Katha – 2021 | “మనం బాన్స్వాడా తండాకు వెళ్తున్నాం!”.. చెప్పింది కలెక్టర్ ఝాన్సీ రాథోడ్.
“ఓకే.. మేడమ్!” అన్నది డీఆర్వో రాగిణి.
ఎందుకని అడగలేదు. కలెక్టర్ ఝాన్సికి సర్ప్రైజ్ విజిట్స్ చేయడం అలవాటు.
ఉదయం ఎనిమిదింటికల్లా కలెక్టర్ బంగ్లాకు వచ్చింది రాగిణి.
ఇద్దరూ ఒకే కారులో బయల్దేరారు. అంతకుముందే సీసీ రాంబాబుకు ఫోన్చేసింది రాగిణి.
“మేడమ్ విజిట్ ఉంది కదా! ఏర్పాట్లు చేశారా?” అని అడిగింది.
“ఏం విజిట్ మేడమ్?”.. అమాయకంగా అడిగాడు రాంబాబు.
“అదేంటి!? పోగ్రామ్ తెలీదా?” స్వరం తగ్గించి అడిగింది రాగిణి.
న్సి ఆ మాటలు విని..
“ఇది అఫీషియల్ విజిట్ కాదుకదా రాగిణీ..” అన్నది.
“సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయి కదా మేడమ్” కంగారుగా చెప్పింది రాగిణి.
“ఫర్వాలేదు.. మనల్ని ఎవరూ టార్గెట్ చేయరులే!” అంటూ.. ఒక న్యూస్ పేపర్ రాగిణికి ఇచ్చింది ఝాన్నీ.
అది ముందు రోజు పేపర్. ఒక న్యూస్ ఐటమ్ మార్కింగ్ చేసి ఉంది.
విషయం అర్థమైంది రాగిణికి.
“ఇప్పుడు మనమేం చేయగలం మేడమ్” అడిగింది.
“ఊర్లో పరిస్థితి అంచనా వేద్దాం. ఇలాంటి మరణం మరొకటి జరగకుండా చూడాలి కదా..” అన్నది ఝాన్సి.
డ్రైవర్ ముత్యాలును చూస్తూ..
“బాన్స్వాడ తండా తెలుసు కదా నీకు..” అని అడిగింది.
“ఊర్లోకి ఎంటరయ్యాక తెలుసుకుంటానమ్మా..” అన్నాడు ముత్యాలు.
బాన్స్వాడ కథనం రాగిణి ముందు మరోసారి కదిలింది.
‘బిడ్డను కోల్పోయిన తల్లి ఆత్మహత్య’.. ఇది ఆ వార్తకు పెట్టిన హెడ్డింగ్.
మరోసారి వార్త చదివింది.
* * *
“గంగూబాయి పాతికేళ్ల యువతి. మగ సంతానం కోసం మూడోసారి కూడా గర్భం దాల్చింది. మళ్లీ ఆడపిల్లే పుట్టింది. దాంతో ఆమె భర్త భీమ్లా నాయక్ యథావిధిగా పుట్టిన బిడ్డ గొంతులో వడ్లు వేసి చంపేశాడు.
బిడ్డను కోల్పోయిన గంగూబాయి శోకభారంతో ఆత్మహత్య చేసుకున్నది. గతంలో ఆమెకు పుట్టిన ఇద్దరు ఆడపిల్లలను కూడా భీమ్లా నాయక్ గొంతులో వడ్ల గింజలు వేసి చంపేసినట్టు గ్రామస్తుల కథనం. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు భీమ్లా నాయక్ను జైలుకు తరలించారు”..
“తనేమో ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త జైలుకెళ్లాడు. ఎవర్ని కలవాలి మేడమ్?” అడిగింది రాగిణి.
“గంగూబాయి తల్లి కూడా ఆడదేగా! బిడ్డను కోల్పోయిన బాధలో ఆమె కూడా ఉంటుంది. మన పరామర్శ ఆమెకు కొంత సాంత్వన ఇస్తుంది కదా?” చెప్పింది ఝాన్సి.
“గంగూబాయి తల్లిది కూడా అదే ఊరా మేడమ్!?”.
“భీమ్లా నాయక్ స్వయానా ఆమెకు తమ్ముడే! ఒకే ఊరు”.
“ఇది చాలా దారుణం మేడమ్. ఆడపిల్లను బతకనివ్వరా?”.. రాగిణి స్వరం వణికింది.
ఆమె కళ్లు వర్షించడం గమనించింది కలెక్టర్ ఝాన్సి.
“కంట్రోల్ యువర్సెల్ఫ్ రాగిణీ!”.. అన్నది.
రోడ్డు మీద ఉన్న గుంతల్లో పడుతూ లేస్తూ.. ఎత్తెత్తి కుదేస్తూ వెళ్తున్నది కారు.
“ముత్యాలూ! కాస్త నిదానంగా వెళ్లు” అన్నది రాగిణి.
కలెక్టర్ ఝాన్సి.. ఐదు నెలల గర్భిణి.
“నేను తిన్నగానే వెళ్తున్నాను మేడమ్. రోడ్డు దారుణంగా ఉంది. ఇటీవల వచ్చిన వర్షాలకు రోడ్డు మొత్తం కొట్టుకుపోయింది” చెప్పాడు.
“ఈ రోడ్డు వేసి ఆరునెలలే కదా అయ్యింది” అన్నది ఝాన్సి.
“కాంట్రాక్టర్ ఎమ్మెల్యే మనిషి కదా.. సగం లాక్కుని ఉంటాడు” అన్నది రాగిణి.
“అఫ్కోర్స్..” అంది ఝాన్సి.
“అతణ్ని బ్లాక్లిస్ట్లో పెడదాం మేడమ్! మీరు అనుమతిస్తే ఒకసారి పిలిచి ఎడాపెడా వాయిస్తాను. మళ్లీ అతనిచేతే ఈరోడ్డు వేయిస్తా మేడమ్!” అన్నది రాగిణి.
“నీ స్పార్క్ నాకు నచ్చుతుంది రాగిణీ!” అన్నది ఝాన్సి.
“మీలాంటి సిన్సియర్ కలెక్టర్ దగ్గర పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం మేడమ్”.
“నిన్ను ఏరి కోరి వేయించుకున్నాను రాగిణీ! మంత్రిగారు.. ‘జిల్లా అంతా ఆడాళ్ల రాజ్యం అయిపోయింది!’ అని నవ్వుతూ అంటూ ఉంటారు..” అన్నది ఝాన్సి.
“నిజమే మేడమ్! ఎస్పీ శాన్వీ మేడమ్ కూడా మీకులాగే స్పిరిట్ ఉన్న అమ్మాయి”.
“ఎస్..శాన్వికి ఒకసారి ఫోన్ చెయ్! సూసైడ్ చేసుకున్న గంగూబాయి ఫ్యామిలీ హిస్టరీ.. ఊర్లో పరిస్థితి వాట్సప్ చేయమను..” చెప్పింది ఝాన్సి.
“ఎస్.. మేడమ్!” అంటూ ఎస్పీ శాన్వికి ఫోన్ చేసింది రాగిణి.
“మనం వెళ్తున్నట్టు చెప్పొద్దు..” అన్నది ఝాన్సి.
“మీ మూమెంట్ శాన్వికి తెలీకుండా ఉండదు మేడమ్” అన్నది రాగిణి.
నవ్వుతూ ముత్యాలు వైపు చూసింది ఝాన్సి.
“కారు కదిలిస్తే మీ మూమెంట్ ఇంటలిజెన్స్ వాళ్లకు చెప్పాలి మేడమ్. మీ సెక్యూరిటీ వాళ్ల బాధ్యత కదా!” అన్నాడు ముత్యాలు.
“ఊర్లో హడావుడి వద్దని చెప్పు. మీడియా హడావుడి కూడా వద్దు..” రాగిణితో చెప్పింది ఝాన్సి.
“మా రెవెన్యూ వాళ్లకు మెసేజ్ పెట్టాను మేడమ్. అందుబాటులో ఉండమని. బట్.. మనం పిలిస్తే తప్ప వాళ్లు రారు” చెప్పింది రాగిణి.
గంటల జర్నీ తర్వాత.. బాన్స్వాడ చేరుకుంది ఝాన్సి బృందం.
అప్పటికే మఫ్టీలో ఇద్దరు ముగ్గురు కానిస్టేబుళ్లు గ్రామంలోకి ప్రవేశించి ఉన్నారు.
గ్రామంలోకి అడుగుపెట్టాక..
“గంగూబాయి మదర్ ఇల్లు ఎక్కడ ఉన్నదో కనుక్కో!”.. ముత్యాలును చూస్తూ చెప్పింది ఝాన్సి.
కారు ఆగగానే ముత్యాలు దగ్గరికి మఫ్టీలో ఉన్న ఒక ఐడీ కానిస్టేబుల్ వచ్చాడు.
ముత్యాలు ఏదో చెప్పడంతో..
“టు మినిట్స్ టైం ఇవ్వండి”.. అని వెళ్లి, సమాచారం సేకరించి తన బైక్ ముందుకు ఉరికించాడు.
అప్పటికే కొందరు ఇళ్లలో నుంచి బయటికి వచ్చి చూస్తున్నారు.
‘ఊర్లోకి వచ్చిన కారు ఎవరిదా?!’ అని కళ్లు చిట్లించి చూస్తున్నారు.
ఊర్లో శ్మశాన వాతావరణం కనిపిస్తున్నది. కారు నెమ్మదిగా గంగూబాయి తల్లి ఇంటి ముందుకొచ్చి ఆగింది. గంగూబాయి తల్లి కమ్లి.. ఒక కుక్కి మంచం మీద పడుకొని ఉన్నది.
కలెక్టర్, డీఆర్వోను చూసి లేచింది.
“కలెక్టర్ గారు!”.. కమ్లిని చూస్తూ చెప్పింది రాగిణి.
వడలిపోయిన చేతులతో నమస్కారం చేసింది కమ్లి.
ఏడ్చి.. ఏడ్చి సొమ్మసిల్లిన చారికలు ఆమె మొఖం మీద స్పష్టంగా కనిపిస్తున్నాయి.
“దరిద్రుడు నా బిడ్డను చంపేశాడు..” అన్నది ఏడుస్తూ.
ఆమె చేతిని ఓదార్పుగా పట్టుకున్నది ఝాన్సి.
“అందుకే కదా జైలుకు వెళ్లాడు. ఇక వాడికి చిప్పకూడే..” అన్నది రాగిణి.
“భగవంతుడు ఎవర్నిస్తే వాళ్లను తీసుకోవాలి కానీ.. మగపిల్లాడి కోసం వెంపర్లాడటం ఏంటమ్మా? ఇద్దరు బిడ్డలను పోగొట్టుకొని మూడో బిడ్డను కూడా కాపాడుకోలేని దౌర్భాగ్యానికి కుమిలిపోయి ప్రాణాలు తీసుకుంది నా బిడ్డ” అన్నది కమ్లి.
దాదాపు అరవై ఏళ్ల వృద్ధుడు.. కారును చూసి లోపలికి వచ్చాడు.
“గంగూ నాయన..” చెప్పింది కమ్లి.
“కలెక్టర్ మేడమ్ మిమ్మల్ని పరామర్శించడానికి వచ్చారు..” చెప్పింది రాగిణి.
బలహీనమైన చేతుల్తో నమస్కారం పెట్టాడు సోనూ నాయక్.
“తోడ పుట్టినోడని బిడ్డను కళ్లలో పెట్టుకొని చూసుకొంటాడని.. నా ఇంటి ఆడది ఆశపడింది. వాడు పశువయ్యాడు. భార్యను చంపుకొన్నాడు. కనుపాపలని చిదిమేశాడు” అంటూ వెక్కివెక్కి ఏడ్చాడు సోనూ నాయక్.
కాసేపు ఝాన్సి ఏమీ మాట్లాడలేదు.
మీకు కలిగిన దుఃఖాన్ని మేము పూడ్చలేం పెద్దయ్యా! ఇది ఉంచండి” అని పదివేల రూపాయల్ని ఒక కవర్లో పెట్టి ఇచ్చింది.
“ఈ పైసలు ఏం చేసుకుంటాం కలెక్టరమ్మా! బెయిల్ మీద ఆ దుర్మార్గుడు మళ్లీ వస్తాడట. ఆడు ఇంక అసలు ఈ ఊర్లో తిరగకూడదు. ఉరి వేయించండి వాణ్ని” కోపంగా.. రొప్పుతూ అన్నాడు సోనూ నాయక్.
“చట్టం తన పని తాను చేసుకుపోతుంటుంది పెద్దయ్యా..” అన్నది రాగిణి.
“చట్టం చట్టు బండలు కాకుండా కాపాడండి తల్లీ! ఈ గర్భశోకం మరెవరికీ కలగకూడదు” అన్నది కమ్లి
ఇద్దరూ తిరుగు ప్రయాణం అయ్యారు.
* * *
“ఎన్ని మరణాలు ఆపగలం రాగిణీ!”.. నిర్వేదంగా అన్నది ఝాన్సి.
“ప్రపంచాన్ని చూడకముందే ఆ పసికందుల్ని చంపేయడం దారుణం మేడమ్” అన్నది రాగిణి.
“ఈ సమస్యకు పరిష్కారం లేదా అమ్మా!?”.. డ్రైవ్ చేస్తూనే అడిగాడు ముత్యాలు.
“మనిషి మనస్తత్వంలోనే మార్పు రావాలి ముత్యాలూ! ఏ బిడ్డ అయితేనేం..?” అన్నది రాగిణి.
“వాడు పుట్టడానికి ఒక ఆడది కావాలి. వాడి కామవాంఛ తీర్చుకోవడం కోసం ఒక ఆడది కావాలి. వాడి కడుపున మాత్రం ఆడపిల్ల పుట్టకూడదు. ఇదెక్కడి ఘోరం”.. అన్నది ఝాన్సి.. కోపంగా తనలో తానే గొణుక్కుంటూ.
అప్పటికే ఎస్పీ శాన్వి సమాచారం పంపింది. తిరిగి ఏదో మెసేజ్ టైపు చేసి పంపింది. కాసేపటి తర్వాత దాన్ని డిలీట్ చేసింది.
వాళ్ల కారు నిజామాబాద్ చేరుకొనేలోపు.. శాన్వి ఫోన్ చేసింది.
“అతని బెయిలు కేసు వాదించడానికి ఎవరూ ముందుకు రావడం లేదట మేడమ్..” చెప్పింది ఎస్పీ శాన్వి.
ఝాన్సి దీర్ఘంగా ఆలోచిస్తూ..
“వాడు బయటికి రావాలి శాన్వి! హుక్ అండ్ క్రుక్..” అని చెప్పింది.
ఒక నిమిషం ఆలోచించి..
“ఎస్.. మేడమ్!” అన్నది శాన్వి.
* * *
తన బెయిలు కోసం ఎవరు ప్రయత్నించారో అర్థం కాలేదు భీమ్లా నాయక్కు.
భీమ్లా ఊర్లోకి వచ్చాడని తెలిసి.. అందరూ తలుపులు వేసుకున్నారు.
అతణ్ని ఇంట్లోకి రానివ్వకూడదని అందరూ తీర్మానించుకున్నారు.
“నా బిడ్డను పొట్టనపెట్టుకున్న వాణ్ని చంపేస్తా!”.. కోపంతో ఊగిపోయాడు సోనూ నాయక్.
“వాడి పాపమే వాణ్ని అంతం చేస్తుంది”.. అన్నది కమ్లి.
“తమ్ముడని కనికరం చూపిస్తావేమో.. వాణ్ని బతకనివ్వకూడదు..” అన్నాడు సోనూ నాయక్.
“అట్టాంటోడు భూమికి భారమేనయ్యా.. వాడు నా తమ్ముడు అయితేంది!?” అన్నది కమ్లి.
భీమ్లా నాయక్ను ఎలా మట్టుబెట్టాలా!. అని చూస్తున్నాడు సోనూ నాయక్..
* * *
కట్టెల పొయ్యి మీద అన్నం వండుకొని.. అందులో గంజి పోసుకొని తిన్నాడు భీమ్లా నాయక్.
కూరలు ఎలా చేయాలో అతనికి తెలియదు. నాలుగు రోజులు గడిచాయి.
ఉన్న కాసిన్ని బియ్యం అయిపోయాయి. జేబులో రూపాయి కూడా లేదు. ఎవరూ ఇంటి తలుపు తెరవడంలేదు.
బావ సోనూ నాయక్.. తన విషయంలో కారాలు మిరియాలు నూరుతున్నాడని అర్థమైంది.
తెగించి ఒకరోజు అక్క ఇంటికి వెళ్తే..
“అరే దగుల్బాజీ! బావ నిన్ను చంపేస్తాడు వెళ్లిపో..” అన్నది కమ్లి.
కాళ్లీడ్చుకుంటూ ఇంటికొచ్చి పడ్డాడు. అప్పు కూడా పుట్టే మార్గం కనిపించడం లేదు.
కడుపులో పేగులు నక.. నకలాడుతున్నాయి. భార్య గంగూబాయి గుర్తొచ్చింది.
* * *
ఎక్కణ్నుంచి తెస్తుందో తెలీదు.. వండిన కూర వండకుండా భీమ్లా నాయక్కు పెట్టేది గంగూబాయి.
రోజు మార్చి రోజు నాటుకోడి తెచ్చి వండిపెట్టేది.
భీమ్లాకు ఇష్టమని వంకాయ, ఎండుచేప వేసి వండి పెట్టేది. గోంగూరలో మెత్తాళ్లు వేసి వండేది.
ఇప్పసారా తాగి.. నాటుకోడి నంజుకొంటే భీమ్లా నాయక్కు స్వర్గం కనిపించేది.
ఇద్దరు బిడ్డల్ని భర్త పొట్టన పెట్టుకున్నా.. మళ్లీ నీళ్లు పోసుకుంది గంగూబాయి.
“ఈసారి ఎవరు భూమిమీద కొచ్చినా.. ఉసురు తియ్యకయ్యా!” అన్నది ఒకరోజు.
“సర్లేవే:” అన్నాడే కానీ.. భీమా ్లనాయక్ మనసులో ఆలోచనలు మారలేదు.
‘మగపిల్లాడు పుడితే.. నాలా జల్సాగా బతికేయచ్చు!. ఆడపిల్ల అయితే దానికి ఎవడు కాపలా కాస్తడు?” అనేవాడు.
గంగూబాయి భయం భయంగా చూసేది.
“పుట్టించే వాణ్ని నేను ఉన్నా కదే! భయమెందుకు?” అనేవాడు.. అదేదో గొప్పగా.
“పుట్టి లోకం కూడా చూడకుండా నువ్వు సాగనంపుతున్న నా బిడ్డల ఉసురు నీకు తగులుతుందయ్యా..” అనేది.
“అదంతా నీ బుగులు లేవే! పుట్టించేది నేనే కదా! వద్దనుకొనే హక్కు కూడా నాకే ఉంటుంది. అయినా నాలుగు రోజులు సాకిన తర్వాత చంపలేం గానీ.. పుట్టిన సందిట్లో చంపితే నష్టమేముంది? మగపిల్లాడు పుట్టేవరకూ.. నీకు ఈ కష్టాలు తప్పవు కాస్త ఓర్చుకో!” అనేవాడు.
గంగూబాయి కన్నీరు మున్నీరై రాత్రంతా ఏడుస్తూ కూర్చొనేది.
“ఈసారన్నా నా కడుపులో ఒక మగ నలుసు పుట్టేలా చూడు సామీ..” అని మొక్కుకునేది.
* * *
గంగూబాయి కన్నీళ్లు సముద్రంగా మారి ఆ ఉప్పెనలో కొట్టుకుపోయినట్టు కలలొచ్చాయ్ భీమ్లా నాయక్కు.
ఒకరాత్రి ఎవరో తట్టినట్టు అనిపిస్తే దిగ్గున లేచాడు.
“ఎవరు..?” అని అడిగాడు.
“నా తోరా?” పిలిచాడు ఒక ఆగంతకుడు.
“ఎవరు నువ్వు?”.. మళ్లీ అడిగాడు భయంగా..
“ముందు బయటికి రా!” చెప్పాడతడు.
భయపడుతూనే నీరసంగా తూలుతూ బయటికి వచ్చాడు.
అక్కడ మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.
“ఎవరు మీరు?..” అడిగాడు భీమ్లా నాయక్.
వాళ్లేమీ చెప్పలేదు.
“ఎవరో తెలిస్తే చస్తావ్..” అన్నారిద్దరూ.
వణికిపోయాడు భీమ్లా నాయక్.
“ఎందుకొచ్చారు?” అని అడిగాడు.
“రా చెబుతాం..” అన్నారిద్దరూ.
“ఎక్కడికీ!?” అని అడిగాడు.
వాళ్లిద్దరూ భీమ్లా నాయక్ మెడపట్టి ముందుకు నెట్టారు.
“ఎక్కడికి తీసుకెళ్తున్నారు?” మళ్లీ అడిగాడు.
“తెలీదు. నడువ్!” అన్నాడు ఒక వ్యక్తి.
“నేను అరుస్తా?? అరిస్తే.. తండా జనం బయటికి వస్తరు” అన్నాడు భీమ్లా నాయక్.
“నిన్ను చంపినా ఎవరూ బయటికి రారు. మూసుకొని మాతో రా!” అన్నాడు ఒక వ్యక్తి.
కాస్త దూరంగా పెట్టి ఉంచిన జీపులోకి ఎక్కించారు భీమ్లానాయక్ను. జీపు కదిలింది.
“ఎక్కడికి తీసుకెళ్తున్నారు?” కలవరంగా మళ్లీ అడిగాడు.
“తెలీదు” అన్నాడొక వ్యక్తి.
కాసేపు ప్రయాణం తర్వాత పొలాల సమీపంలోని ఒక నిర్జన ప్రదేశంలో జీపు ఆగింది.
అప్పటికే అక్కడికి వచ్చి ఆగి ఉన్న కార్లోంచి ఇద్దరు ఆడవాళ్లు దిగారు.
వాళ్లనెప్పుడూ తను చూసినట్టు గుర్తు లేదు. ఒక శాల్తీ.. భీమ్లా నాయక్ దగ్గరకొచ్చింది.
“ఎవరు మీరు?” అడిగాడు.. భయం భయంగా.
అందులో ఒకామె ముందుకొస్తూ..
“మేం ఎవరో చెప్పేముందు నీకో కథ చెప్పాలి..” అన్నది.
ఏంటి మీరు చెప్పే కథ?” అడిగాడు.
“అది కూడా ‘వడ్లు’ కథే!” అన్నది ఆమె.
వెనక్కి విరిచి కట్టిన చేతుల్తో ఉన్న అతణ్ని ముందుకు నెడుతూ.. కల్లాల్లో కుప్పగా పోసిన వడ్లు దగ్గరికి తీసుకొచ్చింది.
“ఇవి నువ్వు తింటావా ?” అడిగింది.
“వడ్లు ఎలా తింటారు?” అడిగాడు.
“తిని చూడు. ఎలా ఉంటాయో తెలుస్తుంది” అన్నదామె.
“మీకేమైనా పిచ్చా..” అన్నాడు అరుస్తూ.
వెనుక నుంచి మరో శాల్తీ ముందుకు వచ్చి..
“పసివాళ్ల గొంతులో వడ్లగింజ వేయడం మాత్రం పిచ్చితనం కాదా?” అన్నది.
“మీరేవరో నాకు అర్థమైంది. మీరు పోలీసులు కదూ..” అన్నాడు.
“మేం ఎవరో నీకు చెబితే వచ్చే లాభం ఏమీ లేదు. కానీ.. ఒక కథ చెబుతాను విను..” అన్నది మొదటి శాల్తీ.
“ఏంటా కథ..” మళ్లీ అడిగాడు భయం భయంగా.
“అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో నీలాంటి ఒక తండ్రి. నీలాగే ఆడపిల్ల వద్దు అనుకున్నాడు. పుట్టిన బిడ్డను పుట్టినట్టు.. అచ్చు నీలాగే గొంతులో వడ్ల గింజను వేసి చంపాలనుకున్నాడు. ఆ బిడ్డతల్లి తల్లడిల్లి పోయింది. బట్ నీ అమాయకపు భార్యలా తనను తాను దహించుకోలేదు. ఫుల్గా తాగి, ఒళ్లు తెలీక పడున్నవాణ్ని లాంతర్లోని చమురుని వంచి గుడెసె తగలబెట్టి.. బిడ్డను తీసుకొని రాత్రికి రాత్రే ఊరు వదిలి పరుగులు తీసింది. బిడ్డను పొదివి పట్టుకొని కాలువలూ, గట్లూ, ముళ్ల పొదలూ దాటుకొని ఒక ఊరిలోకి వచ్చి పడిపోయింది. సొమ్మసిల్లి పడిపోయిన ఆ తల్లిని, గుక్కపెట్టి ఏడ్చి ఏడ్చి కొనఊపిరితో ఉన్న ఆ బిడ్డను ఆ ఊరు అక్కున చేర్చుకుంది. స్పృహలోకి వచ్చిన ఆ తల్లి.. బిడ్డను తనివి తీరా కౌగిలించుకొని ఏడ్చేసింది. అమ్మ స్పర్శతో ఆ బిడ్డలో మళ్లీ ఊపిరాడ్డం మొదలై గుక్కపెట్టి ఏడ్వడం మొదలుపెట్టింది. స్తన్యం ఇచ్చి..
“చంపేశానమ్మా! నిన్ను చంపాలనుకున్న ఆ దుర్మార్గుణ్ని.. మీ నాన్నను నిప్పు పెట్టి చంపేశాను..”అని పిచ్చిదానిలా అరిచి ఏడ్చింది.
ఊరి జనాలకు విషయం అర్థమైంది.
ఊరు ఆదరువుగా నిలిచింది. తనను కాపాడ్డానికి అమ్మ ప్రాణాలు అడ్డుగా వేసిందని ఆ పసిదానికి కాలక్రమంలో అర్థమైంది. జీవితం విలువ తెలిసింది. చదువే లోకంగా బతికింది. అమ్మ ఆశే ప్రపంచంగా మిగిలింది. ఊరు మొత్తం హారతులు పట్టేలా.. ఐఏఎస్ సాధించింది.
ఊరి చరిత్రలో ఎవరూ సాధించలేని విజయం సాధించింది”.. అంటూ ఆగింది.
అక్కడున్న సిబ్బంది ఉత్కంఠతో వింటున్నారు.
ఒక నిమిషం ఊపిరి పీల్చుకొని..
“ఆ ఐఏఎస్ నేనే” అన్నది.
మె కళ్ల వెంట నీళ్లు ప్రవాహమవుతున్నాయి..
“ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ మేడమ్!” అన్నది మరో శాల్తీ.
“ఎలా కంట్రోల్ చేసుకోవాలి శాన్వి. ఆరోజు అమ్మ నన్ను కాపాడకపోతే ఏమయ్యేదాన్ని. ఉన్నతమైన ఈ స్థాయికి ఎదిగేదాన్నా? ఈ ప్రపంచాన్ని చూసేదాన్నా? ఈ దుర్మార్గుడు పొట్టన పెట్టుకున్న ముగ్గురు బిడ్డలు.. నాలా ఏ ఐఏఎస్సో, డాక్టరో, ఇంజనీర్గానో మారి సమాజానికి సేవచేసే వాళ్లు కదా..” అన్నది దుఃఖోద్వేగంతో.
భీమ్లా నాయక్ ఆమెను గుర్తుపట్టాడు.
“మీరు కలెక్టర్ ఝాన్సి కదూ..” అన్నాడు.
“అవును రా!” అంటూ అతని మొఖం మీద బలంగా గుద్దింది ఝాన్సి..
“భూమ్మీదకు వచ్చిన వాళ్లందరూ కలెక్టర్లూ.. డాక్టర్లూ కాలేరు. అయినా నా బిడ్డను నేను చంపుకొంటే మీకు అభ్యంతరం ఏంటి?” అన్నాడు.
ఐపీఎస్ శాన్వి ముందుకొచ్చింది.
“చట్టానికి అభ్యంతరం ఉంది. అందుకే నిన్ను అరెస్ట్ చేశాం. బట్.. అదే చట్టం నీలాంటి నరరూప హంతుకుడికి బెయిల్ కూడా ఇచ్చింది. నీది క్షణికావేశం అనీ, విచారణ చేసి శిక్షించమన్నది. అందుకే నిన్ను ఇలా విచారిస్తున్నాం..” అంటూ ఉంటే అడ్డుపడ్డాడు భీమ్లా నాయక్.
“అర్ధరాత్రుళ్లు ఊరి బయటికి తీసుకొచ్చి విచారణ చేయరు. మీరేదో దురుద్దేశంతోనే నన్ను ఇక్కడికి తెచ్చారు” అన్నాడు.
“సదుద్దేశమే.. నీకు వడ్లు రుచి చూపాలనుకుంటున్నాం. అందుకే నీ బెయిల్కి లాయర్ని కూడా పెట్టి బయటికి తెచ్చాం. తిను.. ఎలాగూ ఆకలితో ఉన్నావుగా తిను..” అని అతని మెడపై పిస్తోలు పెట్టింది శాన్వి.
“ఈ వడ్లు తినాలా.. ఇవి తిని బతుకుతానా?” అన్నాడు.
“బతుకుతావో లేదో తింటేగదా తెలిసేది..” అన్నది ఝాన్సి.
అతని చేతుల్ని విడిపించి నలుగురు పోలీసులు రౌండ్గా నిలిచారు.
“ఇవి తిని నువ్వు బతికితే వదిలేస్తాం..” అన్నది ఝాన్సి.
“నాకేమైనా అయితే మీకు ఉద్యోగాలు పోవడం ఖాయం” అన్నాడు భీమ్లా నాయక్.. చావు తెలివితేటలు చూపిస్తూ.
“వీడితో మాటలు ఏంటి మేడమ్! మీరు ‘ఊ!’ ఎన్కౌంటర్ చేసేస్తాం!” అన్నది శాన్వి
“ఆగు శాన్వి..” అని..
మళ్లీ భీమ్లా నాయక్ను చూస్తూ..
“ఇవి తినరా! ఇవి తిని నువ్వు బతికితే.. నిజంగానే నిన్ను వదిలేస్తాం” అన్నది ఝాన్సి.. గుప్పెడు వడ్లు అతని చేతికిస్తూ.
“మాట తప్పరుగా!” అన్నాడు భీమ్లా నాయక్ ఆశగా.
“అమ్మతోడు! వదిలేస్తాం. ఆ తర్వాత చట్ట ప్రకారమే నీకు శిక్ష పడుతుంది” చెప్పింది ఝాన్సి.
ఆశగా ఆ గుప్పెడు వడ్లు తీసుకొని గొంతులో పోసుకున్నాడు భీమ్లా నాయక్.
నిజంగానే.. అవి అతని గొంతులో అడ్డుపడ్డాయి. గుటక వేశాడు. ఊపిరి ఆడలేదు.
గొంతులో వడ్లు వేసి తాను ఆయువు తీసిన ముగ్గురు పసిగుడ్లూ.. అతని కళ్లముందు కదలాడారు.
గొంతు పిడచ కట్టుకుపోయింది. అతని ఊపిరి ఆగిపోయింది.
* * *
రాయపాటి హైమావతి స్వస్థలం నెల్లూరు. ప్రస్తుత నివాసం హైదరాబాద్. గ్రాడ్యుయేషన్ చేశారు. సాహిత్యంపై మక్కువతో కథలు రాస్తున్నారు. సమకాలీన సమస్యలపై వచ్చే సాహిత్యాన్ని ఇష్టపడతారు. ఆడపిల్లను కాపాడుకోవడం ఒక సామాజిక బాధ్యత అని రచయిత్రి చెబుతున్నారు. దిశ లాంటి చట్టాలు ఆచరణలో అమలు కావడం లేదనీ, పోక్సో చట్టం వచ్చినా చిన్నారులను చిదిమేయడం ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి మారాలంటే.. మనిషిలోనే మార్పు రావాలనీ, దానికి సాహిత్యం కూడా ఊతం ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నారు.