ద్వీపరాజ్యానికి బయల్దేరిన జాయప.. అనుకోని పరిస్థితుల్లో మళ్లీ వెనక్కి వచ్చాడు. కొత్తగా నిర్మితమవుతున్న ఓరుగల్లు పట్టణంలో మిత్రులతో కలిసి తిరుగాడుతున్నాడు. అప్పుడే వచ్చిన ‘సంక్రాంతి’ సంబురాల్లో పాలుపంచుకున్నాడు. అయితే.. పండుగ ముగిసినా రాజధాని అనుమకొండలో సందడి మాత్రం తగ్గలేదు. కారణం.. శివరాత్రి. శైవులైన చక్రవర్తి కుటుంబం, రాజ్య ప్రజలంతా శివుణ్ని కొలిచే పర్వదినం రాబోతున్నదని మిత్రుల ద్వారా తెలుసుకున్నాడు.
డుగ వెనక పండుగ. భరతవర్షమంతా పండుగలే.. సరదాల సందోహాలే! ఇప్పుడు శైవుల హడావుడి మిగతా సరదాలను మించి కనిపిస్తున్నది. ముఖ్యంగా ప్రజల ఆట – పాటలు, కళారూపాలు, శైవ రూపాలుగా ప్రగల్భిస్తున్నాయి.
శైవులు భస్మధారులు. స్మార్తులు గంధం, అక్షతలు కలిపి ధరిస్తారు. ఓ పెద్దమనిషి మోకాళ్లు దాటిన కౌపీనంతో.. ఒడలంతా రాసుకున్న విభూదిరేఖలతో.. శివుని విగ్రహం ఉంచి అలంకరించిన కావడి భుజాన వేసుకుని చేతిలో పెద్దగంట వాయిస్తూ సాగిపోతున్నాడు.
బాటలో పోతున్న పౌరులంతా ఆ శివుని విగ్రహానికి భక్తిగా చేతులు జోడిస్తుండగా.. ఆ శైవుడు మరింత భక్తి ప్రపత్తులతో కావడి కదుపుతున్నాడు.
అది చూసిన జాయప..
“ఆ గుడివద్ద ఇనుప కొక్కెం వీపునకు గుచ్చుకుని వేలాడుతున్న శైవుణ్ని చూశాం. ఇక్కడ మొలగోచితో కావడిలో శివుణ్ని ఉంచుకుని పోతున్న శైవుణ్నీ చూస్తున్నాం. మాట్లాడితే.. ‘హరహర మహాదేవా’ అని అరుస్తున్న శూలధారిని చూశాం. అందరూ శైవులే! అయినా వేరువేరు అలంకరణలతో, వేరువేరు అర్చక విధానాలతో కనిపిస్తున్నారు. అసలు ఎన్ని శైవ విధానాలున్నాయి శెట్టీ?” అని త్రిపుర శెట్టిని అడిగాడు “కాలాముఖులు, లింగాయతులు, కాపాలికులు, పాశుపతులు, వీరశైవులు, ఆరాధ్యులు, స్లావంతులు, జంగమాలు, శివయోగులు, చెంచులు.. అందరూ శైవులే! కొత్త మతం పుచ్చుకుంటే గుర్తులెక్కువ అని సామెత!”.. చెబుతూనే ఫెళ్లున నవ్వాడు శెట్టి. గొంతు తగ్గించమన్నట్లుగా అతణ్ని హెచ్చరించాడు నాగంభట్టు.
దాంతో త్రిపుర శెట్టి గొంతు తగ్గించి..
“మొదట్లో జైనులుగా ఉన్న కాకతీయ రాజులు ఇప్పుడు.. అంటే రెండో బేతరాజు కాలం నుంచి శైవులయ్యారు. ఆయనకు కాలాముఖ శివదీక్ష ఇచ్చినవాడు రామేశ్వర పండితుడు. ఆయన నివాసం శ్రీశైలంలోని మల్లికార్జున శిలామఠం. ఆయనే కాళేశ్వరంలోకూడా లింగప్రతిష్ఠ చేసి మఠం స్థాపించాడు. త్రిలింగదేశం అనే పేరు రావడానికి ప్రధానమైన మూడు దేవాలయాలు శ్రీశైలం, కాళేశ్వరం, శ్రీకాళహస్తి. మూడూ శివాలయాలే. మూడూ కాకతీయుల ఆదరణతో బహుముఖంగా విస్తరిస్తున్నవే. శైవంలో విశేషం ఏమిటంటే కుల, వర్ణభేదం లేదు. ఈ వైదికులు అందరినీ గుళ్లల్లోకి రానివ్వరు కదా.. అందువల్ల శూద్ర, పంచమ కులాల సామాన్యులు ఎక్కువగా శైవులయ్యారు. మరీ ముఖ్యంగా వీరశైవులయ్యారు. వీరశైవుల భక్తి కాస్త అతిగా ఉండగా సిద్ధాంత శైవం అందరినీ కలుపుకొనిపోయేలా ఉంటుంది. పండుగ సందడి మాత్రం వీరశైవులదే. వీళ్లను అసంఖ్యాకులు అంటారు. దీక్షోత్సవం వీరికి ముఖ్యం. ఈ అరుపులు తీవ్రమైన భక్తి భావం, వింతవింత విభూది రేఖలు..
నిప్పుగుండాలు, శివుడి కావళ్లు!”..
వీళ్ల ముచ్చట్లను భంగపరుస్తూ ఓ వీరశైవుడు దగ్గరగా వచ్చి..
“హరహర మహాదేవా.. జై వీరభద్రా..” అని అరిచాడు.
మిత్ర త్రయం కూడా..
“హరహర మహాదేవా!” అని ఉత్సాహంగా అరిచారు.
ఓ కుర్రవాడి మడిచిన వేళ్లపై పికిలిపిట్టలు.. అరచేయి ముడిచి వేలి నాలుగు కణుపులపై జీవంతో కదులుతున్న నాలుగు పికిలిపిట్టలు. అతను నడుస్తూ వింత విన్యాసాలతో చెయ్యి కదపడం గమ్మత్తుగా తోచింది జాయపకు.
అవతలగా ఉన్న దేవాలయం వద్ద మరో ఇద్దరు అలాంటి కుర్రవాళ్లే ఉన్నారు. ఆ పికిలిపిట్టలతో వాళ్లు పికిలిపిట్టల కలహం ఆట ఆడుతున్నారు. జాయప సంభ్రమం చూసి నాగంభట్టు ఆ ఆట విధివిధానాలను వివరించాడు.
మరోవీధిలో గంగిరెద్దుల ఆట, ఇంకోచోట తోలుబొమ్మలాట, మరోచోట నక్క భాగవతం.. అలాగే కావడి నృత్యం. తోలుతో చేసిన ఉరుము అనే వాద్యం ఉరిమినట్లే మోగుతుంది. మెడలో వేసుకుని ఓ పదిమంది వరసగా నిలబడి దానిని వాయిస్తూ పాడుతుంటే.. జాయప నోరు వెళ్లబెట్టి చూసి, మరికాసేపు వాళ్లతో తనూ చిందులు తొక్కాడు. ఈ కళాకారులే మైలార వీరభటులైతే వారి కళోధృతి, భక్తి తీవ్రత తట్టుకోలేనట్లుగా ఉంటాయి. కొన్ని కళారూపాలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. దండరాసకం అనే కళను అప్పటికే కోలాటంగా పిలుస్తున్నారు.
జాయపను ఎక్కువగా ఆకర్షించింది.. సాధారణ ప్రజల పాటల ఆనందం. వాళ్లెప్పుడూ ఏదో ఓ కూనిరాగం తీస్తూ ఉంటారు. వంటచేసే ఆడవాళ్లు, అంగళ్లలో అమ్మేవాళ్లు, కొనేవాళ్లు.. అలాగే పొలాల్లో పనిపాటలు చేసేవాళ్లు, వర్తక బిడారులో కూడా బలింజలు, పెరికలు, ముమ్మూరుదండు తమపని తాము చేసుకుంటూ.. నోటితో ఏదో ఒక పాట.. రాగం.. కూనిరాగం.. హాయిగా గొంతెత్తి పాడుతుంటారు.
అదే కులీనులు, రాజనగరి వర్గాలు పాడరు. ఎప్పుడూ దీక్షగా, దర్పంగా, హుందాగా ప్రవర్తిస్తారు, బతుకుతారు.
అలా సాధారణ ప్రజల స్థానిక తెలుగు మాటలంటే.. వారి పాటలంటే.. జాయపకు రోజురోజుకూ ఇష్టం పెరుగుతున్నది. వీరికి సంస్కృత విద్య లేకున్నా ఉన్న తెలుగుభాషలోనే వారి ఆటలు పాటలు అమోఘం. ఈ పామర జనుల, గ్రామీణుల, సాధారణ ప్రజల జనసాహిత్యాన్ని జానపదం అంటారని.. భవిష్యత్తులో వీటిపై తానొక గ్రంథం రాస్తానని తెలియని జాయప.. ఆయా గేయాలతో, పాటలతో, కూనిరాగాలతో పరవశిస్తున్నాడు. అలాగే వారి ప్రదర్శన కళలు చర్చరి, చిందు, కందుకం, భాండికం, శివప్రియం, కోలాటం.. ఇవన్నీ జాయపకు మరెంతో ఉత్తేజంగా ఉన్నాయి.
శివరాత్రి దగ్గరవుతున్నకొద్దీ.. శైవగీతాలతో, శివనామస్మరణతో రాజధాని మార్మోగిపోతున్నది.
ఆరోజు శివరాత్రి పర్వదినం.
పక్షంరోజులుగా ఎన్నో కళా ప్రక్రియలను చూస్తూ అనుభూతిస్తున్న జాయప మిత్ర బృందం ఆ రోజు కూడా ఉత్సాహంగా వీధుల్లో తిరుగుతూ, ఓ దేవాలయం వద్ద ఉచ్ఛస్వరంతో వినవస్తున్న గానానికి ఆకర్షితులై.. అక్కడికి పరుగులు పెట్టారు.
అది వీరనాట్యం ప్రదర్శన. నాట్యాంశం.. దక్షయజ్ఞం కథ. జాయప బృందం వెళ్లేసరికి శివుడికి, దక్షుడికి వాగ్యుద్ధం.
పాటతో పిచ్చిపిచ్చి చిందులతో ఇద్దరూ గంతులు వేస్తుంటే.. ప్రేక్షకులు పిచ్చెక్కిపోతున్నారు. జాయప బృందం కూడా అందరితో కలిసి ఆనందంగా తిలకించసాగారు.
దక్షుడు, శివుడి ఘర్షణవల్ల సతీదేవి బొటనవేలితో చితి మండించుకుని చనిపోతుంది. అప్పుడు వస్తాడు వీరభద్రుడు. ఆ వీరభద్రుడి పాత్రధారి వచ్చి మహోగ్రంగా నర్తిస్తున్నాడు. రంగస్థలమంతా తిరుగుతూ వీర విహారం చేస్తూ.. బీభత్సం సృష్టిస్తూ నర్తిస్తున్న అతణ్నిచూస్తూ ప్రేక్షకులు పరవశించి పోతున్నారు. మిత్రులందరూ ప్రదర్శనలో లీనమై ఉండగా.. జాయప ఆ వీరభద్రుడు పాత్రధారిని గతంలో చూసినట్లు భావించసాగాడు.
వీరభద్రుడు.. భద్రుడు.. భద్ర! గుర్తొచ్చింది. ఒడలు గగుర్పొడిచింది.
ప్రదర్శన పూర్తయ్యింది. వెళ్లి ఆ నటుడి ముందు నిలబడ్డాడు. నవ్వాడు పలకరింపుగా..
“గుర్తుపట్టావా?” అన్నాడు మెరిసే కళ్లతో. ఆ నటుడు చకితుడై చూశాడు కానీ, జాయపను గుర్తు పట్టలేదు.
“మర్చిపోయావా..? ‘మీ నాన్న బతికేవున్నడా!?’ అని నన్ను అడిగావ్!”..
చిన్నచిన్న నీటి చినుకులు మెల్లగా కలసి ఉవ్వెత్తున కెరటమై ఎగసి దూకినట్లు.. అతనిలో తుంపరల్లాంటి స్మృతి, పూర్తి రూపం తీసుకుంది. అతను భైరవ!
“నువ్వు.. నువ్వు.. ఆ రోజు మా ఇంట్లో అన్నం తిన్నవ్.. కదూ! జాయ.. జాయప నీ పేరు కదూ?!”..
రంగస్థలమంతా వీర విహారం చేస్తూ.. బీభత్సం సృష్టిస్తూ నర్తిస్తున్న అతణ్నిచూస్తూ ప్రేక్షకులు పరవశించి పోతున్నారు. మిత్రులంతా ప్రదర్శనలో లీనమై ఉండగా.. జాయప ఆ వీరభద్రుడు పాత్రధారిని గతంలో చూసినట్లు భావించసాగాడు.
పూర్తిగా ఇద్దరికి నాలుగేళ్ల నాటి సన్నివేశం స్పష్టమైంది. అనుమకొండలో ప్రవేశించిన రోజున యుద్ధంలో మరణించిన గోపయ ఇంట తొలిభోజనం చేశాడు జాయప. అంత దుఖంలోకూడా ఆ తల్లి తన ఆకలి గ్రహించి, తనకు కడుపారా భోజనం పెట్టింది. జాయపను గట్టిగా హత్తుకున్నాడు భైరవ.
“మానాన్న యుద్ధంలో చనిపోయాడని తెలిసి, మా బతుకుల్లో చీకటి మొదలైన రాత్రి నువ్వు వచ్చావ్ జాయపా! మా అమ్మ అన్నం పెట్టింది నీకు. అది మా అక్క ముందుకు నెట్టావ్ నువ్వు. గుర్తుంది మాకు. మేము తర్వాత చాలాసార్లు నువ్వు ఎవ్వరివో.. ఎలా వచ్చావో.. ఎటు వెళ్లావో.. అని మాలో మేము అనుకున్నాం. అమ్మ నిన్ను ఇప్పటికీ తలచుకుంటూనే ఉంటుంది”..
జాయప అతని మాటలకు అడ్డొస్తూ..
“అమ్మ, అక్కా ఎలా ఉన్నారు?” అని అడిగాడు.
“మేము తర్వాత మా ఊరు వెళ్లిపోయాం. అమ్మ అక్కడే ఉంది. అక్క.. ప్చ్! తను శివైక్యం చెందింది.. ఆటలమ్మ సోకి మరణించింది!”.
“అయ్యయ్యో.. అలాగా! అమ్మ.. అమ్మను నేను కలవాలి..” అన్నాడు జాయప.
మరునాడు జాయప, భైరవ వెంట అనుమకొండకు క్రోసెడు దూరంలో ఉన్న అయ్యనవోలు గ్రామానికి వెళ్లాడు. అనుమకొండకు దగ్గరగా ఉన్న ఓ మామూలు గ్రామం అది.
వ్యవసాయ భూములపై పన్నులు, తదనుగుణంగా ఇతర పన్నుల ఆదాయం బాగా ఉండటంతో అడవుల్ని నరికి పంటభూముల్ని విస్తరింపజేయడం ప్రస్తుత అధికార, రాజ్యవ్యవస్థ ప్రధాన కార్యకలాపం.
భైరవ తండ్రి గోపయ యుద్ధ వీరుడుగా మరణించడంతో అతనికి వీరగల్లు నిర్మించారు. అతని స్వగ్రామమైన అయ్యనవోలులో ప్రభుత్వం నాలుగు నివర్తనాల వ్యవసాయ భూమి ఇచ్చింది. అది సాగుచేసుకుంటూ తండ్రికి గుడి నిర్మించాడు భైరవ. అతను గ్రామీణ నాట్యకళాకారుడు. మైలారభటుడు. అయ్యనవోలులో కొండయ అనే నాట్యకారుడు నిర్వహిస్తున్న నాట్య బృందంలో నటుడుగా శైవ కళారూపాలను గ్రామాలలోనూ, అనుమకొండ శైవాలయాల వద్ద ప్రదర్శించడం అతని ప్రధానవ్యాపకం. భక్తి, ఉద్రేకం మూర్తీభవించిన భైరవ ప్రదర్శన.. పామరులను విశేషంగా ఆకట్టుకుంటున్నది.
అయ్యనవోలులో అతని తల్లి రుక్కమను చూసి ఆశ్చర్యపోయాడు జాయప. ఎర్రనిచీర, ఎర్రని రవిక, దానిపై ఎర్రెర్రని ఉత్తరీయం.. తలనుంచి కాలిమట్టెల వరకు ఎరుపు.. పైన విరబోసుకున్న జుట్టు.. ఒడలంతా విభూది రేఖలు! కళ్లలో కూడా ఎరుపు జీరలు.. ఆమె శైవారాధనలో పూర్తిగా లీనమైవుంది. భర్తకు నిర్మించిన వీరగల్లు గుడికి పూజా, నిర్వహణ కూడా ఆమే. ఆమె అంటే గ్రామంలో ఎంతో భయభక్తులు.. ముఖ్యంగా వృత్తికులాల ప్రజలు ఆమెను శివాంశగా కొలుస్తున్నారు.
జాయపను ఆమె గుర్తుపట్టి ఆనందించింది. తనను వెతుక్కుంటూ జాయప రావడం ఆమెను సంతోషపరచింది.
జాయప కోసం ఆమె గోపయ వీరగల్లు గుడిలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించింది. పూజ నిర్వహిస్తూ సాంబ్రాణి పొగల మధ్య పూనకాలతో ఊగిపోతూ.. వేపమండలతో చిందులు తొక్కుతూ, నేటి శైవజీవితానికి ప్రతీకగా కనిపిస్తున్నది రుక్కమ. రాబోయే మాఘమాసం వరకు జాయపను అక్కడే ఉండాల్సిందిగా ఆమె కోరింది.
“ఏమిటి విశేషం?” అన్నాడు జాయప.
మాఘమాసం తొలి రోజున వీరగల్లు గోపయకు జాతర నిర్వహించబోతున్నట్లు.. మెరిసే కళ్లతో చెప్పింది ఆమె.
(సశేషం)
– మత్తి భానుమూర్తి 99893 71284