‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2022’లో ప్రత్యేక బహుమతి పొందిన కథ.
“ఓరిని.. ఎంకా! పొయ్యి మీద బువ్వ మాడిపోతాంది గదరా! నీ.. కాడు మండ! పొయ్యి ముంగలనే కూసోని ఏం జేత్తానవురా!” అని గట్టిగా కొడుకును మందలించిండు, గుడిసెలో కురిసే వాన నీళ్లకు బొచ్చెలు అడ్డం పెడుతున్న ఎంకని తండ్రి ముసలయ్య.
“సూడు కొడకా! పొయ్యిల మంట జరంత బైటికి ఇగ్గి, బువ్వకుండ దించు బిడ్డా!” అన్నది.. కుక్కి నులక మంచంల చిరుగుల దుప్పటి కప్పుకొని ముడుసుకొని పడుకున్న ఎంకని తల్లి దూలమ్మ.
“మాయదారి కండ్లు పాడువడ.. ఉండి లేనట్లాయే! సూపానని కండ్లు ఉంటే ఎంత? పోతె ఎంత? గుడ్డి బతుకైంది బిడ్డా! కాల్రెక్కలు సక్కగున్నా.. సూపానక కూసుండి తినవడితిని. నా కాళ్లు పోరనికచ్చినా మంచిగుండె! నా కండ్లెత్తుకపోయి, పోరని కాళ్లు గుంజకపోయి.. అయిటోల్లను జేసె.. దేవునింట్ల మన్నువడ!” అన్నది దూలమ్మ. మనసులోని బాధనంతా మాటలతో శాపాలు పెడుతూ.
“ఐక్కునుండరాదే! నీ యవ్వ.. రోజు ఇదే బాగోతమా? ఎట్టా జరగాల్నో గట్లనే జరుగుద్ది. మంచిగున్నన్ని దినాలు కూసున్నవా ఏంది!?” అంటూ నిండిన బొచ్చెలోని వాన నీళ్లు బైట పారబోసిండు ముసలయ్య.
“ఈ ఆనింట్ల పీనుగెల్ల! కొట్టింది కొట్టినట్లే కొట్టవట్టె! జర్రంత రికావన్నా ఇత్తలేదు. బతకనిత్తదా.. సంపుద్దా!? కొడితే ఒకటే కొట్టుడు. ఓతె అటే ఓద్ది! సచ్చే రోజులచ్చినయి!” అని గునిసింది దూలమ్మ.
వారం రోజులుగా కురుస్తున్న వాన.. ఊరు – వాడ, ఇళ్లు – వాకిళ్లను తడిపి ముద్దజేసింది. బైటెక్కడ తడవని బెత్తెడు జాగా కనిపించడం లేదు. చెట్లన్నీ తల కడుక్కున్నట్లు నీళ్లు ఒడిపిస్తున్నయి. అప్పుడప్పుడూ తోలే గాలికి.. చెట్ల ఆకులు దాచుకున్న నీళ్లను జలపరిస్తున్నయి.
పశుపక్ష్యాదులు ముడగ దీసుకొని, రెక్కలకింద తలలు దాచుకొని పడుకున్నయి. తల్లి పక్షులు తమ పిల్లలను రెక్కలకింద వెచ్చగా దాచుకొని, కదలకుండా ధ్యానముద్రలో ఉన్నయి. అప్పుడప్పుడూ తలలు ఆడిస్తున్న ఎద్దుల మెడలోని గంటల చప్పుడు.. లయబద్ధంగా వినిపిస్తున్నది. కప్పల బెకబెకలు, కీచుమనే తీతువుల అరుపులు, తడి రెక్కలను విదుల్చుకునే పక్షుల రెక్కల టపటపలు.. నిశి నిశ్శబ్దానికి భంగం కలిగిస్తున్నయి.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన.. నింగికి, నేలకు మధ్య వెండి దారంతో మగ్గం నేస్తున్నట్లున్నది. రెక్కాడితే కానీ డొక్కాడని పేదలు, వాన ముసురుకు పని దొరక్క.. కలో గంజో తాగి కడుపుల కాళ్లు పెట్టుకొని కాలం ఎల్లదీస్తున్నరు.
కానీ, ఎండుపుల్ల దొరకనియ్యని వానతడుపు కారణంగా.. కట్టెల పొయ్యిని ఊదలేక, ఊపిరాడక నానా యాతన పడుతున్నరు. కట్టెల పొయ్యిలోంచి వచ్చే పొగ, గడ్డి గుడిసెల పైకప్పు మీద పరుచుకొని.. ‘గుడిసెలు తగలబడుతున్నయా!!?’ అని భ్రమింప జేస్తున్నది. అందుకే.. పొయ్యి కిందికి, పొయ్యి మీదికి ఉన్న మారాజులకు వానకాలమంత వైభోగం లేదంటరు! నిజమే మరి.
వాన కాస్త తెరిపిచ్చింది. ఊళ్లో హడావుడి మొదలైంది. ఇంత వానపడ్డా పేదల గుడిసెలకు మంచినీళ్లు కరువే! మంచినీళ్ల కోసం పేదలంతా బొడ్రాయి దగ్గరున్న బాపనోళ్ల బాయి దగ్గరికి బారులు తీసిన్రు. బురదమయమైన దారిలో కాళ్లు ఒత్తిపట్టి ఏస్తూ.. సుట్టబట్ట మీదున్న మట్టికుండ జారిపడకుండా చేతులు వదిలి, ఒడుపుగా ఒయ్యారంగా నడుస్తున్నరు నీళ్లు మోసే ఆడోళ్లు.
ముసలయ్య కొరకాసుతో ఆకుచుట్ట ముట్టించి నోట్లోపెట్టుకొని.. బుగ్గలు లొట్టలు పడేలా పొగను లోపటికి గుంజుతూ.. కుండల కావడిని భుజానేసుకొని మంచినీళ్ల బాయికి బైలెల్లిండు.
ఎదురుగా మోటరు సైకిలు మీద అచ్చిన సైదిరెడ్డి..
“అరేయ్.. ముసిలి! ఆన తెరిపిచ్చిందిరా! ఇయ్యాల జీవాలను మేతకు తోల్కపో! ఇంటికాడ అమ్మగారు సద్దిగడతది. నువ్వు జల్దీ రారా!” అని గిరుక్కున మళ్లిపోయిండు.
ముసలయ్య సద్దిమూట, నీళ్ల బుర్ర కర్రకు కట్టి.. భుజం పైన వేసుకొని, తలకు గొంగడి కొప్పెర కప్పుకొని.. మేకలను అడివిబాట పట్టించిండు.
వారం నుంచి దొడ్డి దాటని మేకలు.. కంటబడ్డ ఆకులు, అలములను ఆవురావురుమని మేస్తూ.. వడివడిగా నడుస్తున్నయి. కంచెలకు అల్లుకున్న తీగలను రెండుకాళ్లమీద నిలవడి మేస్తున్నయి.
మందలో కొమ్ములు వడితిరిగి, గడ్డం మొలిసిన మేకపోతు.. మరకల ఉచ్చలు వాసన చూస్తూ.. ఎదకొచ్చిన వాటి వీపు మీద రెండుకాళ్లు పెట్టి, సృష్టి కార్యాన్ని నిర్వహిస్తున్నది.
ముసలయ్య.. మేకలను ‘దున్నపోతుల వాగు’ దాటించి, ఆవలి గట్టున మేపుతున్నడు.
అప్పటివరకూ తెరిపిచ్చిన వాన.. ఒక్కసారిగా కుండపోతలా మారింది. ఈదురుగాలి భయంకరంగా వీచింది. తాటిచెట్లు నేలను తాకుతున్నట్లు వంగి లేస్తున్నయి. పెళుసు కొమ్మలు విరిగి పడుతున్నయి. బలహీనమైన చెట్లు వేళ్లతోసహా పెకిలించుకొని నేల కూలుతున్నయి. మేకల మందతో ముసలయ్య ఒక మర్రిమాను కింద తల దాచుకున్నడు. మేకలన్నీ పడుకొని నెమరు వేస్తున్నయి.
వెంట తెచ్చుకున్న సద్దిమూట విప్పుకొని తిని, ఆకుచుట్ట వెలిగించి ప్రశాంతంగా పొగ తాగుతున్నడు ముసలయ్య. ఇంతలో కడుపుతో ఉన్న మేక.. ఈనడానికి నొప్పులు తీసింది. కుదురుగా పడుకోలేక, నిలబడలేక ఆపసోపాలు పడ్డది. ముసలయ్య ఒడుపుగా మేకకు పురుడు పోసిండు. అమడాల పిల్లలు పుట్టినయి. మాయ పడగానే.. మేక పిల్లలను తల్లిమేక నాకి శుభ్రం చేసింది. మేక పిల్లలను తల్లి మేక పొదుగు దగ్గరపెట్టి, పాలు కుడిపించిండు ముసలయ్య.
మరోదిక్కు చీకటి పడుతున్నది. వాన జోరు మాత్రం ఆగలేదు. మర్రిమాను మొదలు తప్ప.. నేలంతా వరద కట్టింది. మేకలన్నీ లేసి నిలబడ్డయి. ఉరుములు, మెరుపులతో వాతావరణం భీకరంగా మారింది. ఎక్కడో పిడుగుపడ్డ శబ్దం.. చెవులకు చిల్లులు పడేలా తాకింది.
ముసలయ్య కొప్పెర కప్పుకొని వాగుదాక పోయి చూసిండు. వాగు ఉగ్గరం వచ్చినట్లు పొంగుతున్నది.
ఊళ్లోని ఆలమందలోళ్లు, మేకల మందలోళ్లు సోపతి కూడిన్రు. వాగు దాటనియ్యదని తెలిసి.. ముసలయ్యతోపాటు అంతా ఎనకకు మల్లిన్రు.
అట్లా మొదలైన వాన.. రెండు దినాలైనా తెరిపియ్యలేదు. అందరూ నెగళ్లేసుకొని కూసున్నరు. తడిసిన పుల్లలకు పొగ తప్ప.. మంట రావడంలేదు. అందరూ ఆకలికి, చలికి అలమటిస్తున్నరు. అప్పుడప్పుడూ మేక పాలో, ఆవు పాలో తాగి.. ప్రాణాలు నిలబెట్టుకుంటున్నరు.
ఆకలికి, వాన తడుపు చలికి.. ముసలయ్యకు జ్వరం పట్టింది. దగ్గు ఆగడం లేదు. పెయ్యి కాలిపోతున్నది. ఇంటి మీద పానం గుంజుతాంది. ఈ వానకు ఇల్లెట్లున్నదో!? అవిటి పోరడు, గుడ్డి ముసల్ది.. యాదికచ్చిన్రు. కండ్లపొంట వటవట నీళ్లు గారినై.. ముసలయ్యకు!
“వాన తగ్గినా.. రెండు రోజులైతేగాని వాగు దాటనియ్యది. తెల్లారంగనే డొంక బాటన నడిచి, వాగు పెద్దపాయ దగ్గర దాటి ఊళ్లెకు పోదం!” అన్నరు సోపతి గాళ్లంతా!.
డొంకదారిన వెళ్లాలంటే పది మైళ్లు నడక.. ముసలయ్యకు పానం మీదికొచ్చినా తప్పింది కాదు. అందరితోపాటు సొలుక్కుంట, సొక్కుకుంట.. మేకపిల్లలను భుజానేసుకొని నడుస్తున్నడు ముసలయ్య. పెయ్యి తిప్పినట్లయి.. కాళ్లు తడవడుతున్నయి. కండ్లు బైర్లు కమ్ముతున్నయి. అయినా.. నమ్మిన ఆసామి కోసం, గుండెల నిండా స్వామిభక్తి నింపుకొని, ఓపికనంతా కూడగట్టుకొని నడుస్తున్నడు ముసలయ్య.
సస్తాబతుకుతా ఇల్లు చేరిండు. మందను దొడ్లె తోలి.. సొలిగి గల్మల్లనే ఇసురుకొని పడ్డడు ముసలయ్య.
జీవాలను లెక్కబెట్టుకొని ముసలయ్యను లేపి చూసిండు సైదిరెడ్డి. ఎగపోత – దిగపోతగా ఉన్నది ప్రాణం. ముసలయ్యను జీతగాళ్లతో ఎత్తించి, ఇంటికి తోల్కపొమ్మన్నడు.
“అయ్యా! దవాఖానకు తోల్కపోదం. ముసలోడు కాలిపోతాండు!”.. సైదిరెడ్డితో అన్నరు జీతగాళ్లు.
“తెల్లారి సూద్దాం లేరా! ఈ నాత్రి ఏడికి తోల్కపోతం రా!” అని గదమాయించి.. ఆళ్ల నోరు మూయించిండు సైదిరెడ్డి.
రాత్రంతా పెండ్లాం, కొడుకు.. కండ్లార్పకుండ కాళ్లు, చేతులు రుద్దుతనే ఉన్నరు. ముసలయ్యకు గంజి కూడా గుటక పడటం లేదు. ముసలయ్య కండ్లు తెరిచి, పెండ్లాన్ని, కొడుకును చూసుకున్నడు. ఎండిపోయిన కండ్లపొంటి.. వెచ్చగా నీటి చుక్కలు బైటికొచ్చినయి.
‘గుడ్డి పెండ్లాం, కుంటి పోరడు. నేను పుటుక్కుమంటే ఈళ్ల గతేంకాను!’.. అంత బాధలోనూ ముసలయ్యకు తన భార్యా పిల్లల భవిష్యత్తే కండ్లముందు కదిలింది. తనకోసం కాకున్నా.. అశక్తులైన తన వాళ్లను బతికించడం కోసమన్నా తనను బతికించమని కోటి దేవుండ్లకు మొక్కుకున్నడు.
ముసలయ్యకు సైదిరెడ్డి యాదికొచ్చిండు. జీవితాంతం చాకిరీ చేయించుకున్న యజమాని. తన పానం మీదికి వస్తే ఒట్టిపోయిన గొడ్డులా ఒదిలేసిండే తప్ప.. ‘అయ్యో!’ అనలేదు. ‘అయినా! కటికోనికి గొర్రె మీద ఏం ప్రేమ!’ అనుకున్నడు.
ముసలయ్య ఒళ్లు దాచుకోకుండా చేసిన పుట్టెడు చాకిరీతో నాలుగు మేకలు.. వంద మేకల మంద అయ్యిందనీ, ముసలయ్యకు ఇచ్చే జీతంకన్నా వాడు తెచ్చిన లాభమే ఎక్కువని సైదిరెడ్డికి తెలిసినా! ఇదంతా తన అదృష్టం అనుకున్నాడే తప్ప.. ముసలయ్య శ్రమకు విలువకట్టలేదు. సైదిరెడ్డి దృష్టిలో ముసలయ్య ఒక కూలోడు మాత్రమే.
‘వాడు జీతం తీసుకుంటున్నడు. దానికి తగ్గ పని చేస్తున్నడు. డబ్బుంటే చాలు.. ముసలయ్య కాకుంటే మరొకడు ఆ పనిచేస్తడు. అంతే!’.. ఇది సైదిరెడ్డి సిద్ధాంతం. పెట్టుబడిదారీ ఆలోచనలో డబ్బుకున్న విలువ మనిషికి ఎందుకు ఉంటుంది? మనిషి కూడా ఒక పనిచేసే యంత్రం మాత్రమే! ఈ ఆలోచనే తరతరాల శ్రమ దోపిడీకి పునాదులు వేసింది. ఈ అంతరమే సమాజంలో వర్గపోరాటానికి దారులు వేసింది. ఈ అహంకారమే చరిత్రలో అనేక తిరుగుబాట్లకు ఆజ్యంపోసింది.
పట్నం పోయే తోవలో..
సైదిరెడ్డి ప్రమాదానికి గురై ప్రాణం మీదికి తెచ్చుకున్నడు.
ముసలయ్యకు డబ్బులిస్తే తిరిగి రావన్న సైదిరెడ్డి కక్కుర్తి ఆలోచనతో పెట్టుకున్న అనవసరపు ప్రయాణం వల్ల..
ఉన్న గొడ్డూ – గోదా, ఆస్తి – పాస్తులు అమ్మి.. దవఖానకు లక్షలుధారపోసినా సైదిరెడ్డి ప్రాణం మాత్రం నిలబడలేదు.
కానీ, ముసలయ్య దృష్టిలో యజమాని అంటే దేవుడు. ఎదిరించి మాట్లాడటం, కనీసం నోరుతెరిచి తన అవసరాన్ని అడగడం కూడా స్వామి ద్రోహం అని తలిచే స్వభావం కలవాడు. పుట్టెడు చాకిరీ చేసినా.. శ్రమకు తగ్గ ఫలం వచ్చిందా? రాలేదా? అని కూడా ఆలోచించే వాడు కాదు. రెక్కలు ముక్కలు చేసుకొని తన శక్తినంతా ధారపోసి, యజమాని చెప్పిన పనిచేయడమే తన కర్తవ్యం అనుకునేవాడు. కానీ, అంతర్లీనంగా ఈ పని వదిలే ధైర్యం, మరో పని వెతుక్కునే ఆత్మవిశ్వాసం, తన శ్రమ శక్తి మీద నమ్మకం కానీ.. ముసలయ్యకు లేకపోవడం ఒక కారణం అయితే, ప్రశ్నించే ధైర్యం, అండగా నిలబడే సంఘటిత బలం లేకపోవడం.. ఇలాంటి బలహీనుల గొంతు పెగలకపోవడానికి మరో కారణం!
‘ముసలయ్య పరిస్థితి బాగాలేదు. వాని ప్రాణం ఇప్పుడో అప్పుడో అన్నట్లుంది. వాడు బతికితే దవాఖాన ఖర్చులకు డబ్బులియ్యాలి! చస్తే చావు ఖర్చులకు డబ్బులియ్యక తప్పదు! కానీ, ఒక వేళ ఇస్తే.. వాడు పుటుక్కుమన్నాక పైసలు తిరిగొచ్చేది ఎట్లా? గుడ్డి పెండ్లాం, అవిటి పోరడు ఇచ్చిన అప్పెట్ల తీరుస్తరు?’ అని తలపోసిండు సైదిరెడ్డి.
దొరలకు ప్రాణం ఉన్న మనుషుల కంటే.. ప్రాణం లేని పైసలంటేనే మక్కువ మరి!
ఎందుకొచ్చిన లొల్లి పంచాయితీ అనుకొని.. లేని పనిని కాయించుకొని వారందాకా ఇంటికి రానని పెండ్లానికి చెప్పి, రాత్రికి రాత్రే పట్నం దారివట్టిండు సైదిరెడ్డి.
కానీ, ఎవనిగతి ఏం కానున్నదో.. ఎవనికెరుక!? కొందరు ‘విధి లిఖితం’ అన్నా! మరికొందరు ‘పాపం పండింది’ అన్నా.. జరిగేది జరగక మానదు.
పట్నం పోయే తోవలో.. సైదిరెడ్డి ప్రమాదానికి గురై ప్రాణం మీదికి తెచ్చుకున్నడు.
ముసలయ్యకు డబ్బులిస్తే తిరిగి రావన్న సైదిరెడ్డి కక్కుర్తి ఆలోచనతో పెట్టుకున్న అనవసరపు ప్రయాణం వల్ల.. ఉన్న గొడ్డూ – గోదా, ఆస్తి – పాస్తులు అమ్మి.. దవఖానకు లక్షలు ధారపోసినా సైదిరెడ్డి ప్రాణం మాత్రం నిలబడలేదు.
ముసలయ్య.. పైసలు లేని కారణంగా నవిసి నవిసి ఊపిరి వదిలిండు. సైదిరెడ్డి.. డబ్బులకు కక్కుర్తిపడి ప్రాణం పోగొట్టుకున్నడు.
ముసలయ్యకు బాధ్యతలు ఉన్నాయనో! సైదిరెడ్డికి డబ్బులు ఉన్నాయనో చావు రాకమానదుగా! చావు తూకంలో అంతా సమానమే!
డబ్బులు లేక చచ్చిన ముసలయ్య శవం, డబ్బులు పెట్టినా దక్కని సైదిరెడ్డి శవం.. రెండూ కాష్టాలగడ్డకు చేరుకున్నయి.
డబ్బులుండి చచ్చిన సైదిరెడ్డి, డబ్బులేక చచ్చిన ముసలయ్య ఇద్దరివీ వట్టి చేతులే! ఇద్దరి పేర్లూ ఒక్కటే.. ‘శవం’. ఇద్దరూ కాలి బూడిదయ్యింది కట్టెల మంటల్లోనే!
ముసలయ్య ఉసురుగొట్టి, సైదిరెడ్డి చచ్చిండని.. ఊరంతా గుబగుబలాడింది.
ముసలయ్యను చూసి.. ‘అయ్యో పాపం!’ అన్న జనాలే..
సైదిరెడ్డిని చూసి.. తుపుక్కుమని ఊసిన్రు.
ఆ రాత్రి కురిసిన వాన.. కులం – మతం, బీద – ధనిక అనే ఏ వివక్షా చూపకుండా ఇద్దరి బూడిదలనూ కలిపేసింది. కానీ, ఈ మనుషుల అంతరాలు చస్తే తప్ప పోవనుకుంటా!
అందుకే మనిషిని మనిషిగా ప్రేమించలేని మనిషికి, మరణంలోనూ ప్రశాంతత ఉండదనుకుంటా!
రంగనాథ్ సుదర్శనం
రచయిత రంగనాథ్ సుదర్శనం స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు. ఎం.ఎ (సమాజ శాస్త్రం) చదివారు. సింగరేణిలో అసిస్టెంట్ సూపరింటెండెంట్గా ఉద్యోగం చేస్తున్నారు. 2019 నుంచి కథలు రాస్తున్నారు. ఇప్పటివరకు 86 కథలు రాశారు. మొదటి కథ.. ‘నవ్వులపాలైన పెళ్లి’ గోతెలుగు వెబ్ మ్యాగజైన్లో ప్రచురితమైంది. ఆ తరువాత ఎన్నో కథలు.. గోతెలుగు, సహరి, హాస్యానందం, జాగృతి, తపస్వీ మనోహరం, మన తెలుగు కథలు, సుకథ వంటి వివిధ మాధ్యమాల్లో ప్రచురితమయ్యాయి. ‘ఉరిమెళ్ల ఫౌండేషన్ అక్షరాల త్రోవ’ నిర్వహించిన రెండు తెలుగు రాష్ర్టాల స్థాయి కథల పోటీలో.. ‘ఎక్కిరింపు’ కథకు మొదటి బహుమతి అందుకున్నారు. గోదావరి రచయితల సంఘం కథల పోటీలో ‘దేవుడు పారి పోయాడు’కు ద్వితీయ బహుమతి వచ్చింది. వివిధ పోటీల్లో.. ‘దేవునిచెట్టు’, ‘రథం ముగ్గు’, ‘బాల బంధువులు’, ‘లోకం పోకడ’, ‘గ్రహణం విడిచింది’, ‘ఆరిపోని దీపం’ కథలు బహమతులు గెలుచుకున్నాయి.
రంగనాథ్ సుదర్శనం
98662 65630