లక్నో: భారత యువ షట్లర్ ప్రియాన్షు రజావత్ సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీలో సెమీఫైనల్కు దూసుకెళ్లాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-300 టోర్నీ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శుక్రవారం 21 ఏండ్ల ప్రియాన్షు 21-15, 21-16తో ఫర్హాన్ (ఇండోనేషియా)పై విజయం సాధించాడు. ఈ సీజన్లో ఒర్లీన్స్ మాస్టర్స్ సూపర్ టైటిల్ నెగ్గి జోరు మీద ఉన్న ప్రియాన్షు లక్నోలోనూ అదే జోరు కొనసాగించాడు. 49 నిమిషాల్లో ముగిసిన క్వార్టర్స్లో ప్రియాన్షు వరుస గేమ్ల్లో రెచ్చిపోగా.. మరోవైపు ప్రపంచ జూనియర్ చాంపియన్ ఫర్హాన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.
శనివారం జరగనున్న సెమీఫైనల్లో చీ యూ జెన్ (చైనీస్ తైపీ)తో ప్రియాన్షు తలపడనున్నాడు. మరోవైపు మహిళల డబుల్స్లో అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో జోడీ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. క్వార్టర్స్లో పొన్నప్ప-తనీషా జంట 21-19, 21-8తో భారత్కే చెందిన పుల్లెల గాయత్రి గోపీచంద్-త్రిసా జాలీ ద్వయంపై విజయం సాధించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు రెండు టైటిల్స్ గెలిచి ఊపులో ఉన్న పొన్నప్ప జంట.. ఫేవరెట్ అనుకున్న గాయత్రి గోపీచంద్ జోడీని వరుస గేమ్ల్లో మట్టికరిపించడం గమనార్హం.