Jaya Senapathi Episode 30 | జరిగిన కథ : కొండయ బృందంతో మమేకమైన జాయప.. వారితో కలిసి నాటకాలలోనూ నటిస్తున్నాడు. ఒకనాడు అనుమకొండలో ‘ప్రహ్లాద విజయం’ నాటకం పూర్తయిన తర్వాత ఎవరికీ కనిపించకుండా పోయాడు. మర్నాడు కాకతీయ రాజ్య ఆస్థాన నర్తకి నీలాంబ భవంతిలో తేలాడు. నీలాంబ ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాచనగరులో నాట్యోత్సవం జరగాల్సి ఉన్నది. అనుకోకుండా ప్రహ్లాద వేషధారి అదృశ్యం కావడంతో.. ఆమె తన బృందాన్ని పంపించి జాయపను తీసుకొచ్చింది. అలా.. జాయపకు తొలిసారి రాచనగరులో అడుగుపెట్టే అవకాశం కలిగింది.
మర్నాడు పొద్దు పశ్చిమానికి వాలే వేళ.. నీలాంబ బృందం రాచనగరుకు చేరింది. జాయప చాలా ఉద్విగ్నంగా ఉన్నాడు. తను తొలిసారి రాచనగరులో కాలు పెట్టబోతున్నాడు. రాచనగరు అందచందాలు, సమున్నతిపై అతని దృష్టి లేదు. అక్కలు నారాంబ, పేరాంబ ఇక్కడే ఉన్నారు. ఎక్కడో!! తను తొలిసారి వాళ్లుండే చోటుకు వచ్చాడు. అక్కలకు దగ్గరగా.. ప్చ్! అక్కలను చూసే భాగ్యం ఈరోజైనా కలుగుతుందో లేదో. ఎంత దగ్గరగా ఉన్నా.. దూరాలు దూరాలుగానే ఉన్నాయి. చెప్పలేనంత.. చేరుకోలేనంత!!
దాదాపు నాలుగేళ్లయ్యింది తలగడదీవిని వదిలి. ఇక్కడ అక్కలు, అక్కడ అమ్మానాన్న.. ఎవ్వరినీ చూడకుండా తను ఊరుకాని ఊరిలో జీవించడం.. ఎవ్వరీ సుబుద్ధి!? ఎవ్వరీ నాగంభట్టు!? త్రిపుర.. ఏమిటీ జీవితం!? ఎలా బతుకుతున్నాడు తను?
“ఇటు ఇటు..” ఓ కరకుగొంతు పల్లకీ బోయీలను గద్దించడంతో వర్తమానానికి వచ్చాడు జాయప. రెండు పల్లకీలు, రెండు గూడు ఎడ్లబండ్లలో కదలి వచ్చింది నీలాంబ బృందం. రాజనర్తకి అయిన నీలాంబ కోసం రాజప్రాసాదం నుంచి ప్రత్యేక పల్లకి పంపారు. అది రాజోచిత సత్కారం.. గౌరవం.. ఓ సంప్రదాయం! ఆ రాజోచిత గౌరవ పల్లకిలో నీలాంబతోపాటు జాయప. కోట ప్రధాన సింహద్వారం వద్ద ఆపేశారు దౌవారికులు. శ్రీకావలి నియోగ మందిరం వద్ద వారి లాంచనాలు పూర్తయ్యి.. పల్లకీలు లోపలికి పోతుండగా మరొక భటుడు గద్దించాడు..
“అటుకాదు.. ఇటు” అంటూ!
అతను చూపినట్లు ముందుకు సాగిపోయాయి పల్లకీలు, ఎడ్లబండ్లు. పోయిపోయి రంగమండపం వద్ద ఆగాయి. దిగారు అందరూ. అప్పుడు చూశాడు రాచనగరును ఆశ్చర్యంగా. తమ రాచనగరుకు రెట్టింపు ఉంది. చిన్నగ్రామం అంత విశాలంగా ఉంది. లోపల గుర్రాలు, ఏనుగులు, రథాలు కూడా తిరుగుతున్నాయి. ఇక భటులు, పరిచారికలు ఎంతో మంది.. చురుగ్గా తిరుగుతున్నారు. శూలధారులైన రక్షకభటులు రెప్పవెయ్యకుండా కలియజూస్తున్నారు.
“అదిగో అది అంతఃపురం. ఆ ద్వారం వద్దకు ఎవ్వరికీ ప్రవేశంలేదు. కేవలం పరిచారికలు మాత్రమే లోపలికి వెళ్తారు.. వస్తారు. ఇదే నాట్యగృహ ప్రాంగణం. రంగమండపం.. ఇటు.. ఇటు పదండి. ఇకఇకలు పకపకలు ఆపండి! చుట్టూ వేగులు, రక్షకభటులు. అనుమానం వస్తే ముందు శ్రీకృష్ణ జన్మస్థానానికే పయనం. ఆపై మన నాట్యం చెరసాలలోనే! నాలుగు కొరడా దెబ్బలతో నాట్యం చేయించి విడిచిపెడతారు”.. చిన్నగా చెబుతూ.. ముందుకు వెళ్తున్నది నీలాంబ. వెనక బృందం. నాట్యగృహ ప్రాంగణంలోకి వచ్చారు. నాట్యగృహం భరతముని నిర్దేశించిన వికృష్ట మధ్యమ నాట్యగృహ విధానంలో నిర్మించినది.
“నాట్యగృహం చాలా విశాలంగా ఉంది కదూ. ఇవన్నీ సోపానాకృతిలో ఉన్న ప్రేక్షకుల ఆసనాలు. ఇది మహా
రాజుల కోసం నిర్మించిన రాజవేదిక. దానిపై కనిపిస్తున్న ఉన్నతాసనంలో కూర్చుని చక్రవర్తులు మన ప్రదర్శనను తిలకిస్తారు. అది రంగపీఠం. మనం ప్రదర్శించేది ఇక్కడే. ఈ మత్తవారణులు ప్రముఖులు ఆసీనులయ్యే ప్రదేశం. అంటే అధికారులు, మహామంత్రులు, గురువులు, విదేశీ అతిథుల కోసం..” వివరిస్తున్నది నీలాంబ. “అందరూ లోపలికి రండి. ఇది రంగశీర్షం. దీని వెనుక ఉండేది నేపథ్యగృహం. మనకోసం కేటాయించిన ఈ ప్రదేశంలో మన ఆహార్యం పూర్తిచేసుకుని రంగశీర్షం వద్ద వేచి ఉండాలి. మహారాజుగారు విచ్చేశాక.. ఘటియ మోగుతుంది. అప్పుడు మనం రంగపీఠం మీదికి వెళ్లాలి. అక్కడ రంగపూజ నిర్వహించుకున్నాక యవనిక తొలగుతుంది. అర్థం అయ్యిందా?! అందరూ ముఖ ప్రక్షాళన చేసుకుని సిద్ధంకండి. ఆహార్యం ఆలస్యం అవ్వకూడదు. వేగిరం కానివ్వండి. మరికాసేపట్లో ఆస్థాన సాంస్కృతిక నియోగ నిర్వాహకులు గుండయామాత్యులు వస్తారు. మనల్ని వేగిరం సిద్ధం కావాలంటూ తొందర పెడతారు”.. చెబుతూనే జాయప కోసం అడిగింది.
“జాయప ఎక్కడ?” అని..కనిపించలేదు. గబగబా బయటికి వచ్చింది. జాయప బయటే నిలబడి ఏదో వెతుకుతున్నట్లు అన్నివైపులకూ చూస్తున్నాడు. అక్కలు.. అదిగో పేరాంబ. అవతల నారాంబ. అక్కలు తనవైపే వస్తున్నట్లు ఊహ.
“జాయపా! లోపలికి పద. అలా దిక్కులు చూస్తుంటే వేగులవాళ్లు అనుమానపడతారు. ఎక్కడైనా సహిస్తారు గానీ.. రాచనగరులో అనుమానం వస్తే అక్కడికక్కడ కరవాలానికి పని చెప్తారు. లోపలికి పద..” లోపలికి లాక్కూ పోతూ చెప్పింది.
ఆమెవెంట పోతూనే ఓ ప్రశ్నవేశాడు. “లోపల వాళ్లు.. అదే.. అంతఃపుర స్త్రీలు ఎక్కడ కూర్చుంటారు పెద్దక్కా?”. ఆమె అల్లరిగా నవ్వి.. అందరికీ వినిపించేలా అన్నది.
“వినండి వినండి. జాయపకు అంతఃపుర స్త్రీలు కూర్చునే ప్రదేశం కావాలట!”..
అందరూ ఘొల్లున నవ్వారు. అయోమయంగా చూశాడు జాయప. అందులో హాస్యం ఏమిటో అర్థం కాలేదు. అతని ప్రశ్నలో అంతరార్థం వేరు. వారికి తోచింది వేరు. చిరునవ్వు నవ్వాడు.. ఆ అంశం అక్కడితో ముగిసిపోవాలని.
నటబృందమంతా ఆహార్యంతో సిద్ధమయ్యే సరికి మరొక ఝాము గడిచింది. బయట ప్రాంగణంలో సోపాన పంక్తి వద్ద హడావుడి పెరగడం వారికి తెలుస్తూనే ఉంది. రూపశిల్పి అందరికీ ముఖాలంకరణ చేస్తున్నాడు. నీలాంబ అందరి ఆహార్యాన్ని సరిచూస్తున్నది. నిజానికి రాచనగరులో మహారాజుల ఎదుట నర్తకీమణులు చేసే నృత్యాలు రెండు రకాలు. చళిక నృత్యం, యౌవరిత నృత్యం. చళిక కాస్త శాస్త్రబద్ధంగా ఉంటే, యౌవరిత పూర్తిగా పురుషుణ్ని రెచ్చగొట్టేలా ఉంటుంది. ఎక్కువగా రాజులు తమ కామప్రకోపం కోసం యౌవరిత నృత్యాలే చెయ్యమంటారు. వీళ్లూ రాజులు కోరినట్లు ఒళ్లు విరుపులతో, ఊపులతో నృత్యాలు చేస్తారు. గణపతిదేవుడు వాటిని తిరస్కరించాడు. సకుటుంబ సమేతంగా చూసేవి, భరతుడు చెప్పిన నాట్యాంశాలే ప్రదర్శించాలని ఆదేశించాడు. తదనుగుణంగా నీలాంబ కూడా పురాణాంశాలనే ఎన్నుకుని రాచనగరులో ప్రదర్శనకు కొత్తరూపం కూర్చింది.
* * *
హడావుడిగా లోపలికి వచ్చాడు గుండయా మాత్యులు.. ఆస్థాన సాంస్కృతిక నియోగ అధికారి. కొంచెం కురచగా.. నిండుగా నీలి చీనీపట్టుపంచె కట్టి, దానిపై నడుముకు అడ్డంగా ఉత్తరీయం బిగించాడు. విశాలవక్షంపై బంగారు రంగు అంచున్న ఎర్రని కంబళి కప్పుకొన్నాడు. ముఖాన కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న విభూది రేఖలు.. నిలువెల్లా హడావుడి. చేతిలో పొన్నుకర్రతో నాట్యం చేస్తున్నట్లు నడుస్తూ వచ్చాడు. “నీలాంబా! అంతా సిద్ధమేనా..!? ఇదేవిటి.. ఇతడెవ్వరూ.. ఇంకా ఆహార్యం ధరించలేదేం?!”..
రాజాస్థానపు హడావుడి ఆయన మాటల్లో, కదలికల్లో స్పష్టమవుతున్నది. ఆయనకు వంగి నమస్కరించిన నీలాంబ నవ్వుతూ.. “తమరు కాస్త ఇలా ఈ ఆసనంపై విశ్రమించండి గురుదేవా.. అందరూ సిద్ధమే!” అన్నది.
“అమ్మో విశ్రాంతా.. భలే! సమయపాలన. ప్రభువులకు అంతా సమయపాలన. లేకుంటే కొరత వేయిస్తారు. నీకేం తెలుసు మా బాధలు. మొన్నటికి మొన్న.. సుంకమంత్రి బాలియగారు రెండు ఘడియలు ఆలస్యం చేశారని కొరత వేయించారు. హమ్మో! అదిగో విన్నారా.. భేరీ భాంకారం !? ఇప్పుడు ప్రభువులు మాత్రమే కాదు పట్టమహిషి సోమలదేవి కూడా.. ఆవిడ వచ్చి ఉచితాసనంలో కూర్చోవడంలేదు. శ్రీవారి కన్నా ముందే విచ్చేసి ప్రతిదీ పరీక్షిస్తున్నారు. హమ్మో.. ఏదో హడావుడి వినపడుతున్నది. మహారాణివారు విచ్చేసినట్లున్నారు!”..
హడావుడి పడిపోతున్నాడు గుండయామాత్యులు. నిజమే.. గణపతిదేవుల పట్టమహిషి.. కాకతీయ సామ్రాజ్యపు మహారాణి సోమలదేవి రంగమండప ప్రాంగణంలోకి వచ్చారు. కంచుకిలు, దౌవారికులు, పరిచారికలు, రక్షణ భటులు ముందువెనక పరుగులు పెడుతుండగా.. రంగమండపంలోకి వచ్చి రంగశీర్షం దాటి నేపథ్యగృహంలోకి వచ్చేశారు. నలుపు కాని వర్ణం. నిలువెత్తు ఆకారం, కొంచెం దురుసు నడక. బెదిరించే విశాల నేత్రాలు, నుదుటన నిలువు బొట్టు, అడ్డం విభూతిరేఖలు. పెదవులకు లత్తుక, నడుముకు వడ్డాణం, లత్తుక అలంకరించిన పాదాలకు బంగారు గజ్జియలు, మంజీరాలు గలగలలాడుతుండగా.. వేగంగా నడుస్తూ వచ్చిన కాకతీయ సామ్రాజ్య ప్రథమ మహిళ, చక్రవర్తి గణపతిదేవుల పట్టమహిషి సోమలదేవి.. అలంకరించిన గ్రామదేవతలా ఉంది. జాయపకు మాత్రం.. మగవాడికి ఆడవేషం వేసినట్లుంది. ఈమె మగవాడిలా ఉంటే ఆ మహారాజుగారు ఎలా ఉన్నాడో?! ఈమె వయసురీత్యా అక్కలకంటే ఐదారేళ్లు ఎక్కువ కావచ్చు. ఆమె అందరినీ చూస్తూ నీలాంబ దగ్గర ఆగింది. అప్పటికే నీలాంబ నమస్కరిస్తున్న భంగిమలో ఉండగా, సోమలదేవి ప్రతినమస్కరిస్తూ.. “నీలాంబా.. సిద్ధమేనా!? తొలి ప్రదర్శన. అయినా నీకు మేము చెప్పేవారమా!?” పకపకా నవ్విందామె. జడుసుకున్నట్లు బిత్తరపోయి చూశారు నర్తకీనర్తకులు.
నీలాంబ నవ్వి.. వినయంగా..
“మహారాజ్ఞి మీరు.. ఈ నాట్యగృహానికి వచ్చారంటే మీ మనసులో కళాకారులపట్ల అభిమానం అర్థమవుతున్నది మహాదేవి!” అన్నది. ఆమె భళ్లున నవ్వి..
“చక్రవర్తులవారి ప్రథమ వచనం సమయపాలన. ఏది క్రమబద్ధంగా లేకున్నా ముందు మాపై కోపగించుకుంటున్నారు. ‘రాచనగరులో కార్యకలాపాలు కచ్చితంగా లేకుంటే ఇక రాజ్యమంతా ఎలా ఉంటుంది?’ అంటారు. అందుకు! జాగ్రత్త!! వారినుంచి మీరు బహుమతులు అందుకోవాలి సుమా..” అంటూ అదే బెదిరించే నవ్వుతో వెనుదిరిగి వేగంగా సాగిపోయింది. దాస దాసీజనం, అంతఃపుర అధికారగణం పరుగులు పెడుతూ వెనక ముందు.. ఆఖరున గుండయామాత్యులు. ద్వారం వరకూ వెంట వినయంగా వెళ్లారు నీలాంబ, నటబృందం. వాన వెలిసినట్లుంది అక్కడ. జాయపకు తల్లి గుర్తొచ్చింది. పెదవులపై చెరగని చిన్మయముద్రతో తానున్నచోట ఆత్మీయభావన పరుస్తుంది. ఆమె లాలిత్య సాధుశీల. ఈమె ఉధృత కర్కశ సౌందర్యం.
నీలాంబ మరోమారు హెచ్చరించింది అందరినీ..
“అంతా మనసుపెట్టి నటించాలి. గణపతిదేవుల వద్ద మన తొలి ప్రదర్శన. వారి మనసు గెలుచుకోవడం చాలాముఖ్యం. విన్నారుగా.. గుండయామాత్యులు, మహారాణి అన్నీ సరిచూసుకుంటూ, అందరినీ హెచ్చరిస్తూ ఎలా పరుగులు పెడుతున్నారో! వారే ఆయన పద్ధతులకు వణికిపోతుంటే ఇక మనమెంత.. జాగ్రత్త!!”.. ఆమె మాటలతో అంతా మరింత ఏకాగ్రతతో సిద్ధమయ్యారు. తర్వాత నీలాంబ తన ఆహార్యం ప్రారంభించింది. రానురానూ సోపానపంక్తి నిండిపోతున్నది. ప్రముఖుల ఆసనాలున్న మత్తవారణులు కూడా నిండుతున్నాయి. కచ్చితమైన సమయానికి ఘంటారావం వినిపించింది.
కాకతీయ మహారాజు.. తన ప్రతిచర్యను భరతఖండమంతా నిబిడాశ్చర్యంతో చూసేలా పాలన ప్రారంభించిన యువనేత.. దక్షిణాపథ పాలకుడు మహామండలేశ్వరుడు శ్రీశ్రీశ్రీ గణపతిదేవ మహారాజు ప్రవేశించబోతున్నాడు. అందరూ ఉత్తేజంతో.. ఉద్వేగంతో ఆయన విచ్చేసే మార్గంవైపే రెప్పవెయ్యకుండా చూస్తున్నారు. జాయపకూడా.. ద్వీపరాజ్యంపై తనంతట తానుగా దాడిచేసి మహాయోధులైన తనతండ్రిని ఓడించిన ఆ మహారాజు.. గణపతిదేవుణ్ని తొలిసారి చూడబోతున్నాడు. అతనికి చాలా ఉద్వేగంగా ఉంది.
(సశేషం)
-మత్తి భానుమూర్తి
99893 71284