చారిత్రక కాల్పనిక నవల
జరిగిన కథ : మూడేళ్ల తర్వాత చక్రవర్తి కొలువుదీరాడు. గణపతి దేవుడు సింహాసనంపై కూర్చొని ఉండగా.. జాయప ఆ పక్కనే నిలబడి ఉన్నాడు. ఒకే వేదికపై ఉన్న రెండు కొదమ సింహాల్లాంటి ఆ ఇద్దరు మహావీరులను సభ యావత్తూ చేష్టలుడిగి చూసింది. పెద్దల ఆశీర్వాదం తీసుకొని, చక్రవర్తి పక్క న ఆసనంలో జాయపుడు ఆసీనుడు కాగానే.. సభా ప్రాంగణం చప్పట్లతో మారుమోగింది.
సభ నిర్వాహణామాత్యుడు సిరిబుధి సైగతో.. అంతఃపురానికున్న రెండు వేరువేరు ద్వారాలు తెరుచుకున్నాయి.
అందులో నుంచి పట్టమహిషి సోమలదేవి, మరో మహారాణి శ్రీమతి నారాంబ.. చక్రవర్తికి చెరోవైపుగా సభ ముందుకు వచ్చి నమస్కరించి.. సభాసదుల హర్షధ్వానాల మధ్య వారివారి ఆసనాలను అలంకరించారు.
పక్కన పరిచారికల చేతుల్లో పసిబిడ్డలు.. సోమలదేవి పక్కన ఐదారేళ్ల గణపాంబ, పరిచారిక చేతుల్లో రెండో బిడ్డ రుద్రమదేవుడు. నారాంబ పక్క ఇద్దరు పరిచారికల చేతుల్లో ఇద్దరు బిడ్డలు.. మురారి, హరిహరదేవులు.
అప్పుడు లేచాడు గణపతిదేవుడు.
“సభాసదులారా! మూడేళ్ల తర్వాత సభకు వచ్చాం. మరో భార్యను మా బిడ్డలను మీకు చూపడానికి సంతోషిస్తున్నాం. మూడేళ్లుగా జరిగిన సంఘటనలు, సాధించిన విజయాలు ఎప్పటికప్పుడు మీకు వార్తలుగా అనుమకొండ అంతటా తెలియజేస్తున్నారు మహాప్రధానులు గంగాధరులు. మా పట్టమహిషి సోమలదేవికి పుట్టిన బిడ్డలు గణపాంబ.. రెండో సంతానం రుద్రమదేవుడు. నా పెద్దకొడుకు, భావి యువరాజు!”.
బిడ్డలను దగ్గరికి తీసుకుని ముద్దాడి.. సోమలదేవికి అందించాడు.
“మరో భార్య నారాంబ. ఇద్దరూ మగ బిడ్డలు. మురారి దేవుడు, హరిహర దేవుడు”.
పరిచారికలు బిడ్డలను ఆయన చేతికి అందించగా.. ఎత్తి సభకు చూపించి, ముద్దాడి.. తిరిగి నారాంబకు అందించాడు.
ఆమె అందుకుని తిరిగి పరిచారికలకు అందించింది.
“రెండో వివాహం ఏ పరిస్థితుల్లో జరిగిందో మీకు తెలుసు. వెలనాడు పృథ్వీశ్వరుణ్ని నిహతుణ్ని చేశాక.. తామ్రపురి కేంద్రంగా సైనికపటాలం నిలిపి, మన సామంత రాజుల కోసం, మిత్రరాజ్యాల వారికోసం మరికొన్ని యుద్ధాలు చేయాల్సి వచ్చింది. దాంతో మేమూ అక్కడే ఉండాల్సి వచ్చింది. మూడేళ్ల తర్వాత ఇలా మీముందు విజయవంతంగా ఓటమి ఎరుగని చక్ర
వర్తిలా నిలబడ్డాం. ఈ మూడేళ్ల కాలంలో మావెంట నిలిచి, అనితర సాధ్యమైన యుద్ధతంత్రాలతో, యుద్ధ
విన్యాసాలతో ఈ ఘనవిజయాలలో ప్రముఖపాత్ర పోషించినవాడు.. మన జాయపుడు. ఈ నారాంబ
మా జీవితానికి, ఈ జాయపుడు మన కాకతీయ సామ్రాజ్యానికి మణిమకుటంగా ప్రకాశిస్తారని ఆశిస్తున్నాం!”..
ఇద్దరూ ఆయన పక్కన వచ్చి నిలబడ్డారు.
చేతులు చప్పట్లు కొడుతున్నా.. సభికులందరి దృష్టిమాత్రం నారాంబ, జాయపుని మీదే లగ్నమైంది.
మగవేషంలో ఉన్న నారాంబగా జాయపుడు.. ఆడ
వేషంలో ఉన్న జాయపునిగా నారాంబ! వేరువేరు వేషాల్లో ఉన్న ఒకే ప్రాణంలా, చక్రవర్తికి ఇరువైపులా.. ఆయన జీవితానికి ద్వారపాలకుల్లా భాసించారు.
గణపతిదేవుడు మళ్లీ చెప్పసాగాడు.
“ఇక్కడ మీకందరికీ తెలిసిన సంగతి. మేము దివిరాజ్యం నుంచే కంచిరాజ్యంపై యుద్ధంచేసి, మన సామంతులు విక్రమసింహపురి మహారాజు శ్రీమనుమసిద్ధి మహారాజులవారిని తిరిగి రాజ్యప్రతిష్ఠుని చేసిన సంగతి. ఆ యుద్ధం సందర్భంగా జాయపుడు చూపిన యుద్ధతంత్రం, యుద్ధ నైపుణ్యం నేనెప్పుడూ, ఎక్కడా చూడలేదు. వినలేదు. ఇదంతా తెలిసిన మన సకలసేనాధిపతి శ్రీ రేచర్ల రుద్రయవారు.. చిరంజీవి జాయపుణ్ని సేనాని హోదాతో సత్కరించాల్సిందిగా ఆదేశించారు. కాబట్టి, ఈరోజు నుంచి జాయపుడు.. ‘జాయప
సేనాని’గా తన సేవలను కాకతీయ రాజ్యానికి అందించాల్సింగా ఆదేశిస్తున్నాం!”..
సింహాసనంలోంచి లేచి, పరిచారిక అందించిన పుష్పమాలికను జాయపుని మెడలో వేసి.. అభినందనగా భుజం తట్టాడు చక్రవర్తి.
కొలువు ముగిశాక జాయపుణ్ని పెద్దలంతా ఆశీర్వాదాలతో ముంచెత్తారు. చిన్నలు, పెద్దలు, పండితులు, పామరులు, సైన్యాధ్యక్షులు, సాధారణ భటులు కూడా తనను అలా దిగ్భ్రమగా చూడటం జాయపునికి విచిత్రంగా ఉంది. తను యుద్ధానికి వస్తానంటే హేళన చేసి కోపగించుకున్న గణపతిదేవుడు.. ఇవ్వాళ నిండుసభలో తనను కాకతీయ సామ్రాజ్యానికే మణిమకుటంగా పరిచయం చేశాడు. ఆరేళ్లు ఇక్కడే గౌరవనీయ బందీగా ఉన్న తన అక్క.. ఇప్పుడు ఆయన పక్కన మహారాణిగా ప్రకాశిస్తున్నది. నిన్నటివరకు అనామకంగా వీధులవెంట తిరిగిన తనేనా.. ఇప్పుడు.. ఇక్కడ.. పూర్తి ఆత్మవిశ్వాసంతో.. ఈ రాచరిక దుస్తులలో.. కాకతీయ మహామండలేశ్వరుడు గణపతిదేవుని బావమరిదిగా.. ఓ కాకతీయ సేనానిగా సగర్వంగా నిండు పేరోలగంలో మహోన్నతులైన కాకతీయ పరిపాలనా ధురంధరుల అభినందనలు అందుకున్నది? ఇందుకు తను, అక్కలు, తన కుటుంబం చేసిన త్యాగాలు, పడ్డ కష్టాలు ఒక ఎత్తయితే.. గణపతిదేవుని మహోన్నత ఉన్నతత్వం మరో ఎత్తు.
జాయపుడు తనకంటే చిన్నవాడు కావడంతో చర్చల్లో తన భావనలు మరింతగా పంచుకుంటున్నాడు. అలా ఇద్దరి మధ్య స్నేహబంధం ఆత్మీయంగా పెనవేసుకోవడంమొదలయ్యింది. తన మనసులోని ప్రతి ఆలోచననూ పంచుకునే అత్యంత ముఖ్యుడైన ఆంతరంగికుడుగా
జాయపుడు రూపుదేలుతున్నాడు.
వెలనాడుపై గణపతిదేవుడు చేసిన తొలియుద్ధం తన జీవితంలో ఓ ముఖ్య మలుపునకు కారణం. కాగా, ఏడేళ్ల తర్వాత అదే వెలనాడు పూర్వపాలకుడు పృథ్వీశ్వరుణ్ని నిర్జించడంతో తన శక్తియుక్తులు పూర్తిగా ప్రస్ఫుటమవడం.. గణపతిదేవుడు తమ అయ్య కుటుంబపు కష్ట
నష్టాలు పూర్తిగా గుర్తించడం.. అందుకు బాధ్యత ఆయన ఆయన మీదనే వేసుకుని.. అందుకు ప్రాయశ్చిత్తంగా తన అక్కలను ఆయనే వివాహమాడతానని ప్రకటించడం.. అద్భుతం! ఊహాతీతం!
ఆయన తీసుకున్న ఆ గొప్పనిర్ణయ ఫలితమే తను, అక్క నారంబ ఈనాడు ఇక్కడ ఇంతటి గౌరవాన్ని అందుకోవడానికి కారణం.
వెలనాడు యుద్ధానంతరం చక్రవర్తి గణపతిదేవుడు పడ్డ మానసిక ఘర్షణ జాయపునికి ఇంకా బాగా గుర్తు.
అలాగే ఆ మధురమైన వివాహ వేడుకలు.. అతిథుల అపూర్వ స్పందన.. వివాహానంతరం తను పిల్లవాడిలా ఏడుస్తుంటే చక్రవర్తి తనను లాలించిన తీరు.. తనతో తొలిసారి ‘బావగారూ!’ అని పిలిపించుకున్న క్షణాలు..
ఆ క్షణాలు గుర్తొస్తేనే జాయపుని అణువణువూ పులకాంకితమవుతుంది.
వివాహానంతరం గణపతిదేవుడు అత్తవారింట మూడేళ్లు గడిపాడు. ఆ మూడేళ్లూ ఆయనతో తను గడిపిన ఘడియలు.. ఆయన చెప్పిన రాజరికపు విధివిధానాలు.. ఎత్తుచిత్తులు.. అనుకోకుండా చేసిన యుద్ధాలు.. అన్నీ రాజరిక ప్రపంచంలో తననొక పూర్తిస్థాయి యువరాజుగా నిలిపాయి.
ఆ సంఘటనలు.. ఆ ముచ్చట్లు జాయపుని కళ్లముందు ఇప్పడు కదలాడసాగాయి.
అక్కల వివాహానంతరం తీవ్రంగా దుఃఖిస్తున్న జాయపుణ్ని ఊరడించి, లాలించి.. అక్కున జేర్చుకుని ఓదార్చి ‘బావగారూ!’ అని పిలిపించుకుని.. మామూలు మనిషిని చేశాడు గణపతిదేవుడు. అనంతరం వివాహ ఆఖరి అంకం.. అప్పగింతల సమయంలో తలగడదీవి కోట మొత్తం దుఃఖసాగరమయ్యింది.
అప్పగింతలు అందుకున్నవారిలో కాకతీయ ఆడబిడ్డలైన మేలాంబ, కుందాంబ దంపతులతోపాటు రుద్ర
సేనాని దంపతులు, చౌండ సేనాని దంపతులు, గంగాధరుని దంపతులు కూడా ఉన్నారు.
గణపతి నుంచి శెలవు తీసుకుంటూ..
“రాజధానిలో సాధారణ పరిపాలన మేం చూసుకుంటాం. మీరు కొంతకాలం ఇక్కడే ఉండి, అత్తవారి ఆతిథ్యం స్వీకరించండి. యుద్ధాంశాలు మీకు ఎప్పటికప్పుడు ఎరుకపరచగలం!” అన్నారు గంగాధర మంత్రి, రుద్రసేనాని.
నారాంబ – పేరాంబల మధ్య పట్టు శయ్యా మత్తికలపై ఆతిథ్యాలు అందుకుంటున్న కొత్తల్లుడు గణపతిదేవుడు మెత్తగిల్లాడు.
“మీరెలా చెబితే అలాగే! కానీ, నా పిల్లలు. సోమల!”.. నసిగాడు.
“తమరేమీ వాళ్ల గురించి ఆలోచించకండి. నేను సముదాయిస్తాను” అన్నాడు రుద్రసేనాని.
గంగాధరుడు, రేచర్ల రుద్రయను గణపతిదేవుడే కాదు.. సోమల కూడా గౌరవించి, వారు చెప్పింది ఆచరిస్తుంది. ఆ సంగతి గణపతిదేవునికీ తెలుసు.
అత్తవారి అత్యంత గౌరవనీయమైన అతిథి మర్యాదలతో అతిసుందరులైన ఇద్దరు భార్యలతో గణపతిదేవుడు సుఖ సంతోష విహార విలాసాదులతో పరవశిస్తున్నాడు. కృష్ణలో విహారయాత్రలు, సాగరునిపై భార్యలతో, బావమరిదితో ఈత పందాలు, కోళ్లపందాలు, జాతర్లలో సామాన్యులతో చిందులు, బెజ్జవాడ మల్లికార్జునుని దర్శనం, మంచికొండపై పానకాలయ్యకు పానకం సంతర్పణ, కోటప్పకొండపై కోటయ్యకు దానాలు.. ఒకటేమిటి ఎన్నో ఆనంద మకరందాలు! బంధువుల సుహృద్భావ సంబంధాలు! కోటవారి మహారాణి మేనత్త, నతవాడి నుంచి చెల్లెళ్లు, అనేక సామంతరాజ్యాల నుంచి ఆహ్వానాలు, పరస్పర రాకపోకలు.. విందులు – వినోదాలు.
అత్తారింట విందులు కుడుస్తున్న గణపతి.. జాయపునితో వ్యాయామంలో, వాహ్యాళిలో రాజకీయ చర్చలు చేస్తుంటాడు. సామ్రాజ్య స్థాపనలో ఉన్న ప్రయోజనాలు, ప్రజలకు లభించే వసతులు, అలాగే సామంతులలో శత్రువు కాగలవారు, వారిలో బలమైన శత్రువులు.. సమాజంలో సంస్కరించాల్సిన అంశాలు, సమాజంలో మతాల ప్రభావం, ఇప్పుడిప్పుడే పురివిప్పుతున్న కులభావనలు, వ్యాపార సమస్యలు, సమయశెట్టిలు, వృత్తులు, రైతులు, పంటలు, నీటి వనరులు, పన్నులు, వాటి సక్రమ వసూలు, వినియోగం.. అలా తన మనసులోని ఎన్నోభావాలు జాయపునితో పంచుకునేవాడు. అవి జాయపునికి రాజకీయ పాఠాలుగా ఉపయోగ పడుతున్నాయి.
ఇప్పటివరకూ వయసురీత్యా చిన్నవాడైన గణపతి
దేవుడు.. మంత్రులు అమాత్యులు సైన్యాధ్యక్షులతో సమస్యలు చర్చించేవేళ కొంత ఇబ్బంది పడేవాడు. కారణం.. అందరూ పెద్దవారు కావడం! అనేక యుద్ధాలల్లో ఆరితేరినవారు కావడం. జాయపుడు తనకంటే చిన్నవాడు కావడంతో చర్చల్లో తన భావనలు మరింతగా పంచుకుంటున్నాడు. అలా ఇద్దరి మధ్య స్నేహబంధం ఆత్మీయంగా పెనవేసుకోవడం మొదలయ్యింది. తన మనసులోని ప్రతి ఆలోచననూ పంచుకునే అత్యంత ముఖ్యుడైన ఆంతరంగికుడుగా జాయపుడు రూపుదేలుతున్నాడు.
ఆ సమయంలో మళ్లీ యుద్ధభేరి మోగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ యుద్ధాక్రందన విక్రమసింహ (నెల్లూరి) సీమ నుంచి వచ్చింది.
ఒకరోజు తలగడదీవి కోటవద్ద ప్రవేశం కొరకు నెల్లూరిసీమ నుంచి వచ్చారొక వ్యక్తి!
“చక్రవర్తి గణపతిదేవుల వారిని కలవాలి” అంటూ..
కాకతీయ సామ్రాజ్య అంశాలు అనుమకొండలో మాత్రమే చర్చించాలని చక్రవర్తి ఆదేశం. తలగడదీవిలో ఆయన కేవలం అల్లుడిగారిగా అతిథి మాత్రమే.
కానీ, వచ్చింది నెల్లూరిసీమ నుంచి మనుమసిద్ధి ప్రతినిధిగా అయన కుమారుడు తిక్క భూపాలుడు!
ద్వీపకోట శ్రీవాకిలి మారన నాయకుడు విచికిత్సలో పడిపోయాడు. జాయపునికి విన్నవించాడు.
నెల్లూరి తిక్క భూపాలుడు వెలనాటి యుద్ధంలో కాకతీయుల తరఫున పాల్గొన్న మిత్రరాజు.
“వెంటనే వారికి రాజోచిత అతిథిమర్యాదలతో ఆహ్వానం పలకండి” అని ఆదేశించి, చక్రవర్తి ఆంతరంగిక మందిరం లోపలికి వెళ్లాడు. తిక్క భూపాలుడు వచ్చిన విషయం చక్రవర్తికి తెలియపరచాడు. గణపతి దేవుడు కూడా ఏదో ముఖ్యమైన అంశమే అయి
ఉంటుందని భావించి, చర్చామందిరానికి విచ్చేశాడు. నిజమే! ముఖ్యమైన అంశమే!
విక్రమసింహపురం పాలకుడు మొదటి మనుమసిద్ధి కాకతీయ సామ్రాజ్యానికి వీరవిధేయుడు. వెలనాడును జయించాలన్న కాకతీయరాజుల అభిప్రాయానికి పూర్తి మద్దతుగా నిలిచాడు. గణపతిదేవుడు కాకతీయ కొలువు చేపట్టిన తర్వాత తొలిసారి మల్యాల చౌండ నేతృత్వంలో వెలనాడుపై దాడి చేసినప్పుడు కూడా మనుమసిద్ధి సహకరించాడు.
ప్రస్తుతం తమిళజం పాలకుడు చోళరాజు మూడవ కులోత్తుంగచోళుడు.
ఆయన మనుమసిద్ధిని సింహాసనభ్రష్ఠుణ్ని చేసి.. మనుమసిద్ధికి తమ్ముళ్ల వరసైన నల్లసిద్ధిని, తమ్మసిద్ధిని విక్రమసింహపురం పాలకులను చేశాడు.
పృథ్వీశ్వరునిపై గణపతిదేవుడు రెండవసారి దండెత్తినప్పుడు.. మనుమసిద్ధి తన సమస్యలను పక్కనపెట్టి, కాకతీయ సైన్యానికి బాసటగా తన కొడుకు తిక్క భూపాలుణ్ని పంపాడు. ఆ యుద్ధంలో తిక్కభూపాలుని వీరోచిత యుద్ధవిన్యాసాలు గణపతిదేవుణ్ని ఆకట్టుకున్నాయి.
ఇప్పుడు తిరిగి సింహాసనం సాధించడానికి సహాయ
పడాల్సిందిగా కాకతీయ సామ్రాజ్యాధినేత గణపతిదేవుణ్ని అర్థించడానికి స్వయంగా తన కొడుకు తిక్క భూపాలుణ్నే పంపాడు మనుమసిద్ధి.
“మా వివాహానికి విచ్చేసిన మనుమసిద్ధి మహా
రాజులు మాతో ఎందుకు చెప్పలేదు తిక్క భూపాలా?!” అన్నాడు ఆవేదనగా గణపతిదేవుడు.
(సశేషం)
మత్తి భానుమూర్తి
99893 71284