అనుసృజన: నేతి సూర్యనారాయణ శర్మ
జరిగిన కథ : కన్యాకుబ్జ మహారాజు తాళధ్వజునికి ఇరవైమంది రాకుమారులు ఉన్నారు. వారంతా ఐదుగురు చొప్పున నాలుగు దిక్కులకూ దిగ్విజయ యాత్రలకు వెళ్లారు. ఇప్పుడు చివరి ఐదుగురైన..పుష్పకేతుడు, మయూరధ్వజుడు, చిత్రభానుడు, సౌమ్యుడు, పింగళుల వంతు వచ్చింది. ఈ ఐదుగురూ దక్షిణ దిగ్విజయ యాత్ర చేస్తున్నారు..
పుష్పకేతుడు, అతని నలుగురు సోదరులూ… దక్షిణ దిగ్విజయయాత్రలో భాగంగా ఆంధ్ర, కర్ణాటక, కేరళ దేశాలలోని విశేషాలను చూశారు. కాంచీ క్షేత్రాన్ని సేవించి, పాండ్యదేశం మీదుగా స్త్రీరాజ్యాన్ని చేరుకున్నారు.
స్త్రీరాజ్యానికి రాజధాని పుష్పపురం. పది ఆమడల వెడల్పు, పదహారు ఆమడల పొడవు కలిగి.. విశాలమైన వీధులతోనూ, సౌధాలతోనూ కూడుకున్న మహానగరమది. రత్నమకుట అనే మహారాణి ఆ రాజ్యాన్ని పాలిస్తున్నది. రాజపుత్రులు ఐదుగురూ ఆ నగరంలో ఒక భవనాన్ని అద్దెకు తీసుకున్నారు.
“తమ్ములారా! ఈ నగరం స్త్రీ ఏలుబడిలో ఉన్నది. ఆమెతో యుద్ధం పనికిరాదు. కనుక కొంతకాలం ఇక్కడే ఉండి, ఇక్కడి వింతలు చూసి.. మన దారిన పోదాం” అన్నాడు పుష్పకేతుడు.
“ఇంత పెద్దనగరాన్ని మనం ఇంతవరకు చూడలేదు. ఇందులో ఎన్నో విచిత్రాలు ఉండకపోవు. మనం తలోదిక్కుకూ పోయి చూసి వద్దాం” అని సలహా చెప్పాడు మయూరధ్వజుడు.
అప్పటినుంచి ఐదుగురూ ప్రతిరోజూ చక్కగా అలంకరించుకుని.. శృంగారశేఖరుల్లా తలో వీధికి పోయి, విశేషాలు చూసి వచ్చేవారు. రాత్రికి బసలో కలుసుకుని, తాము చూసిన విశేషాలను కలబోసుకునేవారు. ఆవిధంగా మూడురోజులు గడిచాయి.
నాలుగోరోజున పుష్పకేతుడు మాత్రమే తిరిగి వచ్చాడు. మిగతావారు రాలేదు. చీకటి పడింది. పుష్పకేతుడు తమ్ముళ్ల కోసం పరితపిస్తూ వీధిలోనే కూర్చున్నాడు. కానీ, రాత్రంతా ఒక్కరూ రాలేదు.
అంతకుముందు రోజు జరిగిన సంభాషణల గురించి ఆలోచిస్తూ..
‘నిన్నరాత్రి మాటల మధ్యలో ఇక్కడి వేశ్యావాటిక చాలా పెద్దదని, స్త్రీలు మంచి నీటుకత్తెలని పింగళుడు చెప్పాడు. బహుశా ఈవేళ అక్కడికే పోయి ఉండొచ్చు. అయ్యో! అక్కడికి పోవద్దని చెప్పాల్సింది. ఏ మాయలాడి మావాణ్ని మోసపుచ్చి లోబరుచుకుందో.. రేపు వెళ్లి తేల్చుకుంటాను’ అనుకున్నాడు.
మరునాడు చక్కగా అలంకరించుకుని, చేత బెత్తం పట్టుకుని వేశ్యావాటికలో ప్రవేశించాడు. అప్పటికింకా సాయంకాలమైనా కాలేదు. ఆ ఇళ్లలోంచి అప్పటికే సంగీతవాద్యాలు వినవస్తున్నాయి. ఆ సంగీతాన్ని వింటూ.. ఆ వీధిలో అన్నిటికంటే ఎత్తయిన అరుగులతో, విచిత్రమైన గోడలతో, ఆకాశాన్నంటే పైకప్పుతో, లతలతో కూర్చిన విశాలమైన సింహద్వారం కలిగి.. రాజప్రాసాదాన్ని తలపిస్తున్న ఒక భవంతిని చూసి ఆశ్చర్యపోయాడు పుష్పకేతుడు.
ద్వారపాలకుని వద్దకు వెళ్లి..
“ఈ మేడ ఎవ్వరిది?” అని ప్రశ్నించాడు.
“అయ్యా! ఆ గోడకు వేలగట్టిన పటాన్ని చదువుకోండి” అని ఆ ద్వారపాలకుడు సమాధానం ఇచ్చాడు.
పుష్పకేతుడు అరుగెక్కి, అక్కడ వేలాడదీసిన పటంలోని విషయాలను చదవసాగాడు.. ఈ భవంతిలో మహారాజరత్నం అనే పేరు కలిగిన వేశ్యారత్నం కాపురం చేస్తున్నది. దీనికి ఎదురుగా ఉన్న చిత్రపటం ఆమెదే! ఆ త్రిభువనైక సుందరికి అరవైనాలుగు కళల్లోనూ సమానమైన పాండిత్యం ఉంది. ఆమె తుచ్ఛులైన విటులను చేరదు; ప్రచండమైన విద్యామదం కలవారిని మాత్రమే వరించగలదు. విద్యావిషయంగా ఆమె వేసే ప్రశ్నలకు సరైన సమాధానం ఇచ్చిన వారు ఆమెను చేపట్టవచ్చు. తతిమ్మావారంతా ఆమె తోటలో పని చేయాల్సి ఉంటుంది. ఇందుకు అంగీకరించిన వారు మాత్రమే ఒడంబడిక పత్రాలపై సంతకాలు చేసి లోపలికి రావాల్సి ఉంటుంది…అని రాసి ఉన్న పటానికి ఎదురుగా వేలాడదీసిన మహారాజరత్నం చిత్రాన్ని కూడా ఓసారి పరిశీలించాడు పుష్పకేతుడు. నిశ్చయంగా ముల్లోకాలలోనూ ఈమెలాంటి సుందరి ఉండబోదు అనిపించింది.
కొద్దిసేపు ఆలోచించిన తర్వాత ద్వారపాలకుని వద్దకు వెళ్లి..
“ఓయీ! నిన్న ఎవరైనా ఈమె ప్రశ్నలకు సమాధానం ఇస్తామని వచ్చారా?” అని ప్రశ్నించాడు.
అందుకు వాడు..
“అవును స్వామీ! నిన్న ఒక చిన్నవాడు.. అచ్చంగా మీలాగే ఉన్నాడు. లోపలికి వెళ్లినవాడు తిరిగి రాలేదు. బహుశా ఈపాటికి తోటలో మొక్కలకు పాదులు తవ్వుకుంటూ ఉండి ఉంటాడు” అని విచారంగా చెప్పాడు.
‘ఆహా! ఈమె విద్యలలో ఎంత ప్రౌఢ కాకపోతే మా పింగళుడినే ఓడించగలదు! వాణ్ని తిరిగి తెచ్చుకోవాలంటే ఈమెను గెలవడం ఒక్కటే ఉపాయం. కాకపోతే ఆమె ఏ విద్యలలో ప్రశ్నిస్తున్నదో ముందుగా తెలుసుకుని కానీ, లోనికి పోరాదు’ అని మనసులో తలపోశాడు పుష్పకేతుడు.
ఆ ఇంటికి వచ్చే – పోయేవారిని గమనించసాగాడు. కొంతసేపటికి ఒక గుర్రపుబండి వచ్చి ఆగింది. పుష్పకేతుడు ఆ బండివాడి దగ్గరికి వెళ్లి..
“ఓరీ! ఈ బండి ఎవరికోసం వచ్చింది?! రాజరత్నం విహారానికి పోతున్నదా?” అని ప్రశ్నించాడు.
అందుకు వాడు..
“కాదు స్వామీ! ఆమె పరిచారిక కోసం తెచ్చాను” అని చెప్పాడు.
పుష్పకేతుడు ఎవరూ చూడకుండా ఆ బండి వెనుక నక్కి కూర్చున్నాడు. రత్నకేసరి అనే పరిచారిక కొంతసేపటికి బయటికి వచ్చి బండి ఎక్కింది. ఒక గడియలో బండి ఆమె ఇంటి ముందు ఆగింది.
రాజపుత్రుడు ముందుగా బండి దిగాడు. పరిచారిక లోనికి వెళ్లబోతుండగా..
“రత్నకేసరీ! నీకోసమే నేనిక్కడ వేచి ఉన్నాను”
అని పలికాడు.
ఆ మాటలు విని, ఆమె తెల్లబోయింది.
“అనఘా! మీరెవరో గుర్తురావడం లేదు.
ఇంతకుముందు మీరు నన్ను ఎరుగుదురా?” అని ప్రశ్నించింది.
“నా వృత్తాంతం చాలా ఉంది. నన్ను నువ్వు ఎరుగక పోయినా.. నేను నిన్ను ఎరుగుదును. నీ సుగుణాలు విని, నిన్ను కలుసుకోవాలని వచ్చాను. నీ వల్ల నాకొక సాయం కావాల్సి ఉంది. అందుకుగానూ ఈ రవ్వల ఉంగరాన్ని ముందస్తుగానే కానుకగా అందిస్తున్నాను” అని పలికాడు పుష్పకాంతుడు.
కాంతులీనుతున్న ఆ ఉంగరాన్ని రత్నకేసరి స్వీకరించింది.
“స్వామీ! నా వల్ల కాగల కార్యమేదో సెలవివ్వండి” అని కోరింది.
అప్పుడు పుష్పకాంతుడు..
“నువ్వు రాజరత్నానికి ముఖ్యపరిచారికవు కదా! ఆమె విద్వాంసులను విద్యలలో ఓడిస్తుందట కదా!! ఆ విద్యలేమిటో నీవు ఎరుగుదువా?!” అని ప్రశ్నించాడు.
“ఆ విద్యలేమిటో నాకూ తెలియవు. ఆమె లోపలినుంచి ఏవో సంకేతాలను రాసి పంపుతూ ఉంటుంది. వాటికి తగిన సమాధానాలను వాదనకు వచ్చిన విద్వాంసులు తిరిగి రాసి పంపాలి. తగిన సమాధానం రాకపోతే తోటపనికి నియోగిస్తుంది. ఆమె బయటివారికి కనిపించకుండా.. ఈ సంవాదమంతా మాలాంటి వారి ద్వారా నిర్వహిస్తుంది” అని చెప్పింది రత్నకేసరి.
“నిన్న జరిపిన సంవాదానికి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలను నాకివ్వగలవా?!”.
“దానికేం భాగ్యం.. రేపు ఇదే సమయానికి రండి. తెచ్చిస్తాను” అని చెప్పింది రత్నకేసరి.
ఆ ప్రకారమే పుష్పకేతుడు మరునాడు వెళ్లాడు. ప్రశ్నోత్తరాలతో నిండిన పత్రికలను చూశాడు. వాటిలో లేత ఆకు, జాతమంజరి, గోళ్లునాటిన ఎర్రటి వస్త్రం, నల్లటి వస్త్రం చుట్టిన తమలపాకుల బొమ్మలు ఉన్నాయి.
“ఈ ప్రశ్నలు వేటికీ నిన్నటి కుర్రవాడు సమాధానం చెప్పలేదు. ఇవన్నీ తలతిక్క ప్రశ్నలని చెప్పాడు. అందుకు రాజరత్నం ఇవన్నీ శాస్త్రసమ్మతమే అని చెబుతూ.. ఈ శ్లోకాన్ని పంపింది” అంటూ మరో కాగితాన్ని చేతిలో పెట్టింది.
దానిలో.. ‘నర్మగర్భంగా కామసంకేతాలను పంపేందుకు స్త్రీలు ఉపయోగించే పాటలీ, వస్త్రం, పుష్పం, తాంబూలం వంటివాటిని గురించి ఇప్పుడు చెప్పబోతున్నాం’ అని అర్థం వచ్చే శ్లోకం మాత్రమే ఉంది.
“సరే!” అంటూ అక్కడినుంచి వెళ్లిపోయాడు పుష్పకేతుడు.
సత్రానికి చేరుకొని రాత్రంతా ఆ శ్లోకాన్ని గురించే పదేపదే ఆలోచించుకుంటూ ఉండిపోయాడు.
‘మేం కామశాస్ర్తాన్ని కూలంకషంగా చదువుకున్నాం. కానీ, పద్మశ్రీ అనే బౌద్ధబిక్షువు రచించిన నాగర సర్వస్వం మాత్రం చదువుకోలేదు. బహుశా ఈ శ్లోకం అందులోది కావచ్చు. దానిని సంపాదించి చదివితే సరిపోతుంది’ అనే నిర్ణయానికి వచ్చాడు.
మరునాడే నగరంలో ఉన్న పుస్తక భాండాగారానికి వెళ్లి, నాగర సర్వస్వాన్ని తీసుకుని, మూడుసార్లు ఆమూలాగ్రం చదివాడు. అందులో..
సకల కళాపాండిత్యం కలిగిన కలకంఠిని కలుసుకోవడమే కష్టం. దైవం అనుకూలించి, అటువంటి స్త్రీతో సంగమం కలిగినప్పుడు.. ఆమె చేసే సంకేతాలు తెలియనివారు తప్పకుండా పరాభవం పొందగలరు.. అంటూ మొదలుపెట్టి, స్త్రీలు పంపే అనేక సంకేతాలను, వాటికి పురుషులు ఇవ్వదగిన సమాధానాలను శ్లోకాల రూపంలో రచయిత పొందుపరిచాడు.
వాటిని కూలంకషంగా చదివిన తర్వాత, మరునాడు సాయంకాలమే తగిన వేషంతో రాజరత్నం ఇంటికి వెళ్లాడు పుష్పకేతుడు. అరుగెక్కి, ఎవరినీ అడగకుండానే గుమ్మంలోని గంట మోగించాడు.
ఒక భటుడు ఇవతలికి వచ్చి..
“అయ్యా! రాజరత్నంతో ప్రసంగిస్తారా? ప్రకటన చదువుకున్నారా!? ఒడంబడిక మీద సంతకం చేస్తారా?!” అని ప్రశ్నించాడు.
పుష్పకేతుడు పత్రంమీద సంతకం చేశాడు. పరిచారికలు అతణ్ని లోనికి తీసుకువెళ్లారు. కాళ్లు కడిగి, నివాళి ఇచ్చి, సవినయంగా విచిత్రమైన అలంకారాలతో కూడిన గదిలో సముచిత ఆసనంపై కూర్చోబెట్టారు. పానీయం అందించారు. గోడలపై వేలాడగట్టిన చిత్రపటాలను గమనిస్తున్నాడతను.
వాడుక ప్రకారం పరిచారిక, లేత ఆకులు ఉంచిన బంగారు పళ్లేన్ని తీసుకొచ్చి.. అతని ముందు పెట్టింది. వేరొక పళ్లెంలో మరికొన్ని వస్తువులు ఉన్నాయి.
‘నీ కులం ఏమిటి?’ అని అడగడానికి లేత ఆకులు సంకేతమని నాగర సర్వస్వం చెబుతున్నది. పుష్పకేతుడు అప్పుడు.. వేరుగా ఉన్న పళ్లెంలో నుంచి పనసతొనను తీసి బంగారు పళ్లెంలో ఉంచాడు. దాని ప్రకారం.. అతడు తనది క్షత్రియజాతి అని చెప్పినట్లయింది.
తరువాత రాజరత్నం లోపలినుంచి విదియనాటి చంద్రుడి చిత్రాన్ని గీసి పంపింది. అంటే, ‘నువ్వు రాజపుత్రుడివా?’ అని ప్రశ్నించినట్లు అర్థం చేసుకుని.. ‘నేను కేవలం రాజపుత్రుణ్నే కాను, భూపతిని కూడా!’ అని అర్థం వచ్చేలా మేఘం రంగును పుష్పకేతుడు రాసి పంపాడు.
తరువాత రాజరత్నం ‘పోటలీ’ అనే పేరుగల ప్రశ్నను ప్రయోగించింది. మైనాన్ని ముద్దగా చేసి, దానిపై ఐదుగోళ్లు నాటించి, దానికి ఎర్రని వస్ర్తాన్ని చుట్టింది. ఎర్రని వస్ర్తాన్ని చుట్టడం వల్ల నీయందు అనురాగం కలదని, అంతకుముందు తనకు వేరే ఏ పురుషునితోనూ పరిచయం లేదని, ఐదుగోళ్లు గుచ్చడం చేత మన్మథబాణాల బాధ ఎక్కువగా ఉన్నదని స్త్రీ అభిప్రాయం.
దానికి బదులుగా పుష్పకేతుడు ఎర్రని వస్ర్తాన్ని తీసివేసి, చిల్లులు పడిన వస్ర్తాన్ని మైనానికి చుట్టి పంపాడు. నా దేహం మన్మథునిచేత చిల్లులు చేయబడినది అని బదులిచ్చినట్లయింది.
ఆ తరువాత రాజరత్నం తాంబూల ప్రశ్న వేసింది. ఈ ప్రశ్నలో తాంబూలాన్ని ఐదు రకాలుగా చుడతారు. మొదటిది పుల్లలాగా నిలువుగా కట్టే తాంబూలం. దానిని కౌశలం అంటారు. అంకుశం ఆకారంలో ఉండేది రెండో రీతి. త్రికోణాకారంలో ఉండి మధ్యలో బాణాకారంగా ఉండే కందర్పం మూడోరకం. మంచంలా దీర్ఘచతురస్రంగా ఉండే తాంబూలాన్ని పర్యంకమని పిలుస్తారు. ఇక చతురస్రం నాలుగు కోణాలతో ఉంటుంది.
ఈ ఐదింటిలో పర్యంకం అనే రీతిలో తాంబూలాన్ని పంపింది రాజరత్నం. దానికి సంగమానికి రమ్మని పిలవడమే సంకేతార్థం. తనకూ ఇష్టమేనని తెలుపుతూ.. తాంబూలానికి మంచిగంధం రాసి పంపాడు పుష్పకేతుడు.
రాజరత్నం నుంచి తిరుగు జవాబు వచ్చింది.
‘ఎడమచేతి మధ్యాంగుళి నడిమిరేఖనాడు మళ్లీ రావలసింది’ అని రాసి ఉందా ఉత్తరంలో.ఎడమచేయి శుక్లపక్షం. చిటికెనవేలి మొదటిరేఖ నుంచి బొటనవేలి చివరిరేఖ వరకు ఉన్న పదిహేను రేఖలు పదిహేను తిథులు. ఎడమచేతి మధ్యాంగుళి నడిమిరేఖ అంటే శుక్లపక్ష అష్టమి అని సంకేతార్థం.
కానీ, పుష్పకేతుడు ‘అనామిక నడిమిరేఖకే రాగలను’ అని తిరుగు సందేశం పంపాడు.
చెప్పినట్లుగానే పంచమినాటికి మళ్లీ ఆ ఇంటికి వెళ్లాడు. పరిచారికలు సగౌరవంగా లోనికి తోడ్కొని వెళ్లారు. తాను ముందుగా చూసిన గదినుంచి అనేక కక్ష్యలు దాటించి లోనికి తీసుకువెళ్లారు. చూడబోతే అది వేశ్యాసదనం కాదు.. రాజసౌధమే అనిపించింది.
అతను వెళ్లిన కొద్దిసేపటికే కిరీటం, కేయూరాలు ధరించిన మహారాణి లాంటి స్త్రీ అతని ముందుకు వచ్చి నిలిచింది. కానీ, అంతకుముందు అరుగుమీద చిత్రపటంలో చూసిన రాజరత్నం ఆమె కాదు.
(వచ్చేవారం… మణిమంతుడి అల్లుడు)