జరిగిన కథ : ఉజ్జయినిలో నివసించే మదనాంకుడు విద్యాధర కన్య అయిన రాగవతిపై మోజుకొద్దీ.. ఇల్లు వదిలి హిమాలయాలకు వెళ్లాడు. ఆమెతో కొంతకాలం సుఖించాడు. ఆ తరువాత రాగవతి అతణ్ని తన్ని తరిమేసింది. కాశీ నివాసి చంద్రస్వామి ప్రియురాలిని విడిచిపెట్టి ఉండలేక కోతిగా రూపం మార్చుకున్నాడు. అనుకోకుండా ఆ కోతిరూపంలోనే చిక్కుకుపోయాడు. చంద్రస్వామికి మళ్లీ పూర్వరూపం తీసుకు రావడం కోసం అతనితో కలిసి మదనాంకుడు కాశీకి వెళ్లాడు.
చంద్రస్వామి చెప్పినదానికి మదనాంకుడు అంగీకరించలేదు. “మిత్రమా! ఆ విద్యాధర మీద మోజుకొద్దీ నా జీవితంలో పన్నెండేళ్ల కాలం వృథా చేసుకున్నాను. దానితో గడిపిన రోజులు చూస్తుండగానే క్షణాల్లాగా జారిపోయాయి. ఇంత కష్టపడ్డ తరువాత కూడా పొందిన ఆనందం చాలా స్వల్పమే కదా అని తెలిసివచ్చింది. దానికి ఇప్పుడు వగచి లాభం ఏముంది?! మనం హిమాలయాలు వదిలి వచ్చి అప్పుడే మూడేళ్లకాలం గడిచిపోయింది. మరేమీ ఫరవాలేదు. మరో ఏడాది కాలం పట్టినా సరే.. నీకు మళ్లీ పూర్వరూపం వచ్చిన తరువాతనే నేను తిరిగి ఇంటిమొఖం చూస్తాను” అని గట్టిగా చెప్పాడు మదనాంకుడు.
“పాపం.. నీ తల్లి, భార్య ఎలా ఉన్నారో?! వెళ్లి చూసుకోరాదా?” అని చంద్రస్వామి చెబుతూనే ఉన్నాడు.కానీ మదనాంకుడు వినిపించుకోలేదు. కోతిరూపంలో ఉన్న చంద్రస్వామిని అంటిపెట్టుకుని కాశీలోనే ఏడాదికాలం గడిపాడు. చివరికి ఒకనాడు వాళ్లు ఎదురుచూస్తున్న యోగిని వచ్చింది. ఆమె కాళ్లపై పడి మొక్కుకోగా.. ఒక మూలికను ఉపయోగించి చంద్రస్వామి రూపు మార్చింది. అతను మళ్లీ మామూలు మనిషయ్యాడు.చంద్రస్వామి రూపాన్ని చూసి, మదనాంకుడు ఆనందబాష్పాలు రాల్చాడు.
“నాయనలారా! మనకు సమకూరిన సిద్ధిని ఎప్పుడూ చెడుపనులకు వినియోగించకూడదు. ఏదైనా ఒక సదాశయాన్ని నెరవేర్చుకునే క్రమంలో మనిషికి ఎదురయ్యే ఆటంకాలు తొలగించుకోవడానికే రకరకాల సిద్ధులను గురువులు మనకు అనుగ్రహించారు. వీటిని ఎప్పుడూ మంచిపనులకే వినియోగించుకోవాలి. సిద్ధుల సహాయంతో పరులకు అపకారం చేయాలని ప్రయత్నించినా, దుష్టమైన పద్ధతిలో కాంతలను, కనకాన్ని వశపరుచుకోవాలని ప్రయత్నించినా.. ఆ సిద్ధులే మన పతనానికి కారణమవుతాయి. ఇంకెప్పుడూ ఇటువంటి పనులు చేయబోకు” అని హితబోధ చేసింది యోగిని.
“ఇంత అనుభవం వచ్చిన తరువాత కూడా ఇంకెందుకు చేస్తానమ్మా?! నామీద దయతో నువ్వు నన్ను కాపాడావు అంతేచాలు” అని మరోసారి ఆమెకు మొక్కాడు చంద్రస్వామి.
మిత్రులిద్దరూ మరికొంతకాలం కాశీలోనే గడిపారు. ఆ తరువాత మదనాంకుడు ఉజ్జయినికి బయల్దేరాడు.
“మిత్రమా! నా తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు. నా అన్నవాళ్లెవరూ ఇక్కడ లేరు. నేను కూడా నీతోపాటు ఉజ్జయినికి వచ్చేస్తాను” అని కోరాడు చంద్రస్వామి.
అలా ఇద్దరూ కలిసి ఉజ్జయిని దిశగా ప్రయాణం మొదలుపెట్టారు. మరికొద్దిదూరంలో ఉజ్జయిని ఉందనగా ఊరికి ఇవతల పక్కనే మరో మహానగరం కనిపించింది.
“ఇదేమిటి!? ఈ నగరం ఇంతకుముందు ఇక్కడ లేదే?!” అని ఆశ్చర్యపోతూ లోపలికి ప్రవేశించాడు మదనాంకుడు. చంద్రస్వామి అనుసరించాడు.
ఒక వీధిలోకి వెళ్లేసరికి చాలా కోలాహలం కనిపించింది. రాజమందిరాన్ని తలపించే ఒక పెద్ద భవంతిముందు ఏదో పెద్ద ఉత్సవం జరుగుతున్నది. ఎందరో బీదసాదలు దానాలు స్వీకరించి వెళ్తున్నారు.
‘రత్నాంకులవారు మహానుభావులు’ అని వాళ్లంతా మనసారా పొగుడుతూ వెళ్లడం మదనాంకుడి చెవిన పడింది.
ఆ కోలాహలానికి కొంచెం దూరంలో ఒక ఇంటి అరుగుమీద మదనాంకుడు, చంద్రస్వామి విశ్రాంతి తీసుకోసాగారు. వచ్చేపోయే వాళ్లను గమనిస్తూ కూర్చున్నారు.
కొద్దిసేపటికి అక్కడికి మరో ఇద్దరు ముసలివాళ్లు కూడా వచ్చారు. వాళ్లు తమలో తాము మాట్లాడుకుంటూ..
“ఏదిఏమైనా మన మదనాంకుడి కొడుకు గొప్పవాడయ్యాడు. అంత తెలివైనవాణ్ని నేనింతవరకూ చూడలేదు” అనుకోవడం మదనాంకుడికి వినిపించింది.
‘వీళ్లు చెప్పేది నా పేరే కదా.. నాకు కొడుకు పుట్టాడా?’ అని ఆశ్చర్యపోతూనే మదనాంకుడు వారికి దగ్గరగా జరిగాడు.
“అయ్యా! మదనాంకుడెవరు? అతని కొడుకు చాలా తెలివి కలవాడన్నారు కదా.. అతగాడి తెలివి ఎటువంటిదో చెప్పగలరా?” అని అడిగాడు.
అప్పుడు వాళ్లు కథ చెప్పడం మొదలుపెట్టారు.
ఉజ్జయినిలో మదనాంకుడనే వైశ్యకుమారుడు ఉండేవాడు. అతనికి చిన్నవయసులోనే తండ్రి చనిపోయాడు. తల్లి పెంపకంలో కొంతకాలం బాగానే ఉన్నాడు. పెళ్లి కూడా అయింది. కానీ కుర్రతనం పోలేదు. ఎవరి వలలో పడ్డాడో ఏమయిందో కానీ ఇల్లు విడిచిపెట్టిపోయాడు.
కళ్లలో పెట్టుకుని కాపాడుకున్న కొడుకు కనిపించకపోయేసరికి పాపం.. ఆ తల్లి కంటికిమంటికి ఏకధారగా ఏడ్చింది. బతికున్నంతకాలం ఎడబాయక రక్షిస్తానని బాసచేసి పెళ్లాడిన మొగుడు చెప్పాపెట్టకుండా లేచిపోయేసరికి భార్య కన్నీరుమున్నీరయ్యింది. అప్పుడు మదనాంకుడి తల్లి ధైర్యంగా వ్యవహరించింది. గర్భిణి అయిన కోడల్ని కన్నబిడ్డలా సాకింది. ఆమెకు రత్నాంకుడనే కొడుకు పుట్టాడు. అతగాడు పదేళ్ల వయసు వచ్చేసరికి వర్తకానికి తగిన విద్య నేర్చుకున్నాడు.
ఒకనాడు నాయనమ్మ అతణ్ని పిలిచి..
“నాయనా! ఇప్పటివరకూ నిన్నెలాగో పెంచుకొచ్చాను. ఇంక నాకు ఓపిక లేదు. కుమారపురంలో యక్షదత్తుడనే వైశ్యుడున్నాడట. ఆయన కులాభిమానం చేత వాణిజ్యం చేయగలిగిన కోమట్లకు పెట్టుబడి పెడతాడని వింటున్నాం. నువ్వు ఆయన వద్దకు వెళ్లి, దానంగా అడిగి పెట్టుబడి తీసుకుని, ఏదైనా వ్యాపారం పెట్టుకో. చక్కగా వృద్ధిలోకి రా” అని బోధించింది.
బుద్ధిమంతుడైన రత్నాంకుడు ఆరోజే కుమారపురానికి ప్రయాణం కట్టాడు. యక్షదత్తుని ఇంటికి వెళ్లాడు.
ఆయనకు నమస్కరించి..
“అయ్యా! నాపేరు రత్నాంకుడు. వైశ్యుణ్ని. నా తండ్రి చిన్ననాడే ఇల్లు విడిచిపెట్టి పోయాడు. నాయనమ్మ, అమ్మ నన్ను పెంచుతున్నారు. వర్తకానికి సరిపడే విద్య నేర్చుకున్నాను. పెట్టుబడి కోసం మీరేదైనా ధనం సాయం చేస్తే మీకు జీవితాంతం రుణపడి ఉంటాను” అని పలికాడు.
ఆ మాటలు విన్న యక్షదత్తునికి నవ్వు వచ్చింది. అంత చిన్నపిల్లవాడు వ్యాపారం చేస్తాననడం హాస్యాస్పదంగా అనిపించింది. నవ్వుతూ ఆ వీధిలో ఒకచోట చచ్చిపడి ఉన్న ఎలుకను చూపి..
“పిల్లవాడా! నీకా ఎలుకనే మూలధనంగా ఇస్తున్నాను. నువ్వు తెలివైనవాడివైతే దానిని అమ్మి, పదివేలు సంపాదించు చూద్దాం. నువ్వు తెలివిలేనివాడివైతే నేను కోటి రూపాయలు పెట్టుబడి పెట్టినా అర్ధణా కూడా లాభం సంపాదించలేవు” అని పలికాడు.
రత్నాంకుడు నిరుత్సాహపడకుండా ఒక ఆకుదొన్నె కుట్టి, దానిలో ఎలుకను పట్టుకున్నాడు. అంగళ్ల వెంట ‘ఎలుకో ఎలుక’ అని అరుస్తూ తిరగసాగాడు. ఒకచోట ఒక వర్తకుడు ఎలుకల బాధపడలేక పిల్లిని పెంచుకుంటున్నాడు. ఆ పిల్లికి ఆహారం కోసం రత్నాంకుడి వద్ద చచ్చిన ఎలుకను తీసుకుని, అర్ధసేరు శనగలు రత్నాంకుడి ఉత్తరీయంలో పోశాడు.
రత్నాంకుడు ఆ శనగలు మూటకట్టుకుని పోయి, నీళ్లలో నానబెట్టాడు. చక్కగా వేయించి, ఉప్పు, కారం కలిపాడు. ఒక కుండలో మంచినీళ్లతోపాటు ఆ శనగల్ని తీసుకుని, ఊరిబయటికి పోయి ఒక చెట్టునీడలో కూర్చున్నాడు.
ఆ దారిలో అడవినుంచి పుల్లలు కొట్టుకుని, మోపులు నెత్తినెత్తుకుని వచ్చేవాళ్లకు శనగల్ని అమ్మజూపాడు. నలుగురు శ్రామికులు తినేసరికి రత్నాంకుడు తెచ్చిన శనగలు అయిపోయాయి. మిగిలినవాళ్లకు చల్లటి మంచినీళ్లు పోశాడు. వాళ్లు తలో రెండుకట్టెలు రత్నాంకుడి ముందు పారేసి పోయారు.
రత్నాంకుడు ఆ కట్టెలు తీసుకుపోయి.. తనకు శనగలిచ్చిన వర్తకుడికే ఇచ్చాడు. మరికొంచెం పెద్దమొత్తంలో శనగలు తెచ్చుకున్నాడు. మరునాడు కూడా శనగలు అమ్మి, కట్టెలు పోగు చేసుకున్నాడు.
ఈసారి ఎక్కువగా కట్టెలు పోగుపడ్డాయి. అర్ధసేరు శనగలతో మొదలుపెట్టిన వ్యాపారం.. రెండుకుంచాల వరకూ పెరిగింది. ఆ పైన శనగలకు గిరాకీ లేదు. ఆ వ్యాపారం అలా కొంతకాలం కొనసాగింది.
రత్నాంకుడి వద్ద రోజుకు నాలుగు కావళ్ల కట్టెపుల్లలు పోగుపడసాగాయి. అవన్నీ ఒకేరోజు అమ్మేసి శనగలు కొనక్కరలేదు కనుక, మదుపు చేయడం కోసం పెరట్లో ఒక చూరుకింద జాగ్రత్తగా దాచి ఉంచాడు.
ఒకసారి ముసురుపట్టి నాలుగురోజులు ఎడతెరిపిలేని వానలు పడ్డాయి. దాంతో ఎండుకట్టెలకు కరువొచ్చింది. సమయం చూసి తన దగ్గరున్న కట్టెలన్నీ అమ్మేయడం వల్ల రత్నాంకుడికి నూరుమాడల ఆదాయం ఒక్కసారిగా వచ్చింది.
ఆ లాభంతో ఏకంగా కట్టెల అడితి తెరిచాడు. తాను రోజూ ఎవరికైతే శనగలమ్మేవాడో.. వాళ్లదగ్గరనుంచి నేరుగా తానే కట్టెలు కొని, జనాలందరికీ విక్రయించసాగాడు. కొంతకాలానికి ఆ వ్యాపారంలో లాభాలు గడించాడు. దానిని విడిచిపెట్టి ధాన్యవర్తకం మొదలుపెట్టాడు. ధాన్యం నుంచి వస్ర్తాలు, అక్కణ్నుంచి రత్నాల వర్తకం వరకూ వచ్చాడు.
కేవలం రెండుమూడేళ్ల వ్యవధిలోనే చచ్చిన ఎలుకను మూలధనంగా తీసుకుని, రత్నాలవర్తకం వరకూ ఎలా వచ్చాడో ఎవరూ ఊహించలేకపోయారు. కానీ, రత్నాంకుడి పేరు నిజంగా సార్థకమైంది. మట్టిలో మాణిక్యం అయ్యాడు.
అలా ఉండగా ఒకనాడు రత్నాంకుడు వీసెడు బంగారంతో ఎలుకను తయారు చేయించాడు. రత్నాలు పొదిగిన వెండిబోనులో ఆ ఎలుకను ఉంచి మేళతాళాలతో యక్షదత్తుని ఇంటికి వెళ్లాడు.
“ఏమయ్యా! ఏమిటీ జంజాటం” అని అడిగాడు యక్షదత్తుడు.
“అయ్యా! మీరానాడు నాకు మూలధనంగా ఇచ్చిన ఎలుక వల్ల నేను కోటీశ్వరుణ్ని కాగలిగాను. కృతజ్ఞతా సూచకంగా ఈ కాంచన మూషికాన్ని మీకు కానుకగా సమర్పిస్తున్నాను. దయచేసి స్వీకరించండి” అని వేడుకున్నాడు రత్నాంకుడు.
యక్షదత్తుడు ఆశ్చర్యపోతూ..
“అసాధ్యుడిలా ఉన్నావే!” అన్నాడు.
అతనిచ్చిన కానుకను తీసుకుని, ఇంటిలోకి తీసుకుపోయి సత్కరించాడు. తన ఒక్కగానొక్క కూతురినిచ్చి పెళ్లిచేశాడు. మామగారి ఆస్తికూడా కలవడంతో రత్నాంకుడు దేశంలో ఉన్న ధనవంతుల్లోకెల్లా ధనవంతుడయ్యాడు. నడమంత్రపు సిరి నిలవనే నిలవదు. అడ్డగోలుగా సంపాదించిన సొత్తు ఏదో ఒకదారిలో పోనే పోతుంది. కానీ, అదృష్టవంతుణ్ని చెడగొట్టేవాడు ఉండడు. సొంతకష్టాన్నే నమ్ముకున్నవాడు ఎప్పటికైనా సుఖాలు పొందకపోడు.
రత్నాంకుడి తాత ముత్తాతల కాలంనుంచి వాళ్ల కుటుంబమంతా న్యాయమార్గంలోనే వర్తకం చేసేవారు. బహుశా వారు సంపాదించుకున్న పుణ్యమే మళ్లీ రత్నాంకుడి రూపంలో ఫలించి ఉంటుంది.
.. అంటూ ఆ వృద్ధులు పలికిన మాటలన్నీ ఆలకించిన మదనాంకుడు చాలా సంతోషించాడు.
సాయంత్రం వరకు వేచి చూసిన తరువాత.. మదనాంకుడు, చంద్రస్వామి ఆ భవంతిలోకి వెళ్లారు. తాను వచ్చిన వార్తను తల్లికి పంపించాడు. ఆమె కన్నీరు కారుస్తూ వాకిట్లోకి వచ్చింది. కుమారుణ్ని చూసి కౌగిలించుకుని..
“నాయనా! నువ్వు బతికే ఉన్నావా?! నిన్ను చూడకుండానే చచ్చిపోతానేమో అని తల్లడిల్లిపోతున్నానురా” అంటూ తన కన్నీళ్లతో మదనాంకుని శిరస్సును తడిపింది.
భార్యను చూసి మదనాంకుడు కూడా కన్నీళ్లు కురిపించాడు. ఆమె భర్త పాదాలకు నమస్కరించి దూరంగా నిలబడింది. అంతలో రత్నాంకుడు కూడా తండ్రి ఆగమన వార్త విని అక్కడికి వచ్చాడు.
“తండ్రీ! నేను నీ కుమారుణ్ని. దయలేక నీ తల్లిని, భార్యను విడిచిపెట్టి నువ్వు వెళ్లేనాటికి నేను గర్భస్థుడినై ఉన్నాను. అమ్మ, నాయనమ్మల దయచేత ఎలాగో బతికాను. దైవకృపతో ఇప్పటికి నిన్ను కలుసుకోగలిగాను. కృతార్థుడినయ్యాను” అని పలికాడు.
కొడుకు మాటలు విని సిగ్గుపడుతూ మదనాంకుడు అతణ్ని గుచ్చి ఎత్తి లాలించాడు. ఆ తరువాత భార్యాపిల్లలకు, తల్లికి.. తన స్నేహితుడైన చంద్రస్వామిని పరిచయం చేశాడు. తండ్రి స్నేహితుడు కనుక అతణ్ని తన ఇంటి పురోహితునిగా నియమించుకున్నాడు రత్నాంకుడు. ఆ తరువాత చంద్రస్వామి పెళ్లి చేసుకుని, ఉజ్జయినిలోనే స్థిరపడిపోయాడు.
భార్యాపిల్లలతో హాయిగా జీవితం గడుపుతూ, తన అనుభవాలను యువకులకు చెబుతూ.. వారికి కనువిప్పు కలిగిస్తూ, శేషజీవితాన్ని ఆనందంతో గడిపాడు మదనాంకుడు. రత్నాంకుడు కూడా నీతిగా నిజాయితీగా వ్యాపారం చేస్తూ.. ఉజ్జయిని చుట్టుపక్కల సాటిలేని ధనవంతుడిగా ఎదిగాడు.
ఈ కథ జరిగి ఇప్పటికి ఐదు తరాలు గడిచిపోయాయి. ఇప్పటికీ రత్నాంకుడి వంశంలోని వారు ప్రతిరోజూ ఉదయాన్నే వెండిబోనులో పెట్టిన బంగారు ఎలుకను ముందుగా పూజిస్తారు. ఆ తరువాతే వర్తక వాణిజ్యాలు ఆరంభిస్తుంటారు.
(వచ్చేవారం.. అపురూప వస్తువులు)
అనుసృజన:
-నేతి సూర్యనారాయణ శర్మ