జరిగిన కథ : కాకతీయ ఆస్థాన నర్తకి నీలాంబ ఆధ్వర్యంలో జరిగే నాట్యోత్సవం కోసం..రాచనగరులో అడుగుపెట్టాడు జాయప. అక్కడే తన తండ్రిని ఓడించిన గణపతి దేవుణ్ని తొలిసారి చూశాడు. అంతలోనే.. అక్కడికి వచ్చిన అంతఃపుర స్త్రీలలో తన అక్కలు ఉన్నారేమోనని వెతికాడు. కానీ, నిరాశే ఎదురయ్యింది. ఇంతలో ప్రదర్శన ప్రారంభమైంది. ప్రహ్లాదుడి వేషధారణలో రంగప్రవేశం చేశాడు జాయప! తనను రక్షించాల్సిందిగా జాయప భక్తిభావంతో తనవైపే చూడటం..గణపతిదేవుడు గుర్తించాడు.
ప్రదర్శన మొత్తం పూర్తయ్యేవరకు నాట్యమండపం అంతా నాటకంలో లీనమై.. నటనానుభూతితో పరిమళించింది. అందరూ ప్రాణంపెట్టి నటించగా, జాయప ‘అక్కలు’ అనే మరో రెండుప్రాణాలు పెట్టి నటించాడు. ప్రదర్శనలో చివరి సన్నివేశం; నరసింహుడి ఎదుట మోకాళ్లపై కూర్చుని.. తన తండ్రికి ప్రాణభిక్ష పెట్టమనే సన్నివేశం. మోకాళ్లపై కూర్చున్న జాయప.. చేతులు జోడించి నిజంగానే ఏడ్చేశాడు. నట్టువాంగ గాయని మరింత విషాదంగా ఆలపించింది. ఆ దృశ్యం అందరినీ కదిలించింది. ప్రాంగణమంతా మౌనంగా రోదించింది.
సోమలదేవి కూడా సజలనయని అయ్యింది. నరసింహుడు శాంతించి దుష్టశిక్షణ, శిష్టరక్షణ తన అవతార పరమార్థమని.. భక్తుని కోరికను తను తప్పక నెరవేరుస్తానని అభయమివ్వడంతో.. ప్రదర్శన సంపూర్ణమై యవనిక విషాదంగా వాలింది.
అభినందన పూర్వకంగా మోగిన కరతాళధ్వనులతో రంగమండప ప్రాంగణమే కాదు.. రాచనగరి కూడా మారుమోగిపోయింది. గణపతిదేవుడు కరతాళధ్వనులతో తన ప్రశంసను ప్రకటించాడు. కళాకారులందరూ ఆయనకు వినయంగా ప్రణమిల్లారు. ఆయన జాయపనే చూస్తూ వేదిక దిగివచ్చాడు.
గణపతిదేవుడు.. మహామండలేశ్వరుడు.. తదేకంగా జాయపను చూస్తున్నాడు. చిత్రంగా జాయప కూడా ఆయనను అలాగే చూస్తున్నాడు. ఆయన చిటికెవేసి అడపంధారిని దగ్గరికి రమ్మని సైగచేశాడు. పళ్లెరంతో పరుగున వచ్చిందామె. గుండయామాత్యుడు, నీలాంబ కూడా మరింత దగ్గరికి వచ్చారు.
“నీలాంబా! ఈ కుర్రవాడు.. మమ్మల్ని చూస్తూ
నటిస్తున్నాడేమి?”.
నీలాంబే కాదు.. పెద్దలంతా చకితులై చూశారు.
“నీ పేరేమి?” అన్నాడాయన మార్దవంగా.
ఆయననే చూస్తున్న జాయప..
“జాయప!” అన్నాడు సరళంగా.
ఆయన నాణేల సంచిని జాయపకు అందించి..
“కళ్లుమూసి నటిస్తున్నావ్. కళ్లుతెరిస్తే మమ్ము
చూస్తున్నావ్!” అన్నాడు.
నీలాంబ వైపు తిరిగి..
“మంచి కుర్రవాణ్ని శోధించి బాగా సానపట్టావ్. కాస్త కళ్లు తెరచి నటించమని చెప్పు!”..
పకపకా నవ్వి, తిరిగి ఆసనం వైపు వెళ్లాడు గణపతి దేవుడు. భార్య చేతిలోని కుమార్తె గణపాంబను లాగి ఎత్తుకుని ముద్దుచేస్తూ.. ఆసనం దిగివచ్చి మంత్రులతో ముచ్చట్లు చెప్పసాగాడు. జాయప నడిసముద్రంలా గంభీరముద్ర వీడలేదు. కారణం అక్కలు రాలేదు. ఆ రూకల సంచిని నీలాంబకు అందించి ముభావంగా లోపలికి కదిలాడు. ఆమె ఏదో అనబోయింది కానీ, చాలామంది చుట్టుముట్టడంతో అభినందనలలో మునిగిపోయింది.
నీలాంబ జాయపను తర్వాత అడిగింది..
“ప్రభువులు చూశావా.. ఎంత తీక్షణంగా పరిశీలిస్తున్నారో?! నువ్వు కళ్లు మూసుకుంటున్నట్లు ఆయన అన్నారు కదా. నిజమేనా!? ఎందుకు కళ్లు మూసుకున్నావు?”.
“ఈ నాట్యాంశం నాకు తెలియదు కదా! రాత్రి గాయని పాడగా విని నటించాను. ఆమె పాడింది గుర్తు చేసుకోవడానికే కళ్లు మూసుకోవడం”.. వివరించాడు జాయప. మిగిలిన రోజులు కూడా అలాగే జరిగింది. పగలు గాయని పాడగా మొత్తం నాట్యకథాంశం, పాత్ర రంగ ప్రవర్తన.. తనకు తోచినట్లు అర్థం చేసుకుని
నటించేవాడు.
మహారాజులు ఇలాంటి కార్యక్రమాలకు సాంప్రదాయికంగా మొదటిరోజు మాత్రమే హాజరవుతుంటారు. సహజంగా రాచకార్యపు ఒత్తిళ్లతో హాజరుకాలేరు. కానీ, గణపతిదేవుని ప్రవర్తన పూర్తి భిన్నంగా ఉంది. అన్ని
రోజులూ హాజరై పూర్తిగా తిలకించి ఆనందించాడు. రాజ్యంలోని కళల పురోగతిపై చర్చించాడు కూడా.
అలాగే మరో అంశంపై కూడా ఆమెను ప్రశ్నించాడు.
“నీలాంబా.. మీ వేశ్యవాడనుంచి పన్నులు సరిగా వసూలు కావడం లేదని.. పన్నువసూలు అధికారులకు ఏదో.. ఏవో.. లంచంగా ఇచ్చి, పన్నులు ఎగ్గొడుతున్నారని నివేదిక. నిజమా?”.
అక్కడున్న అందరూ పగలబడి నవ్వారు. నీలాంబ విలాసంగా నవ్వుతూ ఉండిపోయింది. కానీ, లోలోన విస్తుబోయింది. ఏ మహారాజు ఇంతవరకూ ఇలా ప్రదర్శన సమయాన వేశ్యలపై పన్నులగురించి ఆడిగినట్లు వినలేదు. అందుకే గొప్ప మండలేశ్వరులు అయ్యారు!!
రెండోరోజు మోహినీ భస్మాసుర. మోహినిగా జాయప.. స్త్రీలకే అసూయ కలిగేలా ఉన్నాడు. తిలకించి పులకించిన చక్రవర్తి అలాగే అభినందించాడు.
“నువ్వు ముందే కలిసి ఉంటే నిన్నే వివాహమాడేవాళ్లం కదా!” అన్నాడు పట్టమహిషిని క్రీగంటచూస్తూ.
ఆమె గోముగా చూసి, బుగ్గలు సొట్టలుపడేలా
వికటంగా నవ్వింది.
మూడోరోజు దక్షయజ్ఞం. నాలుగోరోజు నరకాసురవధ. ఐదోరోజు త్రిపురాసుర సంహారం. ఆరోరోజు మార్కండేయ చరిత్ర. మార్కండేయుడిగా జాయప నటన.. మొత్తం నాట్యోత్సవాలకే కలికితురాయిగా నిలిచింది. శివలింగాన్ని కౌగలించుకుని తన ప్రాణాలు హరించడానికి వచ్చిన యముణ్ని అడ్డుకోవడం.. జాయప అమోఘంగా ప్రదర్శించాడు. శివుణ్ని ప్రార్థిస్తున్నట్లు జాయప గణపతిదేవుణ్ని చూస్తూ ప్రార్థించడం.. ఆయన గుర్తిస్తూనే ఉన్నాడు.
మొత్తంగా నీలాంబకు ఈ ఏడాది నాట్యోత్సవాలు అత్యంత ఫలప్రదం. దాదాపు నలభైయవ పడిలోపడిన నీలాంబను గణపతిదేవుని తండ్రి మహాదేవుని ఆరాధ్య వేశ్యగా చెప్పుకొంటారు. గణపతిదేవుణ్ని దత్తత తీసుకున్న పెదతండ్రి రుద్ర దేవుడు రాజ్యమేలుతున్నప్పుడు.. మహాదేవుడు యువరాజు. మంచి రసికరాజుగా పేరున్నవాడు. అన్న మరణించాక పట్టాభిషేకం కాగానే, నీలాంబను ఆస్థాన నర్తకిగా నియమించాడు. కానీ, తర్వాత బతికిన నాలుగేళ్లూ యుద్ధాలలోనే గడిపి యుద్ధరంగంలోనే మరణించాడు.
ఆమె అంటే గణపతిదేవునికి ఎలాంటి భావమో తెలియదుకానీ, చివరిరోజు ఘనంగా సన్మానించి..
“కాకతీయ ఆస్థాననర్తకి స్థాయి నిలబెట్టావు” అన్నాడు.
ఆమె వ్యక్తిగత మంచిచెడ్డలు ఆరా తీశాడు.
కానీ ఆయన దృష్టి మొత్తం జాయప మీదే ఉంది. కారణం.. జాయప ఆయన్నే చూస్తూ నటించడం.
“నీలాంబా! ఈ కుర్రాడు.. వీణ్ని ఎక్కడ ఎత్తు కొచ్చావ్?” అన్నాడు.
గతుక్కుమన్నదామె.
“మంచి నటుడే! అద్భుతమైన శరీర లావణ్యం. ఆడవాళ్ల కన్నా బావున్నాడు. కానీ, నాట్య శాస్త్రపరిజ్ఞానం గానీ, అంగోపాంగాభినయాలతో నటించడం గానీ తెలియదు. రసభావాలు బాగా పలికిస్తున్నాడు. నటునికి ఏ ఏ నియతగతులు నాట్యశాస్త్రంలో నిర్దేశింపబడ్డాయో వాటినే అతను రంగంపై అవిముక్త సత్వుడై పాటించాలి కదా! అవి ఇతనికి తెలియదు.. తెలియాలి. లోకం, వేదం, అధ్యాత్మం.. ఈ మూడూ నాట్యం విషయంలో త్రివిధ ప్రమాణాలు. వీటిని శుద్ధ శ్రుతకంగా ప్రదర్శించాలి. అప్పుడే మహానటుడు అవుతాడు!”..
ఆయన నాట్య విశ్లేషణకు నీలాంబ ఆశ్చర్యచకిత అయ్యింది.
“తమరు.. ఇంత నాట్య విశ్లేషణ చెయ్యడం..??”..
ఆయన నవ్వి ప్రముఖులవైపు చేయి చూపించి..
“అదిగో అక్కడున్న పెద్దల అభిభాషణల్లో దొర్లిన కళామతల్లి చేలాంచలముల విసరుల కొసగాలుల వల్ల అబ్బిన నాలుగు ముక్కలు..” మళ్లీ నవ్వి,
“మంచి భవిష్యత్తు ఉన్నవాడు. సందేహం లేదు.
కాకతీయ కళా సామ్రాజ్యానికి ఆణిముత్యం కాగలడు. ఒక పనిచేద్దాం. ఆ.. గుండయామాత్యా! ఈ అబ్బాయి..”.
“జాయప అట ప్రభు..”.
“ఆ.. జాయప.. జాయప! ఇతణ్ని తమరికి అప్పగిస్తున్నాం. మంచి నాట్యకారుణ్ని చేసి మాకు చూపాలి. అందుకు అయ్యే వ్యయం మొత్తం మేమే చెల్లిస్తాం. శ్రీభండారు సోమయను అడిగి కోశం నుంచి మా రాచనగరు భాగంనుంచి తీసుకోండి!”.
మరునాడు సుబుద్ధి ఇంటికి వెళ్లాడు జాయప. అప్పటికే అందరికీ తెలిసిపోయింది. జాయపను చక్రవర్తి గుర్తించి.. నాట్యశిక్షణకు గుండయామాత్యుని గురుకులానికి కేటాయించడం. అందరూ మరీమరీ ఆప్యాయంగా అభినందించారు.
“మహాభాగ్యం ప్రభూ!”.
“జాయపా.. ఎందుకో నీ మీద మాకు గొప్ప మనసవుతున్నది. నీ బాధ్యత ఇకపై మాదే. త్వరలో మంచి నాట్య కళాకారునివి కావాలి. రాజాస్థానంలో జరిగే ప్రతికార్యక్రమం రోజునా నువ్వు మాకు కనిపించాలి గుండయామాత్యుల వారితో.. సమ్మతమేనా!?”.
తల ఊపాడు జాయప.. మౌనంగా. ఇన్నిరోజులుగా తాను అనుభవిస్తున్న మౌనవేదనకు ఏదో పరిష్కారం దగ్గరలో ఉన్నట్లు తన సమస్యకు ఏదో వెలుగు ఓ బాటను చూపినట్లు భావించాడు. అక్కల సమస్యకు పరిష్కారం దొరికే మార్గంలోకి ఇప్పటికి వచ్చాడు తను. సందేహం లేదు. కాస్త ఊపిరి పీల్చుకున్నాడు జాయప.
అజ్ఞాతశక్తి ఏదో చెప్పినట్లు గణపతిదేవునికి సాష్టాంగ ప్రణమిల్లాడు. లేపి హత్తుకున్నాడు గణపతిదేవుడు. వారి అన్యోన్యత.. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని ఇద్దరికీ ఆ క్షణాన తెలియదు.
* * *
మరునాటి నుంచి జాయప జీవితం వైకుంఠపాళిలో ఓ నిచ్చెనవైపు మళ్లింది.
“మా ఇంట్లోనే ఉండాలి. ఎక్కడికీ వెళ్లవద్దు” అన్నది నీలాంబ.
గుండయామాత్యుడు ప్రాతఃకాలాన్నే రథం పంపాడు జాయప కోసం. జాయపతో కూడా గుండయామాత్యుని గురుకులానికి వెళ్లింది నీలాంబ. “చక్రవర్తి చెప్పిన మాటను నేను జవదాటగలనా.. శిక్షణ మీవద్ద, నివాసం నావద్ద.. ప్రదర్శన నా బృందంతో!” అన్నది.
గుండయామాత్యుడు అంగీకరించాడు. భోగపు స్త్రీలకు ఎనలేని ప్రాధాన్యం రాచరిక వ్యవస్థలో!!
మరునాడు సుబుద్ధి ఇంటికి వెళ్లాడు జాయప. అప్పటికే అందరికీ తెలిసిపోయింది. జాయపను చక్రవర్తి గుర్తించి.. నాట్యశిక్షణకు గుండయామాత్యుని గురుకులానికి కేటాయించడం.
అందరూ మరీమరీ ఆప్యాయంగా అభినందించారు. నీలాంబ నిర్ణయం కూడా చెప్పి అక్కడ ఉంటే నాట్యంలో మరింత ప్రావీణ్యం వస్తుందని చెప్పాడు. పరిపూర్ణంగా అంగీకరించాడు సుబుద్ధి. తమను మర్చి
పోవద్దని చెబుతూ.. మహిళలంతా వీడ్కోలు పలికారు.
“మీరే నన్ను మర్చిపోకూడదు..” అంటూ చమత్కరించాడు జాయప.
మిత్రులంతా జాయపను ఆటపట్టించారు.
నివాసం నీలాంబతో. శిక్షణ గుండయామాత్యుని నాట్యగురుకులంలో.
“అక్కడా అమ్మాయిలే. ఇక్కడా అమ్మాయిలే! నీ రొట్టెవిరిగి నేతిలో పడిందిలే జాయపా!” అని వ్యాఖ్యానించారు.
అప్పుడప్పుడూ తమకు కూడా ప్రవేశం కల్పించాలని కోరారు. మిత్రులన్నట్లు నీలాంబ భవంతిలోనూ, గుండయామాత్యుని నాట్య గురుకులంలోనూ ఎక్కువమంది యువతులే. నూనూగు మీసాల జాయప.. ఆడపిల్లకంటే అందమైన జాయప.. అతణ్నుంచి చూపు తిప్పుకోవడం అక్కడున్న యువతులకు చాలా క్లిష్టమైన ప్రక్రియే. సందర్భం ఉన్నా, లేకున్నా అందరూ అతణ్ని పలకరించి మాట్లాడేవారే. జాయపతో కలిసి కాలు కదపడానికి, జంటగా నృత్యాలకు అందరూ ఉవ్విళ్లూరుతున్నారు. జాయప పలకరిస్తే చాలు.. ఆవేళ మహదానందం. జాయప తాకితే చాలు.. గుండె ఝల్లుమంటుంది. కాసేపు కబుర్లు చెబితే చాలు.. ఆ రోజు పండుగే! అమ్మాయిల సమస్య ఒక్కటే. జాయప వాళ్లతో సరదాగా ఉండటం లేదు. ఎప్పుడూ గురువులతోనూ, పెద్దలైన నటులతోనే ముచ్చట్లు. అతనికి స్త్రీలంతా అమ్మలు, అక్కలు లేదా చెల్లెళ్లు.
‘ఆ అమ్మాయి అక్క పేరాంబలా ఉంది. ఈమె నీలాంబక్కలా ఉంది. ఆమె నవ్వుతుంటే మా అమ్మ దాయమ్మ గుర్తొస్తున్నది’ అలా అనుకుంటాడు గాని.. పైకి ఏమాటా అనడు. అమ్మ, అక్క పోలికలున్న యువతులతో కాస్త మాట్లాడుతాడు. మిగతావాళ్లను చూడడు.. పలకరించడు. భావప్రకటన లేని ముఖం. అందుకే.. ‘చెక్క బొమ్మ’
అని వాళ్లంతా ముద్దుపేరు పెట్టుకున్నారు.
“తెలుగులో చెబితే జాయపకు ఎక్కదు.
సంస్కృతంలో చెప్పాలి!”.. ఓ ముగ్ధరాలు అన్నది.
“అయితే దారుశిల్పం!”.
అందరూ పగలబడి నవ్వుకున్నారు.
అయ్యనవోలు గ్రామయువతి కాకతి. ఓ మధురోహ! గుర్తొస్తుంది.. అమ్మాయిలతో మాట్లాడుతున్నప్పుడు.
(సశేషం)
మత్తి భానుమూర్తి
99893 71284