జరిగిన కథ : సైనికులను యుద్ధానికి మానసికంగా సమాయత్తం చెయ్యడంపైనా దృష్టిపెట్టాడు జాయపుడు. అందుకోసం ‘ప్రేరణ’ నాట్యాన్ని మరింత మెరుగుపరచాలన్న ఆలోచన చేశాడు. అటు గజతంత్రం..ఇటు ప్రేరణ నృత్త తంత్రం! అదే సమయంలో స్థపతి రామప కోరిక మేరకు కాకతితో కలిసి శిల్పాల రూపకల్పనలోనూ సాయపడుతున్నాడు. ఓరోజు అనుకోకుండా కాకతి పల్లకిబోయలు రాలేదు. దాంతో ఆమె జాయపుడి అశ్వాన్ని అధిరోహించింది.
ఇద్దరూ ఓ అశ్వంపై వెళ్లడం.. ఇద్దరికీ కొత్త అనుభవం.ఆ దగ్గరితనం శిల్పభంగిమల కంటే మరింత సన్నిహితంగా ఉంది. శిల్పశాలలో పనిపూర్తయ్యాక ఆ రాత్రి ఇద్దరూ పురనివాసం వద్దకు వచ్చారు.
ఏకాంతం.. నిశ్శబ్దం! అందులో యవ్వనోల్బణంలో కొట్టుమిట్టాడుతున్న మిథునం. ఓ అందాల రాజకుమారుడు.. మరో పిచ్చెక్కించే శిల్పభామిని!
పగలంతా తక్కువ ఆహార్యంతో అత్యంత దగ్గరగా మిథున భంగిమలో నిలబడ్డ ఆత్మీయజంట. ఇద్దరి శరీరాలు కోరికల నాగుబాముల్లా బుసకొడుతున్నాయి. మాటలు లేవు. ఇతరేతర అనవసర ప్రసక్తులు అసలే లేవు. ఉన్నది శరీరాల ఉన్మత్త ప్రకంపనలే! ఆమెలో కొంటెదనం ప్రవేశించింది. అది ఉపరతి లాంటిది.
శిల్ప కర్మశాలలో అలంకరించుకున్నట్లు వోణి తీసివేసి, లంగాను పైకిలాగి మోకాళ్లవరకూ ఉంచి.. బొడ్డు కనిపించేలా నడికట్టుకు కట్టింది. వోణి కేవలం శిల్పభంగిమలా స్తనద్వయం మధ్యగా నిలువుగా సాగలాగి ఒంటికి చుట్టింది. ఆమె వేగంగా చేస్తున్న ఆ క్రియ అంతా విభ్రమంగా చూస్తున్నాడు జాయపుడు.
తర్వాత చొరవగా జాయపుని కంచుకం విప్పేసింది. అతని పంచెను లాగబోయింది. కానీ, జాయపుడు అడ్డుపడి ఆమెలా తను కూడా శిల్పభంగిమలకు సమాయత్తమైనట్లు పంచెను తొడలవెంట తిరిగి కట్టి గోసె బిగించాడు.
ఇద్దరూ ఇప్పుడు మిథునశిల్పాల్లా భంగిమలో నిలుచున్నారు. గబుక్కున ఇద్దరూ యుగళగీతంలా నవ్వారు.
దగ్గరగా వచ్చిన బుగ్గలు మాటలులేని భాషలో ఏవో చెప్పుకొన్నాయి. లత్తుకలద్దిన అధరాధరాలు కలబడటానికి సమాయత్తం అవుతున్నాయి. తాకీతాకకుండా తాకుతున్న ఎదురొమ్ములు సున్నితంగా, ఆర్తిగా ఘోషిస్తున్నాయి. తొడలు రాచుకుంటున్నాయి. మోకాళ్లు పలకరించుకుంటున్నాయి. తాకిన ప్రతి భాగాన్నుంచీ ఇద్దరి చేతులూ పాఠాలు నేర్చుకుంటున్నాయి. అతని చేతుల్ని ఆమె అలవోకగా తన కిందిభాగం వైపు పొమ్మని చూపుతో గసిరింది. వినమ్రంగా పాటించిన జాయపుడు అక్కడ తడబడ్డాడు. కంగారుతో తాండవనృత్యం చేశాయి అతని చేతులు. కామోద్రేకంతో అరమోడ్పులయ్యాయి ఆమె కన్నులు. తర్వాత ఇద్దరి నడక శయనాగారం వరకూ.. ఆపై శయ్యాతల్పం వరకూ ఒక్కటై సాగింది. ఆమె ఒరుగుదిండ్లు దగ్గరికి లాక్కుని.. చేతులు వెనక్కు ఎత్తి పెట్టి, మెల్లగా అతనికి వెన్నెల పరుపయ్యింది. అతని శరీరం అతని మాట విననట్లు బాహుమూల రుచి పీలుస్తూ ఆమెపైకి ఎగబాకింది. ఆ రాత్రి నిదురించారో లేదో వారికే ఎరుకలేని రాత్రయింది.
మరునాడు శిల్పశాలలో ఏదో భంగిమ. ఏదేదో గుర్తొచ్చి నవ్వారు ఇద్దరూ రమ్యంగా.. శబ్ద రాహిత్యంగా!
ఎర్రెర్రని కన్నులు అలా ఎందుకున్నాయని ఎవరో అడిగినప్పుడూ.. నీలికలువ పూరేకుల్లా ఉన్న ఆమె కనురెప్పలు సిగ్గుపడి కిందికి వాలగా, మళ్లీ నవ్వారు. ఆ నవ్వులు వారి బుగ్గల్లో పూచాయి ఎర్రెర్రగా! హాలుని ‘గాథాసప్తశతి’లోని ఓ కవనం జాయపుని కళ్లముందు కదలాడింది.
‘నీలికలువ పూరేకుల్లా ఉన్న కనురెప్పలు మూతబడనంతవరకే.. రతిసమయంలో స్త్రీలు చేసే చేష్టలు అందంగా ఉంటవి!’..
అలా మూడు పగళ్లు ఇక్కడ.. మూడు రాత్రుళ్లు అక్కడా గడిచాక, ఇద్దరిలో ఓగొప్ప స్థిరత్వం. చాలాకాలంగా శరీర, మానసాలను ఉక్కిరిబిక్కిరి చేసిన ఏదో తెలియని సలపరం తొలగిపోయినట్లు.. శాంతించిన శరీరాలు.. పులకించిన మానసాలు.. జుంటి తేనెను పూర్తిగా నాకిన తృప్తి!
అప్పుడు మొదలయ్యాయి మాటలు.
“నేను చూశాను.. సంజయ చిత్రించిన నగ్న చిత్రాలు!” అన్నది కాకతి.
గందరగోళంగా చూశాడు జాయపుడు ఆమెవంక.
“నీకు సిగ్గనిపించ లేదా!?” అన్నాడు ఇబ్బందిగా.
ఈసారి ఆమె ఆశ్చర్యపోయింది.
“ఎందుకు??”.
“అదే.. అలా వస్ర్తాలు లేకుండా!”.
“నేను రోజూ నీతో వస్త్రరహితంగానే ఊహించుకుంటున్నాను కదా!”.
సిగ్గుతో కుచించుకుపోయి..
“రాక్షసీ.. సిగ్గులేదు!” అన్నాడు.
ఆమె విరగబడి నవ్వింది.. సర్రున హత్తుకుంది.
జాయపుని తక్కువనిద్ర.. మరింత ఎక్కువయ్యింది.
కాకతి శారీరక దగ్గరితనం వల్ల కొంత.. ఆమె గురించిన ఆలోచనలవల్ల మరికొంత.
కాకతిని వివాహమాడక తప్పదు.. బావగారు అంగీకరించవచ్చా!? వచ్చు వచ్చు.. అక్క.. చదు గాక చదు!
మరి ఇంద్రాణి సంగతి ఏమిటి??
కాకతితో సమాగమం జాయపుని జీవితంలో ఓ ప్రగాఢమైన మార్పునకు నాంది అయ్యింది. ఓ రూపం తీసుకుంటున్న అతని జీవనపథం.. ఓపెద్ద కుదుపునకు లోనయ్యింది. అతని జీవితంలో, వివాహ ఆలోచనల్లో ప్రగాఢ సాన్నిహిత్య భావనలు మోసులెత్తించినవారు ముగ్గురు ముదితలు.. కాకతి, ఇంద్రాణి, లలితాంబ!
కానీ, ఊహాతీతంగా శారీరకంగా ఏకమయ్యింది కాకతి. ఇప్పుడే ఇంద్రాణిని భార్యగా నిర్ణయించారు అక్క, బావ. ఇప్పుడేం చెయ్యాలి!? కిం కర్తవ్యమ్??!!
విధి విచిత్రమేమో.. అప్పుడే అనుకోకుండా అనేకానేక సంఘటనలు జరిగాయి.
నారాంబకు కాకతి విషయం ఎలా చెప్పాలో అనేకానేక రకాలుగా పురనివాసంలో అభ్యాసం చేసి, అంతఃపురానికి వెళ్లాడు జాయపుడు. అక్కడ బావగారు ఉంటే తనకెంతో సహకారం ఉంటుందని తలపోసి.. ఆయన ఉండే సమయం చూసి లోపలికి ప్రవేశించాడు.
అదృష్టవశాత్తూ గణపతిదేవుడు అక్కడే ఉన్నాడు. కానీ, అక్కడి దృశ్యం మాత్రం హృదయవికారంగా ఉంది. మురారి, హరిహరదేవులిద్దరూ గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. వాళ్ల ఏడుపులు మందిరమంతా ప్రతిధ్వనిస్తుంటే.. ఇద్దరూ వారిని పట్టించుకునే ధోరణిలో లేరు.
నారాంబ, గణపతిదేవుడు చెరోవైపు ఆసనాలలో కూర్చుని.. ఎటోచూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. వారి ముఖాలలో తీవ్రమైన విషాదచ్ఛాయలు..
జాయపుని మనసు కీడు శంకించింది.
ఎవరైనా చనిపోయారేమో!? ద్వీపం నుంచి దుర్వార్త ఏమీ రాలేదు కదా!? అదే అనేశాడు.
గణపతిదేవుడు తల తిప్పి మౌనంగా ఓ చూపు చూసి.. మళ్లా తనధోరణిలో పైకి చూడసాగాడు.
నారాంబ మాత్రం ముక్కు చీదుకుని..“నేనే పోతే బావుండేది..” అన్నది.
ఆమె గొంతు నిండా నాలుగైదు దుఃఖసముద్రాల ఘోష! పిల్లల్ని ఎత్తుకుని సముదాయిస్తూ..
“ఏమైంది అక్కా!? ఏమిటీ ఈ విషాదానికి కారణం?” అన్నాడు.
జాయపునిలో ఊహించని ఉత్సుకత పెరిగిపోతున్నది.
నారాంబ లేచి కళ్లొత్తుకుంటూ..“అయినా.. దేనికైనా ప్రాప్తం ఉండొద్దూ! పెట్టి పుట్టుండాలి..” అన్నది.
జాయపుడు ఏదో అనబోయేంతలో మళ్లీ తనే..“నువ్వేం బాధపడకురా జాయా! ఇంతకంటే మహత్తరమైన సంబంధం రేపీపాటికి సిద్ధం చేసేస్తాను!” అన్నది.
‘నేను బాధపడటం ఏమిటి!?..’ అర్థం కాలేదు జాయపునికి.“అసలు సంగతి ఏమిటో చెప్పక్కా..” అన్నాడు విసుగ్గా.
“ఆ మహాగాయని ఇంద్రాణిదేవి గారికి మన సంబంధం ఇష్టం లేదట. ఈ ప్రతిపాదన విరమించుకుంటున్నట్లు వార్త పంపించారు!”.
క్షణకాలం ఏమీ అర్థంకాలేదు జాయపునికి. అర్థమయ్యాక సంతోష విషాదాల కలనేతతో గందరగోళమై పోయాడు కాసేపు.
హమ్మయ్య! కాకతిని వివాహమాడటానికి ఇప్పుడు అక్కా బావగార్లు అంగీకరించవచ్చు. కానీ.. ఇంద్రాణి ఎందుకు వివాహం రద్దు చేసుకున్నట్లు?? ముమ్మడి పాత్ర ఇందులో ఎంత?.. ఇలా ముమ్మడి తనపై పైచేయి సాధించాడా!? ఇది అతని గెలుపా.. లేక తన ఓటమా!? ఇంద్రాణి తిరస్కరించడం తనకు ఉపకారమా లేక అపకారమా!? అసలు ఏం జరిగి ఉంటుంది??
మరునాడు రాజనగరి వీధుల్లో తిరిగినా.. ఉద్యానవనంలో వెదికినా.. పుళిందపుడు కానీ, ఇంద్రాణి కానీ కనిపించలేదు. ఇంద్రాణి ఇంటి వద్ద రాత్రింబవళ్లు పడిగాపులు పడినా.. ఆమె బయటికి రాలేదు. మూసిన తలుపులు మూసే ఉన్నాయి. అంకమరట్టను ప్రయోగించాడు. అతను కూడా రిక్తహస్తాలతో తిరిగివచ్చాడు.
“పుళిందపులవారు విదేశీయానంలో ఉన్నారట నాట్యాచార్యా! ఇంద్రాణిదేవి గారి ఆంతరంగిక విషయాలు.. మాబోటి చారులకు తెలిసే అవకాశంలేదు కదా!” అన్నాడు.
గొప్ప గందరగోళం ఆవరించింది జాయపుణ్ని.
ఏం చెయ్యాలి.. ఏం చెయ్యాలి.. చేతులు పిసుక్కుంటూ గురుకులంలో, కర్మశాలలో గడపడం తప్ప.. ఇంద్రాణి, ముమ్మడి వ్యవహారం స్పష్టంగా తెలియడంలేదు. ఆ సమయంలోనే మరో దారుణవార్త తెలియవచ్చింది. నీలాంబ వేశ్యావాటికను ఎవరో దుండగులు దాడి చేసి తగులబెట్టారు.
మ్రాన్పడిపోయాడు జాయపుడు.
పరుగుపరుగున వేశ్యా వాటికకు వెళ్లాడు. దాదాపు పాతిక ఏనుగులబారు.. నోటితో పట్టి తెచ్చిన నీటితో చుట్టూ నిలబడి, ఆ భవనాలను ఆర్పుతున్నాయి. రాజోద్యోగులు కాలి సగం బూడిదైన నీలాంబ భవంతులను నీళ్లతో ఆర్పుతున్నారు. నీలాంబ కనిపించలేదు. మసితో బొగ్గులా మారి.. కరవాలం పట్టి అటూ ఇటూ పరుగులు పెడుతున్న కొందరు మహిళలు..
అందులో లలితాంబ!
“లలితా.. లలితా..” అంటూ పరుగున ఆమె వద్దకు వెళ్లాడు జాయపుడు.
చివ్వున చూసి అతను తాకకుండా అడుగు వెనక్కి వేసింది లలితాంబ.
“రావొద్దు.. రావొద్దు! నీవల్లనే మాకీ దుర్గతి. నీ సహాయం తీసుకుని పొలవాసనాడు వెళ్లడం నేను చేసిన అతిపెద్ద తప్పు. ఇప్పుడీ వాటికను ఆ దుర్మార్గులే కత్తికట్టి మరీ నాశనం చేశారు. చాలు. ఇక చాలు! వివాహం నిశ్చయమైందని విన్నాను. ఎవరో నాట్యకత్తెను అశ్వంపై కూర్చుండ బెట్టుకుని అనుమకొండ అంతటా ఊరేగుతుండటం నేను నా కళ్లతో చూశాను. స్త్రీల విషయంలో మీకొక నిర్దిష్ట నిర్ణయం లేదు మామా! దయచేసి వెళ్లిపోండి.. వెళ్లిపోండి!”.
ఆమె మాటలకు మళ్లీ అవాక్కయ్యాడు. ఆమె మాటల్లో ఎన్నో అర్థాలు.. అపార్థాలు..
కాసేపు నిస్ర్తాణగా నిలబడి చేసేది ఏమీలేక వెనక్కి వస్తూ.. అక్కడున్నవారిని అడిగి తెలుసుకున్నాడు. భవన ప్రాంగణం చాలాభాగం కాలిపోయింది. చాలామంది మహిళలు మరణించారు. ఒళ్లు కాలిపోయినవాళ్లు, శరీర భాగాలు కాలి జీవచ్ఛవాలుగా మారినవాళ్లు ఎందరో..
నీలాంబ ఎక్కడున్నదో.. ఎలా ఉన్నదో తెలియదు.
అక్కడే ఉన్న వేశ్యావాటిక ప్రాంత ఉప దండనాయకుడు బోధిక చమూపతి చెప్పాడు..
“పొలవాసనాడు గొడవలు ఇక్కడివరకూ వచ్చాయి సేనానీ! అక్కడున్న వేశ్యావాటికను ఓ వర్గం.. ఈ వేశ్యావాటికను మరోవర్గం కాపాడుతున్నారట. వీళ్లు వెళ్లి దానిని నాశనంచేస్తే.. వాళ్లొచ్చి ఇది నాశనం చేశారట!”.
హతాశుడై తలవొంచుకుని రాజనగరి వైపు నడుస్తున్నాడు. కంటికి కనిపించని శత్రువులు చుట్టూ గంతులు వేస్తూ వికటాట్టహాసాలు.. ఓ అశ్వంపై ముమ్మడి.. మరో అశ్వంపై పుళిందపుడు.. మరెందరో రాజనగరి కుర్రాళ్లు కరవాలాలు తిప్పుతూ మీసాలు మెలితిప్పుతూ.. వెకిలిగా నవ్వుతూ!
‘ఓడిపోయావు జాయపా! ఓడిపోయావు. అదిగో అటు చూడు.. అక్కడ ఆ మేడమీద నుంచి.. వినపడుతోందా ఆ విషాదగీతం.. నీ చావుగీతం అది. పాడుతున్నది ఎవరో తెలుసా!? నిన్ను పెళ్లి చేసుకోనని నీ ముఖాన ఉమ్మి వేసిందే.. ఆ మహాగాయని ఇంద్రాణి! విను విను. హ్హ హ్హ అహ్హహ్హహ్హ..’
మరింత దగ్గరికొచ్చిన శత్రువులు.. కరవాలపు అంచులతో శరీరాన్ని గుచ్చుతున్నట్లు.. హేళన చేస్తున్నట్లు.. వాళ్లదే పైచేయి అయినట్లు.. విజయ విహారం.
వీళ్లు తనపై పైచేయి సాధించారా!? తనను ఓడించారా!?
(సశేషం)
‘ఓడిపోయావు జాయపా! ఓడిపోయావు. అదిగో అటు చూడు.. అక్కడ ఆ మేడమీద నుంచి.. వినపడుతోందా ఆ విషాదగీతం.. నీ చావుగీతం అది. పాడుతున్నది
ఎవరో తెలుసా!? నిన్ను పెళ్లి చేసుకోనని నీ ముఖాన ఉమ్మి వేసిందే..ఆ మహాగాయని ఇంద్రాణి! విను విను.
హ్హ హ్హ అహ్హహ్హహ్హ..’మరింత దగ్గరికొచ్చిన శత్రువులు..కరవాలపు అంచులతో శరీరాన్ని గుచ్చుతున్నట్లు.. హేళన చేస్తున్నట్లు..
-మత్తి భానుమూర్తి
99893 71284