చారిత్రక కాల్పనిక నవల
జరిగిన కథ : రాజనగరిలో చక్రవర్తి బంధువులు, జ్ఞాతులు.. ఎందరో ఉన్నారు. వారంతా నారాంబను, జాయపుణ్ని కలవడానికి ఉత్సుకత చూపుతున్నారు. ఇటు నారాంబ కూడా తనకు దక్కిన మహారాణి హోదాను అపురూపంగా భావిస్తూ.. అందరినీ కలుపుకొని పోతున్నది. అయితే ఇప్పుడు రాజప్రాసాద కుటుంబాల దృష్టి నారాంబను దాటి జాయపుని పైన ఉన్నది. చక్రవర్తి సూచనతో జాయపుడు కూడా రాజ్యంలోని ప్రముఖుల ఇళ్లను సందర్శిస్తున్నాడు. వారి ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నాడు.
ఓ రోజు హఠాత్తుగా..
“నిన్న నా మందిరానికి విధకదేవుడు వారి ధర్మపత్ని విచ్చేశారు. వారు బావగారి పినతండ్రి కుమారులు. అసలు రుద్రదేవులవారు ఈయన్నే దత్తత తీసుకోవాల్సి ఉన్నదట. దత్తత తీసుకుంటే ఈరోజున ఆమె పట్టమహిషి అయి ఉండేదట.
‘ఏమిటో నాకు పెట్టి పుట్ట లేదు. ఇంతే నా ప్రాప్తం!’ అని వాపోయింది. కబుర్లు ముచ్చట్లు అయ్యాక.. ‘మీ తమ్ముడు జాయప సేనానులకు వివాహ ప్రయత్నాల సంగతి ఏవిటి నారాంబా!?’.. అన్నదామె. నేను
ఆశ్చర్యంతో నోరు తెరిచి ఉండిపోయాను. నామతి మండా!.. ఆమె అనే వరకూ నాకూ ఆ ఆలోచనే రాలేదు తమ్ముడూ..” అన్నది నారాంబ.
ఓ గొప్ప సంగతి తను మర్చిపోతే.. మరెవరో గుర్తుచేయడం ఆమెకు దిగులు కలిగించింది.
తమ్మునికి వివాహం చెయ్యాలనే ఆలోచన రాకపోవడం పట్ల నారాంబ ఖిన్నురాలయ్యింది.
‘ప్చ్.. వాడి వివాహం సంగతి నాకెందుకు తోచలేదు..?’.. రోజూ అదే దిగులు. అదే ఆలోచన. రోజంతా ఏకవాక్య సమస్య. దానిని గణపతిదేవుడు పూరించాడు.
“సరే సరే! రోజూ మా చెవి దగ్గర అదే నస ఏమిటి? మీ నాన్నగారికి కబురు పెడతాను. వారు వచ్చాక మీరూ మీరూ కూర్చుని చర్చించి, జాయప వివాహం నిశ్చయించండి..” అన్నాడు.
మరో పక్షం రోజుల్లో పినచోడుడు అనుమకొండకు విచ్చేశాడు.
“ఉన్నపళంగా రమ్మని వార్త పంపారు.. ఏమిటి విషయం? నారాంబ వల్ల మీకేమైనా కష్టం..” ఆయన వాక్యం పూర్తి కాకుండానే.. గణపతిదేవుడు నవ్వుతూ..
“రోజూ మా చెవులు రెండూ నమిలేస్తున్నది మీ ముద్దుల కూతురు. సంగతేమిటో ఆమెనే అడగండి. ఈలోగా మేమొక సమావేశం నిర్వహించి వస్తాం. కలసి భోజనం చేద్దాం..” అని వెళ్లిపోయాడు.
అసలు సంగతి చెప్పి పినచోడుని ఆందోళనను ఆనంద సందోహంగా మార్చింది నారాంబ.
ఆయన కూడా జాయపుని వివాహం ఇప్పటికే ఆలస్యం అయ్యిందని.. వెంటనే చెయ్యాలన్న తలంపుతోనే ఉన్నాడు. చక్రవర్తి పంపిన వార్తను బట్టి చూస్తే.. ఆయన కూడా జాయపుని వివాహం పట్ల ఆసక్తిగానే ఉన్నట్లు భావించాడు పినచోడుడు.
భోజన సమయంలో అన్నాడు..
“మీరుండగా నేను ఎక్కువ ఆలోచించేది ఏముంది గణపతిదేవా! మీరే తగిన వధువును నిశ్చయించి వివాహానికి పిలిస్తే.. వచ్చి ఆశీర్వదించి వెళతాను..” అని.
గణపతి తల పంకించగా.. నారాంబ పొంగిపోయింది. తమ్ముడి పెళ్లి బాధ్యతను.. తండ్రి తన భర్తపై ఉంచడం ఆమెకెంతో నచ్చింది. ఆమె ఎప్పుడూ తన భర్త అన్ని అంశాలలో దేవుడనే భావిస్తుంది.
ఈ సంగతులేమీ జాయపునికి తెలియదు. ఆ సమయంలో ఆయన ఎక్కడో కామరూపదేశ (అస్సాం)
అడవుల్లో.. ఏనుగుల సేకరణ కోసం గజసాహిణి
కొమురయ నాయకుని బృందంతో కలిసి వెళ్లాడు.
జాయపుడు తిరిగి వచ్చాక అతని పెళ్లి పస్తావనలు, తండ్రి కూడా వచ్చి బావగారితో చర్చించి వెళ్లినట్లు నారాంబ సంబురంగా చెప్పింది.
జాయపుడు కాస్త ఆలోచనలో పడ్డాడు. ఈ రాజనగరు, రాజప్రాసాదం, రాజ్యవ్యవహారాలు, వివిధ నియోగాలు, వాటి కార్యకలాపాలు, అక్కడ జరిగే తంతు.. అన్నీ ఇప్పుడు రాజనగరి లోపలివ్యక్తిగా చూస్తున్నాడు.
ఒకప్పుడు వీధులలో.. చతుష్పథాల వద్ద కర్ణాకర్ణిగా వినే వార్తల్లాంటివి ఇప్పుడు ప్రత్యక్షంగా వీక్షిస్తున్నాడు.
అయితే ఇప్పుడు తన భవిష్యత్తును నిర్ణయించుకోవాలి. తన కార్యకలాపాలకు ఓ రూపం కల్పించుకోవాలి.
ద్వీపం వెళ్తే ఎలా ఉంటుంది!?
సేనాని పదవి ఇచ్చిన చక్రవర్తి.. తనను ద్వీపరాజ్యం పంపనని ముందే చెప్పేశారు. తనకు ఏదో ఓ సరైన జీవనమార్గం నిర్ణయం అయ్యేవరకూ వివాహం వద్దు. ఈ ఆలోచన బాగుంది. అదే అక్కకు చెప్పాడు.. ఆమె బావకు చెబుతుంది కదా..
అనుమకొండ వచ్చాక, రాజప్రాసాదం ప్రవేశించాక.. రెండుమాసాల తర్వాత కోట విడిచి బయటికి అడుగు పెట్టాడు జాయపుడు. సరాసరి నాగంభట్టు ఘటికా
స్థానానికి వెళ్లాడు. జాయపుణ్ని చూసి ఎంతో సంతోషించారు శివభట్టు, నాగంభట్టు కుటుంబం. తర్వాత ఇద్దరూ త్రిపుర, కంటక దొరలను కూడా కలిశారు.
మూడేళ్ల తర్వాత కలిసిన మిత్రుల ఆనందానికి
అంతే లేకుండా పోయింది.
“ఎన్నాళ్లకెన్నాళ్లకు..?!!”.
కాకతీయ రాజప్రాసాదానికి ఆత్మీయ అతిథిగా
ఎదిగిన జాయపుడు వారికి గర్వకారణం.
వీధులలో తిరుగుతూ సమాజాన్ని అబ్బురంగా, అమాయకంగా, ఆశ్చర్యంగా, విజ్ఞానంగా, వినోదంగా చూస్తూ.. నేర్చుకుంటూ, సమయం దొరికినప్పుడు నిచ్చెన మెట్లెక్కి, ఇవ్వాళ అతని స్వస్థానమైన రాజ
నగరుకు తిరిగి చేరాడు. ఇన్నేళ్లు తమ కబుర్లకు, ముచ్చట్లకు పరవశిస్తూ తమతో ఆడిపాడి ఎదిగిన జాయపుణ్ని చూస్తూనే.. వారి గుండెలు పొంగి పరవశిస్తాయి.
అందరూ ఎన్నో చిన్ననాటి ముచ్చట్లు పంచుకున్నారు. వెళ్లి చతుష్పథం వద్ద రాతిబండపై కూర్చుని పులకించారు. పూటకూళ్ల ఇంట భోజనాలు చేశారు. వీధులలో విహరించారు. పాటలు పాడారు.. చిందులు వేశారు.
చలమయ కూడా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. జాయపునికి వాతూల అహోబలపతి గుర్తొచ్చాడు.
“మిత్రమా.. ఆ అహోబలపతిని గుర్తించారా?”
అడిగాడు త్రిపుర.
“లేదు మిత్రమా.. గతపక్షం నా కుమార్తె వివాహం చేశాను. పెళ్లి పిలుపుకోసం తీవ్రంగా ప్రయత్నించాను కానీ, ఆ అహోబలపతివారు మాత్రం దొరకలేదు..ప్చ్!” నిట్టూరుస్తూ చెప్పాడు చెలమయ.
పోరాటం అవసరమని ప్రోత్సహించాడు జాయపుడు. నీరసపడవద్దంటూ పిడికిలి బిగించి చూపాడు త్రిపుర.
మరునాడు నాట్య గురుకులానికి వెళ్లాడు. గుండయామాత్యునికి మొక్కాడు. మిత్రులు, గురువులు తోటి విద్యార్థులు జాయపుణ్ని చూసి ఎంతో సంతోషించారు. అతని అక్కలను గణపతిదేవుడు వివాహమాడటం, దక్షిణ, ఈశాన్య రాజ్యాలపై యుద్ధాలుచేసి విజయాలు సాధించడం.. వారందరూ తరగతులు వదిలేసి మరీ చర్చించుకున్నారట.
ఆ మర్నాడు సుబుద్ధి ఇంటికి వెళ్లాడు. వీధి వీధంతా పండుగ చేసుకుంది. జాయపుడు వచ్చాడని తెలిసి పక్క వీధులు.. మొత్తం బలింజవాడ అంతా కదలివచ్చి అభినందించారు. నిండైన విగ్రహంతో అసలు సిసలైన రాకుమారునిలా భాసిస్తున్న జాయపుని వంక వారంతా ఆరాధనగా చూస్తుండిపోయారు.
జాయపుణ్ని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు సుబుద్ధి. తమ్ముళ్లు, మహిళలు, పిల్లలు ఆనందాతిరేకాలతో పరవశించారు. జాయపుడు పిల్లలతో బొంగరాలు ఆడాడు. పతంగులు ఎగరేశాడు. ఆడవాళ్లతో కలసి బావిలో నీళ్లు తోడాడు. పొయ్యిల్లో కర్రలుపెట్టి,
పొగగొట్టంతో ఊదాడు. పేడతో చావిడి, అరుగులు
అలికాడు. నారతీశాడు. వంటలు చేశాడు. పాయసం కాచాడు. బొబ్బట్లు, బెల్లం బూరెలు తిన్నాడు.
లేగదూడలతో ఆడాడు. అలసిసొలసి చావిట్లో నులకమంచంపై గురక పెట్టి నిద్రపోయాడు.
మూడేళ్ల బెంగ అంతా పోగొట్టుకున్నాడు.
మరోరోజు వేశ్యావాటికకు వెళ్లాడు. నీలాంబ వేశ్యా
వాటిక పండుగ చేసుకుంది. వేశ్య యువతులు, గణికలు, నర్తకిలు.. అందరూ జాయపుని చుట్టూ చేరి నాట్యాలు చేశారు. పాటలు పాడారు. రంగురంగుల బుక్కాయిలు చల్లుకున్నారు. జాయపుణ్ని రంగులలో ముంచేశారు.
“అయ్యయ్యో! ‘ఈ రంగులన్నీ దుస్తులపై ఎలా వచ్చాయి?’ అని చక్రవర్తి బావగారు అడిగితే ఏమని చెప్పాలి?” కంగారుపడ్డాడు జాయపుడు. “అయితే ఆ దుస్తులు విప్పెయ్యి..” అంటూ అతను ధరించిన కంచుకం, పంచె లాగేశారు. లోపలి నడుముకున్న కౌపీన గోచికట్టుతో మందిరమంతా పరుగులు పెట్టించారు.
వీధులలో తిరుగుతూ సమాజాన్ని అబ్బురంగా, అమాయకంగా, ఆశ్చర్యంగా, విజ్ఞానంగా, వినోదంగా చూస్తూ.. నేర్చుకుంటూ, సమయం దొరికినప్పుడు నిచ్చెన మెట్లెక్కి, ఇవ్వాళ అతని స్వస్థానమైన రాజనగరుకు తిరిగి చేరాడు. ఇన్నేళ్లు తమ కబుర్లకు, ముచ్చట్లకు
పరవశిస్తూ తమతో ఆడిపాడి ఎదిగిన జాయపుణ్ని చూస్తూనే.. వారి గుండెలు పొంగి పరవశిస్తాయి.
మొదటిసారి నీలాంబ తన ఆంతరంగిక మందిరంలోకి చెయ్యి పుచ్చుకుని తీసుకుపోయింది జాయపుణ్ని.
“జాయపా! ఇదిగో ఈ అమ్మాయిని చూడు.. ఎక్కడో చూసినట్లుంది కదూ?” అన్నది.
ఆ అమ్మాయిని అలా చూస్తుండిపోయాడు జాయపుడు. ఆమె నీలాంబ కుమార్తె లలితాంబ! అప్పుడే
శిల్పీకరణ పూర్తయిన శృంగార శిల్పం.. నీలాంబను మించిన అందం. కళ్లు తిప్పుకోవడం కష్టం. దివినుంచి భువికి దిగివచ్చిన ఊర్వశి జాతి అప్సరశ్శిరోమణి..
‘పాతికేళ్ల క్రితం నీలాంబ ఇలాగే ఉండొచ్చు.. కానీ, నీలాంబలో లేని గరుకు ముగ్ధత్వం ఏదో ఈ కూతురులో ఉంది’.. అనుకున్నాడు జాయపుడు.
అప్పుడొచ్చిందొక సందేహం. నీలాంబ ఎంత ఆప్యాయంగా చూసినా ఎప్పుడూ ఆమె ఆంతరంగిక మందిరంలోకి జాయపుణ్ని తీసుకుపోలేదు. రానివ్వలేదు. అలాంటి ఓ ఆంతరంగిక మందిరం ఆ భవంతిలో ఆమెకు వేరుగా ఉన్నదని కూడా జాయపునికి తెలియదు. ఊహించలేదు.
అలాంటిది.. ఇప్పుడే ఎందుకు లోపలికి తీసుకు
పోయింది? యవ్వనవతి అయిన తన కుమార్తెను నీలాంబ.. ఓ వేశ్యాగృహ నిర్వాహకురాలు ఇప్పుడే ఎందుకు పరిచయం చేసింది??
మరునాడు జాయపుడి అశ్వం విక్రమ.. అయన్నవోలు గ్రామం దిశగా పరుగులు పెట్టింది. అప్పటి అశ్వం విక్రమ ముసలిది అయిపోవడంతో.. కొత్త అశ్వాన్ని కొనుగోలు చేశాడు జాయపుడు. దానికి కూడా ‘విక్రమ’ అనే నామకరణం చేసుకున్నాడు.
గ్రామం మొగదలలోనే ఉన్న పెద్ద ఊరబావి
చాలా సందడిగా ఉంది. ఊరందరూ ఆ బావినుంచే తాగునీరు తోడుకుపోతారు. అక్కడ దాదాపు పాతికమంది స్త్రీలున్నారు. కొందరు బిందెలు తోముతూ, కొందరు కంచు కడవలతో నీళ్లు తోడుతూ, కొందరు నిండు బిందెలు మరో స్త్రీ భుజంపైకి అందిస్తూ.. కొందరు చంటి పిల్లలకు స్నానాలు చేయిస్తూ..
బావి దృశ్యం చాలా కోలాహలంగా ఉంది.
కొందరు తడిబట్టలతో వెళ్తూ.. కొందరు ఖాళీ బిందెలతో వస్తూ.. అశ్వం విక్రమ అక్కడే తచ్చాడుతున్నది. జాయపుని చూపులు ప్రతిస్త్రీనీ పట్టిపట్టి చూస్తున్నాయి.
‘ఈమె కాదు.. ఆమె అవునా.. కాదు కాదు!’.
ఓ పెద్దావిడ అరిచింది..
“ఎవరు కావలె.. ఎవరు నువ్.. ఊర్లకు పో..
బాయికాడ ఏంది ఎతుకుడు??”.
అందరూ కిలకిలా నవ్వారు. ఆ నవ్వులకు విక్రమ కదిలి సకిలించింది. తను చేస్తున్నది గ్రామ సంస్కృతిలో తప్పులాంటిదని జాయపునికి తెలుసు.
ఉద్వేగం, వాంఛ, నియమ నిబంధనలను అతిక్రమించే వయసు అలాంటిది.
కదలబోయాడు కానీ.. విక్రమ కదల్లేదు. కారణం.. ఎవరో గుర్రాన్ని పట్టి ఆపుతున్నారు. అప్పుడు చూపు ఇటు మరల్చి గుర్రం వైపు చూశాడు. గుర్రాన్ని ఆపింది ఎవరో కాదు.. కాకతి!!
ఉతికిన బట్టలు రెండు భుజాలపై రెండు గుట్టలుగా వేలాడుతుండగా.. చెదరిన ముంగురుల మధ్య భ్రుకుటి ముడివేసి చూస్తున్న కాకతి.. తడిపొడి యవ్వనం. భుజాల మీదుగా కారిన నీటి చినుకులతో తడిసిన
వక్షస్థలం.. జాయపను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా
అన్నది కాకతి.
“ఏంది పిలగా.. ఇక్కడున్నావ్!?”.
(సశేషం)
మత్తి భానుమూర్తి
99893 71284