చారిత్రక కాల్పనిక నవల
జరిగిన కథ : పిష్టపుర యుద్ధవిజయం రాజ్యమంతా పండుగశోభను తెచ్చినా.. చక్రవర్తి మాత్రం విచారవీచికలతో కనిపిస్తున్నాడు. కారణం.. తనకు పినచోడుడు, జాయపుడు మహోపకారం చేస్తే, ఆ కుటుంబానికి తాను అపకారం చేసినట్లు ఆయన భావించడం. అయితే, పినచోడుని కుటుంబానికీ ఉపకారం చేసేలా.. బందీలుగా తెచ్చిన జంట పిల్లలను వివాహం చేసుకోమంటూ చక్రవర్తికి సలహా ఇచ్చాడు రుద్రసేనాని. స్థిర నిర్ణయుడయ్యాడు గణపతిదేవుడు.
పినచోడుని కుటుంబాన్ని, తన శ్రేయోభి లాషులైన కాకతీయ మహామహులను ఉద్దేశించి మాట్లాడటం ప్రారంభించాడు చక్రవర్తి. “పినచోడుని కుటుంబానికి దారుణమైన అన్యాయం జరిగినట్లు మేము అంగీకరిస్తున్నాం. ఆ అన్యాయానికి ఇదే సరైన ప్రాయశ్చిత్తం అనుకుంటే.. ఆ ప్రాయశ్చిత్తాన్ని ఇప్పుడే ప్రకటిస్తున్నాం. మీరు చెప్పినట్లు పినచోడుని కుమార్తెలను మేమే వివాహం చేసుకుంటాం. అది మా తప్పులకు ప్రాయశ్చిత్తమని మీరు నమ్ముతున్నారు. మరి వారు నమ్ముతారా?” అన్నాడు.
పినచోడుని కుటుంబం తక్షణం ఒక్కటైంది. తమ్ముళ్లు, కుమారుడు జాయప.. బాయమ్మ మంచం వద్దకు వచ్చారు. పినచోడునితో చేతులు కలిపారు.
“మాకు అంతకంటే అదృష్టం ఏం కావాలి ప్రభూ! మా కుటుంబచరిత్ర అంతా పవిత్రమైపోతుంది. మేము నిండు హృదయాలతో మీ నిర్ణయాన్ని శిరస్సు వంచి ఆహ్వానిస్తున్నాం!”.. అన్నాడు పినచోడుడు.
మందిరమంతా చప్పట్లతో మారుమోగింది.
ఉద్విగ్నత తగ్గి ఉత్తేజం పెరిగి అందరూ ప్రఫుల్ల మనస్కులయ్యారు.
మరో పక్షంరోజుల తర్వాత.. తలగడదీవి కోట ముఖద్వారం!
మంగళవాద్యాలు అద్భుతంగా మోగుతున్నాయి. ఓ పెద్ద పటాలం ఊరేగింపుగా దగ్గరికి వస్తున్నది. అయ్య రాజవంశపు ముఖ్యులంతా అమందానంద కందళిత హృదయారవిందులై.. విప్పారిన కళ్లతో చూస్తున్నారు. మొదటగా బంగారురంగు పల్లకీ దగ్గరకొచ్చింది. దానినుంచి కుడికాలు కింద పెట్టింది నారాంబ, వెనుక పేరాంబ. యుద్ధ ఖైదీలుగా తలగడదీవి వదిలిన కూతుళ్లు.. అనుమకొండకే మహారాణులుగా నిశ్చయమై, వివాహ వేడుకకై పుట్టిల్లు తలగడదీవికి తిరిగి వచ్చారు. ఆ పుట్టిల్లు పులకించదా మరి!!
తూర్పు సముద్రపు ఉత్తుంగ కెరటాలే ఘోష
వాద్యగా.. కృష్ణా నదీమతల్లి ఆహ్వానగీతికలు పాడుతుండగా వారిని సగౌరవంగా మేళతాళాల మధ్య కోటలోకి తోడ్కొని పొయిందా బంధువుల బృందం. ఆ బృందానికి నాయకత్వం వహించింది.. పోరాట కౌమారుడు.. అయ్య వంశజుడు.. నూనూగు మీసాల జాయప!
అయ్యవంశంతో వియ్యమందడానికి చక్రవర్తి గణపతి
దేవుడు ముందుకు రావడం పినచోడుని కుటుంబాన్ని సంతోష దిగ్భ్రమలో ముంచెత్తింది. క్షణం ఆలస్యం చెయ్యలేదు పినచోడుడు. ముందు రుద్రసేనానిని కలిశాడు. సాష్టాంగ ప్రణామాలు ఆచరించాడు.
“అన్ని గౌరవాలకు నువ్వు అర్హుడివి పినచోడా! గణపతిదేవుడు కేవలం మహామండలేశ్వరుడు మాత్రమే కాదు. జాతి రత్నం. మహామనిషి. దైవాంశ సంభూతుడు. ఎంత ఆత్మజ్ఞానో పరికించావు కదా. మీ కుటుంబపు దుఃఖాన్ని ఆయన ఎలా సంపూర్ణంగా అర్థం చేసుకున్నాడో గ్రహించావా! వెళ్లు.. వెళ్లి వివాహ ఏర్పాట్లు ఘనంగా చెయ్యండి. కాళ్లు కడిగి కన్యాదానం చెయ్యి. ముక్కోటి దేవతలు ఆశీర్వదిస్తారు”..
కాకతీయ చక్రవర్తికి ఏర్పడిన ధర్మశంకకు అద్భుతమైన పరిష్కారాన్ని సూచించి.. మరోమారు ‘కాకతీయ రాజ్యభార ధౌరేయ’ అనిపించుకున్న సకల సేనాధిపతి రుద్రయ సేనాని అమృత పలుకులివి.
మల్యాల చౌండయ అయితే మరింత ఆనందించాడు. పినచోడుణ్ని ఆత్మీయంగా హత్తుకున్నాడు. ఇద్దరూ కలిసి విందారగించారు.
“నీకు, నీ కుటుంబానికి నా పూర్తి సహకారం ఉంటుంది చోడా! కారణం నేను మీకు కలిగించిన క్లేశం. దానిని తన మీద వేసుకున్న గణపతిదేవుడు ఎంత గొప్పవాడో కదా. చివరికి అన్నీ మన మంచికే అన్నట్లుంది. నా జీవితంలో ఇంత ఆనందం ఎన్నడూ చూడలేదు”..
చౌండ తన్మయత్వంతో చెబుతున్న వాక్యాలు.. అంతే తన్మయత్వంతో విన్నాడు పినచోడుడు.
“ఇటు జాయపుని లాంటి కొడుకు.. అటు గణపతి
దేవుడు లాంటి అల్లుడు! నీ అదృష్టమే అదృష్టం పినచోడా! ఎంత గొప్ప మనసో.. అంత రాజకీయ చతురుడు గణపతిదేవుడు. దూరదృష్టి.. కాదు కాదు సుదూర దృష్టి ఉన్నవాడు. మీ కుమార్తెలను పెళ్లాడటంతో ఆయన అనేక సమస్యలను పరిష్కరించబోతున్నాడని నా అనుమానం. కాదు కాదు.. అభిప్రాయం!” అన్నాడు చౌండ.
తనను దర్శించిన పినచోడుణ్ని ఆశీర్వదించాడు గంగాధరుడు.
“ఆయన నీ అల్లుడు కావడం కేవలం శివేచ్ఛ! చక్రవర్తి గొప్పనిర్ణయం తీసుకున్నారు. రాజు మనసుతో నిర్ణయాలు తీసుకోకూడదు.. మేధస్సుతో తీసుకోవాలి. కానీ, గణపతిదేవుడు మనసు, మేధ.. రెండూ మెలివేసి పూర్ణప్రజ్ఞతో నిర్ణయం తీసుకున్నారు. ఆయుష్మాన్ భవ..” అన్నాడు.
అయితే ఈ వివాహవార్త అనుమకొండ అంతః
పురంలో అగ్ని పుట్టించిందని వార్త. సోమలదేవి
ఆగ్రహోదగ్రురాలు అయ్యిందని, తండ్రి జైత్రపాలుడికి వార్త అందించిందన్న వేగుల వార్త.. గంగాధరమంత్రి చెవిన పడనే పడింది. పర్యవసానం.. అంతర్యుద్ధమా? బహిర్యుద్ధమా ?? కాలమే చెబుతుంది.
ద్వీపసీమవారి కాబోయే అల్లుడు మహామండ
లేశ్వరుడు శ్రీశ్రీశ్రీ గణపతిదేవుడు వెలనాడు రాజనగరు నుంచి ద్వీపసీమ తలగడదీవి కోటకు బయల్దేరి.. పాండ్యచోడపురంలో జలధీశ్వరుణ్ని దర్శించుకున్నాడు. ఆయనకు స్వాగత సత్కార సంబరాలు పర్యవేక్షిస్తున్న జాయపుడు.. చక్రవర్తికి అక్కడినుంచి పల్లకీ కాకుండా, ఏడు బంగారు వర్ణపు అశ్వాలు పూన్చిన బంగారు రథం ప్రత్యేకంగా ఏర్పాటుచేశాడు.
రథం ఆరోహించిన చక్రవర్తి గణపతిదేవుని ప్రయాణం.. తలగడదీవి వరకు మొత్తం పూర్తిగా పుష్పవర్షంలోనే కొనసాగింది. దారి మొత్తం ఒకపక్క సాగరమైతే.. మరో పక్క అడుగుకొక మత్తగజాన్ని నిలబెట్టి ఆయనపై పుష్పవర్షం కురిపించాడు జాయపుడు. ముగ్ధుడయ్యాడు గణపతిదేవుడు.
ఆరోజు నుంచి పెళ్లివేడుకలు మొదలయ్యాయి. పదిరోజులు ద్వీప ప్రజలు సంబరాలలో మునిగి తేలారు. మాఘమాసం – కృష్ణపక్షం – శుద్ధతదియ.. తెల్లవారితే శుక్రవారం 4.21 ని.లకు మిథున లగ్నమే పెళ్లి ముహూర్తం. అటు సాగరుని ఒడిలో.. ఇటు కృష్ణమ్మ అంచులో వంద నివర్తనాల పంటభూముల్లో ఏర్పాటుచేసిన చలువ పందిళ్లలో పెళ్లి మండపం నిర్మించారు.
ఆర్యావర్తంలో ఆత్మీయ మిత్రులు, దక్షిణాపథంలో రాజకీయ అవసరార్థులతో మొదలుకొని.. ఆంధ్రదేశమనే భూప్రాంతంలోని మిత్రులకే కాదు.. శత్రుత్వభావనలతో ఉన్నవారితో సహా సమస్త రాజులందరికీ ఆహ్వానాలు అందించాల్సిందిగా గణపతిదేవుడు ఆదేశించాడు. తదనుగుణంగా కాకతీయ మిత్రులుగా కొందరు, పినచోడుని అయ్యవంశ బంధుమిత్రులుగా కొందరు.. మొత్తం సమస్త రాజన్యులకూ ఆహ్వానాలు అందాయి.
రాజధానిలోని మొత్తం ప్రధానులు, అమాత్యులు, మంత్రులు, లెంకలు, సేనాధ్యక్షులు, సాహిణులు, కవి గాయక పండిత ప్రకాండులు, నియోగాధిపతులు, సమయాల శెట్టిలు, పృథ్వీశెట్టి, నానాదేశి పెక్కండ్రు, సార్థవాహులు, విదేశీ వ్యాపారులూ అంతా తరలి వచ్చారు.
రానిదల్లా.. ఒక్క పట్టపురాణి సోమలదేవి మాత్రమే.
మహా మహా రాజ ప్రముఖుల పల్లకీలు, రథాలతో ద్వీప తీరమంతా నిండిపోయింది.
అలంకృత పెండ్లి కుమార్తెలను చూడటానికి రెండు కళ్లూ చాలవు. కవలలైన నారాంబ, పేరాంబ ఇద్దరి శరీర రూపురేఖా విలాసాలు ఒక్క తీరుగానే ఉంటాయి. తీర్చిదిద్దిన అవయవ స్ఫుటత్వంతో బంగారుఛాయలో ఉన్న వారి శరీరాలకు.. యవ్వనం ఒక అనన్య మోహనత్వం ప్రసాదించింది. ఇద్దరికీ ఒకే విధమైన అలంకరణతో రతీదేవి ద్విపాత్రాభినయంలా భాసిస్తున్నారు పెళ్లి ముహూర్త సమయాన.
జానువుల వరకూ వేలాడుతున్న కేశభారాన్ని మూడుపాయల జడగా వేసి, రత్నాలు పొదిగిన బంగారు కుప్పెలున్న పట్టుకుచ్చులతో అలంకరించారు. తలపై మాణిక్య నాగాభరణం, వజ్ర నక్షత్రాభరణం, ముత్యాల పాపిటబొట్టు, గోమేధిక చేమంతి పూవు ధరించారు. కడియాలు, కంకణ, కేయూర, హార, మేఖల, నూపుర ఆభరణాలు ఇద్దరినీ అలంకరించి మురిసిపోయాయి.
కేవలం వేరువేరు దుస్తుల వల్ల మాత్రమే ఇద్దరూ వేరువేరుగా కనిపిస్తున్నారు.
సరిగంచుల పూలపట్టుచీర పైన ఎర్ర కంచుకం నారాంబ కట్టగా.. కాశ్మీర కుసుమంపు పట్టుచీర, గరుడ పచ్చ కంచుకం పేరాంబ కట్టింది. ఇద్దరూ చెంపలకు పుప్పొడి అద్ది, కస్తూరి కుంకుమ మకరిక పత్రాదులు రత్నకర్ణికలతో సయ్యాటలాడుతుండగా.. అలంకరించిన చెలికత్తెలే దిష్టిచుక్క పెట్టి ఎర్రనీటితో దిష్టి తీశారు. ముత్తయిదువులైన అమ్మలక్కలే కాదు.. అంతఃపురంలోని చెలులంతా పెళ్లికూతుళ్లుగా ముస్తాబైన తమ యువరాణులను ప్రత్యేకంగా వచ్చి విప్పారిన నేత్రాలతో అబ్బురంగా చూశారు.
ద్వీపమంతా వివాహశోభతో అలరారుతున్నది. అతిథులంతా పెళ్లికుమార్తెల అందచందాల గురించి ముచ్చటించుకుంటున్నారు. జాయప నేతృత్వంలో పినచోడుని కుటుంబం ఆహూతులకు గౌరవ మర్యాదలలో లోటు రాకుండా అహర్నిశలూ పరుగులు పెడుతున్నారు.
సాగరం అంచు పొడవునా విశేష అతిథులకు ప్రత్యేక తాత్కాలిక అతిథిగృహాలు.. అతిథుల విలాస విహార ముచ్చట్ల సందడుల కోసం వాటి మధ్య అక్కడక్కడా ప్రత్యేక ప్రాంగణాలు.
వీటి మధ్య వేదిక. దానిపై నిత్యం సంధ్యవేళ భోగపు నాట్య ప్రదర్శన. కాదంటే తోలుబొమ్మలాట లేదా సంగీత విందు. అంతా ఆనందాల హేలావలయతం.
ఆయా అతిథిగృహాలు, సమావేశ ప్రాంగణాల చుట్టూ ఏర్పరచిన కరండ పాంచాలికలలోని అగరు జవ్వాది కర్పూర సువాసనలతో మందిరమంతా పరిమళభరితమై మత్తుగొలుపే ఏర్పాట్లు. కాదంబ మధువు, మాధవం, ఐక్షువం, క్షీరంబు మధువు, ఆసవం, వార్షవం, రతిఫలం మొదలైన వందరకాల దేశీవిదేశీ మధువులు. ఎల్లవేళలా అందించేందుకు వేశ్యయువతులు. దాపులనున్న వాతాయనముల నుంచి వీచే మల్లియల తావులకు తోడు.. దాసీజనుల చేతి వీవనాలు!
సైదోడుగా అతిథులకు సముద్ర విహారాలు.. విదేశీ నౌకలలో విదేశీ లలామల నృత్యాలు, సువర్ణ, మలయ, బ్రహ్మ, చంప, యవ, చీనా, కాంభోజ, సింహళ దేశాల వర్తకులతో దేశ విదేశీ వ్యాపార, సాంస్కృతిక విశేషాలపై ముచ్చట్లు. ఊహలో కూడా చూడని రుచులతో భోజన ఏర్పాట్లు. దాదాపు వంద దిగుడు పొయ్యిలు.. వెయ్యి గొల్లెనలు.. సరుకులు తేవడానికి నలభై మంది జంఘాలురు, ఎందరో నలభీములు. గడ్డి పరచి ఎప్పటికప్పుడు వారబోస్తున్న వరి అన్నం.. ఎన్నో రకాల వంటకాలు.. పలురకాల మాడుగులు, దబ్బెడలు, ఊర్పు, అంగారపోలికలు, పాలకాయలు, దగ్దాన్నం, మండెగలు, నిప్పట్లు, సుఖియాలు, ఇడ్డెనలు, దోశెలు, ఉండ్రాళ్లు.. చివరగా మధురసం.. ఆఖరున తాంబూలం.
ద్వీపమంతా వివాహశోభతో అలరారుతున్నది. అతిథులంతాపెళ్లికుమార్తెల అందచందాల గురించి ముచ్చటించుకుంటున్నారు.జాయప నేతృత్వంలో..
పినచోడుని కుటుంబం ఆహూతులకు గౌరవ మర్యాదలలో లోటు రాకుండా అహర్నిశలూ పరుగులు పెడుతున్నారు.
పుటికలు, కొప్పెరలు, దుత్తలు, కుడుకలు, గుండిగలు, గరిటెలు, జాడీలు, బాళీలు. బొక్కెనలతో వడ్డనలు. హస్త ప్రక్షాళనకై నీళ్ల బానలు, చెంబులు, తబుకులు. బంగారు, వెండి తళియలు, దంతపు చషకములు మాత్రమే కాదు.. మర్రి, మోదుగాకులు, రంగురంగుల కలువడాలలో అద్భుతమైన రుచులు. అతిథిగృహాల వద్ద ఎల్లప్పుడూ నీటి కలశములు, తాటాకు బుట్టలలో చిరుతిండ్లు, బెల్లపు పాకంలో ముంచిన బొరుగుల ఉండలు, తాంబూల కరండాలు..
పీకలమొయ్యా తిన్నా.. రుచి తగ్గని వింత ఆహారాలు ఆహూతులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తాయి.
‘దివిలో అయ్యవంశస్తులవారి విందు కుడువని
బతుకేలా!?’ అన్నట్లుగా వివాహ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. అతిథులు తమకు లభించిన గౌరవమర్యాదలతో పూర్తిగా సంతృప్తి చెంది, ఆనందంగా వీడ్కోలు తీసుకున్నారు.
వివాహ ఆఖరి అంకం.. అప్పగింతల సమయంలో తలగడదీవికోట మొత్తం దుఃఖ సాగరమయ్యింది.
(సశేషం)