‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2022’లో రూ.5 వేల బహుమతి పొందిన కథ.
ఎర్రగడ్డ గోకుల్ టాకీసుల మొదటి ఆట సిన్మా ఇడ్సివెట్టిండ్రు. కుంటి పతంగి, సుక్కి.. టాకీస్లకెల్లి బైటికొచ్చి ఇంటి బాటవట్టిండ్రు. అది వానకాలం. పొద్దటికెల్లి ఇడ్సివెట్టకుండ వాన వడ్తనే ఉంది. పతంగి సగం తడుస్తా, సుక్కి తడవకుండా గొడుగు వట్టుకొని నడుస్తుండ్రు. వాడికి సుక్కి అంటే పంచప్రాణాలు. సుక్కికి ఇరువై ఏండ్లుంటయి. ఆమెకంటె రెండేండ్లు పెద్దోడు పతంగి. కొన్నాళ్లుగా వాళ్లిద్దరూ ఒకళ్లను ఇడ్సివెట్టి ఒకళ్లు ఉండలేక వోతుండ్రు.
పతంగికి మూడేళ్లప్పుడు పోలియో సోకటాన ఎడమ కాలు కొద్దిగంత చిన్నగుంటది. కుంటుకుంట నడుస్తడు. చిన్నప్పటికెల్లి సుక్కి – పతంగి ఒక్కతానే పెరగటాన.. అందరు విల్సినట్లే.. ‘రేయ్ కుంటోడా!’ అనే విల్సేది సుక్కి. కానీ, కొన్ని దినాలుగా వాడినట్టా పిల్వటానికి సుక్కి మనసెందుకో ఒప్పుకొంటలేదు. కొద్దిదూరం వోయిండ్రో లేదో.. వాన జోరందుకుంది. గొడుగు వట్టుకొని నడుస్తున్న పతంగి కాలుజారి.. రోడ్డు పక్కనున్న మురికి గుంతలో వడవోయిండు. అది సూసి, సుక్కి వాన్ని గబుక్కున రెండు చేతుల్తో గట్టిగా వట్టుకుంది. వాడు నిలదొక్కుకొని.. నిలవడి సుక్కివైపు కృతజ్ఞతగా సూస్తా..
“ఇట్టనే ఈ కుంటోనికి బతికినన్నాల్లూ ఊతంగా ఉంటవా సుక్కి?” అని ఆశగా అడిగిండు. “ఓ అట్టనే ఉంటా! మరి గిప్పుడు గీ వానకు నేను తడ్వకుండా వట్టుకున్న గొడుగులెక్కనే.. నూగూడా నా బతుకంతా ఆసరాగా ఉంటవా?” అనడిగింది సుక్కి. “ఉత్త గొడుగులెక్కనే కాదే.. కంటికి రెప్పలా సూసుకుంట!”.. వాడన్న మాటతో సుక్కి సంతోషంతో పొంగివోయింది. ఇద్దరూ నడ్సుకుంట మోతీనగర్ సెంటర్ దాటింరు. కొద్దిదూరం నడ్సినంక..
“ఒరేయ్ రాజూ! ఆనల తడ్వవాకు బిడ్డా! సర్దిజేస్తదీ!” అనే మాటలు ఇన్పడ్డయి.
అచ్చం వాళ్లమ్మ మాటల లెక్కనే ఇనపడేసరికి.. ఉలికిపడి ఒక్కపాలిగా ఆగిపోయిండు పతంగి. దిగాలువడి వాళ్లమ్మ యాదిలకు వోయిండు. అమ్మ – తను శేరిలింగంపల్లిల రైల్స్టేషన్ దగ్గర గుడిసెల ఉండేది. కూలి పనికి పోయేది. అప్పుడు తనకు ఎనిమిదేండ్లు. గవర్మెంటు బళ్లె మూడో క్లాస్ చదువుకునేటోడు. ఎవల మాయలో పడిందో ఏమో.. ఓ అద్దరాత్రి వాణ్ని ఒంటరిగా ఒగ్గేసి ఎటో ఎల్లిపోయింది అమ్మ.
“మీ అమ్మ ఎర్రగడ్డ కాడ కన్పడింది” అని ఎవల్లో చెప్తే.. అమ్మను వెతుకుతూ ఎర్రగడ్డకాడికి వచ్చిండు. అక్కడ ఏడుస్తూ తిరుగుతూంటే.. ఎల్లయ్య తాత చూసి, తన కథ విని.. వెంట తోల్కొచ్చిండు. తన ఐదేండ్ల మనుమరాలు సుక్కికి పరిచయం చేసిండు. తమతోపాటే ఉంచుకున్నడు. తెగిన పతంగిలెక్క బజార్ల దొరికిండనీ, ‘రాజు’కు బదులుగా ‘పతంగి’ అని పేరువెట్టి, రాంపాల్ రెడ్డి స్క్రాప్ దుకాణంల పనికి పెట్టిండు. అట్ల రోజులు గడుస్తున్నయి.
తనకు పదిహేనేండ్లప్పుడు, ఓ ఖాళీ గుడిసె చూపించి.. ‘బిడ్డా పతంగీ! ఈరోజు నుండి నూ ఇండ్లనే వండుకతింటూ, ఇండ్లనే ఉండూ!’ అన్నడు. అప్పటిసంది ఆ గుడిసెలనే ఉంటున్నడు. అట్ల ఆలోచించుకుంటూ నడుస్తున్న పతంగికి.. తను పనిచేసే స్క్రాప్ దుకాణం కాడికొచ్చింది గూడా ఎర్కకాలే. “రాత్రి పది అయితుందీ. గింత సేపట్దాంక యాడికి వోయిండ్రురా?”.. రాంపాల్ రెడ్డి సేటు మాట ఇనపడంగనే, సోయిలకొచ్చి తల గోక్కుంటా..
“సిన్మాకు వోయినం సేటు!” అన్నడు పతంగి. “అయితెమాయె గానీ.. మనింటికి వోయి ఈ మందులు సేటమ్మకు ఇచ్చిరా!” అనిచెప్పి.. మందుల సంచి పతంగి చేతికిచ్చిండు రాంపాల్ రెడ్డి. “నేను పనిమీద శంషాబాద్ ఎల్తున్నననీ.. రాత్రికి ఇంటికి రాననీ సేటమ్మకు చెప్పు!” అని.. ఆటో కిరాయిలకని రెండొందలు వాడి చేతిలో వెట్టిండు. మారు మాట్లాడకుండా.. సుక్కి దిక్కు చూస్తూ.. ‘పోయొస్త!’ అన్నట్లు సైగ చేసిండు.
సుక్కి గూడ ‘సరే!’ అన్నట్లు తలూపి, తమ గుడిసె వైపు వెళ్లిపోయింది. పతంగి రోడ్డు దాటి.. సనత్నగర్ పోయే ఆటో ఎక్కిండు. ఆటో కదిలింది. పతంగి ఆలోచనలు రాంపాల్ రెడ్డి వైపు మళ్లినయి.
నాలుగు నెలలుగా రాంపాల్ రెడ్డి స్క్రాప్ దుకాణం సరిగ్గా నడుస్తలేదు. దినాం నాలుగైదు లారీల స్క్రాప్ లోడ్ ఎత్తేటోడు. ఇప్పుడు వారానికి ఒక లారీ గూడ ఎత్తుతలేడు. ఆడ కొత్తగా వేరేటోళ్లు స్క్రాప్ దుకాణం పెట్టిండ్రు. రాంపాల్ రెడ్డి కంటే ఎక్కువ పైసలిస్తున్నరు. దాంతోని గుడిసెలోళ్లంతా స్క్రాప్ను గా కొత్త దుకాణంలనే అమ్ముతున్నరు. కొన్నాళ్లు ఇట్లనే ఉంటే.. రాంపాల్ రెడ్డి దుకాణం ఎత్తేసుడు ఖాయం!
ఆటో బ్రేక్ ఏసుడుతోని.. ఆలోచన బంద్జేసి ఆటో దిగిండు పతంగి. వానల నడుసుకుంటనే సేటు ఇంటికి చేరుకున్నడు.
మందుల సంచి సేటమ్మకిచ్చి.. “నేను వోతున్న సేటమ్మా!” అని ఎనిక్కి తిరిగిండు. “గీ వానల యాడికి బోతవ్ రా? అన్నం తిని ఈణ్నే పండుకో! పొద్దున్నే పోదువుగాని!” అన్నది సేటమ్మ. పతంగి ఆలోచనల పడ్డడు. టైం పన్నెండయితున్నది. ఉంటెనే మంచిదనుకున్నడు. తిన్నంక.. సేటమ్మ ఇచ్చిన చాప దుప్పటి దీసుకొని హాల్లనే పండుకున్నడు. కానీ, నిద్రయితే పడుతలేదు. సుక్కే కండ్లల్ల తిరుగుతున్నది. పిచ్చిదానికి తనంటే ఎంత ప్రేమో! అనుకుంట ఆలోచనల్ల పడ్డడు. అటు ఇటూ దొర్లి.. టైం చూసిండు. రెండు దాటింది. వాన జరంత తగ్గింది. వానికి సుక్కే యాదికొస్తున్నది. ఆడ ఉండబుద్ధి కాలే! లేసి పక్క దుప్పట్లు మడిచివెట్టి బయటవడ్డడు. నడ్సుకుంటనే ఇంటిబాట వట్టిండు.
తెల్లవారుజాము నాలుగు అయితున్నది. సుక్కిని ఓసారి చూసొద్దమని ఆళ్ల గుడిసె కాడికి వోయిండు. అలవాటు లెక్కనే తడికెల తలుపు సందులంగ లోపటికి సూసిండు. అంతే! వాడి గుండె భళ్లున పలిగింది. వేయి పిడుగులు ఒక్కసారిగా వాని మీద పడ్డట్టు వణికివోయిండు. చూసింది నమ్మలేక పోతున్నడు. మళ్లమళ్ల చూసిండు. కల కాదు.. నిజమే! సగం బట్టల్లేకుండా సుక్కి మత్తుగ నిద్దట్లో ఉంది. కాళ్లూ – చేతులు సుక్కి మీదేసి, నిద్రవోతున్నడు రాంపాల్ రెడ్డి. ఆవేశంతో నరాలు బిగుసుకున్నయి పతంగికి. తట్టకోలేకవోతున్నడు. వాని కండ్లు నిప్పు గోళాల్లెక్కయినయి.
‘రాత్రి నాకు మాయమాటలు సెప్పి, మందుల వంకతోని వాల్లింటికి తోలి.. నా సుక్కిని నాకు కాకుండ జేస్తడా? ఈ నా కొడుకును బతకనియ్య! ముక్కలు ముక్కలుగా నరికెయ్యాల! ఆ.. అంతే!’..
అట్టా అనుకున్నదే తడువుగా.. ఎప్పుడో పాత ఇనుప సామాన్లలో వచ్చిన మూరెడు పొడవు కత్తిని గుడిసెలో దాచిపెట్టింది యాదికొచ్చింది. క్షణం ఆలస్యం చేయకుండా గుడిసెకాడికి ఉరుకుతూ, బాట పక్కన పడుకోనున్న కుక్కపిల్ల తోక తొక్కిండు. అది ‘కుయ్యో’మని మొరగవట్టింది. పతంగి దాన్ని పట్టిచ్చుకోకుండ తన గుడిసె కాడికొచ్చి, కత్తి బైటికి దీసిండు. ఒక్క దెబ్బకే ఆని తల తెగిపడాలె అనుకుంటనే.. సుక్కి గుడిసె కాడికొచ్చిండు. ఓ చేత్తో కత్తిని అంగీలోపట దాచిపెట్టుకుని.. కుంటి కాలితోని తలుపును ఒక్క తన్ను తన్నిండు. అది ఊసిపోయి గుడిసె లోపటవడింది. కుంటికాలు నిలదొక్కుకోలేక తూలి పడవోయి సంబాళించుకొని నిలవడ్డడు.
బయట కుక్క మొరిగినప్పుడే రాంపాల్ రెడ్డి నిద్రలేసిండు. బట్టలేసుకొని.. తనకు లేత కొబ్బరి ముక్కలాంటి సుక్కి భార్యగా దొరికిందనీ, ఇంకా తన పాచిక పారిందనీ తృప్తిగా, సంతోషంగా ఉన్నడు సేటు.
సంపదను పోగేసుకునేందుకు ఏసే ఎత్తుగడల్లో.. పెద్ద పెట్టుబడిదారుడికీ, చిన్న పెట్టుబడిదారుడికీ పెద్ద తేడా ఉండదు. ఇద్దరిదీ ఒకటే సిద్ధాంతం. అమాయక శ్రమజీవుల్నీ నయానో భయానో లోబర్చుకోవడమే! రాంపాల్ రెడ్డి గూడా అదే చేసిండు. ఒక్క దెబ్బకు రెండు పిట్టల్లా.. సుక్కీ తనకు దక్కింది. గుడిసెలోళ్లకు చుట్టమైనందుకు వ్యాపారం నిలబడింది. అట్ల సంతోషకర ఆలోచనల్లో ఉన్న రాంపాల్ రెడ్డి, గభాల్న తలుపు తన్ని లోపలికొచ్చిన కుంటోణ్ని చూసి..
“ఏందిరా కుంటోడా? తలుపు ఇరిగేలాతన్ని లోపలికొచ్చినవ్? మందులు సేటమ్మకిచ్చినావా?” అనడిగిండు. అనుకోనిది జరిగేసరికి కంగారుపడి తేరుకొని.. “ఆ! ఇచ్చొచ్చిన సేటు!” అన్నడు పతంగి. రాంపాల్ రెడ్డి పొడువుగా – లావుగా – బలంగా ఉంటడు. పతంగి కోపంతో ఉడికిపోతూ.. ‘నా కొడుకు పడుకొనే ఉంటే గనక ఈపాటికి తల తెగిపడేది’ అనుకున్నడు. ఇప్పుడేం చేయాలో తోస్తలేదాడికి. కోపంతో లోపట కుతకుతా ఉడికివోతున్నడు. వాని కండ్లు చింత నిప్పుల్లాగున్నయి. కుంటోడు అనుమానించి తనను తప్పుగా అర్థం చేసుకున్నడని గమనించి..
“రేయ్ పతంగీ! నిన్న నీకు చెప్పుడు మర్సిన. రాత్రి సుక్కిని పెళ్లి చేసుకున్న!”..
అనుకుంట సుక్కి దగ్గరికి వోయి.. “ఇగోసూడు!” అని సుక్కి మెడల కట్టిన పసుపుతాడు సూపించిండు. “సుక్కి నా రెండో భార్య! ఇప్పటిసంది సుక్కిని పేరు పెట్టి పిల్వమాకు. ‘చిన్న సేటమ్మా!’ అని పిల్వు. సమజైందా? గీ సంగతి ఇప్పుడే పెద్ద సేటమ్మకు ఎర్కగానియొద్దూ!” అని.. జేబులంగ పైసలు తీసి, వెయ్యి రూపాయలు పతంగి జేబులో వెట్టిండు.
“బట్టలు కొనుక్కో! చికెన్ బిర్యానీ గిట్ట తెచ్చుకొని దావత్ జేస్కో! నా పెండ్లి దావత్! అర్థమైందా?” అని పతంగికి చెప్పి.. అటువైపు తిరిగి పడుకోనున్న సుక్కితో.. “సుక్కీ! నేను ఎల్తున్న! పదకొండింటికల్ల వస్త. లేసి స్నానం చేసి, రెడీగా ఉండు. సొమ్మలు కొననీకి బంగారం కొట్టుకువోదం!!” అన్నడు. మల్ల పతంగిని సూసుకుంట..
“పోతున్నరా కుంటోడా!” అన్చెప్పి ఎల్లివొయిండు రాంపాల్ రెడ్డి.
పతంగికి సర్రున మండింది. ‘ఎవడ్రా కుంటోడూ? లం.. నా కొడకా! మీ బుద్ధులు కుంటియి! మీరు కుంటి నా కొడుకులు! ఇగో చేసేదంతా చేసి.. నన్ను మోసంచేసి, ఏం ఎరగనట్టు నంగనాచిలా పడుకుందే.. గీ సుక్కి, ఇది కుంటి నా లం.. ది! ఇక్కడ ఎవడ్రా కుంటోడూ.. నా కొడకా?’ అని రాంపాల్ రెడ్డి దిమ్మ దిరిగేలా తిట్టాలనుకున్నడు. కానీ, మాటలు గొంతులోనే అడ్డువడ్డయి. వాడి మనసు గత్తర గత్తరైతంది. కసి.. అందరి మీదా కసి. ఈ లోకం మీద కసి. అంతే! కసిగా బైటికొచ్చిండు. కాండ్రించి గుడిసె మీద ఉమ్మేసిండు. గబగబా తన గుడిసెలకు వోయి.. వలవలా ఏడ్సిండు. సుక్కి ఇంత అన్యాయం చేస్తదనుకోలేదు. బొందిలో ప్రాణముండగా మళ్లా సుక్కి ముఖం చూడకూడదని దూరంగా వెళ్లిపోవాలనుకున్నడు. లేచి బట్టలు సదురుకున్నడు. పెట్టెలున్న పైసలు దీసుకొని బైటికొచ్చిండు. వానల తడ్సుకుంట రోడ్డునవడ్డడు. నా అనే వారు లేని, దయాగుణం అసలే లేని ఈ మాయదారి లోకంలో ఏ తీరాలకో.. ఈ ఒంటరి బాటసారి పయనం?
బయటికి వోయిన పతంగి కాండ్రించి ఉమ్మేసినప్పుడే.. సుక్కికి తెలివైంది. ఆడు ఉమ్మింది గుడిసె మీద కాదనీ.. తన మీదేననీ సుక్కికి అర్థమైంది.
‘నన్నిట్టా సూసి వాని గుండె పలిగి ఉంటది. ఎంత బాధవడ్డడో? నన్ను మోసగత్తె అనుకున్నడేమో!’.. అనుకుంట, రెండు చేతుల్తో తల బాదుకుంటూ గుండెలవిసేలా ఏడ్సింది. అసలు రాత్రి ఏం జరిగిందో ఒక్కొక్కటిగా యాదిజేసుకోవట్టింది.
మందుల సంచి దీసుకొని పతంగి అటెల్లంగనే.. సుక్కి తాముండే గుడిసెల కాడికొచ్చింది. గుడిసెల మద్దిన పండగలూ, కార్యాలూ జరుపుకొనే షెడ్డుకు లైటింగ్ చేసి ఉంది. శానమంది గుమిగూడి ఉన్నరు.
‘ఏం జర్గుతున్నదిక్కడ?’ అనుకుంట షెడ్డుకాడికి వోయింది సుక్కి. అంతల్నే.. “అగ్గో.. సుక్కి వచ్చింది!” అన్నరెవరో గుంపులంగ. ముగ్గురు వదినెలు, ఇద్దరక్కలు తనకాడికొచ్చి..
“యాడికి వొయినవ్ గింత రాతిరిదంకా?
జల్ది వోదంపా!” అంటూ తనను తమ గుడిసెకాడికి లాక్కొచ్చింరు. “తడ్సి ముద్దయినవ్గా పిల్లా! తానం సేద్దూ పా!” అన్కుంటా.. తానాలు చేసే తడికెల సాటుకు వట్కవోయింరు. అప్పటికే గోలెంల ఎవరో వేడినీల్లు తోడివెట్టింరు. బలవంతంగా తనను కూకోవెట్టి తానం చేయించింరు. తను బిత్తరవోయీ..
“ఏందిది వదినా?” అనడిగితే.. “తొందరెందుకమ్మా మరదలా.. నీకే ఎర్కయితదిగా!” అనింది సిన్న వదిన. తానం చేయించినంక గుడిసెలకు తీస్కవొయి కొత్త బట్టలు కట్టిచ్చింరు. తనకేం అర్థమైతలేదు.
“ఏందక్కా! నాకెందుకు సింగారిస్తుండ్రు?” అడిగింది సుక్కి.. “నీకు పెండ్లి జేస్తున్నం.. పెండ్లి!” అన్నది చిన్న వదిన. గుండె ఝల్లుమన్నది సుక్కికి. “నాకు పెండ్ల్లా? నాకు ఎర్కలేకుండ పెండ్లేందీ?” అడిగింది సుక్కి.. తన్నుకొస్తున్న ఏడ్పును ఆపుకొంటూ.
గుబులుతో వణుకు మొదలైంది.
“మన తెగలల్ల కట్టుబాట్లు గిట్టనే ఉంటయి. ఆడపిల్ల ఇష్టాలతో పనిలేదు! పెద్దోల్లు ఆడపిల్లను ఎవల్లతో జత కట్టియ్యాలనుకుంటే ఆల్లతోనే లగ్గం జేస్తరు. తలొంచుకొని పసుపుతాడు కట్టించుకోవల్సిందేనమ్మా!” అన్నది పెద్ద వదిన.
తనను బలిపశువును చేసిండ్రని సుక్కికి అర్థమైంది. కళ్లనిండా కుంటి పతంగే కనపడుతున్నడు. ఏం చేయాలో అర్థమైతలేదు. వదినెలూ అక్కలూ కల్సి తనను తలా ఓ పక్కన పట్టుకొని.. పెండ్లి తంతు జరిగే షెడ్డు కాడికి తీస్కొచ్చి, లగ్గం పీటపైన కూకోవెట్టిండ్రు. మెల్లెగా తలెత్తి పక్కకు చూసింది. పెళ్లికొడుకు బట్టల్ల పెళ్లిపీటపై కూకోనున్న రాంపాల్ రెడ్డి సేటును చూసి ఉలికిపడింది. ఎవరో చేతబడి మంత్రమేసినట్టు సుక్కి మెదడు మొద్దువారింది. ఏ ఆలోచనా వస్తలేదు. జరిగేది చూస్తున్నది. ఎవరేం చెప్తున్నరో వింటున్నది. రాంపాల్ రెడ్డి తన మెడల పసుపుతాడు గట్టింది గూడ.. సోయి లేకుంట ఉన్నది.
కాసేపాయినంక ఎల్లయ్య తాత ఊతకర్ర వట్కొని నిలవడి.. “అందరూ జాగర్తగా ఇనుర్రి. పదిహేనేండ్లుగా గీ రాంపాల్ రెడ్డి మనల్ను అన్ని రకాల ఆదుకుంటూ వచ్చిండు. సేటుకు లగ్గమై పదేండ్లు దాటినా, భార్య ఆరోగ్యం బాగలేక పిల్లలు పుట్టలే. పిల్లలు లేనోల్ల గోస మనకెర్కే. పిల్లల కోసరమనే రెండో పెండ్లి చేస్కోవాలనే ఆలోచన చేసి.. మన సుక్కమ్మను తనకిచ్చి లగ్గం జేస్తడేమో కనుక్కోమని ఓ పెద్ద మడిసిని నా కాడికి తోలిండు. నేను పది దినాలు బాగా ఆలోచన చేసిన. అమ్మాఅయ్యా లేని మా సుక్కమ్మ మంచిగా బతుకుతదని ఈ పెండ్లికి ఒప్పుకొన్న. ఇన్నాల్లవట్టీ రాంపాల్ రెడ్డి మనకు సేటు మాత్రమే. ఇయ్యాల్టి సంది చెత్త ఏరుకొని బతికే మనకు సుట్టం గూడ. కాబట్కీ.. రేపటి సంది మనందరం రాంపాల్ రెడ్డి దుకాణంలనే స్క్రాప్ అమ్మాలని పెద్దోనిగా అందరి మంచిగోరి చెప్తున్న. అందరికీ ఇష్టమేనా?” అనడిగిండు.
ఆడున్నోళ్లందరూ.. ‘ఓ!’ అన్నరు.ఇద్దరు వదినెలు సుక్కిని గుడిసె దగ్గరికి పట్టుకొచ్చి.. “రాంపాల్ రెడ్డి ఇప్పుడు సేటు కాదు. నీ పెనిమిటి. బెట్టు సేయకుండా మంచిగ సూస్కో. ఇంకెల్లూ!” అని గుడిసె లోపటికి తోలి, వెల్లివోయిండ్రు. ఆపాటికే రాంపాల్ రెడ్డి లోపలుండు. మెల్లగ వచ్చి.. లోపటంగా బేడెం వెట్టి, తనను పట్టుకొచ్చి మంచమ్మీద కూకోవెట్టిండు. తనకేం అర్థమైతలేదు. కండ్లు మూసుకున్నది. ఏం జరిగిందో.. రాంపాల్ రెడ్డి ఏం చేసిండో తనకేం మతికిలేదు.
అట్ల రాత్రి జరిగిన సంఘటనలు యాదికి రాంగనే ఉలికిపడింది సుక్కి. ఎవల మీదనో కోపం, అంతల్నే దుఃఖం, భయం, మెదడునిండా ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరయింది. ఎంటనే పతంగిని కలవాలనుకుంది. ఉదయం ఆరు కావస్తున్నది. తానానికి చన్నీళ్లు తోడుకున్నది. పెయ్యిమీదున్న పసుపు బట్టలు తీసి ఇసిరేసింది. మెడలోని పసుపుతాడు తెంపి మురికి కాల్వల పారేసింది. రాంపాల్ రెడ్డి తనను ఎక్కడెక్కడైతే తడిమిండో.. అక్కడ సబ్బు – కొబ్బరి పీసుతో రుద్దుకొని తానం చేసింది. పోయిన సంకురాత్రికి పతంగి కొనిచ్చిన పంజాబీ డ్రెస్సు ఏసుకుంది. ‘రేయ్ కుంటోడా! అన్నీ నూ ఇప్పిచ్చినయేరా! అన్నీ నియ్యే! ఈ సుక్కి గుడా నీదేరా!’ అని వాడికి చెప్పాలనుకుంది.
పరుగులాంటి నడకతో పతంగి గుడిసె కాడికొచ్చింది. గుడిసె తలుపు తెరిసే ఉంది. లోపలికి పోయి చూస్తే పతంగి లేడు. పాత ట్రంకుపెట్టె తెరిచి ఏవో సదురుక పోయినట్టుంది. తనను ఇడ్సివెట్టి ఉండలేక ఎటో
వెళ్లిపోయిండని అర్థమయింది.
గుండె బాదుకుంటూ.. “రేయ్ కుంటోడా! మానం వోతే మంచి మనసుతోటి, మంచి నీళ్లతోటి కడిగేసుకుంటే సుబ్రమైపోతాదిరా! పానం బోతే ఎట్ల బతికేదిరా! నూ నా పానానివిరా కుంటోడా! నూ లేకుండా నేనెట్టా బతికేదిరా!” అంటూ, తల బాదుకుంటూ గోడుగోడున ఏడుస్తూనే ఉంది.మళ్ల ఏదో మతిలకొచ్చి ఏడవటం ఆపేసి.. గబుక్కున లేచి బైటికొచ్చింది. షేరింగ్ ఆటో ఎక్కి.. భగత్నగర్ రైల్స్టేషన్ కాడ దిగింది. స్టేషన్ల అప్పుడే ఓ రైలు వచ్చి ఆగింది.
ఎక్కేటోళ్లు- దిగేటోళ్ల హడావుడితోని స్టేషన్ రద్దీగా ఉంది. ప్లాట్ఫాం మీదికి వచ్చి.. పతంగి కనిపిస్తడేమోనని ఆశగా వెతికింది సుక్కి. రైలు వెనకనుంచి మూడో పెట్టెల పతంగి ఎక్కుతున్నట్లు అగుపడ్డడు. అప్పుడే రైలు కూతేసి కదిలింది. “రేయ్ కుంటోడా! నేనొచ్చినానురా! నూ పోమాకూ! నన్నిడ్సివెట్టి పోమాకురా!” అంటూ రైలెంట ఉరుకుతున్నది సుక్కి. ముందు రాత్రి ఏం తినలేదు. సేటు మీదవడి ఒల్లంతా గుల్ల జేసిండు. నిద్ర లేదు. నిస్సత్తువ. అయినా.. ఎట్టాగైనా పతంగిని ఆపాల్నని ఉరుకుతున్నది. అప్పుడే భుజాన ఉన్న చున్నీ జారి కాళ్లల్ల అడ్డు వడటంతో.. దభిల్లుమని కింద వడిపోయి సోయి దప్పింది సుక్కి.
కిందపడ్డ సుక్కిని జనాలు చూసుకుంట పోతున్నరు గాని.. దగ్గరికొచ్చి లేపినోళ్లు లేరు. గంట గడిచింది. అప్పటిదాక తగ్గిన వాన మళ్ల దంచికొట్టింది. ఆ వానకు సోయిలకొచ్చి లేచి కూర్చున్నది సుక్కి. నుదుటికి తాకిన దెబ్బతోని రక్తం కారుతున్నది. మోకాలికి దెబ్బ తలిగి విపరీతంగా నొప్పి పెడుతున్నది. చేత్తో నుదుటి గాయపు రక్తం తుడుచుకొని, చూసుకొని నవ్వుతున్నది. మోకాలి దెబ్బకు పైజామా చిరిగి కనపడుతున్న గాయానికి ఉమ్మితో అద్దుకుంది. నవ్వుతున్నది.. సిగ్గుపడుతున్నది.. ఏడుస్తున్నది! తనలోతానే మాట్లాడుకుంటున్నది. ఇంతల్నే వేరే రాష్ర్టానికి వెళ్లే ప్యాసింజర్ రైలు వచ్చి నిలబడింది. సుక్కి మెల్లిగా లేచి.. ఓ పెట్టెకాడికి పోయి, దిగుతున్న ఒకాయనను..
“అన్నా! గీ రైలు మా కుంటి పతంగి కాడికి వోతదా?” అనడిగింది. అతను సుక్కి వైపు జాలిగా సూసి.. ‘పాపం’ అనుకొని వెళ్లిపోయిండు. అతని వెనకాలే వస్తున్న ఇంకో యువకుణ్ని కూడా అట్లనే..
“అన్నా! గీ రైలు మా కుంటి పతంగి కాడికి వోతదా?” అనడిగింది.
“ఆ పోతది. కుంటి పతంగి ఊరికి పోతది! పతంగి ఇంటికాణ్నే దింపుతది. ఎక్కు పో!” అన్నడా ఆకతాయి. “ఆ! అట్టయితే ఎక్కుతా! కుంటోడు నా ఇంటోడు! వానింటికే వోత!” అనుకుంటా రైలెక్కింది. బోగి నిండా జనమున్నరు. బోగి తలుపు దగ్గిరే కింద కూకోని.. “కుంటోడే నా ఇంటోడు! వాన్నిడ్సివెడ్తనా? వానికాడికే వోత!” అనుకుంటా.. తనలోతానే గునుక్కుంటా కూకుంది. రైలు మెత్తటి కుదుపులకు నిద్రలోకి జారుకుంది సుక్కి.. పాపం పిచ్చితల్లి!
ఏ గమ్యాలకో.. స్థిమితం లేని ఈ ఒంటరి పయనం? పతంగి – సుక్కి.. సుడిగాలిలో చిక్కిన రెండు చిత్తుకాగితాలు.. రాళ్లల్లోనో.. రప్పల్లోనో?చెత్త కుప్పల్లోనో.. మురికి గుంటల్లోనో?
అట్టడుగు వర్గాల ఆలోచనలు, భావోద్వేగాలే.. సయ్యద్ గఫార్ కథా వస్తువులు. వారి వెతలే.. ఈయన రాసే కథలు! గఫార్ స్వస్థలం నల్లగొండ జిల్లా వాడపల్లి. హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. 1973 నుంచీ కథలు రాస్తున్నారు. మొదటి కథ.. ‘పాపం పండిన రాత్రి’. ‘పంచాయతీ రాజ్ లీడర్’ స్థానిక సంస్థల విశ్లేషణ మాస పత్రికను ఎనిమిదేళ్లు నడిపించారు. స్టేజీ నాటకాల్లో నటన, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. 2018లో ‘జనన వాంగ్మూలం’ కవితా సంపుటిని వెలువరించారు. నమస్తే తెలంగాణ – ముల్కనూరు ప్రజా గ్రంథాలయం నిర్వహించిన కథల పోటీల్లో.. ఖుర్బానీ, నషా, ఉల్టాబాజా, మరో ప్రేమకావ్యం కథలకు వరుసగా బహుమతులు దక్కించుకున్నారు. తెలుగు నాటక కళా పరిషత్తు వైజాగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు కథా, నాటక పోటీల్లో ‘మౌనధ్వని’ నాటికకు ప్రత్యేక బహుమతి లభించింది. నవతెలంగాణ పత్రిక నిర్వహించిన బండారు అచ్చమాంబ స్మారక కథలపోటీలో ‘హంస’ కథకు మొదటి బహుమతి వచ్చింది. ఈ కథను ‘హంస’ పేరుతో స్వీయ దర్శకత్వంలో లఘుచిత్రంగా నిర్మించారు. ‘ఖుర్బానీ’ కథల సంపుటి, ‘మౌనధ్వని’ నాటికను పుస్తకం రూపంలో తీసుకువచ్చారు.
-సయ్యద్ గఫార్
81432 53116