కోల్కతా: ప్రముఖ కాలేజీలోని విద్యార్థి సంఘం గదిలో చెదలు పట్టిన లక్షలాది డబ్బును గుర్తించారు. అలాగే రహస్య గదుల్లో ఫర్నిచర్, రెండు ఏసీ బెడ్ రూమ్స్, మద్యం సీసాలు, కండోమ్ ప్యాకెట్లు, ఒక రివాల్వర్ కూడా లభించడం కలకలం రేపాయి. (Secret Rooms In College) పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఈ సంఘటన జరిగింది. వర్షాకాలం ప్రారంభానికి ముందే కాలేజీ ప్రాంగణాలను శుభ్రం చేయాలని విద్యా సంస్థలకు అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలో కోల్కతాలోని అత్యంత పురాతన, ప్రతిష్టాత్మక కాలేజీల్లో ఒకటైన సురేంద్రనాథ్ కళాశాలలో క్లీనింగ్ డ్రైవ్ చేపట్టారు.
కాగా, 2019 నుంచి క్యాంపస్ ఎన్నికలు జరగనందున కళాశాలల్లోని యూనియన్ రూమ్లను మూసివేయాలని అప్పటి టీఎంసీ ప్రభుత్వాన్ని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో 2025 నుంచి లాక్ వేసి ఉన్న సురేంద్రనాథ్ కాలేజీలోని విద్యార్థి సంఘం గదిని ఏడాది తర్వాత తెరిచారు. అందులోని అల్మారాలో ఉన్న రెండు సూట్కేసుల్లో చెదలు పట్టి, పాడైన లక్షలాది డబ్బు కనిపించింది.
మరోవైపు కొన్ని గంటల తర్వాత మరిన్ని దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటపడ్డాయి. ఆ కాలేజీలో రహస్య గదులను గుర్తించారు. పాక్షికంగా ఫర్నిచర్ ఉన్న రెండు ఏసీ బెడ్ రూమ్స్, మద్యం సీసాలు, కండోమ్ ప్యాకెట్లు, ఒక రివాల్వర్ లభించాయి. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ కాలేజీకి చేరుకున్నారు. ఆ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.
అయితే గత తృణమూల్ ప్రభుత్వం ‘టెర్రస్ సౌకర్యాలు’గా వీటిని ప్రారంభించినట్లు విమర్శలు వచ్చాయి. టీంఎసీ నేత దేబాశిస్ బంద్యోపాధ్యాయ్, ఆయన కుమారుడు శిభావిస్ ఈ గదులను వినియోగించినట్లు కళాశాల అధికారులు ఆరోపించారు. ఈ గదుల్లో ఉద్యోగులతో ఆ ఇద్దరు నాయకులకు మసాజ్ చేయించుకున్నట్లు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సమగ్ర దర్యాప్తునకు బీజేపీ ప్రభుత్వం ఆదేశించింది.
కాగా, ఈ ఆరోపణలను దేబాశిస్ బంద్యోపాధ్యాయ్ ఖండించారు. ఆ గదుల గురించి తనకు తెలియదని అన్నారు. అయితే ప్రముఖ బెంగాల్ సాహిత్యవేత్తలు, స్వాతంత్ర్య సమరయోధులను అందించిన ఆ పురాతన కళాశాలలో ఇవి బయటపడటం రాజకీయ వివాదం, విమర్శలకు దారి తీసింది.
#Watch | A stack of termite-infested cash worth over Rs 1 lakh was found in two suitcases in a college union room in Kolkata this week.
Read more: https://t.co/C0lDWkXt9D pic.twitter.com/xC4pZEegGv
— NDTV (@ndtv) June 3, 2026