మా నాన్నగానీ, అమ్మగానీ పెద్దగా మంత్రాలనూ, తాయెత్తులనూ నమ్మేవారు కాదు. మా నానమ్మకు మాత్రం ఎలా తెలిసిందోగానీ.. ఈ అఫ్జల్ మియాకు దిష్టిమంత్రం వచ్చని తెలిసింది. ఇక నాకుగానీ, అక్కకుగానీ ఎప్పుడైనా ఏ కొంచెం నలతగా ఉన్నా.. “పిల్లకు బాగ జిస్టి తలిగినట్టున్నది. మీ తురుకోళ్ల మంత్రాలు బాగ నేటు అంటరు. కొంచెం జిస్టి తియ్యవయ్యా అఫ్జల్!” అని ఆయన్ను ఆదేశించేది.
మా నాన్న చూడకుండా అఫ్జల్ మాకు దిష్టి తీసేవాడు. ఏమేమో ఉర్దూలో చదువుతూ, చేతులు ఆడిస్తూ, భుజం మీద చిన్నగా తట్టి ఆయన చేసే తతంగం చూస్తుంటే నాకు తమాషాగా అనిపించేది.
అంతే! ఇక అదేదో నాకూ నేర్పమని అఫ్జల్ వెంటపడ్డాను. “అమ్మో! సాబ్కు ఎరుకైతే ఏమన్న ఉంటదా! వద్దు అమ్మా!” అని తప్పించుకోజూశాడు. కానీ, నేను వదల్లేదు. ఒక్కరోజులో ఆ వాక్యాలన్నీ థియరీ, ప్రాక్టికల్తో సహా నేర్చుకున్నాను. ఇక చెట్లతో, గోడలతో ఆడే నా ఆటల్లో కొత్తగా ఇది చదువుతూ.. వాటికి మంత్రం వేసేదాన్ని. ఇప్పటికీ నాకు ఆ మాటలు గుర్తున్నాయి. కాకపొతే.. ‘అల్లా! యా ఖుదా! సుధార్ కరో’ లాంటి మాటలకు తప్ప మిగతా వాటికి అర్థాలు తెలిస్తే ఒట్టు!
ఈ అఫ్జల్ మియా ద్వారానే నానమ్మకు ఒకసారి బూబమ్మ అనే ఆవిడ గురించి తెలిసింది. ఆమె దిష్టి మంత్రం, దడుపు మంత్రం, విరోచనాలు తగ్గడానికి మంత్రం, ఆకలి మందగించినప్పుడు సురసుర ఆకలి పుట్టడానికి మంత్రం, చలితో వచ్చే వెన్నుపూస జ్వరం విడవడానికి మంత్రం.. ఇలా చాలా సమస్యలకు మంత్రం వేస్తుందనీ, ఆమె చేయి పడితేచాలు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుందనీ.. ఆమె కేవలం ఆది, గురువారాల్లో మాత్రమే కన్సల్టేషన్ ఇస్తుందనీ అఫ్జల్ చెబుతుంటే, నాన్న చూడకుండా ఆనందబాష్పాలు రాల్చింది నానమ్మ. అప్పట్నుంచీ మేం ఎప్పుడైనా గట్టిగా దగ్గినా, తుమ్మినా నానమ్మ వెంటనే అమ్మతో.. “గా బూబమ్మ దగ్గరికి అఫ్జల్ను తీసుకపొమ్మందామా?! మంచిగ చూసి తక్వజేస్తదట! పైసలు గూడా ఎక్కువ కాదు. రూపాయో, రెండో.. గంతేనట!” అనేది.
దానికి అమ్మ.. “ఆఁ.. గీ పాటి సర్దికి మందులు ఎందుకూ?! ఓమ, ఎల్లిగడ్డ, తులసి దంచి పోస్తెబాయె! లేకుంటె జిందాతిలిస్మాత్ పోద్దాం. అయినా పిల్లలన్నాక దగ్గరా? తుమ్మరా?! అదే తక్వయితది. కొత్తగ గీ బూబమ్మ ఎవరు?! ఏం మందు ఇస్తదట?! మంచిదే గానీ, ఎందుకు తియ్యండి?!” అని ఆ ప్రసక్తి ఆపేది. మంత్రం సంగతి అమ్మకు తెలియదు. అయితే, అప్పటికే బూబమ్మ పేరు ప్రఖ్యాతులు మా ఊరంతా వ్యాపించాయి. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఆమె మంత్రం వేసి తాయెత్తు కడితే ఎలాంటి అనారోగ్యమైనా తగ్గిపోతుందని అనుకునేవారు.
అక్క హిందీలో కొంచెం వీక్. మిగతా అన్నిట్లో ఫస్ట్క్లాస్ మార్కులు వచ్చేవి. హిందీలో మాత్రం బొటాబొటీగా వచ్చేవి. హిందీ పరీక్ష ముందురోజు బాగా టెన్షన్ పడేది. ఓసారి నానమ్మ అఫ్జల్కు రూపాయి ఇచ్చి పంపి.. అక్క పెన్నుకు బూబమ్మ చేత నల్లదారం కట్టించి తెప్పించింది. ఆ మర్నాడు అక్క అన్నీ తేలిక ప్రశ్నలే వచ్చాయని చెప్పగానే.. ఆ పెన్నుతో పరీక్ష రాస్తేనే ఫస్ట్క్లాస్ వచ్చిందనే థియరీని నానమ్మ కూడా ప్రచారం చేయడం మొదలుపెట్టింది. “ఆఁ.. దాని మొహం! హిందీ అంటె భయం ఉన్నందుకు బాగ చదివింది. రాసింది” అని అమ్మ అంటే.. అభిమాన హీరోను ఏమైనా అంటే భరించలేని వీరాభిమానిలా నానమ్మ విలవిల్లాడింది.
“ఆఁ , గా తాయెతులేంది, అంత ఉట్టిదే!” అని మా నాన్న ఇష్టపడేవాడు కాదు. కానీ, నానమ్మ విశ్వాసానికి తోడు పనివాళ్ల సపోర్ట్ కూడా ఉండేది. మాకు ఎప్పుడైనా జలుబూ, జ్వరమూ మూడు రోజులు దాటిందంటే.. “మీరు నమ్మరు గాని, బొక్క పట్కోని ఇడువని సందు జరాలు బూబమ్మ తాయెత్తు తోనే పోతయి” అని అమ్మతో అనేవారు. ఓసారి ఇలాగే తాయెత్తు తెప్పించి నానమ్మ నాకు కట్టాక ఆ మర్నాడే జ్వరం తగ్గింది. అయితే “మూడు రోజులు టాబ్లెట్స్ ఏసుకున్నవు గద, జ్వరం రాదు ఇగ !” అంటూ అయిదు రోజులుంచాల్సిన తాయెత్తును నాకు నచ్చజెప్పి నాన్న విప్పేశాడు. మా నానమ్మ గొణుక్కుంది గానీ నాన్నను ఏమీ అనలేక పోయింది పాపం!
కొన్నాళ్లకు మా క్లాసులో కూడా బూబమ్మ ఒక వరాలిచ్చే దేవత అయిపోయింది. మా స్నేహితుల్లో చాలామందికి గాజుల మధ్య బూబమ్మ కట్టిన నల్లతాడు మిలమిలా మెరుస్తూ కనిపించేది. కొందరయితే మెళ్లో తాయెత్తు కట్టించుకునేవారు. దాన్ని ఎవరైనా చూస్తే మహిమ తగ్గిపోతుందని బయటికి కనిపించకుండా జాగ్రత్తపడేవారు. పరీక్షల ముందు “బూబమ్మ దగ్గరికి పోయినవానబ్బా ?!” అని అడగడం.. “పోలేదోయ్ ! ఇవ్వాళ్ల మా అమ్మ తీస్కపోతనన్నది!” అని జవాబు చెప్పడం జరిగేది. ఇదంతా చూసి నేను “అయితె మీరు ఇంటి దగ్గర చదువుకోరా?” అని అడిగేదాన్ని. “కాదు రమా! అందరు నీలెక్క క్లెవర్స్ ఉండరు గాదోయ్, కొంచెం పెన్నుకు మంత్రం ఏపిచ్చుకోని తాయెత్తు కట్టిచ్చుకుంటె పేపర్ ఈజీగ ఒస్తదన్నట్టు! మనం చదివిన ప్రశ్నలే దిగుతయ్!” అని ఈ విషయంగా చాలా రీసెర్చ్ చేసిన సుశీల చెప్పేది.
బూబమ్మ మహిమ అంతటితో ఆగిపోలేదు. ఆ తరువాతి రోజుల్లో మా మేనకోడళ్లు స్కూల్లో చదువుకునేటప్పుడు కూడా బూబమ్మ చేత పెన్నులకు నల్లతాడు కట్టించుకునేవాళ్లు. వదలని సుస్తీలు చేసినప్పుడు బూబమ్మ చేత మంత్రం వేయించుకుని స్వయంగా తాయెత్తు కట్టించుకుంటే ఎంతటి అనారోగ్యమైనా పారిపోతుందని చాలామంది అనేవారు. మొత్తానికి మా వాళ్లలో చాలామంది పరీక్షల ముందు బూబమ్మ దగ్గరికి స్వయంగా వెళ్లి తాయెత్తు కట్టించుకోవడమో, మంత్రించిన దారం కట్టిన పెన్నుతో పరీక్ష రాయడమో మామూలైపోయింది.
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి