుక్కు మా ఈడు వాళ్లే ఇద్దరబ్బాయిలు. ఇద్దరూ ఒకే క్లాసులో నాకు జూనియర్స్గా ఉండేవారు. వాళ్లను ‘పెదబాబు, చినబాబు’ అనీ.. మమ్మల్ని ‘పెద్దమ్మాయి, చిన్నమ్మాయి’ అని పిలిచేవారందరూ. అయితే మేం ఎవరింటికీ వెళ్లేవాళ్లం కాదు గనుకా.. మా ఈడు వాళ్లే అయినా మగపిల్లలు అవడం వల్లా.. బడిలో చూడటం తప్ప ఇంటికెళ్లే వాళ్లం కాదు.
దొరతాత ముగ్గురు కూతుళ్లలో ఆఖరి బిడ్డకు అప్పటికి పెళ్లి కాలేదు. ఒక్క పెద్దావిడ తప్ప.. మిగతా ఇద్దరూ ఎక్కువగా ఇక్కడే ఉండేవారు. వాళ్లు అక్కనూ, నన్నూ.. స్కూల్కు వెళ్తుంటే చూశారో ఏమో! ఓ సారి వాళ్లింట్లో పనిచేసే సరోజినిని మా ఇంటికి పంపి.. మా ఇద్దర్నీ వెంటపెట్టుకు రమ్మన్నారు. “పొయ్యి తొందరగ రాండి. అక్కడ ఎడ్డి గుణాలు చేసుకుంటు, కనవడ్డ దాని దిక్కు అగడుబడ్డట్టు చూసుకుంటు ఉండకండి. ఏ వస్తువునూ ముట్టుకోకండి”.. ఇలాంటి వంద జాగ్రత్తలు చెప్పి అమ్మ పంపిస్తే.. మేం వాళ్లింటికి వెళ్లాం.
వాళ్లది పెద్ద ఇల్లు. పాటక్ (గేటు) దాటి లోపలికి వెళ్లగానే.. మా ఇల్లులాగే చతుశ్శాల భవంతి. కానీ, ఎత్తు మీద ఉండి, టేకుతో చేసిన బల్లలూ, కుర్చీలు, పరదాలతో వైభవంగా ఉంది. బాబు వాళ్లమ్మ ఎదురొచ్చి.. “ఒచ్చిన్రా! రాండ్రి. కూసొండ్రి!” అని మమ్మల్ని కూచోబెట్టింది. మా అమ్మ వయసావిడ మమ్మల్ని ‘మీరు!’ అని సంబోధించడం మాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. బాబు వాళ్ల నాయనమ్మ.. “పిల్లలను ఒక్కసారి చూడాల్నని కలువరిస్తిరి గద! ఒచ్చిన్రు” అని కూతుళ్లకు చెప్పింది. ఇంతలో లోపల్నుంచి పాపాయత్తమ్మ, బుచ్చత్తమ్మ (బాబూ వాళ్లు పిలిచినట్టే.. మేం కూడా తరువాతి రోజుల్లో అలాగే పిల్చాం) వచ్చారు. “ఎంత ముద్దుగున్నరో పిల్లలు! ఒక్కసారి జూద్దామని రమ్మన్నం!” అంటూ.. మమ్మల్ని లోపలికి తీసుకుపోయారు వాళ్లు.
అది మొదలు.. అప్పుడప్పుడూ సరోజిని మా ఇంటికి వచ్చి మమ్మల్ని తీసుకువెళ్లేది. పాపాయత్తమ్మ, బుచ్చత్తమ్మ మమ్మల్ని చాలా ముద్దు చేసేవారు. రకరకాలుగా జడలు వేసి పూల దండలు పెట్టేవారు. “మీ కళ్లు గింత మంచిగున్నయ్. కాటుక ఎందుకు పెట్టుకోరు?” అంటూ కాటుక దిద్దేవారు. అద్దంలో మా మొహాలు మాకే కొత్తగా కనిపించేవి. ఇంటికి వెళ్లగానే.. “గీ కాటుకలేంది? పువ్వులేంది? ఎవరు పెట్టిన్రు?!” అనడిగేది అమ్మ. మేం చెప్పాక.. “సరె తియ్యిండి! మీ అంతల మీరైతె పెట్టుకోలే గద!” అనేది.
అత్తమ్మల పెద్దక్క కొడుకు చిట్టిబాబు కూడా వీళ్లింట్లోనే ఉండేవాడు. బుచ్చత్తమ్మ మాతో దాగుడు మూతలాట ఆడించేవారు. మాలో ఒకరి కళ్లకు బట్ట కట్టి, మిగతా వాళ్లందరినీ దాక్కోమని.. “దాగుడు మూతలు దండాకోర్! పిల్లి వొచ్చే ఎలుకా భద్రం.. ఎక్కడి దొంగలక్కడ్నే.. గప్చుప్” అని పాడి, అప్పుడు కళ్లకున్న బట్ట విప్పేది. ఒక్కోసారి కళ్లకున్న బట్ట విప్పకుండానే మిగతా వాళ్లను పట్టుకోవాలి. అయితే, ఎవరూ అరుగు దాటి పోకూడదు.. అదీ కండిషన్! ఒక్కోసారి పాపాయత్తమ్మ కూడా మాతోపాటే ఆడేవారు.
వాళ్లింట్లో ఆడవాళ్లు ఎప్పుడూ బయటికి రాకపోయేవాళ్లు. ఎందుకంటే వాళ్లు వెలమ కులస్తులని చెప్పారు. ఒకవేళ ఎప్పుడైనా కచ్చడం బండిలో అందరూ పట్టకపోతే.. ఇంటి కోడళ్లను మాత్రం బండిలో కూర్చోబెట్టి పరదాలు వేసి, కూతుళ్లు బండి వెనుక నడిచేవాళ్లు.
బతుకమ్మ రోజుల్లో కూడా ఇంటి వెనుక ఒక గొయ్యి తీసి.. దాన్నిండా నీళ్లు పోసి, ఆడాక అందులో బతుకమ్మను వదిలేవాళ్లు.
పాపాయత్తమ్మ పెళ్లి ఆ ఇంట్లోనే జరిగింది. కారులో పెళ్లికొడుకు పక్కన కూర్చుని ఆమె వెళ్లిపోతుంటే.. దిగులేసి బాగా ఏడుపొచ్చిన సంగతి ఇంకా జ్ఞాపకం ఉంది నాకు. ఆ తరువాత మనోహర్ రావు అంకుల్, అంటీ (పెదబాబు, చినబాబు వాళ్ల నాన్నా, అమ్మా) చాలా ఏళ్లు ఈ ఊర్లోనే ఉన్నారు. ఆ తరువాత ఇక్కడి భూములు అమ్మేసి, ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు. కొన్నాళ్లకు వాళ్ల ఇంట్లో పిచ్చిమొక్కలు మొలిచి.. అంతా పాడుబడ్డట్టు అయింది.
ఏడాది కింద ఎల్ఐసీలో వుమెన్ ఎంప్లాయిస్ సౌత్ ఇండియా వింగ్ వాళ్లు వరంగల్లో ఓ కాన్ఫరెన్స్ జరిపారు. ఒక రచయిత్రిగా నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు. కార్యక్రమం పూర్తయ్యాక ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటే.. మైథిలి అనే యువతి వచ్చింది. “బాగా మాట్లాడారు” అంటూ.. హైదరాబాద్కు చెందిన యూనియన్ ప్రతినిధిగా తనను పరిచయం చేసుకుంది. నాతో ఫొటో తీసుకుంది.
– నెల్లుట్ల రమాదేవి ( Nellutla Ramadevi ), రచయిత్రి
Ramaayanam | చెట్టులెక్కగలవా?- II
Ramaayanam | చెట్టులెక్కగలవా?- I