రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్లలో యుజ్వేంద్ర చాహల్ ఒకడు. ఎనిమిదేళ్లపాటు ఆ ఫ్రాంచైజీతో గడిపిన యుజీ.. లేటెస్ట్ ఐపీఎల్ సీజన్లో మాత్రం రాజస్థాన్ తరఫున ఆడుతున్నాడు. ఈ క్రమంలో మెగా వేలం గురించి, ఆర్సీబీ కోచ్ తనతో చెప్పిన మాటల గురించి యుజీ వెల్లడించాడు.
ఇప్పటికీ కొందరు బెంగళూరు ఫ్యాన్స్ నన్ను ‘‘అంత డబ్బు ఎందుకు అడిగావు?’’ అని అడుగుతున్నారని చెప్పిన చాహల్.. తను అసలు డబ్బు గురించి ఎవరితోనూ చర్చించలేదన్నాడు.
‘‘మైక్ హెసాన్ (ఆర్సీబీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్) నన్ను పిలిచాడు. మేం మ్యాక్స్వెల్, కోహ్లీ, సిరాజ్ను రిటైన్ చేసుకుందామని అనుకుంటున్నాం. వేలంలో నీ కోసం పోటీ పడతాం అని చెప్పాడు. అంతే, అసలు డబ్బు గురించి మేం మాట్లాడుకోలేదు’’ అని స్పష్టం చేశాడు.
అలాగే ఐపీఎల్లో తన జెర్సీ మారిందని, అంతేగానీ తన ఆటతీరు కాదని తేల్చిచెప్పాడు. ఆర్సీబీకి ఆడినట్లుగానే ఆర్ఆర్ తరఫున కూడా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తానని మాటిచ్చాడు. కాగా, ఐపీఎల్ మెగా వేలంలో యుజీని రూ.6.50 కోట్లకు రాజస్థాన్ ఫ్రాంచైజీ దక్కించుకుంది. ఆర్సీబీ యాజమాన్యం చాహల్ కోసం ఒక్కసారి కూడా బిడ్ వేయకపోవడం గమనార్హం.