ఖైరతాబాద్, జూన్ 12 : ట్రాన్స్పోర్టు వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయని నమ్మించి ఓ వ్యక్తి పలువురి వద్ద కోట్లాది రూపాయలు వసూలు చేసి ఉడాయించాడు. ఈ ఘటన పంజాగుట్ట పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం…దిల్సుఖ్నగర్ చైతన్యపురికి చెందిన కోటకొండ నంద కిశోర్ పంజాగుట్టలోని ఓ డయాగ్నస్టిక్ సంస్థలో పనిచేస్తున్నాడు. అదే సంస్థలో పనిచేస్తున్న పల్లి యోగేశ్వర రావుతో ఎనిమిదేండ్లుగా పరిచయం ఉంది.
ఆ పరిచయాన్ని ఆసరా చేసుకొని మే 2021లో ఓ హోటల్కు పిలిపించి ట్రాన్స్పోర్టు వ్యాపారం చేయడం ద్వారా అత్యధిక లాభాలు గడించవచ్చని, రవాణా వాహనాలు, బస్సుల ద్వారా తాను ఈ వ్యాపారంలో మంచి లాభాలు పొందుతున్నానని, వ్యాపార భాగస్వామ్యం కల్పిస్తానని యోగేశ్వర రావు తన సహద్యోగి నంద కిశోర్ను నమ్మబలికాడు. అతని మాటలు నమ్మి రూ.15లక్షల పెట్టుబడి పెట్టాడు.
నందకిశోర్తో పాటు అతని స్నేహితులతో కూడా పెట్టుబడులు పెట్టేలా ప్రేరేపించగా, 2021 నుంచి 2025 వరకు ఒక్కొక్కరు లక్షలాది రూపాయల పెట్టుబడులు పెట్టారు. నందకిశోర్ రెండో సారి పలు విడతల్లో రూ.75లక్షల వరకు అతను సూచించిన బ్యాంకు ఖాతాలకు డబ్బులను పంపించాడు. మొదట్లో పెట్టుబడుల్లో రాబడుల పేరుతో కొంత కాలం డబ్బులు చెల్లించిన యోగేశ్వర రావు వ్యాపారంలో లాభాలు వస్తున్నాయన్న నమ్మకం కలిగించాడు.
2025 డిసెంబర్ తర్వాత డబ్బులు రావడం నిలిచిపోవడంతో పాటు యోగేశ్వరరావు ముఖం చాటేశాడు. అతనితో పాటు భార్య ప్రత్యూష సైతం ఈ మోసంలో భాగస్వామిగా ఉందని, యోగేశ్వర రావు సోదరి దీపిక, ఆమె భర్త పగోటి శ్రీనివాస్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలోని జోహెన్స్బర్గ్లో ఉన్నారని, వారి వద్ద కీలక సమాచారం ఉండి ఉంటుందని బాధితులు పోలీసులకు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.