చారిత్రక కాల్పనిక నవల
జరిగిన కథ : కాకతీయ సైన్యం యుద్ధభేరి మోగించింది. చక్రవర్తి గణపతిదేవుని ఆలోచనతో.. నాట్యంతోనే మళ్లీ మామూలు మనిషయ్యాడు జాయపుడు. కొలనిపురం యుద్ధం ప్రారంభమయ్యిందని.. చాలా నిస్పృహగా సాగుతున్నదని తెలుసుకున్నాడు. మళ్లీ మహాయోధుడిలా.. ఉత్సాహంగా యుద్ధక్షేత్రం వైపు దూసుకువెళ్లాడు. తమకు విధేయత చూపకుండా, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఉదయగిరి పాలకుడు పడిరాయడిపై యుద్ధం ప్రకటించాడు జాయపుడు. యుద్ధ షరతులు వినిపించి రమ్మంటూ.. సంధివిగ్రహి ధనభూతిని పంపాడు.
“మా సామంతుడిగా ఉండాలి. అంగీకరించిన కప్పాలు చెల్లించాలి. కాకతీయ మహామండలేశ్వరుడు శ్రీశ్రీశ్రీ గణపతిదేవులవారు మీకు పూర్తిరక్షణ కల్పిస్తారు. ఇది గణపతిదేవుల వర్తమానం!”..
ఈ లేఖను అందించిన సంధివిగ్రహి ధనభూతిని పడిరాయడు గౌరవించలేదు. యుద్ధానికి సిద్ధమయ్యాడు.
నిడదప్రోలు, ఉదయగిరి పొలిమేరల్లో స్కంధావారం నెలకొల్పి.. యుద్ధ స్తంభం పాతి తాంబూలమిచ్చి యుద్ధ శంఖారావం చేశాడు జాయప చమూపతి. ఇరువర్గాల మధ్య సంకుల సమరం ప్రారంభమైంది.
“మొదలు మొదలే శత్రుసైన్యంపై దూకుడుగా దాడి చెయ్యండి.. విచక్షణారహితంగా శత్రు సైనికులను నరికివేయండి. మనదే పైచేయిగా ఉండాలి”.. మహాయుద్ధ తంత్రజ్ఞుడు జాయప సేనానులవారి ఆజ్ఞ. దాంతో..
కాకతీయ, సామంత సైన్యం వీరవిహారం చేస్తుండగా ఉదయగిరి సైన్యం బిత్తరపోయి కకావికలమైంది.
“వారానికో శత్రు సైన్యాధికారి తల నా అశ్వం ముందు పడి దొర్లాలి!”..
అప్పుడు మొదలైంది జాయపసేనాని ప్రత్యేకత. కాకతీయ సైనికులకు మొదట లక్ష్యం పరశునాయకుడు.
మంచియోధుడు. మంచి ధనుర్ధారి. వేగంగా బాణం వేయడంలో నిపుణుడు. ఆరోజు పరశు రథంపై వచ్చాడు. కొమ్ముబూర జాయపుని మెడలో ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. దానితో ఓ వింతకూజితం చేశాడు. పరశు, కాకతీయ సేనానులు ఎదురెదురయ్యారు. బాణాలు, బరిసెలు విసురుకుంటున్నారు. అక్కడే పరశు పొరపడ్డాడు. అతను జాయపుణ్ని సమీపించడానికి ప్రయత్నిస్తూ తన మీదికొస్తున్న ముప్పును గ్రహించలేదు. ఎవరో తనపై ఇంతెత్తున దూకడం అతను గుర్తించేసరికి.. బరిసె భుజంలోదిగి గుండెను చీల్చేసింది. రథంలోనే కూలిపోయాడు. ప్రాణాలు పోయేసరికి తన రథం ముందు ఓ ఏనుగుల వరుస నిలబడిందని, అది ముందు చిన్నఏనుగుతో మొదలై తన రథం ముందుకు వచ్చేసరికి మహామత్తగజం ఉండటం గుర్తించేసరికి ఆలస్యమైంది. ఓ ఖడ్గదారి మీదికి దూకి బరిసెను దగ్గరగా గుచ్చడం తెలిసింది. శ్వాస ఆగిపోయింది.
పరశు శిరస్సు వచ్చి విక్రమముందు దొర్లి ఆగింది. వంగి ముట్టుకున్నాడు. అంతే.. శరీరంలో కంపనలు.. గగుర్పాటు. అచ్చం నాట్య ప్రారంభానికి ముందు కలిగే గగుర్పాటులాంటిది. తల తిరిగింది. కళ్లముందు కాకతి..
నాట్య ఆహార్యంలో! ఆనంద లాస్యం చేస్తున్నది. జాయపుణ్ని చెయ్యమని రెచ్చగొడుతున్నది. అసంకల్పితంగా జాయప కాలు కదిలింది. ఆయన కందుక క్రీడ ఆడతాడని సైనికులు భావించారు. కానీ, ఆయన కందుక నాట్యం ఆరంభించాడు. ఉత్సాహంగా సైనికులు కూడా నాట్యం చేశారు. పది ఘడియలు.. వంద ఘడియలు!.
మళ్లీ శత్రు సైనికులు చుట్టుముడుతుంటే కాకతి అదృశ్యం.. చటుక్కున జాయపసేనాని అశ్వం ఆరోహించాడు. యుద్ధం కొనసాగింది. కానీ, యుద్ధరంగంలో అలా కాకతి భావన కలగడం.. దేవాలయంలో కలిగే స్పందనలు యుద్ధభూమిలో కలగడం.. అందులో కాకతి ప్రవేశించడం.. అతనికి దిగ్భ్రమ కలిగించింది. మహోత్సాహం కలిగింది. నాట్యానికి, యుద్ధ విజయానికి సంబంధం ఉందా.. అదే తాండవమా.. అప్పుడే నా నాట్యభాగస్వామి కనిపిస్తుందా.. ఎందుకు.. ఎలా.. ఏమిటిది?
మరునాడు మరో వీరుడు ధర్మవీర నాయకుణ్ని నరికేశారు. గజతంత్రంతో కేవలం వారంరోజులలో మహామహులందర్నీ మట్టుపెట్టాడు గజసాహిణి జాయపసేనాని.
పడిరాయడి శిరస్సును జాయపుడే స్వయంగా నరికేశాడు. శత్రుయోధుడి మరణం జరిగినప్పుడలా నృత్తం.. తాండవం.. కాకతి దర్శనం.. జంట లాస్య తాండవకేళి! జాయపుడు సింహనాదం చేస్తే కాకతీయ సైన్యం విజయాట్టహాసం చేసింది. తర్వాతి దండయాత్ర కొలనుపురం మీదేనని ఉదయగిరి ఆక్రమించుకున్నాక ప్రకటించాడు. అనుమకొండ మురిసిపోయింది. గణపతిదేవుడు మీసం మెలేశాడు. ఉదయగిరి స్వాధీనంతో బెంబేలెత్తిన కొలనిపురం మండలేశ్వరుడు కేశవదేవుడు తెల్లజెండా ఊపాడు. సంధి మంత్రం పఠించాడు. గణపతిదేవునికి వార్త పంపాడు ప్రసాదిత్యుడు.
“ఏం చేయమంటారు మహారాజా?”.
ఆయన ఎప్పుడూ సంధికే మొగ్గు చూపుతాడు. సంధికోసం సంధివిగ్రహితోపాటు ఒకరిద్దరు మంత్రులు కొలనిపురి వెళ్తారు. అప్పటివరకు మొత్తం సైన్యం అక్కడే ఉంటుంది. కాకతీయ, సామంతసైన్యం జయ జయధ్వానాలతో కొలనిపురి స్కంధావారంలో తిష్ఠవేశాయి.
సంధి షరతులు కుదిరితే సంధి.. లేకుంటే కత్తి ఝళిపించడం!!
జాయపుడు ద్రాక్షారామ భీమేశ్వరస్వామిని దర్శించుకుని అఖండ దీపానికి తగిన దానాలుచేసి శాసనం వేయించాడు. ఈ విజయం శ.సం.1134 అంగీరసలో జరిగినట్లు చరిత్ర లిఖించింది.
అప్పుడే జాయపకు వెలనాడు నుంచి విషాదవార్త అందింది. అతని తండ్రి, వెలనాడు మండలేశ్వరుడు పినచోడుడు మరణించాడు. అటునుంచి అటే హుటాహుటిన దనదప్రోలు వెళ్లాడు చక్రవర్తి అనుజ్ఞతో.
పినచోడుని శ్రాద్ధకర్మలన్నీ చివరిదశకు వచ్చాయి.
జాయపుడు పూర్తి నిర్వేదంలో ఉన్నాడీ శ్రాద్ధకర్మల వేళ. అక్క, అమ్మ దాటిపోయారు. పెద్దనాయన, ఇద్దరు బాబాయలు కూడా పరమపదించారు. ఇప్పుడు తండ్రి కూడా.. ఇప్పుడిక ఏముంది ద్వీపరాజ్యంలో.. నిట్టూర్పు విడిచాడు. శ్రాద్ధకర్మల్లో చివరిరోజు కృష్ణానదిపాయలో పురోహితుడు చెప్పినట్లు మునకలు వేస్తూ.. నీటినుంచి పైకి లేచినప్పుడు రెండు చేతులతో కళ్లు తుడుచుకుని తెరచి అటూఇటూ చూశాడు. దూరంగా నదీతీరం అంచులో ఓ ఆడమనిషి.. తననే చూస్తున్నట్లు..
కళ్లు చికిలించి చూశాడు. ఆమె.. ఆమె? ఆమేనా.. ఆమె ఆమె కాకతి.. జుట్టు విరబోసుకుని ఉంది. బహుశా నదిలో స్నానించి జుట్టు ఆరబోసుకుంటూ జాయపుని బృందంవైపు.. కాదు కాదు.. జాయపునిపై దృష్టి కేంద్రీకరించి చూస్తోందా స్త్రీ. ఉలిక్కిపడ్డాడు. ఆమె కదిలి వెనక్కి వెళ్తున్నది.. ఇటే చూస్తూ.
నీటిలో మునిగి ఉన్న జాయపుడు పిచ్చికేక పెట్టాడు..
“కాకతీ..”
అందరూ ఉలిక్కిపడ్డారు. పురోహితుడు మంత్రాలు వల్లించడం ఆపేశాడు.
పంచె సరిచేసుకుంటూ నీటినుంచి వేగంగా బయటికి వచ్చి తీరంవెంట ఆమెవైపుగా పరుగుపెట్టాడు.
ఎవ్వరూ లేరు. కేవలం నీటిశబ్దం. గాలిహోరు. కృష్ణాతరంగ నిశ్శబ్ద రాగాలు రివ్వురివ్వున చుట్టేస్తున్నాయి.
గొడ్లు కాచుకుంటున్న బాలుడు కనిపించాడు.
“ఇక్కడ.. ఇప్పుడు ఎవరైనా ఆడమనిషి.. ఇక్కడే చూశాను.. ఎటు వెళ్లింది?”.
“ఎవురూ లేరండే రాజుగోరా.. ఈడ ఆడమడిసి రాలేదే..” అన్నాడా బాలుడు.
కాస్తదూరం నుంచి ఓ పెద్దమనిషి.. ఈ బాలుని తండ్రి పరుగుపరుగున వచ్చాడు. బాగా వంగి చేతులు జోడించి..
“అయ్యా.. పిల్లోడు ఏవన్నా తప్పుమాట అన్నాడా అయ్యా.. మన్నించండి బాబో..” అన్నాడు.
“ఇక్కడెవరైనా స్త్రీ.. అదే ఆడమనిషి.. చూశావా..?” అన్నాడు జాయపుడు.
అన్నదమ్ములంతా దగ్గరికి వచ్చారు.
“చూశా మారాజా. ఎక్కడుందో తెల్దుగానీ.. రోజూ మీరొచ్చే యాలకే వచ్చి మీరు ఆడ తానాలు సేత్తంటే ఆయమ్మ ఈడ రేవులో తానం సేసి పోతంది!”.
కొయ్యబారి పోయాడు జాయపుడు. వింటున్న వాళ్లెవ్వరికీ జాయపుడు ఎవరో తెలియని ఓ స్త్రీ కోసం అంతలా ఆతృతపడటం కొత్తగా.. చిత్రంగా ఉంది.
“రోజూ వస్తున్నదా!? అంటే ఇక్కడే దగ్గరలో ఉండాలి.. ఎక్కడుంటుందో తెలుసా?”.
“మాకెట్టా తెలుసుద్ది మారాజా! కాపోతే ఇట్టాంటోళ్లంతా.. ఆ పాడుబడ్డ గుళ్లలో పొడుకుంటారు మారాజా!”.
పరుగుపరుగున దగ్గరలో కృష్ణా తీరమంతా అక్కడక్కడా ఉన్న పాడుపడిన దేవళాలు, బౌద్ధ ఆరామాలు, జైన బసదులు వెతికాడు. అన్నీ పాములు, జెర్రులు, మండ్రగబ్బలు, గబ్బిలాలతో నిండి.. భరించలేని దుర్గంధంతో ఉన్నాయి. కొన్ని అంతో ఇంతో పూజా పునస్కారాలతో ఉండగా ఎక్కువ శిథిలాలయాలే!
అన్న, వెలనాడు మండలీశ్వరుడు పృథ్వీశ్వరచోడుడు అడిగాడు.
“జాయా.. ఎవరు!? స్త్రీ ఎవరు.. ఎవరికోసం నీ వెదకులాట?”.
‘ఏం చెప్పాలి.. ఆమె కాకతి అవునో కాదో తెలియదు. ఎక్కడ ఓరుగల్లు.. ఎక్కడ ద్వీపరాజ్యంలో కృష్ణాతీరం.. ఎలా వచ్చింది ఇంత దూరం.. ఎందుకు వచ్చింది.. నేను వచ్చానని తెలుసా.. తండ్రి పినచోడుని మరణవార్త విన్నదా.. తెలుసుకుందా.. మాతోపాటే కాస్త ఆవలగా స్నానం చేయడం ఏమిటి!?’.
సగం శరీరం కాలి శారీరక సౌందర్యం నశించి.. జీవచ్ఛవంలా తల్పానికే పరిమితమైన నీలాంబను చూసి జాయపుని కళ్లు నీటి చెలమలయ్యాయి. ఆమెను అలా చూడాల్సి వస్తుందని అతను ఊహించలేదు. ఎదురుగా నిలబడిన జాయపుణ్ని చూసి మూగదైపోయింది నీలాంబిక. మెల్లగా లేవబోయింది. వంగి ఆమెను హత్తుకున్నాడు. ఇద్దరూ చాలాసేపు అలా మౌనంగా రోదిస్తూ ఉండిపోయారు.
“అన్నా పృథ్వీ.. మన రాజ్యంలోని ముఖ్యంగా శిథిలాలయాలన్నీ తక్షణమే పునర్నిర్మించాలి. అవి అనాథలకు, బీదాబిక్కి అసహాయులకు ఆవాసంగా ఉన్నాయి. అక్కడ పూజా పునస్కారం ఎలా ఉన్నా.. కనీసం అనాథలు, బాటసారులు కాస్త రాత్రి నిద్రించడానికి తగినట్లుగా ఏర్పాట్లు చేయించాలి”.
“అలాగే జాయా..” ఆశ్చర్యంతో వింటూ అంగీకరిస్తున్నాడు.
“ఆ అన్నా.. ఆ పాడుపడిన గుళ్లవద్ద ఆడవాళ్లూ కూడా ఉంటారట. వాళ్లమీద మగవాళ్లు దౌర్జన్యానికి దిగకుండా ప్రతి శిథిలాలయం వద్ద ఓ రక్షకభటుణ్ని ఏర్పాటు చెయ్యి. కనీసం రాత్రివేళ”.
వడివడిగా చెప్పుకొంటూ పోతున్న జాయపుడు మరి జాముకు మామూలు మనిషయ్యాడు.
కాస్త శాంతించిన తర్వాత చెప్పాడు పృథ్వీశ్వరుడితో..
“ఆమె కాకతి అని.. ఓరుగల్లు అమ్మాయి అని అనుమానం. నాట్యగురుకులంలో నా సహాధ్యాయిని. ఇక్కడ కనిపించడం ఆశ్చర్యం. ఆమె నాకు కావాలి. బాగా వెదికించు పృథ్వీ.. నాకోసం!”.
జాయపుడు అంత తీవ్రంగా గందరగోళంగా ఉండటం పృథ్వీశ్వరుడు ఎప్పుడూ అక్క నుంచి వినలేదు. తానుగా చూడలేదు.
“అలాగే తమ్ముడూ.. నువ్వు కాస్త విశ్రమించు!” అన్నాడు.
ద్వీపరాజ్యపు రహదారులన్నీ జల్లెడ పట్టించాడు పృథ్వి. ఎవరెవరో ఒంటరి స్త్రీలు దొరికారు. అందరినీ కోటలో జాయపుడు పరిశీలించాడు కానీ వారెవ్వరూ కాకతి కాదు.
“అసలు మీరు ఇక్కడ నదీతీరాన చూసింది నువ్వనుకున్న కాకతినేనా జాయా?”.
పృథ్వి అడిగినప్పుడు అయోమయంగా చూశాడు జాయపుడు. జవాబివ్వలేకపోయాడు. తానే పొరబడ్డాడా..
ఎవరినో చూసి కాకతి అనుకున్నాడా..
“జాయా.. గతంలో నీ ముఖంలో అద్వితీయమైన వెలుగు.. గొప్పకాంతి ఉండేది. నువ్వు స్వయం ప్రకాశకుడివి. కానీ.. కానీ ఇప్పుడు నీ వదనాన ఆ వెలుగు.. కళాకాంతులు తగ్గినట్లనిపిస్తున్నది తమ్ముడూ!”.
అన్న! అతని ఎంగిలిపాలు తాగి ఎదిగినవాడు తను.. అలా అంటే ఏం జవాబివ్వాలో తెలియలేదు జాయపునికి.
అనుమకొండ వెళ్లాక నీలాంబ నివాసానికి వెళ్లాడు జాయపుడు.
సగం శరీరం కాలి శారీరక సౌందర్యం నశించి.. జీవచ్ఛవంలా తల్పానికే పరిమితమైన నీలాంబను చూసి జాయపుని కళ్లు నీటి చెలమలయ్యాయి. ఆమెను అలా చూడాల్సి వస్తుందని అతను ఊహించలేదు.
ఎదురుగా నిలబడిన జాయపుణ్ని చూసి మూగదైపోయింది నీలాంబిక. మెల్లగా లేవబోయింది. వంగి ఆమెను హత్తుకున్నాడు. ఇద్దరూ చాలాసేపు అలా మౌనంగా రోదిస్తూ ఉండిపోయారు.
‘అక్కా!’ అని నోరారా పిలిచే జాయపుడంటే ఆమెకు అంతులేని ఆపేక్ష.
కూతురు లలితాంబికను జాయపునికి కన్నెరికం పెట్టాలన్న ఆలోచన ఆమెకు అప్పట్లో లేదు.
యుక్త వయస్కుడై రాజాస్థానానికి ఎదిగినప్పుడు ఆమెకు ఈ ఆలోచన వచ్చింది. కానీ విధి బలీయమైనది. ఎన్నో సమస్యలు.. ఎన్నో మలుపులు తిరిగి తిరిగి చివరికి నీలాంబ వేశ్యావాటికే సర్వనాశనమైంది.
నీలాంబ కాలిన కట్టెలా మంచాన మిగిలితే.. లలిత నిలువనీడ కోల్పోయిన మొక్కలా మిగిలింది.
(సశేషం)
మత్తి భానుమూర్తి
99893 71284