జరిగిన కథ : ద్వీపరాజ్య యువరాజు జాయప.. అనుమకొండలో ఓ సామాన్యుడిలా బతికాడు. ఒకనాడు తల్లిపై బెంగతో రోదిస్తూ, ఎక్కడెక్కడో తిరిగాడు. కదిలిపోయిన సుబుద్ధి.. జాయపను వల్లయశెట్టి వర్తక బిడారుతో ద్వీపరాజ్యం వెళ్లే ఏర్పాటు చేశాడు. అలా జాయప.. దాదాపు రెండేళ్ల తర్వాత తన ద్వీపరాజ్యం వైపుగా వెళ్తున్నాడు. ఆ ప్రయాణంలో భాగంగా నాలుగో రోజు చాగిరాజ్యంలో నందిగ్రామ పేటస్థలం వద్ద వర్తకం కోసం బిడారు ఆగింది.
పగలు రెండో జామువేళ కొనుగోళ్లు, అమ్మకాలు జోరుగా సాగుతుండగా.. జాయపను రావాల్సిందిగా వల్లయశెట్టి నుంచి పిలుపు వచ్చింది. భైరయ తన సహాయకుణ్ని పురమాయించాడు.. జాయపను వల్లయ దగ్గరికి తీసుకెళ్లమని. గొల్లెనలోకి వచ్చిన జాయపను తన పక్కన కూర్చోబెట్టుకుని.. “మీరు ద్వీపరాజ్యం గాజుల వర్తకులు కదా సోమిశెట్టి! అంతఃపుర స్త్రీలకు, మహారాణి గారికి కూడా మీరు గాజులు తొడుగుతారా?” అంటూ పక్కనున్న వర్తకుడితో అన్నాడు వల్లయ.
“మా రాజాంతఃపుర మహిళలంతా నావద్దే గాజులు తొడిగించుకుంటారు శెట్టి. నాకు తప్ప మరొకరికి చెయ్యి ఇవ్వరు! నా గాజుల నాణ్యత అంత గొప్పది..” అన్నాడు సోమిశెట్టి ఉత్సాహంతో మీసం మెలేస్తూ.
“మీ మహారాణివారి ఆరోగ్యం బాగాలేదని.. వారు కొంచెం అస్వస్థులుగా ఉన్నారని మా అనుమకొండలో వార్త. నిజమేనా?” అడిగాడు వల్లయ.
“ఛ ఛ! వారెంతో ఆరోగ్యంగా ఉన్నారు. గత వారమే నేను వారికి కొత్త గాజులు తొడిగాను. వారెంతో ఉల్లాసంగా ఉన్నారావేళ! ఎవరో గిట్టనివారి గాలి కబుర్లు. నమ్మకండి. ఆమె ఎంతో యోగ్యురాలు!” అన్నాడా ద్వీప వర్తకుడు. నిశ్చేష్టుడయ్యాడు జాయప. తన తల్లి అస్వస్థురాలని స్వయంగా మైలాంబ పిన్నిగారు చెప్పారే? ఆ పెద్దల ముందు ఏమీ అనలేకపోయాడు. దిగ్భ్రమతో నోట మాటరాక నిలబడిపోయాడు.
“శెట్టీ! ఈ అబ్బాయి మా బంధువు. ఇతణ్ని తలగడదీవిలోని వాళ్ల ఇంటికి చేర్చగలరా?” అడిగాడు వల్లయ.
“అయ్యో! అదెంత భాగ్యం. మీరు సెలవిస్తే అది మా అదృష్టం కదా శెట్టి! నేను పక్క గ్రామం సంతలో రేపు సరుకు అమ్ముకుని వస్తాను. రేపు రెండో జామువేళకు వచ్చి ఈ అబ్బాయిని నా గుర్రపు బండిపై తీసుకెళ్తాను” అన్నాడు.
“అలాగే! ఆ జాయపా.. వెళ్లు! భైరయకు చెప్పు. రేపు వెళ్లడానికి సిద్ధంగా ఉండు..” అన్నాడు వల్లయ. తల ఊపి కదిలాడు మౌనంగా.. జాయప ఎంతో మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఊహించకుండా మరో భయానకమైన అనుభవం.. ఆ రాత్రి జాయపకు ఎదురైంది.
రాత్రి రెండోజాము వేళ. గూడుకట్టిన ఎడ్లబండిలో భైరయ పక్కన నిద్రిస్తున్నాడు జాయప. తల్లి రూపం, మైలాంబ మాటలు.. పదే పదే మనోఫలకంపై మెదులుతూ తీవ్రమైన మానసిక క్షోభకు గురిచేస్తున్నాయి. అలా అలా ఎప్పుడో నిద్ర పట్టేసింది. ఎక్కడో అలజడి.. గుర్రాల గిట్టల సవ్వడి. ఎద్దుల గంటల మోత. మగవాడి ఏడుపు! స్త్రీ ఆక్రందన! అరుపులు.. చటుక్కున మెలకువ వచ్చింది జాయపకు. భైరయ కూడా అప్పుడే దిగ్గున లేచాడు. గూడు నుంచి వెలుపలికి వచ్చారిద్దరు. ప్రతి బండి వద్దా ఓ కాగడా వెలుగుతుంటుంది. అప్పుడే చాలామంది లేచి.. ఏం జరిగిందో అర్థం కాక తమ బండికున్న కాగడాను తీసుకుని, ఆ అలజడి వినిపించిన వైపుగా కదిలారు.
దాదాపు పదిమంది.. పది గుర్రాలపై ఉన్నారు. ఒకరిద్దరు చాలా ఉద్రేకంగా అరుస్తున్నారు. ఆడపిల్ల జుట్టుపట్టి ఈడ్చుకురావడం దూరం నుంచి కనిపించింది. బిడారులో స్త్రీలు ఎవ్వరూ లేరు. మరి ఆ స్త్రీ ఎవరు? భైరయ కాగడా పట్టుకొని వేగంగా వెళ్తున్నాడు. జాయప కూడా అతణ్ని అనుసరించాడు. వర్తకుల కాగడాల నడుమ కిందపడి ఉన్నాడో మనిషి. చుట్టూ గుర్రాలపై ఉన్నవాళ్ల చేతుల్లోని పొడవైన ఖడ్గాలు.. కాగడాల వెలుతురులో దూరం నుంచి కూడా మెరుస్తూ కనిపిస్తున్నాయి. కిందపడ్డ వ్యక్తి, పక్కనున్న మరోవ్యక్తి.. ఆశ్వికులకు చేతులు జోడించి వేడుకొంటున్నారు. అతని మాటలు అస్పష్టంగా వినిపిస్తున్నాయి. జాయపకు అర్థమైంది ఏమిటంటే.. ఆ కింద పడ్డవాణ్ని చంపడానికి వచ్చారు ఆశ్వికులు. వద్దని అభ్యర్థిస్తున్నవాడు.. బిడారులో అమ్మకానికి వచ్చిన శెట్టి. అతణ్ని ఎందుకు చంపబోతున్నారు. ఏమిటి వాడు చేసిన తప్పు?? ముందున్న భైరయను అందుకోవడానికి మరింత వేగంగా వెళ్లబోయాడు జాయప. అప్పుడే.. అత్యంత వేగంగా.. సర్రున శబ్దం చేస్తూ.. జాయప పక్కగా సాగిపోయి.. ఆ గుర్రాల ముందు నేలకు గుచ్చుకుంది ఓ బరిసె. వెంటనే ఉరుము ఉరిమినట్లు..
“ఎక్కడివారు అక్కడే ఆగండి!”.. వల్లయ గర్జన. ఎక్కడివారక్కడే ఆగిపోయారు. వేగంగా మరో నిమిషంలో ఆ గుర్రాల ముందున్నాడు వల్లయ. అందరూ ఒక అడుగు వెనక్కి వేశారు. సమయ శెట్టి సమక్షంలో ఎవ్వరూ నోరెత్తడానికి వీలు లేదు. క్లిష్ట పరిస్థితులు రానంతవరకూ అందరూ ప్రశాంతంగా ఉంటారు. ఘర్షణ వాతావరణం ఏర్పడితే పరిస్థితి చాలా తీవ్రంగా ఉండే కాలం ఇది. ప్రతివారి వద్ద కనీసం చురకత్తి ఉంటుంది. చంపడం చాలా సాధారణ విషయం. ‘విజయమో వీరస్వర్గమో’ అనేది యుద్ధాలలోనే కాదు.. సాధారణ జనజీవితంలో కూడా చలామణిలో ఉన్న నానుడే. అయితే కట్టుబాట్లకు, ఇచ్చిన మాటకు ప్రజలు పూర్తిగా కట్టుబడి ఉంటారు. వల్లయ గర్జించాడు.
“ఎవడు? ఎవడు.. నా అనుమతి లేనిదే నా బిడారులోకి ప్రవేశించింది. ఎవడు??”..
ఆయన గర్జనకు నిద్రాభంగమైన పిట్టలు భయంతో చేస్తున్న రెక్కలశబ్దం నిశీధిలో పిశాచాల ఏడుపులా ఉంది. ఆశ్వికులు గుర్రాలు దిగారు. కత్తులపై చేతులు మరింత బిగుసుకున్నాయి. ఒక్కడు మాత్రం కత్తి పట్టుకుని వల్లయ దగ్గరికి సర్రున దూసుకొచ్చాడు.
“వీడు.. వీడు!”.. అంటూ కింద పడ్డవాణ్ని ఒక్క తన్నుతన్ని..
“వీడు నీ బిడారువాడు కాదు శెట్టి! వీడు నా కూతుర్ని బలవంతంగా ఇంటినుంచి లేపుకొచ్చాడు. వీడు బతక్కూడదు!”..పెద్దగా అరిచి రెండు చేతులతో కత్తి పైకెత్తాడు. వల్లయ పట్టుకోకపోతే కిందివాడి తల తెగిపడేదే! వల్లయకు కొంచెం అర్థమైంది.
“ఆగు మిత్రమా! నా బిడారులో జరిగిన దానిని తెలుసుకోవడం నా ధర్మం. ఏం జరిగింది. కాస్త చెప్పండి..” అన్నాడు స్థిరంగా.. అనునయంగా. ఆ చల్లని నిశీధిలో.. అక్కడ మాత్రం కొలిమి మండుతున్నట్లుగా ఉంది. అందరూ నిశ్శబ్దంగా ఒక్కొక్క అడుగు ముందుకేశారు కుతూహలంతో.. జాయప కూడా. కిందనున్న మరొకడు బిడారు వర్తకుడు కాచయ. కింద పడ్డవాడు సత్యాచారి. పంచాణం వారి అబ్బాయి. కత్తి దూసినవాడు ఓరుగల్లు పురవాసి, సైనిక సమాహర్త పండరి. ఆ అమ్మాయి అతని ఏకైక కుమార్తె రుద్రాంబ. ఆ అమ్మాయి జుట్టు పట్టినవాడు పండరి తమ్ముడు వేమప. కాచయకు అబద్ధం చెప్పి, ఆ అమ్మాయితో బండిలో ఎక్కాడు సత్యాచారి. అమరావతిలో గుడి శిల్పాలు చెక్కుతున్నానని, భార్యకోసం వచ్చానని, ఇద్దరినీ బండిలో బెజ్జవాడ వరకూ తోడ్కొని పోవాల్సిందిగా అడగడం.. మిత్రుడిగా తెలిసిన కాచయ అంగీకరించడం.. ఇద్దరూ వల్లయశెట్టి దృష్టిలో పడకుండా నాలుగు రోజులుగా బిడారుతో ఇంతదూరం రావడం జరిగింది. ఓరుగల్లులో సంగతి తెలిసిన పండరి.. అన్నదమ్ములతో కలిసి వెతుకుతూ, చివరికి ఈ రాత్రివేళ బిడారు వద్ద వాళ్లను పట్టుకున్నాడు. పదిమంది మంచి యుద్ధవీరులు, ఆశ్వికులు. వారిని నిలువరించడం కష్టం. పైగా అవమానభారం వారిలో నిలువెల్లా ప్రజ్వలిస్తున్నది. బయటివారికి బిడారు కట్టుబాట్లు వర్తించవు. వర్తకులకు ప్రతివారూ కొనుగోలుదారే కాబట్టి.. కొత్తవారిని బిడారు వర్తకులు ఆదరంగా చూసి, బిడారులోనే తమతోపాటు సముచిత భోజన ఏర్పాట్లుచేసి గౌరవిస్తారు. జాయప అప్పుడు చూశాడు ఆ అమ్మాయిని.. జుట్టు గట్టిగా పట్టుకోవడంతో గింజుకుంటున్నది. ఉలిక్కిపడ్డాడు. అచ్చం తన అక్క పేరాంబలా ఉంది. పాపం వాడు మోసంచేసి తీసుకొచ్చాడు కాబోలు.అప్పుడు జరిగింది ఇది.. సత్యాచారి సర్రున లేచాడు..
“నేనే రుద్రమను ప్రేమించాను. ఆమె నాది! నా భార్య. నా ప్రేయసి. ఆమె లేకపొతే నేను బతకలేను. ఆమె నాశిల్పం. ఆమె నా కళ..” అంటూ అక్కడ పాతుకున్న వల్లయ బరిసెను ఊడబెరికి.. రుద్రమను పట్టుకున్న వేమపపైకి దూకుడుగా ఎగిరాడు. మరుక్షణం.. అతని తల శరీరంనుంచి వేరుపడి, వల్లయ దగ్గరగా వచ్చిపడింది. ఒక్క కత్తి ప్రహారంతో అతణ్ని తెగ నరికాడు పండరి. తెగిన తలలోంచి చివ్వున చిమ్మిన రక్తం.. వల్లయ మీదే కాక కాస్తదూరంగా నిలబడ్డ వర్తకులపై కూడా పడింది. దిగ్గున జరిగి దాక్కుంటున్నట్లు భైరయ వెనక్కి వెళ్లాడు జాయప. తెగిన తలనుంచి వెలువడుతున్న రక్తం.. పచ్చిగా, వేడిగా.. అదోరకమైన వాసన.. తెలుస్తున్నది జాయపకు. అందరూ మ్రాన్పడిపోయారు. వల్లయ కూడా చేష్టలుడిగి అలాగే ఉండిపోయాడు. అప్పుడు అరిచింది ఆ అమ్మాయి రుద్రమ. పిచ్చిపట్టినట్లు..
దిక్కులు పిక్కటిల్లేలా..
“సత్యాచారి!! అయ్యో.. నాకోసం చనిపోయావా. సత్యా! నాన్నా.. ఎంత పనిచేశావ్ నాన్నా. నేనే అతణ్ని రెచ్చగొట్టాను. ఎక్కడో గుళ్లో శిల్పాలు చెక్కుతున్నవాణ్ని పిలిచి, నన్ను తనతో తీసుకువెళ్లమన్నాను. తప్పు నాది. సత్యది కాదు..” ఆమె ఆర్తనాదాలతో ఆ నిశ్శబ్ద ప్రకృతి విలవిలలాడింది. అందరూ అసలు సంగతి గ్రహించి నిశ్చేష్టులయ్యారు. ఆమె ఒక్కఉదుటన వేమప చేతిలోంచి తనచేతిని గింజుకుని.. పరుగు పరుగున గుండెలు బాదుకుంటూ సత్యాచారిపై వచ్చి పడింది.
“తప్పు నాది. మరణం నీకా?!” అంటూ నోరు కొట్టుకుంటున్నది. నెత్తి బాదుకుంటున్నది. పూనకం పట్టినట్లు ఊగిపోతూ గగ్గోలు పెడుతున్నది. అందరూ ఆమె బాధ, హృదయావేదన అర్థమైనట్లు.. మౌనంగా, సానుభూతిగా చూస్తున్నారు.ఉన్నట్లుండి పండరి పెద్దపెట్టున అరిచాడు.
“హరహర మహాదేవ!”..
అరుపుతోనే మరోసారి ఖడ్గ ప్రహారం అందరికీ వినిపించింది. ఆమె ఆర్తనాదం.. ఒక్కసారిగా ఆగిపోయింది.
పండరి.. కన్నకూతురి తలను ఒక్కవేటుతో తెగనరికాడు. తెగిన రుద్రాంబ తల ఎగిరి, సత్యాచారి తల పక్కగా దబ్బున పడింది. శరీరం అక్కడే కుప్పకూలిపోయింది. వర్తకులే కాదు.. ప్రకృతే బిత్తరపోయింది. సమస్త దేవతలు, అష్టదిక్పాలకులు కూడా నిరుత్తరులయ్యారు. మొండాల నుంచి కారుతున్న రక్తం తప్ప.. అక్కడ అంతా నిశ్శబ్దం.. శ్మశాన నిశ్శబ్దం.
(సశేషం)
-మత్తి భానుమూర్తి
99893 71284