రెండేండ్ల తర్వాత ద్వీపరాజ్యానికి బయల్దేరిన జాయప..
ఓ ఊహించని
పరిణామంతో మళ్లీ అనుమకొండ బాట పట్టాడు. అర్ధరాత్రివేళ..
అడవి మార్గంలో నడక
మొదలుపెట్టాడు. ఒక దగ్గర
నలుగురు దొంగలు ఒక వ్యక్తిని చంపి, అతని వస్తువులను
పంచుకోవడం చూశాడు.
వారికంట పడకుండా, అక్కడున్న అశ్వాన్ని తీసుకొని..
అనుమకొండవైపుగా పరుగు
పెట్టించాడు. గమనించిన దొంగలు.. చీకట్లోనే జాయప వెంటపడ్డారు. అలాంటి పరిస్థితుల్లో ఎదురుగా ఓ అపరిచిత వ్యక్తితో కలిసి..
దొంగల భరతం పట్టాడు జాయప.
ఆ పెనుగులాటలో గాయపడ్డ జాయప.. ఆ అపరిచితుడి ఒడిలోనే సృహ కోల్పోయాడు.
మెలకువ వచ్చేసరికి జాయప ఒక గుడిసెలో నులక మంచంపై ఉన్నాడు. ఒళ్లంతా పచ్చిపుండులా ఉంది. కళ్లు తెరవడం కూడా కష్టంగా ఉంది. లేవబోయి వెనక్కి పడిపోయాడు. అప్పుడు చూసుకున్నాడు. తన శరీరంపై వస్ర్తాలు లేవు. తన కంచుకం, అంగీ లేకుండా శరీరంపై ఏదో పసరు పూసి.. ఆకులతో చుట్టినట్లు గ్రహించాడు. కదిలాడు. చెయ్యి జివ్వున లాగింది. కుడిజబ్బ వద్ద చురకత్తి దిగిన చోట ఏవో ఆకులతో గట్టిగా కట్టుకట్టి ఉంది.
కళ్ల ముందు, మనసులోనూ రాత్రి చీకటిలో జరిగిన దృశ్యాలే! అంతా బీభత్సం. ఆ చీకటి.. అణువణువునా భయం. తెగింపు.. దూకుడు. చలిలో వేడి.. రక్తసిక్తమైన వెన్నెల.. జీవన్మరణ పోరాటాలు.. ఆ దుష్టులెవరు? ఆ చనిపోయింది ఎవరు? హఠాత్తుగా వచ్చిన ఆగంతకుడెవరు?.. తనపై ఈటె విసిరినవాడే తనను రక్షించాడు.
ఎవరతను?.. ఇప్పుడు తనెక్కడ ఉన్నాడు??
ఈ భావతరంగాలు నిజమా లేక ఏదో సుషుప్తిలో ఉన్నాడా.. తనకే అర్థం కావడంలేదు. అలా ఎంతసేపు ఉన్నాడో తెలియదు. మరో రెండు ఘడియల కాలం గడిచింది. ఎవరో వంగి ముఖంలోకి చూస్తున్నారు. కళ్లు తెరిచాడు. ఎక్కడో చూసిన ముఖం. ఆప్యాయంగా నవ్వాడు. గుర్తుపట్టి నవ్వాడు.. జాయప. ఆగంతుకుడు. తనను ఒక్కచేత్తో లేపి వీపుమీదికి ఎగరేసుకున్నవాడు.
‘పొడిచేయ్’ అన్నవాడు. కత్తితో సిద్ధంగా ఉండమని హెచ్చరించినవాడు. నొప్పికంటే పోరాటమే ముఖ్యమని చెప్పకనే చెప్పినవాడు. తన ఉత్తరీయం చింపి, రక్తం పోకుండా కట్టుకట్టినవాడు. ముఖ్యంగా ‘సిన్నోడా!’ అని పిలిచినవాడు.. “సిన్నోడా..” అన్నాడతను పలకరింపుగా. మనసంతా ప్రఫుల్లమయ్యింది జాయపకు. వెచ్చని కన్నీరు కంటి అంచులు దాటి ప్రవహించాయి. పలవరించినట్లు..
“అన్నా..” అన్నాడు జాయప.
ఆగంతకుడు మంచంలో పక్కనే కూర్చుని, జాయపను ఒడిలోకి తీసుకున్నాడు. రాత్రి అడవిలో తీసుకున్నట్లు!
“పేణాలు నిలిసినయ్. మంచిగ పండుకో సిన్నోడా! అమ్మో అమ్మో! ఎంత గుండె నీది? ఎంత తెగువ? నువ్వు పెపంచకానికి ఎంతో చెయ్యాల్సి ఉంది. నిన్ను భుజాన ఏసుకున్నాను గందా! అది నాకెంతో ఉశార సిన్నోడా..” అన్నాడు.
అతని మాటలు ఎంతో ఊరడింపుగా ఉన్నాయి.
“అన్నా.. నేను ఎక్కడ?..” అన్నాడు జాయప.
“నాపేరు కంటక దొర. అసలు ఏవైందో చెప్పేదా”..
చెప్తుండగా మరో వ్యక్తి లోపలికి వచ్చాడు.
ఆయన నిలువెత్తున శిరస్సుపై కుచ్చుల టోపీతో, పెద్ద గుబురుమీసాలతో.. మోకాలివరకు కట్టిన పంచెతో పైనంతా, ఒళ్లంతా రంగు రంగుల చిత్రాలు, మెడలో పూసలదండలతో చూడటానికి విచిత్రంగా ఉన్నాడు. చేతిలో ఏదో దారుపాత్ర ఉంది.
“ఊ.. ఏవంటున్నడు బిడ్డ”.. అన్నాడా వచ్చిన వ్యక్తి.
“బాగు బాగు. నీ దయవల్ల బతికిండు!” అన్నాడు కంటక దొర. ఆ వచ్చినాయన నవ్వి..
“లేశి తిరుగుతడు. నీతోపాటే దొంగల్ని నరకుతడు..” అన్నాడు. ఇద్దరూ పెద్దగా నవ్వగా.. జాయపకూడా చిరునవ్వు నవ్వాడు.
“రెండు దినాలు.. లేశి ఉరుకుతవ్..” అంటూ, చేతిలోని దారుపాత్రలో ఉన్న ద్రవం.. జాయప నోటివద్దకు తీసుకెళ్లి, తాగమన్నట్లు చూశాడు ఆ వచ్చినాయన.
“ఈయన మా గూడెం మందులోడు. నిన్ను బతికించినోడు. అబ్బో గొప్పోడు. శవాల్నిలేపి చిందులేయిస్తడు” అంటూ, ఆ పాత్ర తీసుకుని జాయప నోటికందించాడు కంటక దొర. జాయప మెల్లగా తాగాడు.
“రెండు దినాలాయె. ఇంతదాకా సిన్నోడు ఏం దినలే! బువ్వ ఎప్పుడు పెడతా దేవరా ?” అడిగాడు కంటక దొర.
“రేపు నీ ఇష్టం.. తినమను. తినాలనుకున్నయన్నీ తినమను బిడ్డను..” నవ్వుతూ అక్కణ్నుంచి నిష్క్రమించాడు వైద్యుడు. ఆయన చెప్పినట్లే మరో రెండు రోజులకు పూర్తిగా తేరుకున్నాడు జాయప.
ఆ రాజ్యంలో అరణ్యప్రాంతాలు ఎక్కువ. గ్రామాలు కూడా ఎక్కువే. గ్రామాల మధ్య దట్టమైన అరణ్యాలు కూడా ఎక్కువే. వ్యాపారానికి, వర్తకానికి అనువైనచోట్ల పురాలు, పట్టణాలు ఇప్పుడిప్పుడే ప్రఖ్యాతి వహిస్తున్నా.. అవి కూడలి ప్రాంతాల్లో పెరుగుతున్నాయి.
గిరిజనులు రాజ్యంలో ప్రముఖ స్థానంలోనే ఉన్నారు. చరిత్రలో మూలవాసులకు ప్రతీక గిరిజనులు. అన్ని సామాజిక వర్గాలూ గిరిజనులుగానే పుట్టి పరిఢవిల్లి.. ఆనక గ్రామీణులుగా, ఆ తర్వాత నగరవాసులుగా ఎదిగారు. అయినా, ఎంతో కొంత జనాభా గిరిజనులుగానే నివసిస్తూ తమ ఉనికిని, సంస్కృతిని కాపాడుకొంటున్నారు.. ఇప్పటికీ. వారు తేనె, దుంపలు, పళ్లు, మూలికలు లాంటి అనేక అడవి పదార్థాలు పోగుచేసి తెచ్చుకుని.. తమకు కావాల్సిన నిత్యావసరాలు సంతలలో వస్తుమార్పిడి విధానంలో కొనుగోలు చేస్తారు. గిరిజన మహిళలకు.. పూసలతో, పక్షి ఈకలతో, పక్షుల పిట్టల చర్మాలతో అలంకార వస్తువులు తయారుచేయడం మరో ముఖ్య వ్యాపకం.
తమదైన సంస్కృతీ, సంప్రదాయాలు వారికి ఉన్నాయి. వాటిని ప్రాణప్రదంగా కాపాడుకోవడం గిరిజనుల లక్షణం. చూడగానే గిరిజనులని తెలియజెప్పే ఆహార్యం వారిది. తలలపై ఈకల తలపాగాలు, మహిళల వినూత్న కేశాలంకరణలు, పై భాగాన ఆచ్ఛాదన లేకపోయినా అసభ్యంగా లేనట్లు ఒంటిపై పచ్చబొట్లు, మెడల్లో ఏవో పూసల హస్తకళ అలంకారాలు.. వారి ప్రత్యేకతను పట్టిస్తాయి. ఈ రెండురోజుల్లో జాయపకు ఆహారం అందిస్తూ, కబుర్లు చెబుతూ.. జరిగింది వివరించాడు కంటక దొర.
చాగి రాజ్యప్రాంతంలో బంజాయ అనే చెంచుగూడెం అది. కంటక దొర గిరిజనదండుకు సైన్యాధ్యక్షుడు. అడవిలో స్వేచ్ఛగా తిరిగే గిరిజనులు ప్రకృతిలో లీనమై బతుకుతుండగా.. వారి ఇతరేతర సమస్యలు తీర్చడానికి తండా సమయం (సంఘం) ఉంది. అందులో కంటక దొర కూడా ఒక సభ్యుడు. అంతేకాక యుద్ధ సంసిద్ధులైన గిరిజన యువకులకు నాయకుడు, శిక్షకుడు.
గిరిజనతండాలో నాగదొర చిల్లరవర్తకుడు. వర్తక బిడారులో సరుకులు కొనడానికి ఆయన రాగా, అతనికి రక్షణగా కంటక దొర వచ్చాడు. కొనుగోలు పూర్తయ్యాక సమీపగ్రామంలో ఉన్న బంధువులను కలిసివస్తానని, తను వచ్చేవరకు బిడారువద్దే ఉండమని కంటక దొర చెప్పినా.. నాగదొర ఆగకుండా బయల్దేరాడు.
కొండవీడు ప్రాంతంలోని అడవిలో దోపిడీ దొంగల ముఠాలు ఉన్నట్లు తెలిసినా కంటక దొర కోసం ఆగకుండా తన గుర్రపుబండిపై సరుకులు వేసుకుని ప్రయాణం మొదలుపెట్టాడు. సందేహించినట్లుగానే అతణ్ని దొంగల గుంపు వెంబడించింది. చీకటిపడేవేళ అతణ్ని రాళ్లతో కొట్టి దట్టమైన అడవిలోకి మళ్లించి చంపివేశారు. బండిని విరగ్గొట్టి అందులోని సరుకును వాళ్లు పంచుకుంటుండగా.. జాయప అక్కడికి వెళ్లాడు.
తర్వాత వచ్చిన కంటక దొర.. బాటలో విరిగిపడి ఉన్న బండిని చూసి అడవిలోకి ప్రవేశించాడు. గుర్రం సకిలింపు విని ఈటె విసిరాడు. జబ్బలో గుచ్చుకున్న చురకత్తి దెబ్బతో విలవిలలాడినా, గాఢాంధకారంలో సైతం తనతోపాటు పోరాడి స్పృహతప్పిన జాయపను భుజంపై వేసుకుని.. బంజాయ తండాకు ఉదయానికి చేరాడు. జాయపను తన ఇంట్లో ఉంచి తండా వైద్యుని సహాయంతో వెంటనే ప్రథమచికిత్స చేసి.. ప్రాణాపాయం తప్పించాడు.
అతని ఆప్యాయతతో త్వరగా కోలుకున్నాడు జాయప.
తండాలో ఉన్నా అతని మనసంతా అనుమకొండపైనే ఉంది. తన అదృశ్యం అక్కడ సృష్టించే గందరగోళం ఎలాంటిదో.. జాయప ఊహించాడు.
“నా మాటను నువ్వు సెప్పింది సెప్పినట్లుగా కసా కసా సేశావ్ సూడు.. అది గొప్ప!” అని జాయపను మెచ్చుకున్నాడు కంటకదొర.
“అసలు ఎవరి పిల్లోడివి నువ్.. అర్ధరేత్రి గా దట్టమైన అడవిలో, జంతువుల కంటే మొరటోళ్లయిన దొంగల కంట్లో ఎట్టా పడ్డావ్ సిన్నోడా?” అడిగాడు కంటక దొర.
తన గురించి చెప్పాడు జాయప. ఆశ్చర్యపోయాడు కంటక దొర.
“ఆళ్లెవురో.. పాండవులు అంటారే! ఆళ్లు అజ్ఞాతవాసం, అరణ్యవాసం చేశారని ఇన్నా గానీ.. నువ్వు అంతకంటే గొప్పోనివి సిన్నోడా..” అన్నాడు. అంతలోనే నాలిక కరచుకుని.. “తప్పయ్యింది. తమరు రాజుగారి పిల్లోడు కదా.. సిన్నోడు అన్నా! నొచ్చుకోకు మారాజా..” అన్నాడు సంజాయిషీగా.
కంటక ‘సిన్నోడా!’ అని పిలవడం జాయపకు గమ్మత్తుగా ఉంది. అతనికి సంస్కృతం, సంస్కృత ప్రభావంతో మాట్లాడే తెలుగు తెలుసు గానీ, ఇలా గిరిజనుల మాండలికం కొత్త.
“నన్నెప్పుడూ అట్లాగే పిలవాలి అన్నా! మీరు అట్లా పిలుస్తుంటే భలేగా ఉంది తెల్సా..” అన్నాడు జాయప.
అతని ఆప్యాయతతో త్వరగా కోలుకున్నాడు జాయప. తండాలో ఉన్నా అతని మనసంతా అనుమకొండపైనే ఉంది. తన అదృశ్యం అక్కడ సృష్టించే గందరగోళం ఎలాంటిదో.. జాయప కొంత ఊహించాడు. కానీ, తను జ్వర తీవ్రత వల్ల కదలడానికి అశక్తుడు. తన ఆత్రుతను చెప్పి కంటక దొరను ఇబ్బందిపెట్టడం అతని అభిమతం కాదు. అందువల్ల కాస్త మౌనంగా ఉండిపోయాడు. పైగా ప్రకృతిలో భాగమైపోయే గిరిజన పిల్లలతో ఆడుతూ పాడుతూ వాళ్లతో మమేకమైపోయాడు జాయప.
జంతువుల కూతలను అనుకరించడం, అనుసరించడం ప్రతి ఆటవికుడూ చేస్తాడు. గిరిజన పిల్లలకు పక్షుల కూజితాలు, జంతువుల అరుపులు, శబ్దాలు ఉగ్గుపాలతోనే ఒంటపడతాయి. మాటలకన్నా ముందు ఈ కూజితాలే నోటికి వచ్చేస్తాయి. జాయప బాబాయి బ్రహ్మయ ఈ అంశంపై ఆసక్తి ఉన్నవాడు కావడంతో వారి అన్నదమ్ముల పిల్లల్లో ఈ కూజితాలపై చిన్ననాడే ఆసక్తి జనింపజేశాడు. ఏకసంతాగ్రాహి అయిన జాయప మరింత ఆసక్తిగా నేర్చుకునేవాడు. తిరిగి ఇక్కడ బంజాయ తండాలో తనచుట్టూ ఉన్న వారంతా.. ప్రతినిత్యం కూజితాలతో వింతవింత శబ్దాలు చేస్తూ జంతువులతో, పక్షులతో కలగలిసి ఆడుతూ పాడుతుంటే.. జాయపకు ప్రాణం లేచి వచ్చినట్లయ్యింది. ఒంటిపై వస్త్రంలేని పిల్లల మెడల్లో ఉన్న కొమ్ముబూరలు అతణ్ని ఆకర్షించాయి.
“అయ్యి కొమ్ముబూరలు. ఊదితే పులులు కూడా సెప్పినట్టు ఇంటయ్..” అన్నాడో పిల్లవాడు.
“మరి ఏనుగులు?”.
“అబ్బో.. ఏనుగయితే చిందు తొక్కుద్ది..” అన్నట్టే బూరతో వాడు చేసిన కూజితాలతో ఓ ఏనుగు వచ్చి వాడిముందు గంతులేసింది. వాడిపేరు బండోయ దొర. ఇప్పుడు కూజితాల శిక్షణలో జాయపకు గురువు. జాయప కంటే రెండేళ్లు చిన్న. అప్పటికే ఏనుగులతో అనుబంధం ఏర్పరచుకోవడంలో కొంత ప్రవేశం ఉన్న జాయప, ఇక్కడ కొమ్ముబూర కూజితాల ప్రయోగంపై మరింత పట్టు సాధించాడు. దూరంనుంచి కూడా ఏనుగులను నియంత్రించగల పరిణతి సాధించాడు.
బంజాయ తండాకు రావడం కూడా తనమంచికే అని తలపోస్తుండగా.. ఓరోజు ఆ తండాలోకి కాకతీయ రాజ్య వేగులు ప్రవేశించారు. తాము మహాసేనాని మల్యాలచౌండ భటులమని.. చౌండ నియంత్రణలో ఉన్న జాయప అనే కుర్రవాడి కోసం వచ్చామని.. అతను ఇక్కడ ఉన్నట్లు తెలిసిందని.. వెంటనే తమకు చూపాలని తండాను చుట్టుముట్టారు. జాయప వారి వెంటవెళ్లడం తప్పింది కాదు. అలా పదిరోజుల తర్వాత తిరిగి అనుమకొండలో ప్రవేశించాడు జాయప.
(సశేషం)
– మత్తి భానుమూర్తి 99893 71284