Jaya Senapathi | జరిగిన కథ : ఓ పల్లెటూరి జానపద గాయని కోసం వెతుక్కుంటూ వచ్చిన జాయపకు.. ఊహించని సంఘటన ఎదురైంది. తను వచ్చే సమయానికి ఆ గాయనిని తన భర్త హింసిస్తుండగా.. కాపాడి తీసుకుపోయింది నీలాంబ కుమార్తె లలితాంబ! అంతే, తెల్లబోయాడు జాయపుడు. మరునాడే నీలాంబ వేశ్యాగృహానికి వెళ్లాడు. ఎప్పుడూ ఈ వేశ్యావాటికను పరిశీలనగాచూడలేదు. ఇప్పుడు కలియజూస్తే అర్థమైంది ఏవిటంటే.. వాటిక ప్రధానద్వారం ఒక్కటే కానీ, కార్యకలాప మందిరాలు వేరు, నివాస మందిరం వేరు.
జాయపుడు రెప్పవేయని కళ్లతో అయోమయంగా కలియ జూస్తున్నాడు. అప్పుడు మొదటి అంతర్వులో అక్కతోనే ఆమె పర్యంకంపై పక్కనే నిద్రపోయాడు. అక్కడే లలితాంబ కూడా ఉండేది. మరెందరో పిల్లలతో ఓ చిన్న
పిల్లల బృందం ఉండేది. బయటికి వచ్చేటప్పుడు ఎవరెవరో వెంట వచ్చి.. పల్లకీ లేదా ఎడ్లబండి లేదా అశ్వంపై తీసుకెళ్లేవారు.. తీసుకువచ్చేవారు. తను ఎప్పుడూ ఒంటరిగా వెళ్లలేదు. రాలేదు. ఇవన్నీ చూస్తుంటే..
‘అసలు ఆమె వేశ్యా సామ్రాజ్యంలోకి.. అంటే అవతలి మందిరాల్లోకి అడుగుపెడితే ఎలా ఉంటాయో? ’ అని తలపోస్తుండగా, నీలాంబ ఓ బంగారుపళ్లెరంలో బొబ్బట్లు, బూరెలు, అల్లపు గారెలు తీసుకువచ్చింది.
నవ్వుతూ ఏదో చెబుతూ, ఓ గారెను జాయపుని నోటికి అందించింది. జాయపుడు కూడా అంతే ఆప్యాయతతో నోరుతెరిచి అందుకున్నాడు.
మాతృత్వభావనపు పరవశం ఆమె శరీరమంతా నిండి తొణికిసలాడుతున్నది. ఆమెను చూస్తుంటే జాయపునికి తన తల్లివరుస బంధువులు గుర్తుకువస్తున్నారు. ఇప్పుడామె మగవాని చూపులకు తన తనూలావణ్యాన్ని ఎరవేసే అనుభవజ్ఞురాలైన వేశ్యావాటిక నిర్వాహకురాలిగా లేదు. ఓ తల్లిలా ఉంది. ఓ అక్కలాగా ఉంది. బిడ్డ ఆకలి తీర్చే పక్షిలా ఉంది. కోడెదూడకు పాలిచ్చే గంగిగోవులా ఉంది. అతనితో మాట్లాడుతున్నా.. జాయపుని చూపుల్లో కదలాడుతున్న ప్రశ్నార్థకాలు, ఆశ్చర్యార్థకాలు గుర్తించలేని అమాయకురాలు కాదు నీలాంబ. జాయపుడు తినడం పూర్తయ్యాక అన్నది..
“నా వేశ్యావాటిక చూస్తావా?” అని. జాయపుడు కంగారుపడ్డాడు. పొలమారింది కూడా! నీటికోర అందించింది. అతని జవాబు కోసం చూడకుండానే లేచి కదిలింది.
“నాతో రా!” అన్నది. జాయపుడు ఆమె వెంట కదిలాడు.చిన్నతోవ గుండా వెళ్తుండగా..
“అప్పట్లో నువ్వు పిల్లవాడివి. ఇక్కడి కార్యకలాపాలు నీకు తెలియదు. అప్పుడు చెప్పినా అర్థంకాదు. ఇప్పుడు అర్థం చేసుకునే వయసుకు వచ్చావు. ఇప్పుడు చెప్పి తీరాలి” అని అన్నది. జాయపుని ఊహలకు ఆమె అందడంలేదు. తన మనసులో ప్రశ్నలను, భావాలను గుర్తించినట్లే జవాబిస్తున్నది. ముఖంలోని ప్రశ్నలకు వివరంగా జవాబులు చెబుతున్నది. ప్రధానమందిరం లోపలికి కుడికాలు పెట్టిన జాయపునికి మతిపోయింది. అదొక స్వప్నసౌధం. ఇంద్రుని శృంగారవాటిక లాంటి ప్రధానమందిరం.. అది ఉదయవేళ కావడాన నిద్రిస్తున్న ఊర్వశిలా ప్రశాంతంగా కనిపించింది జాయపునికి. అద్భుతమైన శృంగార సన్నివేశాలతో, శృంగార జంటల చిత్రాలతో అలరారుతున్న కుడ్యాలు.. ఓ శృంగార ప్రపంచాన్ని చెప్పకనే చెబుతున్నాయి. అంతటా ఖరీదైన ఆసన, పర్యంకాలు.. మొత్తం విదేశీ వస్తుసముదాయం. దంతశిల్పాలు పొదిగిన కళలూరే స్తంభాలు.. చిత్రవిచిత్ర లతలు నగిషీ చేసిన కంచు దీపస్తంభాలు.. మధ్యలో ఉన్నత వేదిక. దానిపై ఓ ఉన్నతాసనం..
‘బహుశా నీలాంబక్క కూర్చునే ఆసనం కావచ్చు!’.. అనుకున్నాడు. “ఇది పెద్దలు ప్రవేశించే ప్రధాన మందిరం. దీనికి అటూ ఇటూ నాట్య మందిరం, సంగీత గోష్ఠి మందిరాలు.. పద చూద్దాం..” అంటూ వాటిని చూపించింది. అవి కూడా ప్రస్తుతం నిర్మానుష్యంగా ఉన్నాయి. కానీ, వాటి ఉన్నతత్వం జాయపునికి తెలుస్తున్నది.
“లోపలికి వెళ్దాం పద.. ఇదిగో ఇవి రసికులకు నిర్దేశించిన గదులు! ఇవన్నీ గణికలు, నాట్యకత్తెలు, గాయనీమణులు, వాద్యకారిణులు.. తదితరులుండే మందిరాలు, గదులు. ఇవన్నీ వేశ్యలుండే గదులు!”.
ఎంతోమంది మహిళలు ప్రశాంతంగా ఎలాంటి అలంకరణలు లేకుండా విశ్రాంతిగా కూర్చుని, నిలబడి, పడుకొని ఉన్నారు. జాయపుణ్ని చూసి అంతా సంభ్రమంగా.. నమస్కరిస్తూ నవ్వులతో పలుకరింపుగా చూస్తూ..
“అదిగో అటుచూడు.. అవన్నీ వారి భోజనశాలలు. అవన్నీ వారి ఇతర వస్తుసముదాయం ఉన్న గదులు!”
.. మరోవైపు నడుస్తూ..
“అదిగో అవన్నీ విటులకోసం ఏర్పరచిన భోజనమందిరాలు. అది మధుసేవన మందిరం!”..మరోవైపు కదులుతూ..
“అవి ఈ మహిళల పిల్లలు, వృద్ధ మహిళల మందిరాలు. అదిగో అవి బోయీలు, నపుంసకులు తదితరుల నివాసాలు! ఇంకా చూస్తావా!? అవన్నీ వాహనాలు, పల్లకీలు, గుర్రాలు, ఏనుగులు.. తదితర వాహన జంతువుల చావడులు, వాటి నిర్వహణ, మేత తదితర అంశాలకు సంబంధించిన దొడ్డి.. ఈ వేశ్యావాటికకు, నాకు సేవలు అందిస్తున్న అందరూ కన్నబిడ్డల్లా.. ఈ తల్లికోడి రెక్కలకిందే ఉన్నారు”.
జాయపునికి మతిపోయింది. నీలాంబక్క ఓ నాట్యకత్తె.. నీలాంబ భవంతి, చౌండసేనాని భవంతి లాంటివి ఆ పసికాలాన అతనికి పరిచిత భవంతులే. కేవలం సుబుద్ధి ఇంటికి వెళ్లినప్పుడే కొంచెం ఆశ్చర్యపోయాడు.
కానీ, ఇప్పుడు యుక్తవయస్కుడైన జాయపునికి అన్నీ అర్థమవుతుండగా.. నీలాంబలాంటి అక్క నిర్వహిస్తున్న ఈ వేశ్యా సామ్రాజ్యం అతణ్ని తీవ్రంగా ఆశ్చర్యపరచింది. మొత్తంగా ఓ మాయామేయ ప్రపంచం. నీలాంబ లాంటివారు ఇప్పుడు కేవలం శరీరంతో సొమ్ము గడించే మహిళల సముదాయం కాదు. సమాజం, పాలకులు గుర్తించి గౌరవించే ఓ ముఖ్యమైన వ్యవస్థ.
“ఈ వాటికలో ఇలాంటి గృహాలు దాదాపు ఓ వంద ఉన్నాయి. గతంలో ఓ పాతిక ఉండేవి. ఇప్పుడు ఈ గణపతిదేవుని పాలనాకాలానికి వంద అయ్యాయి. మేం.. ఈ వందగృహాలవాళ్లు చెల్లించే పన్నుల విలువ ఎంతో తెలుసా..?” అని అడిగింది నీలాంబ. తల అడ్డంగా ఊపాడు. ఆమె అల్లరిగా నవ్వి.. “ఇప్పుడు రాజనగరి నివాసివి కదా! ఇలాంటి ఆశ్చర్యపరచే అంశాలు కూడా తెలుసుకో.. జాయపా! జాయప సేనానీ” అన్నది మురిపెంగా.
అంతా చూసి తిరిగి వచ్చి ఆసనాలలో కూర్చున్నారు. మాటలు రావడం లేదు జాయపునికి.
ఇదొక చెడువ్యవస్థ అనాలో.. మంచి వ్యవస్థ అనాలో తెలియడంలేదు. కానీ, నీలాంబలాంటి అక్కలు నిర్వహిస్తున్న ఈ వ్యవస్థ మాత్రం దగాపడ్డ మహిళలకు గొప్ప ఆసరా! ఆసరా మాత్రమే కాదు.. వాళ్లు తల ఎత్తుకుని జీవించేలా ఈ వ్యవస్థకొక సామాజిక స్థాయినివ్వడం అద్భుతం. రాజులదేముంది!? పన్నులు వస్తాయంటే చాలు ఏ వ్యవస్థనైనా ప్రోత్సహిస్తారు.
“నిజానికి నువ్వు సంధ్యవేళ వస్తే అసలు సిసలు.. వేశ్యా ప్రపంచం కనిపిస్తుంది. వస్తావా!? మరింత విపులంగా చూడవచ్చు”.
“చాలు. నేను చూడాల్సింది చూశాను..” అన్నాడు జాయపుడు. ఇద్దరూ కదిలి మొదటి అంతర్వుకు చేరారు. అప్పుడు చూశాడు.. అక్కడ కుడ్యానికున్న ఓ మహారాజు ఆహార్యంలో ఉన్న వ్యక్తి భారీ చిత్తరువు..
“ఎవరక్కా.. ఆయన!?”. చాలాసార్లు అక్కడికి వచ్చినా, ఆ చిత్తరువును ఎన్నోసార్లు చూసినా.. ఎప్పుడూ సందేహం రాలేదు. ఇప్పుడొచ్చింది. ఆమె ఆ చిత్తరువువైపు మెల్లగా వెళ్తూ.. ఆరాధనగా చాలాసేపు చూసింది.
ఈరోజు అసలు సిసలు నీలాంబను చూస్తున్నానని జాయపునికి తట్టింది.
“నా..” అంటూ చెప్పబోయి.. “ఎవరో చెప్పుకో..” అన్నది. ఆమె కళ్లు నీరునిండిన మేఘాలై.. ముసిరిన జ్ఞాపకాలతో బరువెక్కి.. ఉద్వేగంతో కదలాడుతున్నాయి. అమాయకంగా ఎప్పటి పిల్లవానిలాగే.. “నాకు తెలియదు అక్కా..” అన్నాడు జాయపుడు. ఆమె గట్టిగా నవ్వి.. “అందుకే నువ్వంటే నాకు అంత ప్రేమ..” అన్నది.అతని బుగ్గలు పుణికింది.
“ఆయన లలితాంబ తండ్రి..” అన్నది. బుగ్గల్లో గడ్డకట్టి ఉన్న ఎరుపంతా ఆమె చెబుతున్నప్పుడు తిరిగి కరిగి, శరీరమంతా పాకినట్లు నీలాంబ క్షణకాలం చిరుకంపనతో కదలాడింది. మహానాట్యకారుడైన జాయపుడు ఆ సంస్పందనను గుర్తించాడు. అప్పుడే కింద మందిరంలో ఏదో కలకలం.. ఆమె అదేదో గుర్తించి..
“లలిత వచ్చినట్లుంది..” అంటూ వేగంగా కిందికి మెట్లు దిగుతుండగా, జాయపుడు అనుసరించాడు.కింద నిజంగానే లలితాంబ మరికొందరు మహిళలతో లోపలికి వచ్చింది. ఆ బృందంలో కొత్తగా మరో ఇద్దరు మహిళలు.. చూడగానే గ్రామీణుల్లా ఉన్నారు. నిన్నటి దృశ్యం మళ్లీ పునరావృతమైనట్లు అర్థమైంది జాయపునికి. ఈసారి ఇద్దరు మహిళలను రక్షించి, కాపాడి తీసుకువచ్చారన్నమాట. అతనికి లలితాంబ ఓ యోధురాలిలా..
ముఖ్యంగా అనాథ మహిళలను కాపాడటానికి పుట్టిన దేవతలా తోచింది. నీలాంబను, జాయపుణ్ని ఒకేసారి చూసింది లలితాంబ.
తల్లిని వదిలేసి..
“అరె.. జాయ మామా! ఇప్పుడు ఇక్కడ..?”. ఆమె ముఖంలో రెండులిప్తలముందు ఆ చిత్తరువు చూస్తున్నప్పటి నీలాంబ ముఖ కవళికలు.. దగ్గరగా ఆత్మీయంగా వచ్చి కళ్లలో కళ్లుపెట్టి చూస్తూ.. “అమ్మా.. మామకు భోజనం పెట్టావా..?” అన్నది తల్లితో. “అక్క ఏదో పెట్టిందిలే! నువ్వేమీ నాకు అతిథిమర్యాదలు చెయ్యనక్కరలేదు. ఇది నా అక్క నివాసం. సరే సరే.. ఇవ్వాళ్టి కథ ఏమిటో చెప్పు.. వినాలని కుతూహలంగా ఉంది లలితా..” అన్నాడు జాయపుడు.
“ఏముంది? అన్ని కథలూ ఒక్కటే! భర్త దుర్మార్గం.. ఇంటివాళ్ల సహకారం.. ఊరివాళ్ల నిర్లిప్తత.. ఎక్కడో ఎవ్వరో నీబోటి పుణ్యాత్ములు మాకు తెలియజేస్తే.. వాళ్లను రక్షించి ఇక్కడికి తీసుకురావడం. అమ్మ, అమ్మమ్మ నాటినుంచీ ఇదే కథ.. ఒక్కటే వ్యథ!” చెప్పింది లలితాంబ.
“నేను ఇప్పుడు తిరగలేకపోతున్నాను జాయపా! అందుకే లలిత వెళ్తున్నది. లోపల నువ్వు చూసిన ఆడవాళ్లంతా అలా వచ్చినవాళ్లే! వాళ్లు, వాళ్ల పిల్లలు.. ఇక్కడ హాయిగా, స్వేచ్ఛగా మరణించేవరకూ.. ఏ చీకూచింతా ఉండదు!”.
బతకడానికి ఒళ్లు అమ్ముకునే దుస్థితి ఆ అభాగ్య స్త్రీలకూ రాకుండా స్త్రీలకు ఓ హోదా, స్థాయి, సంఘగౌరవం ఈ వేశ్యావాటికల వ్యవస్థవల్ల ఏర్పడింది. ఇది గొప్ప విప్లవం.
జాయపునికి ఇప్పుడు నీలాంబక్క మరింత ఉన్నతంగా కనిపిస్తున్నది.
నిత్యం మూడు సమావేశాలు అధికారికంగా ఉంటాయి రాజప్రాసాదంలో. అన్నిటినీ పూర్తి ఉత్సాహంతో నిర్వహిస్తాడు మహామండలేశ్వరుడు గణపతిదేవుడు. నాలుగవది సాంస్కృతిక సమావేశం. నిత్యం ఏదో ఓ సాంస్కృతిక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఆసక్తి, ఓపిక ఉంటే వెళ్తాడు.. లేకుంటే తన నివాసానికే వచ్చేస్తాడు. అనంతరం అంతఃపురానికి వెళ్తాడు. ఈరోజు బాగా అలసిపోయి.. సరాసరి నారాంబ అంతఃపురానికి వచ్చాడు. పరిచారికలు తెచ్చిన మంచినీటికోర భర్తకు అందించింది నారాంబ. తాగి.. కాస్త విశ్రాంతిగా పర్యంకంపై జారగిలబడ్డాడు గణపతిదేవుడు. కాస్త ఆశ్చర్యంతో నారాంబ వంక చూశాడు. ఆమె మౌనంగా ఉండటం ఆయన్ను ఆశ్చర్యపరచింది. ఆమె దేవళపు ఘంటలా.. ఎప్పుడూ గణగణ మోగుతూ ఉండాల్సిందే! దేవాలయంలో అలవాటైనట్లు ఇక్కడ కూడా ఆయనకు అలవాటైపోయింది. కానీ, ఇప్పుడు మౌనంగా ఉండటంతో ఆయన ఆశ్చర్యపోయాడు.
(సశేషం)
-మత్తి భానుమూర్తి
99893 71284