Kasi Majili Kathalu Episode 87 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : భోజరాజు పాలించే ధారానగరంలో అగ్నిశిఖుడు అనే ఛాందసుడు ఉండేవాడు. ఆయన ఒకసారి తన తండ్రిగారి తద్దినాన్ని నిర్వహిస్తూ.. మహాకవి కాళిదాసు, యోగి అయిన జ్ఞానతీర్థుల ఆశీస్సులు పొందాడు. ఆ కారణంగా ఆయనకు ముగ్గురు పిల్లలు కలిగారు. అయితే ఆ కుటుంబాన్ని ధారానగరంలోని కులీనులు వెలివేశారు.
అగ్నిశిఖుని కుటుంబాన్ని ఊరంతా వెలివేసింది. వెలిని తట్టుకుని, ఆ కుటుంబం ఎలాగో నెట్టుకొస్తున్నది. కాలగతిలో అగ్నిశిఖుడు మరణించాడు. చిన్నపిల్లలు ముగ్గురూ ఏమవుతారోననే ఆలోచన కూడా లేకుండా ఆయన భార్య సతీసహగమనం చేసింది. అప్పటికే కొద్దిగా ఊహ వచ్చినవాళ్లు కావడంతో మగపిల్లలిద్దరూ తమ చెల్లెలైన పితృదత్తను కంటికి రెప్పలా కాపాడసాగారు. వెలికి గురైన కుటుంబం కావడంతో తమకు తామే గురువులై.. తండ్రి వదిలివెళ్లిన గ్రంథాలయాన్ని ఆధారం చేసుకుని, జ్ఞానవంతులయ్యారు.
తండ్రికి ప్రాణస్నేహితుడైన అగ్నిమిత్రుడు మాత్రమే వారికి ఆ ఊరిలో సహాయకారిగా ఉండేవాడు. పితృదత్త యుక్తవయసుకు వచ్చింది. అన్నలకు వంట చేసిపెట్టడం, ఇంటి నిర్వహణ తానే స్వయంగా చూసుకోసాగింది. తీరిక వేళల్లో అన్నలు బోధించే కావ్యపాఠాలను చక్కగా నేర్చింది. పనిపాటల్లోనూ, చదువులోనూ ఆరితేరిన తమ చెల్లెలికి మంచి సంబంధం కుదిర్చి పెళ్లి చేయాలని అన్నలిద్దరూ ఎంతగానో ప్రయత్నించారు. అగ్నిమిత్రుడు కూడా అనేక ప్రయత్నాలు చేసి..
“మీరు వెలిలో ఉండటం వల్ల చుట్టుపక్కల ఊళ్లలో మీకు సంబంధాలు కుదిరేలా లేవు. కనుక మీరు ఈ ఊరు వదిలి ఎక్కడికైనా వలసపోండి” అని సలహా చెప్పాడు. ఆ విషయం గురించే అన్నదమ్ములిద్దరూ ఆలోచిస్తూ ఉండగా.. అనుకోని ఉపద్రవం ఒకటి వచ్చిపడింది.
ఉదయాన్నే ఏటికి వెళ్లి నీళ్లు తీసుకురావడం తప్ప, ఎన్నడూ ఇల్లుదాటి బయట కాలుపెట్టి ఎరగకపోయినా.. ఏ పురుషుడి ముఖం చూడకపోయినా.. లోకవాసనలు తెలియనిదైనా.. పుస్తకాలే చెలికత్తెలుగా, పురాణగాథలే బంధువులుగా పెరిగినదైనా.. పితృదత్త గర్భిణి అయింది. మొదట్లో తిన్న అన్నం అరిగించుకోలేక, వాంతులు చేసుకోసాగింది. అది రోగవికారం అనుకుని కొంతకాలం మందులిప్పించారు. లాభం లేకపోయింది.
మరికొన్ని దినాలు గడిచేసరికి ఆమె నడక మందగించింది. పాలిండ్లు బిగువై, ముఖం తెల్లబడసాగింది. మూడునెలలు దాటేసరికి గర్భచిహ్నాలు బయటపడ్డాయి. అన్నలిద్దరికీ అనుమానం తోచింది. ఇంటిలో పనిచేసే దాదిని అడిగి, ఆ విషయాన్ని రూఢిపరుచుకున్న తరువాత.. ఏం చేయాలో ఇద్దరికీ తోచలేదు. ఉన్నది తాము ముగ్గురే.
పాపం ఆ అన్నదమ్ములిద్దరూ ఒకరిపై ఒకరికి మనసులో కలిగిన అనుమానాన్ని దాచుకోలేక, బయటపడి అడగలేక చాలా సతమతమయ్యారు. చివరికి ఒకనాటి రాత్రి ఇద్దరూ ఎవరికీ చెప్పకుండా ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోయారు. వెళ్లేముందు చెల్లెలి బాధ్యతను రెండోవారిపై పెడుతూ.. ఉత్తరాలు రాసిపెట్టారు.తెల్లవారిన తరువాత అన్నలు రాసిపెట్టి వెళ్లిన ఉత్తరాలు చూసుకున్న పితృదత్త గుండెలవిసేలా ఏడ్చింది. దాది వచ్చి, ఆమెను ఓదార్చింది.
“ఓసీ! నేను గర్భవతినయ్యానా? ఆ విషయం నాకే తెలియదు కదా.. మా అన్నలకెలా తెలిసింది? అసలు గర్భచిహ్నాలెలా ఉంటాయి?” అని అమాయకంగా అడిగింది పితృదత్త.
ఆ మాటతో ఆశ్చర్యపోయింది దాది.
“ఆహా! నీకే తెలియకుండా గర్భమైందా?! నీ ఒడలు, నీ నడుము, నీ మొగము చూసుకో! నీకే తెలుస్తుంది. అయినా పెళ్లికాని పిల్లవు. మీది గొప్ప వంశం కదా. ఇటువంటి పాడుపని ఎలా చేశావు? ఇన్నాళ్లూ నిన్ను బాధపెట్టడం ఎందుకులే అని ఊరుకున్నాను. ఇకనైనా నువ్వు ఎవరితో భోగించావో చెప్పు” అని అడిగింది. అందుకు పితృదత్త..
“భోగమంటే ఏమిటి?” అన్నది.
“ఎంత నంగనాచివి?! భోగమంటే ఏమిటో తెలియకుండానే ఇంత పొట్ట పెంచుకున్నావా? చాలు చాలు. నిజం చెప్పు” అన్నది దాది.. బుగ్గలు నొక్కుకుంటూ.ఏమని సమాధానం చెప్పాలో తెలియక పితృదత్త గోలుగోలుమని విలపించసాగింది. అప్పుడు దాది బాగా ఆలోచించి, అగ్నిమిత్రుణ్ని తీసుకువచ్చింది.
“బాబాయి గారూ! మీ పాదాలమీద ఒట్టు. నేనే పాపమూ ఎరగను. దైవశోధన చేసి, నేను అపరాధినైతే నన్ను చంపండి. మీరు చంపకపోయినా నేనే ఆత్మహత్య చేసుకుంటాను. సోదరులిద్దరూ వేరైపోయిన తరువాత నేను బతికుండటం ఎందుకు?!” అని మళ్లీ రోదించింది పితృదత్త.అగ్నిమిత్రుడు ఆమెను ఊరడించి..
“అమ్మా! నీ సుగుణాలు ఎరిగిన వారెవరూ నిన్ను దూషించరు. నీ నిర్దోషిత్వాన్ని భగవంతుడే నిరూపించకపోడు. తొందరపడకు. ఈమధ్య నీకేదైనా కల వచ్చిందేమో గుర్తుచేసుకుని చెప్పు” అని అడిగాడు.
అందుకు పితృదత్త కాసేపు ఆలోచించి..
“కొన్ని నెలల కిందట ఒకనాటి అర్ధరాత్రి వేళలో సరిగా గుర్తించలేని ఒక పురుషాకారం నా మంచం మీద కూర్చుని ఏదేదో చేసినట్లు కల వచ్చింది. నేను ఆ కలను గురించి ఎవరికీ చెప్పలేదు. అసలు దానిమాటే మరిచిపోయాను” అన్నది.ఆ మాటవిని అగ్నిమిత్రుడు సంతోషించి..
“సరిసరి. లోకంలో ఇటువంటి చిత్రాలు జరుగుతుంటాయి. బాధపడకు! అప్పటికి నీకది కలే కానీ, వేరొకరెవరికో కాదన్నమాట. అటువంటి వారెవరో త్వరలోనే నీకే తెలుస్తుంది. నీకు చక్కని కొడుకు పుడతాడు” అని చెప్పి వెళ్లిపోయాడు. పురుష సంపర్కం లేకుండానే, కేవలం ఒక కల కారణంగా.. పెళ్లికాని పితృదత్త గర్భవతి అయిందనే వార్త ధారానగరంలో వ్యాపించిపోయింది. వీధి అరుగుల మీద, రచ్చబండల మీద పురుషులు ఈ విషయాన్ని గురించే ఎక్కువగా ముచ్చటించుకునేవారు. రేవుల వద్ద అమ్మలక్కలు చెవులు కొరుక్కునేవారు.
పితృదత్తకు క్రమంగా నెలలు నిండి, ఒక చక్కని కుమారుడు ఉదయించాడు.ఒకనాడు ఈ సంగతి భోజమహారాజు చెవిన పడింది. మారువేషంలో నగరంలో పర్యటిస్తూ ఉండగా పౌరులు మాట్లాడుకునే మాటలన్నీ ఆయన శ్రద్ధగా విన్నాడు. ‘కలలతోనే కన్యలకు గర్భాలొస్తాయా? అదే జరిగితే ఈ ప్రపంచం నిలబడుతుందా? ఏ ఆడదైనా ధైర్యంగా జీవించగలుగుతుందా? ఆ అగ్నిమిత్రుడు కావాలనే ఇలాంటి పుకారు పుట్టించాడు. ఆమెగారు ఎవడినో మరిగే ఉంటుంది’ అని ఎక్కువమంది అనుకోవడం భోజమహారాజు గమనించాడు. మొత్తంమీద అందరూ ఏదో ఒకవిధంగా పితృదత్తను దూషిస్తున్నవారే! కానీ, ఆ దూషణలలో నిజమెంతో తెలియదు. మరునాడు కొలువుకూటానికి వస్తూనే.. భోజుడు తన ఆస్థానంలోని విద్వత్కవులందరినీ పిలిచి ఒక సమస్యను ఇచ్చాడు.
‘ప్రసూత కన్యాత్మజ మప్యనాథా’.. నాథుడే లేనిదైనా ఒక కన్య కొడుకును కన్నది.. అన్న ఆ సమస్యను చాలామంది పూరించలేక పోయారు. కవిపండితుడైన భవభూతి మాత్రం..
“దూర్వాసుడిచ్చిన వరాన్ని పరీక్షించబోయి.. పతి లేనిదైనా, స్వయంగా ఆయనే పతి కాకపోయినా కేవలం సూర్యుని ప్రభావంతోనే కర్ణుణ్ని కన్నది” అని ఆ సమస్యను పూరించాడు. తరువాత కాళిదాస మహాకవి వంతు వచ్చింది.
ఆయన కళ్లు మూసుకుని.. ధ్యానంలో భోజుని అంతరంగాన్ని గుర్తించాడు.
“మణివంతుడనే నాగరాజుకు కామరూప విద్య తెలుసు. అతడే ఒకనాడు ఏటి ఒడ్డున పితృదత్తను చూసి మోహించాడు. ఆ రాత్రి ఆమె గదిలో ప్రవేశించి నిద్రలో ఆమెతో కూడగా.. ఆమెకు కుమారుడు ఉదయించాడు” అని ఆ సమస్యను పూరించాడు.
భోజుని సమస్యకు సమాధానం దొరికింది. అయినా అంతటితో విడిచిపెట్టకుండా, పితృదత్త సంరక్షకుడైన అగ్నిమిత్రుణ్ని వెంటపెట్టుకుని సూతికా గృహానికి వెళ్లాడు భోజుడు. అప్పటికి ఆమెకు కానుపు వచ్చి నాలుగు దినాలైంది. పొత్తిళ్లలోని బిడ్డను తెప్పించి చూసి..
“ఇతడు దేవతాంశ వల్ల జన్మించినవాడు. సందేహం లేదు” అని పలికాడు. ఆ మాటలు విన్న అగ్నిమిత్రుడు సంతోషించి..
“మహారాజా! ఈ కుటుంబాన్ని ఇరవై ఏళ్లుగా ఊరంతా కలిసి వెలివేసింది. దిక్కులేని ఈ తల్లీ కొడుకులకు మీరే దిక్కు కావాలి” అని కోరాడు. భోజుడు పక్కనే ఉన్న మంత్రితో..
“ప్రతినెలా వీరికి కావలసిన భత్యాన్ని కోటనుంచి పంపండి” అని ఆజ్ఞాపించాడు. అగ్నిమిత్రుణ్ని ఉద్దేశించి..
“మీరు చెప్పిన ఛాందసులను ఇప్పుడే కలుసుకుంటాను. ఇటువంటి వారు మా నగరంలోనే ఉన్నారని ఇంతకాలం గ్రహించలేకపోయాను” అంటూ అప్పటికప్పుడే ఆ వాడకట్టులోని బ్రాహ్మణులందరికీ పెద్ద అయిన సభాపతిని పిలిచాడు.
“నేను దైవశోధన చేసి చెబుతున్నాను. పితృదత్త నిక్కచ్చిగా నిర్దోషి. మణివంతుడనే నాగరాజు ఆమెకు భర్త. అందరితోనూ నా మాటగా చెప్పు.. ఇకనుంచి పితృదత్తకు వెలిని రద్దు చేస్తున్నాను. ఎవరైనా ఆమెను దూరం పెడితే మిమ్మల్ని శిక్షిస్తాను” అని కఠినంగా పలికి వెళ్లిపోయాడు. ఆనాటికి ఊరుకున్నా ఆ ఊరి బ్రాహ్మణ్యం మరునాడు సరిపెట్టుకో లేకపోయింది. ‘మహారాజు శిక్షించినా, కాళిదాసు ధ్యానంలో చూసి చెప్పినా సరే.. మణివంతుడనే పేరు స్పష్టంగా చెప్పినప్పటికీ, పితృదత్త పెళ్లికాకుండా గర్భవతి అయింది కాబట్టి నేరం చేసినట్లే!’ అని రచ్చబండ తీర్మానించింది.
పైకి చెప్పకపోయినా పితృదత్త పట్ల వెలి షరతులను అలాగే కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. పితృదత్త తిలోత్తమ కంటే, రంభకంటే చక్కనిది. అయినా ఎంత చక్కనిది కాకపోతే ఒక దివ్యపురుషుడు ఆమెను కామిస్తాడు?! ఒకసారి ఆమె సొగసును చూసినవాడు ఎవరైనా విరాళిలో వేగిపోక మానడు. అయితే ఆమె ఎన్నడూ పరపురుషుల కంట పడేది కాదు. ఎప్పుడూ కొడుకును చూసుకుంటూ, తీరికవేళలో చదువుకుంటూ ఒంటరిగానే గడుపుతుండేది.
అటువంటి ఆమెకు కూడా నలుగురు పురుషులను చూడకుండా తప్పేది కాదు. భోజమహారాజు ప్రతినెలా ఆమెకు భత్యం నిర్ణయించాడు. ఆ మొత్తాన్ని రాజ పురోహితుడే స్వయంగా అందించాలి. ఆయన వెంట మంత్రి కుమారుడు ఆమెను చూడాలని వెళ్తుండేవాడు. వాళ్లిద్దరూ కాకుండా లెక్కలు రాసే గణకుడు, ధనరక్షణ చేసేందుకు దండనాథుడు కూడా వారింటికి నెలకు ఒకసారి వెళ్లేవారు. అలా వెళ్లి చూసిన ప్రతిసారి వారిలో విరహం పెరుగుతుండేది. పితృదత్త ప్రతిరోజూ తెల్లవారకముందే ఎవరికంటా పడకుండా ఏటికి పోతుందని వారికి ఎలాగో తెలిసింది.
ఒకనాడు ఆమె ఏటికి వెళ్లివస్తుండగా.. మంత్రిపుత్రుడైన లబ్ధవర్ణుడు అడ్డగించాడు. “తరుణీమణీ! నిన్ను చూసింది మొదలు నన్ను మదనుడు రోజురోజుకూ కుంగదీస్తున్నాడు. తాళలేకపోతున్నాను. భోజమహారాజుగారికి మా కుటుంబమంటే చాలా గౌరవం. నువ్వు నా ప్రేమను అంగీకరిస్తే.. నీకు నెలవేతనం పెంచేలా చూస్తాను. నన్ను వద్దంటే ఇప్పుడే నీ పాదాలమీద పడి మరణిస్తాను” అన్నాడు.
అందుకు పితృదత్త కొంచెం ఆలోచించి.. “ఇది సమయం కాదు. రాబోయే శుక్రవారం మా ఇంటికి రా. నీకోసం చూస్తూ ఉంటాను” అని చెప్పి అక్కణ్నుంచి తప్పుకొన్నది.
దైవికంగా పురోహితుడు కూడా ఆనాడే మరోసందులో తారసడ్డాడు. “నీ కొడుక్కిప్పుడు ఏడెనిమిదేళ్లు ఉంటాయా?! నీకా కొడుకునిచ్చిన వాడెవడో తెలియదు. మళ్లీ రాలేదు. ఒకవేళ అటువంటివాడు ఉంటే.. ఈపాటికి మళ్లీ వచ్చి ఉండేవాడు. మహారాజు నేను గీచిన గీత దాటడు. కాళిదాసు నాకు మిత్రుడే. మళ్లీ ఏదో సమస్యనిచ్చి పూరించమని నీమీద అపవాదు రాకుండా నేను చూసుకుంటాను. యవ్వనప్రాయాన్ని వృథాగా పాడు చేసుకోకు. నా అభిలాష తీర్చు” అని కోరాడు.
అతనితో కూడా.. “ఇది సమయం కాదు. వచ్చే శుక్రవారం మా ఇంటికి రండి” అని చెప్పి, నవ్వుతూ వెళ్లిపోయింది పితృదత్త. మరో రెండు సందులు తిరిగేసరికి గణకుడు, దండనాథుడు కూడా ఆమెకు అదే విధంగా ఎదురయ్యారు. పైవాళ్లిద్దరి లాగే విపరీతపు కోరిక కోరనే కోరారు. బెదిరించి, ఆశపెట్టి ఆమెను ఎలాగోలా లొంగదీసుకోవాలని శక్తివంచన లేకుండా మాట్లాడారు. వాళ్లకు కూడా శుక్రవారమే రమ్మని గడువు విధించి, అప్పటికి క్షేమంగా ఇంటికి చేరుకుందామె.
(వచ్చేవారం.. చెక్కపెట్టెలో నాలుగు భూతాలు)
-అనుసృజన: నేతి సూర్యనారాయణ శర్మ