Jaya Senapati Episode 31 | జరిగిన కథ : కొండయ బృందంతో కలిసి నాటకాలు వేస్తున్న జాయప.. ఒకనాడు కాకతీయ ఆస్థాన నర్తకి నీలాంబ దగ్గర తేలాడు. ఆమె ఆధ్వర్యంలో జరిగే నాట్యోత్సవం కోసం రాచనగరులో అడుగుపెట్టాడు. తమ రాజ్యంపై దాడిచేసి.. తనతండ్రిని ఓడించిన గణపతి దేవుణ్ని తొలిసారి చూడబోతున్నాడు. దాంతో చాలా ఉద్వేగంగా ఉన్నాడు ఆ ద్వీప రాకుమారుడు.
గణపతిదేవుని ప్రవేశంతో భట్రాజులు బృందగానం ప్రారంభించారు
“ఓం శ్రీ శ్రీ నమఃశివాయ.. నమఃరుద్రాయ
సకల గుణాలంకార.. పరనారీదూర
అనుమకొండ పురేశ్వరా సోమలదేవీ నిజేశ్వరా
దోర్బలభీమా రణరంగ రామా
వితరణకర్ణా శౌర్య సౌవర్ణా
పరహితాంజనేయా శౌచగాంగేయా
సత్యరత్నాకరా దుష్ట జనభీకరా
స్వామిద్రోహరగండ శ్రీశ్రీ కాకతి
వంశాబ్ధి కులచంద్రమా
శ్రీశ్రీశ్రీ రాయగజకేసరి బిరుదాంకి
శ్రీశ్రీశ్రీ గణపతిదేవ మహారాజులుంగారు
వేం చేయుచున్నారోహో! వేం చేయుచున్నారోహో..
వేం చేయుచున్నారోహో! వేం చేయుచున్నారోహో..”
భట్రాజుల స్తోత్రపాఠాలకుతోడు రుంజలు, బూరలు,
తప్పెట్ల సంగీతహోరు ఆ ప్రాంగణమంతా ప్రతిధ్వనిస్తుండగా, అందరూ విభ్రాంతిగా రెప్పవెయ్యకుండా చూస్తుండగా.. మహా మండలేశ్వరుడు, కాకతీయచక్రవర్తి శ్రీశ్రీశ్రీ గణపతిదేవుడు హుందాగా నడచివచ్చి, తన సింహాసనం వద్ద నిలబడ్డాడు. వెంటవచ్చిన లెంకలు వెనక్కి వెళ్లారు.
ఆ హోరు తగ్గాక ఆయన చేతులు జోడించి సభకు నమస్కరించాడు. అప్పుడు ఆయన వంక చూడటం అందరికీ ఎంతో ఉత్తేజంగా, కన్నుల పండువగా ఉంది.
తిరుచూర్ణపు అంచున్న వెండిరంగు పట్టుపంచె కట్టి.. పైన బంగారు, ఎరుపు కలనేత కంచుకం ధరించి, వజ్ర వైడూర్యాలు పొదిగిన హారం, పొడుగైన ముత్యాలదండ ఎదపై కదలాడుతుండగా.. నడుముకు ఉత్తరీయం చుట్టి, దానిలో వజ్రాలపిడిగల చురకత్తి దోపాడు. ముఖాన విభూతిరేఖలపై నిలువు ఎర్రెర్రని బొట్టు. తలపై బంగారు రంగు తలపాగా.. నిండైన కోరమీసం.
స్థిరపడిన యవ్వనంతో తుళ్లిపడుతున్న ఉత్కృష్టరూపం. రాజ్యభారం ఏమాత్రం కష్టం అనిపించనట్లుగా విశాలమైన నవ్వు.. ఆరడుగుల ఆజానుబాహువై.. స్థితప్రజ్ఞునిలా గోచరిస్తున్నాడు. ఎవరినైనా తనవైపు తిప్పుకోగల బలమైన వ్యక్తిత్వం.. శారీరక దృఢత్వంతో కలగలిసిన మానసిక పటుత్వం.. ముఖంలో తేజరిల్లుతుండగా, అన్నివైపులా తల తిప్పుతూ అందరినీ మధురస్మితంతో పలకరిస్తున్నట్లు చూస్తున్నాడు.
‘భలే ఉన్నాడే! తెలివైన పరాక్రమశీలి కావచ్చు.. నాకు నచ్చాడు!!’.. జాయప పెదాలు అస్పష్టంగా కదలాడాయి. గణపతిదేవుణ్ని చూస్తూ కనురెప్పలు కదలిక మరిచాయి.
ప్రాంగణ ఉత్తరభాగంలో ఉన్నతవేదిక. దానిపై సమున్నతంగానున్న వజ్ర వైడూర్య ఖచిత బంగారు సింహాసనంపై ఆయన ఉపవిష్టుడయ్యేవరకూ.. ప్రాంగణంలోని పెద్దలంతా నిలబడి చేతులుజోడించి, వినయంగా వంగి ఉన్నారు. ఆయన కూర్చుని చిరునవ్వుతో సైగ చేశాక.. అందరూ కూర్చున్నారు.
ఇది రాచరికపు సంప్రదాయం.
అది సాయంకాల సాంస్కృతిక కార్యకలాపం కాబట్టి కనీసపు రాచమర్యాదలు నిర్వహించారు. అదే ఉదయపు చక్రవర్తుల ప్రధాన సభా సమావేశమైతే పూర్తిస్థాయి రాచరికపు పద్ధతులు ఉంటాయి. ఇవి శివరాత్రి పర్వదిన సంరంభాలు కాబట్టి చక్రవర్తి కొంచెం విశ్రాంతిగా కనిపిస్తున్నారు. ఆయన మంత్రులు, ప్రధానులు, నియోగాధిపతులు.. తదితర అధికారవర్గాలు సాధారణ దుస్తులలో వచ్చి, విశ్రాంతిగా కూర్చుని.. తీరుబడిగా అందరితో ముచ్చట్లు చెబుతున్నారు. నగరులో ఉన్నవారు, రాచకార్యాలులేని ముఖ్యులు, కుటుంబాలతో తరలివచ్చారు. సాధారణ ప్రేక్షకుల్లో ఎక్కువగా రాచనగరు ఉద్యోగులు, వారి కుటుంబాలు ఉన్నాయి. ప్రాంగణం ఎక్కువగా కవులు, సాహితీవేత్తలు, స్థపతులు, శిల్పాచార్యులు, విద్యాప్రకాశకులు, నాట్యాచార్యులు, గాయకులతో కళా సాహితీ సమరాంగణంలా భాసిస్తున్నది.
చక్రవర్తి పట్టమహిషితో హాజరుకావడం.. ప్రధాన సభా సమావేశాలతో పోల్చితే తక్కువమంది ఉండటంతో అందరికీ చక్రవర్తి దంపతులను దగ్గరగా చూడటం ఉత్తేజంగా ఉంది. చక్రవర్తి కూడా అందరితో పరిహాసయుక్తంగా, కళాభిజ్ఞతతో మాట్లాడుతుండటం ఆ సాయంవేళ మరింత శోభాయమానంగా ఉన్నది.
అక్కడ కొంచెం హడావుడిగా ఉన్నది.. కార్యక్రమ నిర్వాహకుడైన గుండయామాత్యులు మాత్రమే. ఆయన సైగ చేయగా రూకలసంచులు ఉంచిన బంగారు తళియ పట్టుకున్న అడపంధారి.. సింహాసనం పక్కకు వచ్చి వినయంగా నిలబడింది. చక్రవర్తి చూశాడు. నవ్వి..
“ఊ.. గుండయామాత్యులు అన్నీ సిద్ధం చేసినట్లున్నారు. కాస్త విశ్రాంతిగా మీ ఆసనంలో ఆసీనులుకండి!” అన్నాడు హాస్యస్ఫోరకంగా.
“నీలాంబ కంటే ఆయనే నాట్యం చేసేలా ఉన్నాడు ప్రభూ..” అల్లరిగా అన్నాడొక మంత్రి పుంగవుడు.
చక్రవర్తితోపాటు ప్రాంగణమంతా నవ్వులతో పరిమళించింది. గుండయామాత్యుడు నగుమోము తెచ్చిపెట్టుకుని రాజాజ్ఞను గౌరవించినట్లు ఆసనంలో కూర్చుని తిరిగి లేచాడు.
“నిజానికి వారు నాట్యగురువులు. నిర్వహణాధికారం ఇచ్చి వారి నాట్యకౌశలాన్ని మనం కోల్పోయామేమో..” అన్నాడు చక్రవర్తి. మళ్లా మందిరమంతా చిరునవ్వులు. జాయప ఆలోచన తిరిగి అక్కలవైపు మళ్లింది. చూపు అంతఃపుర ప్రాంగణ ద్వారంపైనే ఉన్నది. అప్పుడే అంతఃపుర ద్వారాలు తెరచుకున్నాయి. పట్టపురాణి శ్రీమతి సోమలదేవి అంతఃపుర అధికార మర్యాదలతో, దాసదాసీ పరివారంతో మరోసారి మందిరంలోకి వచ్చింది. ఈసారి ఆమె చేతిలో జ్యేష్ఠపుత్రిక గణపాంబ.
ఉద్విగ్నంగా లేచి వచ్చిన అంతఃపుర స్త్రీలను రెప్పవెయ్యకుండా చూశాడు జాయప. అక్కలు కనిపిస్తే.. వాళ్లను బంధవిముక్తులను చెయ్యమని మోకాళ్లపై వంగి చక్రవర్తిని ప్రార్థించాలని భావించాడు. ప్చ్.. నిరాశే ఎదురయ్యింది. అక్కలు అక్కడ కనిపించలేదు.
పరివారం ఆసనాల వద్ద ఆగిపోగా, సోమలదేవి చక్రవర్తి వద్దకు వచ్చి పక్కనున్న ఉచితాసనంలో కూర్చున్నది. తండ్రిని చూసిన చిన్నారి గణపాంబ తండ్రి వైపు దూకుతున్నది. ఆయన మరింత పుత్రికోత్సాహంతో కూతుర్ని అందుకుని ఒడిలో అదుముకున్నాడు.
జాయప గణపతిదేవుణ్ని, సోమలదేవిని జంటగా చూసి చాలా ఆశ్చర్యపోయాడు. రాజు, రాణి అంటే తన తల్లిదండ్రుల వయసులో ఉంటారని అతని అవ్యక్త అభిప్రాయం. కానీ, కాకతీయ చక్రవర్తి, ఆయన పట్టమహిషి పూర్తిగా చిన్నవాళ్లు. చక్రవర్తి తన బాబాయి కంటే చిన్నవాడు. బహుశా నాగంభట్టు, త్రిపుర వయసు ఉండొచ్చు. సోమలదేవి తన అక్కలకంటే ఎక్కువే పెద్దది. పెద్దక్క నీలాంబ కంటే చిన్నది కావచ్చు. అప్పుడే మరో ఆలోచన కూడా జాయప బుర్రలో మెరిసింది. గణపతిదేవుడు తనకు బావ కాగల వయసు వాడే. ఇలాంటి చక్రవర్తి తన అక్కలను వివాహమాడితే?! అక్కలు కూడా మహారాజు కుమార్తెలే కదా!? తప్పేముంది!! పైగా గణపతిదేవుడు అందగాడు. సోమలదేవి అందవిహీనం కాదుగానీ, మరీ మగరాయుడు. తన అక్కలు అందాల రత్నాలు.. వజ్రాల మెరుపు తీగెలు. బావుంది బావుంది!! ఈ ఆలోచన మనసంతా తేనెలూరించింది.
వెనకనుంచి నీలాంబ అతని వీపుపై తట్టింది.
“ఏమిటి జాయపా.. నవ్వుకుంటున్నావ్?” అన్నది.
అప్పుడొచ్చాడు ఇహ లోకంలోకి. మరోసారి కళాకారులను అందరినీ హెచ్చరించింది నీలాంబ.
అక్కలు కనిపిస్తే..
వాళ్లను బంధవిముక్తులను
చెయ్యమని మోకాళ్లపై వంగి
చక్రవర్తిని ప్రార్థించాలని భావించాడు. ప్చ్.. నిరాశే ఎదురయ్యింది.
గుండయామాత్యుడు లేచి..
“శివరాత్రి పర్వదిన ఉత్సవాల్లో భాగంగా కాకతీయ ఆస్థాననర్తకి నీలాంబ బృందం ఈరోజు ప్రదర్శించే నృత్య కార్యక్రమం ‘ప్రహ్లాద విజయం’ ప్రారంభించడానికి అనుమతి ఇవ్వవలసిందిగా మహామండలేశ్వరులవారిని కోరుతున్నాను..” అన్నాడు చేతులు జోడించి వినయంగా.
ఆయన నవ్వుతూ..
“ఊ.. శుభం.. ప్రారంభించండి!” అన్నాడు.
అందరూ చప్పట్లు కొడుతుండగా.. నీలాంబ వయ్యారంగా కదిలి తాంబూలపళ్లెరంతో పరిచారిక వెంటరాగా, వెళ్లి చక్రవర్తి ముందు వినయంగా ఇంచుక ఒయ్యారంగా తాంబూలం తీసి ఆయన చేతికి ఇచ్చింది. పన్నీరుకోర పైకెత్తి ఆయన పైనా, సోమలదేవి పైనా పన్నీరు చిలుకరించింది. చిన్నారి గణపాంబపై మరింత చిలుకరించింది. ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగింది. సంప్రదాయాన్ని గౌరవిస్తున్నట్లు ఇద్దరూ చిరునవ్వు నవ్వారు.
“నీలాంబా.. శివరాత్రి శుభాకాంక్షలు! రాజ్య ప్రజలంతా శివరాత్రి ఉత్సవాలను అంగరంగవైభవంగా జరుపుకొంటున్నారు. మరి రాచనగరులో మేము కూడా ఉత్సవాలు జరుపుకోవాలి కదా. మీ నాట్యమే మా ఉత్సవం.. ప్రారంభించండి!” అన్నాడు గణపతిదేవుడు.
ఆమె మరోమారు చక్రవర్తి దంపతులకు నమస్కరించి దిగి వస్తూ.. ఆమెవైపే చూస్తూ గుటకలు మింగుతున్న కవి గాయక సాహితీమూర్తులకు నమస్కరిస్తూ.. వారి ఆశీర్వాదాలు, కామప్రకంపనలు అందుకుంటూ.. నాట్యమండపానికి చేరింది. అనంతరం వాద్యఘటిక మోగింది. అప్పుడే సమయాన్ని తెలిపే ఝాముల ఘటిక కూడా సమాంతరంగా మోగింది. చక్రవర్తి తృప్తిగా తలపంకించాడు. నిర్దేశించిన సమయానికి కార్యకలాపం ప్రారంభమవడంతో గుండయామాత్యుడు, సోమలదేవి హాయిగా నిట్టూర్పు వదిలారు.
రంగస్థలంపై మృదంగధ్వని.. దానితో నట్టువాంగ చిడుతలధ్వని కలిసి మనోహరంగా ప్రారంభం కావడంతో ప్రేక్షకులంతా రంగస్థలంపై దృష్టి నిలిపారు. లోపల రంగదేవతా పూజనం చేశారు నీలాంబ బృందం.
‘శుక్లాంబర ధరం విష్ణుం
శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్
సర్వ విఘ్నోప శాంతయే..
ఆంగికం భువనం యస్య వాచకం సర్వ వాఙ్మయం!
ఆహార్యం చంద్ర తారాది తం వందే సాత్వికం శివం!!’
రంగదేవతా పూజనం అయ్యాక తెర తొలగింది. మృదంగ దరువుతో రాగరంజితంగా ప్రారంభమైంది ప్రదర్శన. నీలాంబ గొప్పనర్తకి. తన కార్యకలాపాలన్నీ రాజనగరులో.. ముఖ్యంగా చక్రవర్తి సమక్షంలో ఉంటాయి. కాబట్టి అత్యుత్తమ స్థాయి కళాకారులనే ఆమె తన బృందంలోకి ఆహ్వానిస్తుంది. వారికి ప్రఖ్యాతులైన గురువులతో నిరంతరం నాట్యాభ్యాసం నిర్వహిస్తుంది. ఈ ఏడాది ఆమె దాదాపు పది నాట్య ప్రదర్శన అంశాలను సిద్ధం చేసుకుని ఉన్నది. హఠాత్తుగా ఒక నటుడు అదృశ్యం కావడం కంగారుపెట్టినా.. అనుకోకుండా జాయప లభించడం ఆమె బృందానికి అదనపు బలం.. అదనపు ఆకర్షణ కూడా!
ప్రహ్లాదుడుగా జాయప! పూర్తి ఆహార్యంతో ఉన్న జాయప నిజమైన ప్రహ్లాదుడిలా కళ్లు తిప్పుకోలేనంత అద్భుతంగా గోచరించాడు నీలాంబకు, తోటి నర్తకీ బృందానికి. అతని ముఖంలో అక్కలు కనిపించలేదన్న విషాదవీచికలు.. కనిపించీ కనిపించని ఏదో అసంతృప్తి! తప్పక వస్తారేమోనన్న ఆశ కలిగిస్తున్న సన్నని వెలుగు.. కలగలిసిన సహజ చాతుర్యంతో అందరినీ తనవైపు తిప్పుకొంటున్నాడు జాయప.
నాటకం సనకసనందనాది మునుల విష్ణుమూర్తి ప్రార్థనతో ప్రారంభమై.. రెండవ అంకం తెర తొలగగానే ప్రవేశించాడు ప్రహ్లాదుడు.. జాయప!!
“నారాయణ మంత్రం..
శ్రీమన్నారాయణ భజనం”..
నాట్యమండపమంతా దిగ్భ్రమతో మూగబోయింది..
ప్రహ్లాదుడు అనేవాడు ఇలాగే ఉంటాడేమో!? ఆ మహాభక్తుడే నిజంగా కాకతీయ నాట్యమందిరానికి వచ్చాడేమో!? ఆ ముఖంలో భక్తిభావం.. తన తండ్రిలోని రాక్షసత్వం తెలిసినప్పటి బాధ.. కలగలిసిన ముఖంతో ఆ పసివాడు.. రక్షించాల్సిందిగా నారాయణున్నే చూస్తున్నట్లు తనవైపే చూడటం.. గణపతిదేవుడు గుర్తించాడు.
(సశేషం)
– మత్తి భానుమూర్తి 99893 71284