జరిగిన కథ : నాగరాజు వల్ల పితృదత్తకు పుట్టిన ఫణిదత్తుడు.. మల్లయోధుడయ్యాడు. కాశీగంగలో మునిగి, పాతాళానికి వెళ్లాడు. వరుణకన్యకలకు బంధవిముక్తి కల్పించాడు. మిత్రుల దారిద్య్రాన్ని పోగొట్టడానికి.. శశాంకవతి అనే రాజకన్యను రక్షించాడు. ఆమె అతణ్ని ప్రేమించింది. ఫలితంగా గర్భవతి అయింది. రాచనగరు నుంచి ఆ జంట తప్పించుకుపోతుండగా.. దారిమధ్యలో శశాంకవతిని ఎవరో ఎత్తుకుపోయారు.
ఫణిదత్తుడు కొద్దిదూరం వెళ్లేసరికే.. శశాంకవతిని ఎత్తుకుపోతున్న సైన్యం కనిపించింది. నేర్పుగా ఆ సైన్యంలోకి చొచ్చుకుపోయాడు ఫణిదత్తుడు. శత్రువు గుర్రం సమీపానికి తన గుర్రాన్ని లంఘించి, వాణ్ని ఒక్క తన్ను తన్నాడు. ఆ రౌతు కిందపడగానే ఆ గుర్రాన్ని తానెక్కి, రెప్పపాటులో ఆ సమూహం నుంచి ఈవలకు వచ్చాడు. వచ్చేటప్పుడు కిందపడిన రౌతును విడిచిపెట్టకుండా గుర్రపు కాలిగిట్టల చేత తొక్కించడం వల్ల వాడు మరణించాడు. అప్పటికే చీకటి పడుతూ ఉండటంతో.. ఈ సంగతి వారెవరూ గుర్తించలేదు.
ఆ చీకట్లోనే ఫణిదత్తుడు తన గుర్రాన్ని చాలాదూరం నడిపించాడు. అపాయం పూర్తిగా తప్పిందని నిర్ధారణ అయినాక ఒకచోట ఆగి.. శశాంకవతికి బడలిక తీర్చాడు. తెల్లవారింది లగాయతు.. వారి ప్రయాణం మొదలైంది. ఈసారి మళ్లీ చీకటిపడేలోగా.. అడవి దాటాలని మొండిగా ప్రయత్నించాడు ఫణిదత్తుడు. కానీ, ఎంతదూరం వెళ్లినా ఆ అడవికి తుదిమొదలు కనిపించలేదు. ఆ ఇద్దరినీ పగలంతా మోసిమోసి చాలాదూరం పరుగెత్తడం వల్ల ఆ గుర్రం అలిసిపోయి.. ఒకచోట నేలపై పడి, గిలగిలా కొట్టుకుని ప్రాణాలు విడిచింది.
అప్పటికింకా జాము పొద్దుంది. ఇక ఆ పూటకు వారక్కడే ఉండాలని నిశ్చయించుకున్నారు. శశాంకవతికి దాహం కావడంతో ఫణిదత్తుడు ఒక చెట్టెక్కి చూశాడు. దగ్గరలోనే ఒక తటాకం ఉన్నట్లు గమనించి, చెట్టుదిగి..
“నేను వచ్చేదాకా జాగ్రత్తగా ఉండు!” అని ఆమెతో చెప్పి.. శంఖం తీసుకుని వెళ్లాడు.
చెరువుకు వెళ్లి శంఖంలో నీళ్లు పట్టుకుని.. తిరిగి వద్దామని చూసేసరికి చీకటి పడింది. చీకట్లో ఫణిదత్తుడు దారి తప్పాడు. రాత్రంతా ఎంత ప్రయత్నించినా.. తాను ఎక్కణ్నుంచి వచ్చాడో తిరిగి అక్కడికి మాత్రం చేరుకోలేకపోయాడు. తెల్లవారిన తరువాత కూడా అతని ప్రయత్నమంతా వ్యర్థమే అయింది. సుడిగుండంలో పడ్డ కట్టెలా.. పోయిన చోటికే పోతూ, చూసిన తావునే చూస్తూ శశాంకవతిని కలుసుకోలేక మూడురోజులపాటు నానా యాతన పడ్డాడు. చివరికి తామెక్కివచ్చిన గుర్రం చనిపోయిన చోటును కనిపెట్టగలిగాడు. ఏదో జంతువు తినేయగా.. దాని ఎముకలు మాత్రం కనిపించాయి. అది చూస్తూనే.. “హా! శశాంకవతీ!” అని అరిచాడు ఫణిదత్తుడు.
ఆ ప్రాంతమంతా కలియతిరిగాడు. అయినా ఫలితం లేకపోయింది. ఆమె కనిపించలేదు. తన చేతిలోని శంఖాన్ని నీరు కిందికిపోకుండా ఇసుకనేలలో ఒకచోట గుచ్చి.. పక్కనే ఉన్న మద్దిచెట్టెక్కి చూడసాగాడు.
అంతలో అక్కడికి కొందరు కిరాతులు వచ్చారు. వారి నాయకుడు శంఖాన్ని పైకి తీసి చూస్తుండగా ఫణిదత్తుడు చెట్టుదిగి వచ్చాడు.
“ఇది నా శంఖం. నాకిచ్చెయ్!” అని లాక్కోబోయాడు.
ఆ శబర నాయకుడు దానిని ఇవ్వకుండానే..
“నువ్వెవరు? ఇక్కడికెలా వచ్చావు?” అని అడిగాడు.
“నేను, నా భార్య ఈ దారిన పోతుండగా నీటికోసం వెళ్లి.. ఆమెతో విడిపోయాను. ఆమె నీకెక్కడైనా కనిపిస్తే చెప్పగలవా?” అని అడిగాడు ఫణిదత్తుడు.
“అయ్యో! ఆమె నీ భార్యేనా? ఎవరో అనుకున్నాను. పాటలీపుత్రానికి దారి అడిగితే చెప్పాను. ఆమె వెళ్లినదారి నాకు బాగా తెలుసు. నువ్వు వీళ్లవెంట మా ఇంటికి పో. నేను నీ భార్యను తీసుకొచ్చి అప్పగిస్తాను” అన్నాడు శబర నాయకుడు.
“అయితే నా శంఖం నాకిచ్చెయ్యి” అని అడిగాడు ఫణిదత్తుడు.
“నేను తెస్తాలే పో! నీ భార్యకు ఆనవాలుగా చూపవద్దూ!” అన్నాడు శబరుడు.
సరేననుకుని ఫణిదత్తుడు కొందరు కిరాతులతో కలిసి, వాళ్ల గూడేనికి వెళ్లాడు. ఆ రాత్రికి అతిథి మర్యాదలు చక్కగా జరిగాయి. తెల్లవారి నిద్రలేచి చూసుకునేసరికి కాళ్లకు సంకెళ్లు తగిలించి ఉన్నాయి.
దాంతో ఫణిదత్తుడు..
‘అయ్యో మోసపోయాను. నా గ్రహచారం బాగోలేదు కాబోలు. ఆపదల మీద ఆపదలు వస్తున్నాయి’ అనుకున్నాడు.
ఆరోజంతా అతనికి భోజనం లేదు. మరునాడు ఆహారం పట్టుకుని ఒక కన్య వచ్చింది. ఆమె తనను బంధించిన నాయకుడి కూతురు. చూడగానే ఫణిదత్తుణ్ని మోహించింది.
“మహాపురుషా! నువ్వెవరు?! మావాళ్ల చేతిలో ఎలా పడ్డావు?! నిన్ను చూస్తుంటే జాలేస్తున్నది. నువ్వింక మూడునెలల కన్నా ఎక్కువ బతకవు. దసరానాటికి నిన్ను అమ్మోరికి బలిచ్చేస్తారు” అని చెప్పిందామె.
ఆ మాట వినగానే ఫణిదత్తుడు మ్రాన్పడిపోయాడు.
“వీరుడా! నీకొక ఉపాయం చెబుతాను. నన్ను పెళ్లాడితే మా నాన్న నిన్నేమీ చేయడు. ఏమంటావు?”
అన్నదామె మళ్లీ.
అనువుగాని చోట ఎదిరించడం కంటే లొంగినట్లు నటించడమే మేలనుకున్నాడు ఫణిదత్తుడు. ఆమె కోరికకు అంగీకారం తెలిపాడు. ఆనాటినుంచి ఆమె ప్రతిరాత్రీ వచ్చి ఫణిదత్తుడితో కలిసేది. కానీ, ఎంతకోరినా ఫణిదత్తుడి సంకెళ్లు మాత్రం పూర్తిగా తొలగించలేదు. క్రమంగా ఆమె నెలకూడా తప్పింది. అప్పుడిక ఆ విషయం దాచలేక తన తల్లితో చెప్పుకొన్నది. తల్లీకూతుళ్లిద్దరూ కలిసి ఫణిదత్తుడి సంకెళ్లు విడిపించారు.
“అల్లుడుగారూ! మీరిక్కడే ఉంటే మా ఆయన మిమ్మల్ని చంపేస్తాడు. ఎక్కడికైనా వెళ్లి, దసరా తరువాత రండి. అప్పుడాయన ఏమీ చేయలేడు” అన్నది తల్లి.
“అప్పటికి కూడా నువ్వు తిరిగిరాకపోతే నీవల్ల ఒక ప్రాణం అన్యాయంగా పోతుంది” అన్నది కూతురు.
ఫణిదత్తుడు వారి మాటలకు తల ఊపాడు. అక్కణ్నుంచి తానింతకుముందు శశాంకవతితో విడిపోయిన చోటును వెతుక్కుంటూ వెళ్లాడు. అక్కడే ఒకచెట్టుకింద కూర్చుని విచారిస్తుండగా.. వేరొక భిల్ల యువకుడు అక్కడికి వచ్చాడు. ఫణిదత్తుణ్ని ఎగాదిగా చూడసాగాడు.
తనను బంధించింది అతడే అనుకుని, ఫణిదత్తుడు పిడికిలి బిగించి మీదికి ఉరకబోయాడు.
కానీ, ఆ భిల్లుడు చేతులు జోడించి..
“సామీ! నేను మీకు విరోధిని కాదు. ఆప్తుడిని.
శశాంకవతి మీ భార్యే కదా! ఆమెను నేనెరుగుదును” అన్నాడు.
ఆ మాటతో ఫణిదత్తుడికి ఆవేశం పోయి,ఆతురత కలిగింది.
“నిజమా! ఆమెను నువ్వెరుగుదువా? ఆమె ఎక్కడుంది? నాకు చూపగలవా?” అని అడిగాడు.
“నేనెరుగుదును సామీ! ఒకనాడు నేనీ అడవిలో తిరుగుతుండగా.. ఆమె ఒంటరిగా శోకిస్తూ నా కంటపడింది. నేను దగ్గరికి వెళ్లి, వివరాలడిగాను. నమ్మకం కలిగేలాగా మాట్లాడాను. ఆమె మీ కథనంతా నాతో చెప్పింది. ‘నాతో మా పల్లెకు రా. నేను నీ మగణ్ని వెతికి తీసుకొచ్చి అప్పగిస్తాను’ అని చెప్పి, నేనామెను మా ఇంటికి తీసుకుపోయాను. నా ఇల్లాలు ఆమెను చూసి నాతో తగాదా పెట్టుకుంది. కానీ, నీ భార్య తన ఒంటిపై నగలన్నీ ఇవ్వడంతో శాంతించింది. ఆదరంగా చూడసాగింది. అయితే, మా పల్లె చాలా చిన్నది. అక్కడున్నవారందరూ చాలా క్రూరులు. అక్కడే ఉంచితే ఆమెకు ఎప్పటికైనా అపాయం తప్పదని భావించి.. సునాభమనే అగ్రహారంలో మా గురువు విశ్వనాథభట్టుగారి వద్దకు చేర్చాను. ఆయననుంచి ఉపదేశం పొందిన తరువాతనే నేను జంతుబలులు మానుకున్నాను. కులాచారం మానేశానని మా వాళ్లకు నేనంటే కోపం. అదీ సంగతి. పదండి మా గురువుగారి దగ్గరికి పోదాం” అని చెప్పాడు భిల్లుడు.
“బాబూ! చల్లనిమాట చెప్పావు. నువ్వు కిరాతకులంలో పుట్టినా మహర్షి సమానుడవయ్యావు. నీ ఉపకారానికి కృతజ్ఞతలు చెప్పడం తప్ప మరేమీ బహుమతి ఇవ్వలేను. ఆ గ్రామం ఎంతదూరంలో ఉంది? నన్నక్కడికి తీసుకువెళ్లగలవా?” అన్నాడు ఫణిదత్తుడు.
“అయ్యా! ఆమాట మీరు నన్ను ప్రత్యేకంగా అడగాలా? నాతో రండి” అంటూ బయల్దేర దీశాడు భిల్లుడు.
దారి మధ్యలో వారికి అంతకుముందు ఫణిదత్తుణ్ని బంధించిన కిరాతులు కనిపించారు. ఫణిదత్తుణ్ని గుర్తించలేక.. శబర నాయకుడు అతనితో తగాదా పెట్టుకున్నాడు. వాళ్లందరినీ ఫణిదత్తుడు తన పిడిగుద్దులతో మట్టికరిపించాడు. ఆ తరువాత ఆరురోజులకు వాళ్లిద్దరూ విశ్వనాథభట్టు గ్రామం చేరుకున్నారు.
“ఫణిదత్తా! మాది చాలా చిన్న ఊరు. ఇక్కడి కుర్రకారు నుంచి నీ భార్యను కాపాడటం కష్టంగా ఉండటం వల్ల ఆమెను మధురాపురంలో సుబంధుడనే మా మిత్రుని ఇంటికి పంపాను. మీరక్కడికి వెళ్తే ఆమెను కలుసుకోవచ్చు” అని చెప్పి విశ్వనాథభట్టు.. దారి చూపడానికి తన శిష్యుణ్ని తోడిచ్చి పంపాడు.
“మీకు అతను తోడున్నాడు కదా! నాకు సెలవిప్పించండి. ఇల్లువదిలి చాలాకాలమైంది” అన్నాడు
భిల్ల యువకుడు.
సరేనన్నాడు ఫణిదత్తుడు.
మధురాపురానికి వెళ్లేదారిలో, వీరిని ఒక దొంగలముఠా అటకాయించింది. ఫణిదత్తుడు తన చేతిలోని దండంతో ఆ దొంగలలో ఒకణ్ని చావగొట్టాడు. వాడు పడిపోవడం చూసి, మిగిలిన దొంగలు పారిపోయారు. ఆ సందట్లో విశ్వనాథభట్టు శిష్యుడు కూడా అక్కణ్నుంచి పారిపోయాడు.
శశాంకవతిని ఎత్తుకుపోతున్న సైన్యం చేతిలో చావుదెబ్బలు తిన్న ఫణిదత్తుడి స్నేహితులు నలుగురూ.. కొంతకాలానికి మెల్లగా కోలుకున్నారు. తదుపరి మిత్రుణ్ని వెతుక్కుంటూ బయల్దేరారు. ముందుగా వారికి ఫణిదత్తుణ్ని బంధించిన శబర నాయకుడు కనిపించాడు.
“నాకు ఫణిదత్తుడు బాగా తెలుసు. మా ఇంట్లోనే ఉన్నాడు. మా వాళ్లతో వెళ్లండి. చూపిస్తారు” అన్నాడు.
అతని మాటలు నిజమే కాబోలనుకుని ఆ ఊరికి వెళ్లసాగారు మిత్రులు. కానీ, వారి అదృష్టం కొద్దీ దారిలో శశాంకవతిని కాపాడిన భిల్ల యువకుడు తారసపడ్డాడు. జరిగిన సంగతి యావత్తూ వివరించి..
“మీరు ఆ ఊరికి వెళ్లకండి. సునాభ అగ్రహారానికి వెళ్లండి. మా గురువుగారు మధురాపురానికి దారి చూపుతారు” అని చెప్పాడు.
వాళ్లు విశ్వనాథభట్టును కలుసుకుని, అక్కణ్నుంచి మధురాపురానికి వెళ్లారు. సుబంధుడి ఇంటికి వెళ్లి..
“గురువర్యా! మా ఫణిదత్తుణ్ని, శశాంకవతిని మాకు చూపగలరా?” అని కోరారు.
అందుకు సుబంధుడు విచారసముద్రుడై..
“నాయనా! విశ్వనాథుడు ఉత్తముడు. నేను శ్రోత్రియుణ్ని కదా అని ఆ పిల్లను నా దగ్గర దాచి ఉంచాడు. నేను కూడా ఆమెను నా కూతురితో సమానంగా చూసుకుంటున్నాను. ఇలా ఉండగా మొన్నామధ్యన ‘అప్తోర్యామ’మనే యాగం తలపెట్టాను. దానికి కావాల్సిన ధనమంతా ఇవ్వడానికి మా మహారాజు సుయజ్ఞుడు ఒప్పుకొన్నాడు. యాగవిధిలో భాగంగా ఐదు రోజులపాటు రోజూ ఆయన ఇక్కడికి వచ్చేవాడు. ఆ సమయంలో నా భార్య వద్దనే శశాంకవతి కూడా కూర్చునేది. ఆమె రూపాతిశయం మహారాజు దృష్టిని ఆకర్షించింది. ఆమెను గురించి రహస్యంగా ఆరాలు తీశాడు. నన్ను పిలిపించి, ఏకాంతంగా తన మనసులో మాట చెప్పాడు.
‘రాజా! ఇదివరకు నువ్విలాంటి అకృత్యాలు చేసినవాడివి కాదు. ఇప్పుడు మాత్రం నీకున్న మంచిపేరు చెడగొట్టుకోవడం ఎందుకు? ఆమె పతివ్రత. నిన్ను వరించదు. ఆమెతో నీవేమీ సుఖపడగలవు’ అని ఎన్నోరకాలుగా చెప్పి చూశాను. కానీ, అతను అంగీకరించలేదు.
చివరికి విధిలేక ఒకనాడు పేరంటం నెపం పెట్టి నా భార్యను, శశాంకవతిని కోటకు పంపాను. సుయజ్ఞుని తాంబూలపు పెట్టెను మోసే నీలవేణి చాలా చాకచక్యంగా.. శశాంకవతికి మాయమాటలు చెబుతూ నా భార్యనుంచి వేరుచేసి వేరొక గదిలోకి తీసుకుపోయి తాళం పెట్టింది. నా భార్య మొరపెడుతున్నా వినకుండా..
‘ఆమెను తరువాత పంపిస్తాం.. నువ్వు వెళ్లు!’ అంటూ నా భార్యను తరిమేసింది.
ఆమె ఇంటికి వచ్చి నాతో చెప్పి చాలా పరితపించింది.
‘పతివ్రతలను చెరపదలిచినవాడు తానే భ్రష్టుడవుతాడు’ అంటూ ఆమెను ఓదార్చాను.
నేను చేసిన విశ్వాసఘాతుకానికి ప్రాయశ్చిత్తంగా కాశీకి పోవాలనుకుంటున్నాను. మీరు ముందుగా రావడం వల్ల ఈ కథ మీకు చెప్పగలిగాను”.. అని జరిగింది చెప్పాడు.
ఆ మాటలు విని సుబాహుడు..
“అయ్యా! మా ఫణిదత్తుడు మిమ్మల్ని కలుసుకున్నాడా?” అని అడిగాడు.
“లేదు నాయనా!” అని చెప్పాడు సుబంధుడు.
‘సరే!’ అని అక్కణ్నుంచి బయటికి వచ్చి, శశాంకవతిని చెర విడిపించడం ఎలా అన్న విషయమే ఆలోచిస్తూ.. మిత్రులందరూ నగరవీధులలో తిరుగాడసాగారు.
ఒకనాటి సాయంకాలం వారికి ఫణిదత్తుడు కనిపించాడు.
కానీ, అతని చేతులకు, కాళ్లకు సంకెళ్లు తగిలించి ఉన్నాయి. రాజభటులు అతణ్ని బంధించి, ఊరి బయటికి తీసుకుపోతున్నారు.
(వచ్చేవారం.. కలిసొచ్చిన కాలం)
అనుసృజన:
నేతి సూర్యనారాయణ శర్మ