అనుసృజన: నేతి సూర్యనారాయణ శర్మ
జరిగిన కథ : కన్యాకుబ్జ యువరాజు పుష్పకేతుడితోపాటు అతని నలుగురు సోదరులూ.. తమిళదేశంలోని స్త్రీ రాజ్యానికి వెళ్లారు. అనుకోకుండా ఒకరోజు అతని తమ్ముళ్లు నలుగురూ కనిపించకుండా పోయారు. వాళ్లను వెతుకుతూ.. పుష్పకేతుడు ఆ రాజ్యపు రాణిని పెళ్లాడాడు. ఆ కొలువులో తనముందుకు వచ్చిన రెండు హత్యాపరాధాలపై విచారణ చేపట్టాడు.
“ఏమయ్యా! నీ అభియోగం ఏమిటి?” అని ప్రశ్నించాడు పుష్పకేతుడు.
“మహారాజా! నేను వ్యాఘ్రముఖి అనే వారకాంత తమ్ముణ్ని. మా అక్క కులవృత్తి చేత చాలా ధనం ఆర్జించింది. మొన్న ఒక విటుడెవ్వడో తన కూతురైన కుందమాలను వశం చేసుకుని, మా అక్కను చంపి నూతిలో పారేశాడు. అడ్డం వచ్చిన వారిని కూడా హతమార్చాడు. మా మేనకోడలు కుందమాల వాడికి జడిసి వరించిందో.. ఏమో తెలియదు కానీ, తల్లిని చంపిన వాడనే విచక్షణ లేకుండా వాడితోనే కులుకుతున్నది. అందువల్ల నేనే ఈ అభియోగం తెచ్చాను. వాడు మీ ఆజ్ఞాపత్రిక పుచ్చుకుని కూడా విచారణకు హాజరు కాలేదు. మీరే మాకు న్యాయం చేయాలి” అని వేడుకున్నాడు వాదిగా వచ్చినవాడు.
“వాడినిప్పుడే బంధించి తీసుకురండి” అని భటులను ఆజ్ఞాపించాడు పుష్పకేతుడు.
ఇంతలో మణిమంతుడు తిరిగి వచ్చాడు.
“దేవా! మా అల్లుడు చాలా అలసిపోయి ఉన్నాడు. ఇప్పుడు రాలేనని తమతో మనవి చేయమన్నాడు” అని చెప్పాడు.
ఆ మాట వింటూనే పుష్పకేతుని ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
“వాణ్ని కూడా వెంటనే బంధించి తీసుకురండి” అని మరికొందరు భటులను పంపాడు.
రెండువైపులకూ వెళ్లిన భటులు తిరిగి వచ్చారు.
“మహారాజా! వాళ్లను బంధించడం మా వల్ల కాలేదు. వారి కత్తికి బదులివ్వడం మాకు సాధ్యం కాలేదు” అని సమాచారం ఇచ్చారు.
పుష్పకేతుడు ధూమకేతునిలా మండిపడ్డాడు.
“ఓహో! ఈ రాజ్యపౌరులకు మా సామర్థ్యం చాటి చెప్పాల్సిన సమయం వచ్చినట్లుంది” అని కత్తిదూసి బయల్దేరాడు.
సభలోనే ఉన్న అతని తమ్ముడైన పింగళుడు కూడా అన్నను అనుసరించాడు. వారికంటే ముందుగా అల్లుడి వద్దకు వెళ్లిన మణిమంతుడు ఎన్నోవిధాలుగా అతణ్ని బతిమాలాడు.
“ఉత్తిపుణ్యానికి రాజుతో విరోధం మంచిది కాదు. ఆయన చాలా మంచివాడు. మన పక్షానే ఉన్నాడు. ఒక్కసారి ఆయన దర్శనం చేయి” అని ఎంతగానో చెప్పిచూశాడు.
కానీ, ఆ మాటలు అతని చెవులకు ఎక్కలేదు.
“మామా! నా భుజబలం నువ్వు ఎరగక పోవడం వల్ల అలా మాట్లాడుతున్నావు. నాకంటే బలవంతులైన సోదరులు నలుగురు ఈ ఊరిలోనే ఉన్నారు. వారితో కలిసి వెళ్లి, ఇప్పుడే ఈ రాజ్యాన్ని కైవసం చేసుకుంటాను” అంటూ బయల్దేరాడు.
అతనికి దారిమధ్యలో మయూరధ్వజుడుఎదురుపడ్డాడు.“చిత్రభానూ! ఎలా ఉన్నావూ?!” అని పలకరించాడు.
“అన్నయ్యా! మనకీ దేశపు రాజుతో కయ్యం వచ్చింది. పద!” అంటూ.. మయూరధ్వజుణ్ని
బయల్దేరదీశాడు.
వాళ్లకు దారిమధ్యలో పుష్పకేతుడు, పింగళుడు కనిపించారు. అన్నదమ్ములందరూ ఆప్యాయతలు పంచుకున్నారు. మణిమంతుడు కంగారుపడుతూ వెనకే వచ్చాడు. పుష్పకేతుడు అతణ్ని చూసి..
“సెట్టీ! నీ అదృష్టం పండింది. చక్రవర్తి కుమారుణ్నే అల్లుణ్ని చేసుకున్నావు. సోదరులారా! పదండి. కోటకు పోదాం” అన్నాడు.
నలుగురూ వెళ్తుండగా.. దారిమధ్యలో సౌమ్యుడు కూడా కలిశాడు. విడిపోయిన అన్నదమ్ములు ఐదుగురూ యథాలాభంగా ఒకేరోజున కలుసుకోగలిగారు.
కోటకు వెళ్లిన తరువాత.. వాళ్లు ఒకరి కథలు ఒకరికి చెప్పుకొన్నారు. ముందుగా పుష్పకేతుడు తాను రత్నమకుటను ఓడించి రాజ్యాన్ని చేపట్టడం, పింగళుడి చెర విడిపించడం వరకు గల కథను చెప్పాడు.
చిత్రభానుడు తాను విచిత్ర రీతిలో మణిమంతుడికి అల్లుడు కావడం వెనుక గల కథను వివరించాడు.
ఇప్పుడు సౌమ్యుడు తన కథను ఇలా చెప్పాడు..
అన్నలారా! ఆనాడు నేను, పింగళుడు కలిసి వేశ్యావాటికకు వెళ్లాం. ఒక వీధిలో అతణ్ని వదిలేసి నేనొక్కడినే ముందుకు వెళ్లాను. నడివీధిలో కొందరు విటులు మాట్లాడుకుంటుంటే అక్కడే కూర్చుని ఆలకించాను.
“ఆ కుందమాల తల్లి వ్యాఘ్రముఖి ఎంతకాలమైనా చావదేమిట్రా?! దాని మాటే యముడు మరిచిపోయాడేమో!” అన్నాడు వాళ్లలో ఒకడు.
“కుందమాలకు కన్యత్వ హాని కలగకుండా విటులను వంచించి, ఆ వ్యాఘ్రముఖి ధనం ఆర్జిస్తోందట. ఎలాగంటావ్?!” అడిగాడు మరొకడు.
“అదే విచిత్రంగా ఉంది. కుందమాలను కోరుకుని, ఆ ఇంటిలో ప్రవేశించినవాడు ఎవడూ తిరిగి రావడం లేదట. అదేం మర్మమో తెలియడం లేదు” అని చెప్పాడు ఇంకొకడు.
“ఏమైతేనేం? కుందమాల చక్కదనం చూసి తీరాలి. మొన్న గరుడోత్సవంలో చూశాను. దాని అందం, బింకం, పొంకం, సౌరు, టక్కు మన నగరంలో వేరే ఏ వారకాంతకూ లేవు” అన్నాడు మొదటివాడు.
“అది మనబోటివారికి దక్కదురా. అందరాని పళ్లకోసం ఆశపడటం ఎందుకు?!” అని పెదవి విరిచాడు రెండోవాడు.
వాళ్ల మాటలు నాకు ఆశ్చర్యాన్ని, కుందమాలను ఎలాగైనా ఒకసారి కలుసుకోవాలనే అభిలాషను కలిగించాయి. ఆమె మేడ ఆ ప్రాంతంలోనే ఉందని తెలుసుకుని, ఆ ఇంటికి వెళ్లాను. వాడుక ప్రకారం ఒక దాది నన్ను లోనికి తీసుకుపోయింది.
ఇంతలో వ్యాఘ్రముఖి వచ్చింది.
“చూడబోతే మహారాజుల బిడ్డలాగా ఉన్నారు. మేమెంత ధన్యులం?! మా కుందమాల నోములిప్పటికి ఫలించాయి. మీ వస్త్రభూషణాలు చూస్తుంటేనే మీరెంతటి వారో అర్థమవుతున్నది. ఎందరో చక్రవర్తులు వచ్చి ఊళ్లిస్తామని, దేశాలిస్తామని కన్నెరికం చేయమని కోరారు. కానీ నాకు గానీ, నా కూతురికి గానీ ఇష్టం లేకపోయింది. తగినవాడు దొరకాలి. అభిలాష తీరాలి కానీ, ఊళ్లు దేశాలు ఏం చేసుకుంటాం” అన్నది.
నేను గుటకలు మింగుతూ, కుందమాల కోసం విరహార్తిలో పడినట్లు నటించాను.
“మా అమ్మాయి చిత్రపటం చూస్తారా?!” అంటూ నా చేతికి అందించింది.
నిజంగా త్రిలోక సుందరిలా ఉంది.
“మా కుందమాలను పోలిన ఎలనాగ ఈ భూమండలం మీదే కాదు.. స్వర్గంలో కూడా లేదని చెప్పగలను. ఏమైతేనేం ఇప్పటివాళ్లకు మాకున్నపాటి సామర్థ్యం ఉండదు కదా! నేను దానికళ్ల ముందే దాటిపోవాలి. అందుకోసం చూస్తున్నాను” అన్నది వ్యాఘ్రముఖి.
“భయపడకు. నిన్ను నేను దాటిస్తానులే! కుందమాలను రప్పించు” అన్నాను నేను.
“అమ్మాయి ఇప్పుడే అలంకరించుకుని వస్తుంది. అందాకా మీరా హంసతూలికా తల్పం మీద విశ్రమించండి” అని చూపించి, వ్యాఘ్రముఖి లోనికి వెళ్లింది.
నేనా గదిలో ప్రవేశించాను. నిద్రించే ముందుగా పక్క దులిపి వేసుకోవాలని, మంచాన్ని చేతితో గట్టిగా కొట్టి చూడాలని చిన్నప్పుడు చదువుకున్నవాణ్ని కాన.. కుడిచేతితో ఆ మంచాన్ని కొట్టాను. అంతే! ఆ మంచానికి అమరించిన యంత్రపు గడియ సడలిపోయింది. మంచం అగాథంలా ఉన్న నూతిలో పడిపోయింది.
‘ఔరా! ఎంత పనిచేసింది?! కనిపెట్టకపోయి ఉంటే ఈపాటికి మరణించి ఉందును’ అనుకుంటూ.. పక్కగది నుంచి వినిపించిన మాటలు ఆలకించాను.
“ఒసేవ్! అబ్బాయిగారి పని అయిపోయింది. నూతిలో పడిపోయి శయనించారు”.
“అది సరేనమ్మా! మీరు ఆయనతో మాట్లాడుతుండగా.. అమ్మాయిగారు వచ్చి చూచి పోయింది. ఆయన్ను వలచినట్లుంది. తనకు అతనితో పెళ్లి చేయమని మీతో చెప్పమన్నది”.
“చిన్నపిల్ల.. దానికేం తెలుసు?! దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలి. అప్పుడే విటులను చేరదీస్తే రెండురోజుల్లో బొత్తిగా డొక్కయిపోతుంది. దమ్మిడీ విలువ చేయదు. దాని లావణ్యం తెలియకనే కదా ఇప్పుడు గొప్పగొప్పవాళ్లంతా వరుస కడుతున్నారు!”.
“అమ్మా! ఎల్లకాలమూ సంపాదనేనా? ఉన్న సొమ్ము చాలదనా?! మీరు చేస్తున్న ద్రోహకృత్యాలు అమ్మగారికి ఇష్టం లేవు. మరీమరీ చెప్పమన్నది!”.
“ఛీ! నువ్వే దానికి లేనిపోనివన్నీ నూరిపోస్తున్నావు. కావాలంటే మీరిద్దరూ నా ఇంట్లోంచి లేచిపోండి. నేను వేరే పిల్లను తెచ్చి పెంచుకుంటాను. ఇంతకంటే ఎక్కువే సంపాదించగలను. సరే కానీ, నూతిలో దిగి, ఆ విటుని ఒంటిమీద వస్తువులన్నీ దోచుకోవాలి. పదపద..” అంటూ వ్యాఘ్రముఖి ఆ గదిలోకి వచ్చింది.
నాకు కోపం ఆగలేదు. దాని కొప్పు పట్టుకుని లాగి, నూతిలో పారేశాను. దాసీలు తలో మూలకూ పారిపోయారు. ఆ ఇంటిలోనున్న పురుషులు కొందరడ్డం వచ్చారు. వాళ్లను కూడా అలాగే నూతిలోకి తోసేశాను.
కుందమాల నా వద్దకు వచ్చి నమస్కరించి..
“మహాత్మా! నా వల్లే ఇటువంటి ఘోరకృత్యాలు జరుగుతున్నాయి. నన్ను చంపినా మీకేం దోషం అంటదు” అంటూ మెడ వంచింది.
నేను కటారి పారవేసి..
“కుందమాలా! నీ డెందము చందము నేను విని ఉన్నాను. నువ్వు ఉత్తమురాలివి. నీ తల్లిదే పాపమంతా. తగిన శిక్ష అనుభవించింది. నీకొచ్చిన భయమేం లేదు” అని పలికాను.
అప్పుడామె..
“ఆర్యా! మీరెవ్వరో తెలియదు. కానీ, మిమ్మల్ని చూడటంతోనే నా మనసు మీకే అంకితమైంది. ధనకనక వస్తు వాహనాలతో సహా నన్ను నేను మీకు సమర్పించుకుంటున్నాను. నేనింతకుముందు ఏ పురుషుణ్నీ ఎరగను. దయచేసి నన్ను స్వీకరించండి” అన్నది.
ఆమె మాటలకు నాకు జాలి కలిగింది. ఆమె సౌందర్యం అంతకుముందే నాకు నచ్చినందు వల్ల అంగీకరించాను. ఆ మరునాడే నూతిలోనుంచి ఆమె తల్లిని, మిగిలిన వారిని తీయించి అంత్యక్రియలు చేయించాను. ఆ వ్యాఘ్రముఖి తమ్ముడు నా చేతిలో దెబ్బలు తిని పారిపోయి, మీ వద్ద అభియోగం తెచ్చాడు. ఆ తరువాయి కథ మీరు ఎరిగిందే!..
..అని సౌమ్యుడు తన కథ పూర్తిచేశాడు.
ఆ తరువాత మయూరధ్వజుని వంతు వచ్చింది.
“సోదరులారా! ఆనాడు నేను బసనుంచి బయల్దేరి, దక్షిణవీధి వెంట చాలాదూరం వెళ్లాను. ఆ నగరం తుదిచూడాలని బుద్ధిపుట్టి వేగంగా నడిచాను. కానీ, ఎంతసేపు నడిచినా తుది కనిపించలేదు. అంతలో సాయంకాలమైంది. ఇళ్లలో, వీధుల్లో దీపాలు వెలిగించారు. ఒక వీధి అరుగుపై కూర్చుని కొందరు కథలు చెప్పుకొంటున్నారు. నేనా కథలు ఆలకించాను.
కథకుడు ఇలా చెప్పసాగాడు..
ఉజ్జయినీపురాన్ని మహాసేనుడనే రాజు పాలిస్తున్నాడు. ఆయనకు చాలాకాలం తరువాత గోపాలుడు, పాలకుడు అనే ఇద్దరు పుత్రులు కలిగారు. ఆయన మంత్రికి కూడా అలాగే రోహాంతకుడు, సురోహరుడు అనే పుత్రులిద్దరు కలిగారు. నలుగురూ కలిసి విద్యాభ్యాసం చేశారు. కొద్దికాలంలోనే సమస్త విద్యలనూ చదివి, మహాపండితులని పేరు తెచ్చుకున్నారు.
కొంతకాలానికి మహాసేనుడు స్వర్గస్థుడు కావడంతో మంత్రులు అతని పెద్దకుమారుడు గోపాలునికి పట్టం కట్టారు. అతని తమ్ముడు పాలకుడు యువరాజయ్యాడు. మంత్రి పుత్రులిద్దరూ మంత్రులై సమస్త కార్యాలనూ న్యాయంగా నడిపిస్తున్నారు.
అలా ఉండగా ఒక విజయదశమినాడు.. గోపాలుడు పట్టపుటేనుగునెక్కి మహావైభవంతో నగరవీధులలో ఊరేగసాగాడు. ఆ సమయంలో పౌరులందరూ మేడలెక్కి.. గోడలెక్కి తమ రాజును తిలకించసాగారు. ఒకచోట గోడపైకెక్కి చూస్తున్న ఒక బ్రాహ్మణ బాలికను పట్టపుటేనుగు తొండంతో పట్టుకోబోయింది. ఆమె హడలిపోతూ నేలమీద జారిపడింది.
గోపాలుడు కలవరపడుతూ ఆమెను లేవదీయించి..
“అయ్యో తల్లీ! నీకు దెబ్బతగిలింది కాబోలు. ఉపచారాలు చేయించుకో!” అని పలికాడు.
అప్పుడామె చురచుర చూస్తూ..
“రాజపుత్రా! రాజ్యానికి రావడం కోసం తండ్రినే చంపినవాడివి నువ్వు. అటువంటి నీ ఏనుగు నన్నిట్లా బాధించడంలో ఆశ్చర్యం ఏముంది?” అంటూ లోపలికి పోయింది.
ఎంతటి కఠినాత్ముడైనా వినగానే మనసు కష్టపెట్టుకోదగిన ఆ మాటలను ఆలకించిన గోపాలుడికి నిజంగానే మతిపోయింది.
‘అయ్యయ్యో! ఈ చిన్నది నన్నిలా ఎందుకు నిందించింది? దైవంలాంటి మా తండ్రిని నేను చంపడం ఏమిటి? ఆయన సహజమరణాన్ని కూడా హత్యగా చిత్రించిన పాపాత్ములెవరు?! అసలింతకీ ఈ ఘోరమైన లోకాపవాదం నాపై పడటానికి కారణం ఏమిటి?’ అని ఆలోచిస్తూ ఊరేగింపు మానిపించి ఇంటికి తిరిగి వెళ్లాడు. అతనికి ఆ రాత్రి నిద్ర పట్టలేదు.
‘నిప్పులేనిదే పొగరాదు. ఈ అపవాదుకు మూల కారణం ఏదో ఒకటి ఉండనే ఉంటుంది. అదేమిటో
నేనే స్వయంగా అన్వేషించి తెలుసుకుంటాను’ అని తీర్మానించుకున్నాడు.
(వచ్చేవారం.. మయూర ధ్వజుని పెళ్లి)