జరిగిన కథ : తల్లికి అనారోగ్యంగా ఉన్నట్లు తెలిసి.. తలగడదీవి కోటకు చేరుకున్నాడు జాయప. మంచంపై తల్లి దాయమ్మను చూసి, చంటిపిల్లాడిలా ఏడ్చేశాడు. అర్ధరాత్రి వేళ దిగ్గునలేచాడు. కల.. చెరసాలలో సంకెళ్లతో దీనంగా చూస్తున్న అక్కలు! వెంటనే తన అశ్వాన్ని అధిరోహించి.. మరునాడు అనుమకొండ చేరాడు. ఒకరోజు నాట్యగురుకులంలో మహా స్థపతి రామపను కలుసుకున్నాడు. అప్పటినుంచి జాయపకు శిల్ప్ర పపంచం పరిచయం అయ్యింది. రామప పిలుపుమేరకు రుద్రేశ్వరాలయానికి వెళ్లాడు జాయప. అక్కడ ఆలయ నిర్మాణంలోని శాస్త్ర అంశాల గురించి వివరిస్తున్నాడు స్థపతి రామప.
నాన్నగారు వేయిస్తంభాల గుడిలో భక్తిభావం ఎక్కువగా చూపారు.
ఆతుకూరిపురం రుద్రేశ్వరాలయంలో రసభావనలు రసరమ్యంగా చూపాలని నేను భావిస్తున్నాను..
“అదిగో ప్రధానదేవుడు లింగరూప శివుడు. లింగానికి కిందిభాగాన్ని పానవట్టం అంటారు. దీనిని గర్భగుడి లేదా అంతరాలయం అని పిలిస్తే.. ఇది ముఖమండపం. అది ప్రదక్షిణా పథం. అవి రంగమండపాలు. వాటిలోని స్తంభాలన్నీ కలిపితే వెయ్యి ఉంటాయి. అందుకే ఇది వెయ్యి స్తంభాల గుడి. లోపల శిల్పాలు చూడు. ఇదిగో ఈ శిల్పం నేనే చెక్కాను. బాగుందా..? ఇవన్నీ చూడు. వీటిలో ఎక్కువ శిల్పాలు చేపలు, నీళ్లు, జలచరాలు, పద్మాలు. వీటిని చూస్తే ఏదైనా ఒక సమున్నత భావన కలుగుతున్నదా!? ఏ భావన కలిగింది నీకు? స్వామికి రుద్రేశ్వరుడిగా కంటే గంగాధరుడిగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు మా తండ్రిగారు. రాజ్యమంతటా చెరువులు తవ్వించి జలసంపద పెంచాలని రుద్రదేవుల ఆకాంక్ష. అందుకనుగుణంగా ఈ గుడిలో ఆ భావనను చిత్రించారు”.. చెప్పాడు రామప.
తర్వాత ఇద్దరూ బయటికి వచ్చారు.
“మన హిందూ దేవాలయాలు రెండు రకాలు.. పుణ్య క్షేత్రాలు, పుణ్య తీర్థాలు. మా పంచాణంవారి భాషలో ఆర్యావర్తం సాత్విక దేశం. అక్కడ దేవాలయాలు నాగర విధానంలో కడతారు. వింధ్యపర్వతాల కిందినుంచి కృష్ణానది వరకు రాజస దేశం.. ఇక్కడ కట్టే విధానాన్ని వేసర విధానం అంటారు. కన్యాకుమారి వరకు తామస దేశం.. అక్కడి దేవాలయ నిర్మాణాన్ని ద్రావిడ విధానం అంటాం. మొత్తం గుడిని చూడు. దీనిని అధిష్ఠానం అంటారు. ఈ భాగంపేరు పాదం. దీనిని ప్రసరం, దీనిని కంఠం అని పిలుస్తారు. ఇది శిఖరం. ఇది వ్యాపి. చివరిగా దీనిని విమానం అంటారు. ఇలా దేవాలయంలోని ప్రతి అంగుళ భాగానికీ ఒక నిర్దిష్టమైన పేరు, అందుకు వివరణ ఉంటాయి. మొత్తం గుడి నిర్మాణంలో వాస్తు, ఆగమశాస్త్ర విధానాలతో ప్రత్యంగుళం ఎన్నో జాగ్రత్తలు తీసుకుని కడతారు కాబట్టే.. దేవుడు ఇక్కడే నివసిస్తాడు. ప్రతి గుడిలో ప్రధానదైవం అంశ ఉండి తీరుతుంది. అందుకే భారతీయ దేవాలయాలు వేల సంవత్సరాలు చెక్కుచెదరకుండా నిలిచి.. పంచభూతాలైన పృథ్వీవ్యాపస్తేజో వాయురాకాశాలను ప్రతి అంగుళం పవిత్రంగా ఉంచుతాయి”..
జాయపకు దేవాలయం ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్నది. ఏదో గుడికి వెళ్లడం.. ప్రదక్షిణ చెయ్యడం.. గంటకొట్టడం.. కోర్కెలు చెప్పుకోవడం.. అంతే తెలుసు. కానీ ఇంతటి విశాల దేవళాల్లో అంగుళం అంగుళం వద్దంకులు శానం, సుత్తి పట్టుకుని శాస్త్ర, సాంకేతిక, వాస్తు, కళా, నాట్య, కవితాత్మక అంశాలను మేళవించి నిర్మించడం..
శరీరం జలదరించింది. రాళ్లలో దేవుణ్ని చెక్కి.. దైవత్వం సృష్టించి.. వేదోక్తంగా ప్రతిష్ఠించి.. ప్రజల్లో ఇంతటి భక్తి ప్రపత్తులను కలిగిస్తున్న దేవాలయాల నిర్మాణంలో ఇన్ని అంశాలు ఉండటం జాయపకు మొదటిసారి కొత్తలోకాన్ని ఆవిష్కరించింది.
‘దేవాలయంలో దేవుడు ఉంటాడో లేదో తెలియదుగానీ.. శిల్పుల అనన్య ప్రతిభ మాత్రం ఆచంద్ర
తారార్కం నిలిచి ఉంటుంది!’ అనుకున్నాడు.
గుడి అంతా కలియచూస్తున్న జాయపను పక్కన ఎవరో గట్టిగా పిలిచారు. తుళ్లిపడి చూసి, జడుసుకున్నట్లు రామప వెనక్కి పరిగెత్తాడు.
ఉత్కృష్టమై.. జీవం తొణికిసలాడుతున్న అతిపెద్ద నంది! మహా నందీశ్వరుడు!!
పెద్దమూపురంతో సర్వాలంకృతుడై కళ్లు చెదిరేలా ఉన్న నందీశ్వరుడు.. నిజంగా పిలుస్తున్నట్లు చూస్తున్నాడు. విశ్రమించినా శివుని ఆనకోసం సర్వదా
సన్నద్ధంగా ఉన్నట్లు సుశిక్షకుడైన సైనికుడిలా ముడుచుకున్న కాళ్లు.. ఒక్క ఊపున లేచి నిలబడటానికి సిద్ధం అన్నట్లు ఉన్నాయి. చెవులు సదా చలిస్తున్నాయి. కళ్లలో గంభీరత, ముక్కుపుటాల్లో ధ్వనిస్తున్న వెచ్చని ఆవిరులు, రుద్రేశ్వరుడేమో గానీ.. జాయప మాత్రం ఆ నందీశ్వర శిల్పంలోని జవజీవాలలో సుళ్లు తిరిగిపోయాడు.
“నందీశ్వరుడు నచ్చాడా!? అయితే పద. నీకు మరో విచిత్రం చూపిస్తా..” అంటూ జాయపను అనుమకొండలోని శిల్పకర్మశాలకు తీసుకువచ్చాడు రామప.
ఆ శిల్పకర్మశాల ప్రాంగణంలోని ఓ మందిరంలోకి అడుగుపెట్టిన జాయప దిగ్భ్రమ చెందాడు. అక్కడ వేయిస్తంభాల గుడిలో చూసిన నందీశ్వరుడిలాంటి నంది
శిల్పాలు వేనవేలు. ఎటు చూసినా నందీశ్వరులే.. అంతమంది నందీశ్వరులు తననే పలకరిస్తున్నట్లు.. అబ్బ.. చెంపలకు చేతులుజేర్చి రెప్పవెయ్యడం మరచి మూర్చనలు పోయాడు. రాతి నిర్మిత దేవుడిలోనేకాదు నందికి కూడా ప్రాణంపోసిన శిల్పికి జేజేలు!!
“మన దేవాలయాలలో ఉన్నన్ని నందిశిల్పాలు
భారత రాజ్యాలలో ఎక్కడా లేవు. నందీశ్వరులను ప్రత్యేకంగా చెక్కడానికి ప్రత్యేక మందిరం ఉందిక్కడ. రాజ్యంలో వ్యవసాయానికి ఇస్తున్న ప్రోత్సాహానికి గుర్తుగా ప్రతిగుడిలో స్థిరగంభీరమైన నంది ఉండాలన్న చక్రవర్తులవారి నిర్ణయంతో ఆస్థానస్థపతి కానోజు ఈ శిల్పశాలను నిర్వహిస్తున్నారు” చెబుతున్నాడు రామప.
గుడిలో శిల్పనిర్మాణానికి ముందు రామప, సంజయ చేస్తున్న రూపకల్పన యజ్ఞం జాయపను కదిలించింది. తానుకూడా ఈ యజ్ఞంలో భాగస్వామి అయితే బావుణ్ను అనుకున్నాడు. గురుకులానికి వచ్చి నాట్యకారుల భంగిమలు.. అలాగే నీలాంబ వేశ్యాగృహం వద్ద నాట్యప్రదర్శనలు కూడా వాళ్లు చిత్రించుకునే వేళ వెంట ఉండేవాడు జాయప.
“నాన్నగారు వేయిస్తంభాలగుడిలో భక్తిభావం ఎక్కువగా చూపారు. ఆతుకూరిపురం రుద్రేశ్వరాలయంలో రసభావనలు రసరమ్యంగా చూపాలని నేను భావిస్తున్నాను..” అన్నాడు రామప.
రామప, సంజయలను తన స్నేహబృందానికి కూడా పరిచయం చేశాడు జాయప.
“అబ్బో.. ఇప్పుడు శిల్పాచార్యులదే కాలం. మహా
రాజుల తర్వాత అంతటి గౌరవమర్యాదలు అందుకుంటున్నది వీళ్లే. ఆసేతుహిమాచల పర్యంతం ఎక్కడ
చూసినా దేవాలయ నిర్మాణాలే! మహారాజులు సైన్యం
పై ఎంత వ్యయం చేస్తున్నారో.. అంతకు రెట్టింపు దేవాలయాలకు చేస్తున్నారు..” అన్నాడు త్రిపుర.
“అవును. మహామహా స్థపతులు ఉద్భవించారు. అద్భుత రూపకల్పనా ప్రణాళికలతో దేవుడు నిజంగానే దిగి వచ్చి కూర్చునే దేవాలయాలు దేశమంతటా సృష్టిస్తున్న ఈ స్థపతులను ఎంత గౌరవించినా తక్కువే!”.. అన్నాడు మరో చరిత్రకారుడు అంకాల.
“చిన్న చిత్రం లిఖించాలని ప్రయత్నిస్తే కాలు వంకర, చెయ్యి వంకర, గుడ్డి కళ్లు లిఖిస్తాం. అలాంటిది బండ రాళ్లపై ఈ శరీరాలు, భావాలు, అందచందాలు.. ఆభరణాలు, అలంకారాలు.. ఇంత కచ్చితమైన కొలతలతో ఎలా చెక్కుతున్నారో!?” అన్నాడు జాయప.
“మనశిల్పులు చెక్కని అంశం లేదని చెప్పగలను..” అన్నాడు అంకాల.
“అందుకు రూపకారుల బృందం సహాయం తీసుకుంటున్నాం..” అన్నాడు రామప.
“నగల సంగతి ఏమోగానీ! అమ్మాయిల అందచందాలు.. ఆ పలుచని దుస్తులు.. ఏమి చాతుర్యం. ఆ ఎత్తులు ఆ వంపులు రాళ్లల్లో ఎలా తెస్తారబ్బా!? తట్టుకోలేక పోతున్నాననుకో..” త్రిపుర పులకింత.
“అమ్మాయిల అందచందాలలో సంజయ ప్రత్యేకత సాధించినవాడు. అజంతా గుహల చిత్రకారులవద్ద శిక్షణ పొందినవాడు. అందుకే అంత కచ్చితత్వం ఆ వక్షోజాల్లో..” అన్నాడు రామప.
అందరూ నవ్వారు.
“ఈమధ్య నగ్నచిత్రాలు దాటి పూర్తి మిథున సన్నివేశాలను నిస్సంకోచంగా గుడికుడ్యాలపై చిత్రించడం.. భలే! నేనయితే వాటిని చూడటానికే గుడికి వెళ్తున్నా..” త్రిపుర కళ్లు మూసుకొని తన్మయుడై అన్నాడు.
“మహాకవుల వర్ణనలు చదవకుండానే, మహా మహా గ్రంథాలలోని ప్రసిద్ధ సన్నివేశాలను శిలలపై సృష్టిస్తున్నారు వీళ్లు. అదే ఆశ్చర్యం..” అన్నాడు నాగంభట్టు.
“భరతఖండంలో దేవతార్చన మనిషి స్థిరజీవితం మొదలైన నాటినుంచే ఉంది. తొలినాళ్లలో యజ్ఞయాగాదులు ఎక్కువగా ఉంటే, మధ్యలో బౌద్ధం, జైనంవల్ల వైదిక కర్మకాండ తగ్గి మళ్లీ హైందవం ప్రబలినా.. యజ్ఞయాగాదులు తగ్గిపోయాయి. తర్వాత భక్తి అనే భావన వచ్చాక దేవతలకు విగ్రహరూపం కల్పించి పూజలు చేయడం ఎక్కువయ్యింది. బౌద్ధులు కూడా బుద్ధుడి విగ్రహాలు, జైనులు మహావీరుడి విగ్రహాలు పూజిస్తున్నారు. మూడో శతాబ్దంనుంచి అనుకుంటా.. బౌద్ధం, జైనం ప్రాభవం తగ్గాక శిథిలమైన చైత్యాలు, జినాలయాలే దేవతల గుళ్లకు పునాదులు అయ్యాయి. ఇప్పుడు హైందవ దేవాలయ నిర్మాణం అత్యున్నత స్థాయిలో ఉంది..” దేవాలయ పరిణామం వివరించాడు గౌరవ.
“ఇప్పుడు దేవాలయం సామాజిక జీవితంలో ముఖ్యభాగం అయ్యింది. రాజులకంటే, వ్యాపారాల్లో సంపాదించిన వైశ్యులు, బలింజలే గుడులకు ఎక్కువ దానాలు చెయ్యడం చూస్తున్నాం..” అన్నాడు నాగంభట్టు.
“పోన్లే! అదీ మంచికేగా. నేలమాళిగల్లో మూలిగే బంగారం, నాణాలు దేవాలయాల్లోకి వస్తున్నాయి. నలుగురు వృత్తిదారులకు, పంచములకు భుక్తి దొరుకుతున్నది. మొన్నటికిమొన్న ‘తాటిమట్టలు కొట్టండ్రా!?’ అంటే వినకుండా గుడి ఆవుల్ని మేపాలని పోయాడు మా గొల్లరాముడు. వాడి గోల వాడిది!”..
“ఇప్పుడు అటు ఆర్యావర్తంనుంచి ఇటు తమిళగం లాంటి దక్షిణరాజ్యాల నుంచి ఎవడెవడో వచ్చి.. ‘మేం పశువుల కాపరులం. మాకు ఆవులు ఇవ్వండి’ అని అడుగుతున్నారు. వాళ్లలో ఎవడు యాదవుడో ఎవడు కాదో ఎవరికి తెలుసు!?” అన్నాడు రామప.
“మీరు మాత్రం మరో వృత్తివాణ్ని మీ పనిలోకి తీసుకోరు కదా..” నవ్వాడు త్రిపుర.
“ఎందుకు??”.. ఆశ్చర్యంగా అడిగాడు జాయప..
“ఇప్పుడు వృత్తుల పునరేకీకరణ ఎక్కువయ్యింది. ఏ వృత్తికి గౌరవం, ఆదాయం బాగుంటే జీవిక కోసం
ఎక్కడినుంచో ఎవరెవరో వచ్చి.. ‘మేమూ అదే వృత్తిదారులం!’ అంటున్నారు”..
“అవునవును. ఇదివరకు రాజులంతా మాది సూర్యవంశం, మేము చంద్రవంశజులం అని చెప్పుకొనేవారు. శాసనాలలో రాయించుకునేవారు. ఇప్పుడిప్పుడే తాము చతుర్థ కులస్తులమని స్పష్టంగా చెప్పుకొంటున్నారు. మన కాకతీయులు కూడా తాము చతుర్థ కులస్తులమని ఎప్పుడో ప్రోలరాజే స్పష్టం చేశాడు. తాము విష్టి కులజులమని, దుర్జయ వంశీయులమని వాళ్ల శాసనాల్లో స్పష్టంగా రాసుకున్నారు”..
“ఇప్పుడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలకు, వృత్తి కులాలకు మధ్య శూద్రుల జనసంఖ్య పెరిగిపోయింది. పలనాటియుద్ధం తర్వాత శూద్రకులాల్లోనూ స్పష్టత వస్తున్నది. వీళ్లూ వేరువేరు కులాలుగా చెప్పుకోవడం మొదలయ్యింది..” అంకాల విపులీకరించాడు.
రాయి, ఇనుము, ఇత్తడి, బంగారం, దారు.. ఈ ఐదు ధాతువులపై రకరకాల వస్తూత్పత్తి చేసే శిల్పకారులను మొత్తంగా పంచాణంవారు అంటారు. పంచాణంవారు ఇతరులను వాళ్ల వృత్తిలోకి రానివ్వరు.
“చూశావా!. వాళ్ల ప్రత్యేక ఆహార్యం! ముఖ్యంగా బొడ్లో దోపుకొన్న ఆ బంగారు ఉలి..” త్రిపుర అన్నాడు.
“చూశాను! రుషుల్లా.. పాదాలకు పావుకోళ్లు! నిజంగా ఉదాత్తజీవితం అంటే అలా ఉండాలి”..
“మాది పూర్తిగా దైవకార్యం. ఎవడుబడితే వాడు వచ్చి.. ‘నాకు పని కల్పించండి!’ అంటే కుదిరేపని కాదు. రాయిని దేవుడిగా మలచడం అంటే దైవ ప్రాణప్రతిష్ఠ. అందుకు ఎంతో నియమనిష్ఠాగరిష్ఠమైన ప్రవర్తనగల వారే అర్హులు. అందువల్ల మా వృత్తిలో పుట్టినవాళ్లకు మాత్రమే ఉగ్గుపాలతో శిల్పకళ నేర్పుకొంటాం. ఇతరులు వస్తే వర్ణసంకరమై పవిత్రత పోతుంది. ఇది అన్ని రాజ్యాలలోనూ అమలవుతున్న పంచాణంవారి నియమం!”.. రామప వివరణగా చెప్పాడు.
“ఇది ఇప్పుడు అన్నికులాలవారూ అనుసరిస్తున్నారు మిత్రమా..” అన్నాడో మిత్రుడు.
‘సబబే!’ అనిపించింది జాయపకు.
“త్రిపురా.. ఆ అహోబలపతి చిరునామా దొరకడంలేదు మిత్రమా..” అంటూ వచ్చాడు చలమయ.
(సశేషం)